శ్రీ సాయిసచ్చరిత్రము /ఇరువదియేడవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఇరువదియేడవ అధ్యాయము )


శ్రీ సాయిసచ్చరిత్రము ఇరువదియేడవ అధ్యాయము భాగవతము, విష్ణుసహస్రనామములనిచ్చి అనుగ్రహించుట 1. దీక్షీత్ యొక్క విఠల్ దర్శనము 2.గీతారహస్యము 3. ఖాపర్డే దంపతులు


బాబా మతగ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రముగ చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి యీ అధ్యాయములో చెప్పుకొందుము.

మానవుడు సముద్రములో మునుగగనే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందముల నాశ్రయింపగనే, త్రిమూర్తులకు (బ్రహ్మ విష్ణుమహేశ్వరులకు) నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితముకూడ లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానుమునకు సముద్రమును, మనకు అత్కసాక్షాత్కారమును కలుగజేయునట్టి శ్రీసాయిమహరాజునకు జయమగు గాక! ఓ సాయి! నీ కథలందు శ్రద్ధను కలుగజేయుము. చాతకపక్షి మేఘజలము త్రాగి యెట్లు సంతసించునో, అటులనే నీ కథలను చదువువారును, వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు వినునప్పుడు వారికి, వారి కుటుంబములకు సాత్వికభావములు కలుగునుగాక! వారి శరీరములు చెమరించుగాక! వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక!వారి ప్రాణములు స్థిరపడుగాక! వారి మనస్సులు ఏకాగ్రమగుగాక! వారికి గగుర్పాటు కలుగుగాక! వారు వెక్కుచు ఏడ్చి పణకెదరుగాక! వారిలోగల వైషమ్యములు తరతమభేదములు నిష్ర్కమించుగాక! ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించిన దనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు. గురువు మిక్కిలి సంతసించి అత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయబంధములనుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగ శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయయనే మహసముద్రమును దాటించలేవు. సద్గురువే యాపని చేయగలరు. సర్వజీవకోటియందును భగవంతుని చూచునట్లు చేయగలరు.

గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట

ముందటి అధ్యాయములో బాబా బోధలోనర్చు తీరులను జూచితిమి. అందులో నింకొకదానిని యీ అధ్యాయములో జూచెదము. కొందరు భక్తులు మతగ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనెడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతో నున్నటుల భావించెడివారు. ఒకనాదు కాకామహజని ఏకనాథభాగవతమును దీసికొని శిరిడీకి వచ్చెను. శ్యామా యాపుస్తకము చదువుటకై తీసుకొని మసీదుకు బోయెను. అచ్చట బాబా దానిని తీసికొని చేతితో తాకి, కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తనవద్ద నుంచుకొమ్మనెను. అది కాకా పుస్తకమనియు, నందుచే దాని నాతని కిచ్చి వేయవలెననియు శ్యామా చెప్పెను. కాని బాబా "దానిని నేను నీకిచ్చితిని. దానిని జాగ్రత్తగా నీవద్ద నుంచుము. అది నీకు పనికివచ్చు"ననిరి. ఈ ప్రకారముగ బాబా అనేక పుస్తకములు శ్యామావద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహజని తిరిగి భాగవతము తెచ్చి బాబా కిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహజనికే ఇచ్చి దానిని భద్రపరుచుమనెను. అది యాతనికి మేలు చేయుననిరి. కాకా సాష్టాంగనమస్కారముతో స్వీకరించెను.

శ్యామా విష్ణుసహస్రనామములు పుస్తకము

శ్యామా బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా యతనికి మేలు చేయ నిశ్చయించి విష్టుసహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను.

ఒకప్పుడు ఒక రామదాసి (సమర్థ రామదాసు భక్తుడు) శిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ నుండెను. ప్రతి రోజు ఊదయమే లేచి, ముఖము కడుగుకొని స్నానము చేసి, పట్టుబట్టలు ధరించి, విభూతి పుసికొని విష్ణుసహస్రనామమును, అధ్యాత్మరామాయణమును శ్రద్దతో పారాయణ చేయుచుండెను. అతడీ గ్రంథముల ననేకసారులు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయనిశ్చయించి విష్టుసహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసిని బిలచి తమకు కడుపు నొప్పిగా నున్నదనియు సోనాముఖి తీసికొని రమ్మని కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దే దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి యిట్లనెను. "ఓ శ్యామా! యీ గ్రంథము మిగుల విలువైనది. ఫలప్రదమైనది. కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధ పడితిని. నా హృదయము కొట్టుకొనెను. నాజీవిత మపాయములో నుండెను. అట్టి సందిగ్థస్థితి యందు నేను ఈ పుస్తకము నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా! అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని యనుకొంతిని. అందుచే దీనిని నీ కిచ్చుచున్న్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజున కొక నామము చదివినను మేలు కలుగుజేయును." శ్యామా తనకా పుస్తక మక్కరలేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి, కావున వానితో కయ్యము వచ్చుననెను. మరియు తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదువలేననెను.

వినోదార్ధము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామా యనుకొనెనే గాని, బాబా తనకు మేలు కలుగుజేయనున్నాడని యనుకొనలేదు. బాబా యా సహస్రనామమనే మాలను శ్యామా మేడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడయినప్పటికి బాబాకు ముఖ్యభక్తుడు. బాబా ఈ ప్రకారమతనిని ప్రపంచభాధలనుండి తప్పించగోరెను. భగవన్నామఫలిత మందరికి విశదమే. సకల పాపములనుండి, చావుపుట్టులనుండి అది మనలను తప్పించును. దీనికంటె సులభమయిన సాధన మింకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దాని కెట్టి తంతు కూడ అవసరం లేదు. ఫలప్రదమైనది. శ్యామాకు ఇష్టము లేనప్పటికి వానిచే దాని నభ్యసింపచేయవలెనని బాబాకు దయకలిగెను. కనుక దానిని బాబా వానిపయి బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారమునే చాలా కాలము క్రిందట ఏకనాథమహరాజు బలవంతముగా విష్ణుసహస్రనామము నొక బీదబ్రహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్టుసహస్రనామపారాయణ చిత్తశుద్ది కొక విశాలమయిన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను.

రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నా చించణీకర్ యక్కడనే యుండెను. నారదునివలె నటించి జరిగిన దంతయు వానికి జెప్పెను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామాపయి బడి, శ్యామాయే కడుపునొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకము తీసికొనెనని యనెను. శ్యామాను తిట్టనారంభించెను. పుస్తకము ఈయనిచో తల పగులగొట్టుకొందుననెను. శ్యామా నెమ్మదిగా జవాబిచ్చెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను. "ఓ రామదాసి! యేమి సమాచారము? ఎందులకు చికాకుపడుచున్నావు? శ్యామా మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టెదవు? ఎందుకు జగడ మాడుచున్నావు? నెమ్మదిగ ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయిచుంటివి, గాని యింకను నీ మనస్సు నపవిత్రముగాను, అస్వాధీనముగాను ఉన్నటున్నది. నీ వెట్టి రామదాసివయ్యా? సమస్త విషములందు నీవు నిర్మలుడవుగా నుండవలెను. నీ వా పుస్తకమును అంతగా నభిలషించుట వింతగా నున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత యుండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావు? వెళ్ళు, నీ స్థలములో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకము లనేకములు వచ్చును, కని మనుష్యులు రారు. బాగా అలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ యెంత? శ్యామాకు దానితో నెట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసికొని వాని కిచ్చితిని. నీ కది కంఠపాఠముగా వచ్చును కదా! కావున శ్యామా దానిని చదివి మేలు పొందుననుకొంటిని. అందుచే దాని నతనికిచ్చితిని."

బాబా పలుకులెంత మధురముగా మెత్తగ కోమలముగా అమృతతుల్యముగా నున్నవి! వాని ప్రభావము విచిత్రమయినది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్నగీతయను గ్రంథమును శ్యామావద్ద తీసికొనెద ననెను. శ్యామా మిక్కిలి సంతసించి, "ఒక్కటేల పది పుస్తకముల నిచ్చెద" ననెను.

బాబా ఈ విధముగా వారి తగవును తీర్చెను. ఇందు అలోచించవలసిన విషయమేమన రామదాసి పంచరత్నగీత నేల కోరెను? అతడు లోనున్న భగవంతుని తెలిసికొనుట కెన్నడు యత్నించి యుండలేదు. ప్రతినిత్యము మతగ్రంథలను మసీదుతో బాబా ముందర పారాయణ చేయువాడు, శ్యామాతో బాబా యెదుట ఏల జగడమాడెను? మనము ఎవరిని నిందించవలెనో, యెవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథ నీ విధముగా నడిపించక పోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము భగవన్నామస్మరణఫలితము, విష్టుసహస్రనామపారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసియుండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామా చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమాన్ బూటీ అల్లుడగు జి.జి.నార్కేకు బోధించగలిగెను. ఈ నార్కే పూనా యింజనీరింగు కాలేజి ప్రిన్సిపాలుగా నుండెను.

గీతా రహస్యము

బ్రహ్మవిద్య నధ్యాయనము చేయువారిని బాబా యెల్లప్పుడు ప్రేమించు వారు, ప్రోత్సహించువారు ఇచట దానికొక యుదాహరణమిచ్చెదము. ఒకనాడు బాపూసాహెబు జోగ్‍కు ఒక పార్సెలు వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతా రహస్యముండెను. అతడా పార్సెలును తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేయునప్పుడది క్రింది పడెను. అదేమని బాబా యడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము నుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులోనుండి ఒక రూపాయి తీసి పుస్తకము పై బెట్టి దక్షిణతో గూడ పుస్తకమును జోగున కందించుచు, "దీనిని పూర్తిగ చదువుము. నీకు మేలు కలుగును" అనిరి.

ఖాపర్డే దంపతులు

ఖాపర్డేల వృతాంతముతో నీ అధ్యయమును ముగించెదము. ఒకప్పుడు ఖాపర్డే తన భార్యతో శిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబు ఖాపర్డే సామాన్యుడు కాదు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్దికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢీల్లి కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి తెలివయినవాడు, గొప్ప వక్త. కాని బాబా ముందర నెప్పుడు నోరు తెరవలేదు. అనేకమంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కాని ముగ్గురు మాత్రము - ఖాపర్డే, నూల్కర్, బూటీ - నిశ్సబ్దముగా కూర్చుండువారు. వారు వినయవిధేయత నమత్రలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన ఖాపర్డే బాబా ముందర మసీదులో కూర్చొనునప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు. నిజముగా మానవుడెంత చదివినవాడైనను వేదపారాయణ చేసినవాడైనను, బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తకజ్ఞానము బ్రహ్మజ్ఞనము ముందు రాణించదు. దాదాసాహెబు ఖాపర్డే 4 మాసములుండెను. కాని యతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును శిరిడీలో నుండుటచే సంతసించిరి. ఖాపర్డేగారి భార్య బాబాయందు భక్తిశ్రద్దలు గలగి యుండెడిది. అమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతి రోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా దెచ్చుచుండెను. దానిని బాబా యామోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను. అమే ఒకనాడు మధ్యాహ్న బోజనసమయమున ఒక పళ్ళెములో సాంజా, పూరీ, అన్నము, ఫులుసు, పరమన్నము మొదలగునవి మసీదుకు దెఛ్ఛెను. గంటల కొలది యూరకనే యుండు బాబా యానాడు వెంటనే లేచి, భోజనస్థలములో గూర్చుండి, యామె తెచ్చిన పళ్ళెముపయి యాకు దీసి త్వరగా తిననారంభించెను. శ్యామా యిట్లడిగెను. "ఎందుకీ పక్షపాతము? ఇతరుల పళ్ళెముల నెట్టివైచెదవు. వానివైపు చూడనయిన చూడవు కాని, దీనిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనమెందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగా నున్నది." బాబా యిట్లు బోధించెను. " ఈ భోజనము యదార్థముగా మిక్కిలి యమూల్యమయినది. గతజన్మతో నీమె ఒక వర్తకుని యావు. అది బాగా పాలిచ్చుండెను. అచ్చటనుండి నిష్ర్కమించి, ఒక తోటమాలి యింటిలో జన్మించెను. తదుపరి యొక క్షత్రియిని యింటిలో జన్మించి యొక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను. చాలకాలము పిమ్మట ఆమెను నేను జూచితిని కావున అమె పళ్ళెమునుండి యింకను కొన్ని ప్రేమయుతమగు ముద్దలను దీసికొననిండు." ఇట్లనుచు బాబా యామె పళ్ళెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుగుకొని త్రేన్పులు తీయుచు తిరిగి తన గద్దెపయి కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా యామెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్ళను తోముచున్న యామె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురుశిష్యులు ఒండొరులు సేవ చేసికొనుట జూచి శ్యామా యిటులనెను. "చాల బాగా జరుగుచున్నది. భగవంతుడును, భక్తురాలును ఒకరికొకరు సేవ చేసికొనుట మిగుల వింతగా నున్నది." అమె యదార్థమయిన ప్రేమకు సంతసించి బాబా మెల్లగ మృదువయిన యాకర్షించు కంఠములో ’రాజరామ్’ యను మంత్రమును ఎల్లప్పుడు జపించు మనుచు నిట్లనియెను. "నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనస్సు శాంతించును. నీకు మేలగును." అధ్యాత్మికము తెలియనివారికి ఇది సామాన్య విషయమువలె గాన్పించును. కాని యది యట్లు గాదు. అది శక్తిపాతము అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలెంత బలమయినవి! ఎంత ఫలవంతమయునవి! ఒక్క క్షణములో నవి యామె హృదయములో ప్రవేశించి స్థిరపడెను.

ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసికొనవలెను. వారిద్దరికి మధ్య భేదము లేదు. ఇద్దరొకటే, ఒకరి లేనిదే మరియొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద బెట్టుట బాహ్యదృశ్యమేగాని, యాదార్థముగా వారివురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు; సంపూర్ణజ్ఞానము లేనివారును.


శ్రీ సాయినాథాయ నమః ఇరువదియేడవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు