శ్రీ సాయిసచ్చరిత్రము /ఇరువదియారవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ఇరువదియారవ అధ్యాయము )



శ్రీ సాయిసచ్చరిత్రము ఇరువదియారవ అధ్యాయము 1. భక్త పంతు 2.హరిశ్చంద్ర పితలే 3. గోపాల అంబాడేకర్‌ల అనుభవములు.


ఈ విశ్వమునందు కనిపించు ప్రతివస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడినవి. ఈ వస్తువులు నిజముగా నుండియుండలేదు. నిజముగా నుండునది ఒక్కటే. అదియే భగవంతుడు. బోకటిలో తాడునుగాని, దండమును కాని చూచి పామనుకొనునట్లు, ప్రపంచములో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు గాన్పించును; గాని యంతర్గతముగా నున్న సత్యమును తెలిసికొనలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను దెరిపించి వస్తువులను సరిగా జూచునటుల జేయును. మన కగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని యసలయిన దృష్టిని కలుగుజేయుమని ప్రార్థింతముగాక! అదే సత్యదృష్టి.

ఆంతర పూజ

హేమడ్‌పంతు మనకొక కొత్తరకము పూజావిధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుట కానందభాష్పములనే వేడినీళ్ళు నుపయోగించెదముగాక! స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక! దృఢవిశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక! అష్టసాత్త్వికభావములనెడు ఎనిమిది తామారపుష్పములు సమర్పించెదము గాక. ఏకాగ్రచిత్తమను ఫలమును సమర్పించెదము గాక. భావమను బుక్కా వారి శిరముపై జల్లి భక్తియనే మొలత్రాడును కట్టెదము గాక. మన శిరస్సును వారి బొటన వ్రేళ్ళుపై నుంచెదము గాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో నలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతము గాక. అట్టి యానందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించెదము గాక.

"మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివయిపు పోవునటుల జేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును దెలిసికొను శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల యాసక్తిని పోగొట్టి మాకు అత్మసాక్షత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖదుఃఖనుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సుని నీ స్వాధీన ముందుంచుకొనుచు నీ యిష్టము వచ్చినట్లుల చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక."

ఇక నీ అధ్యాయములోని కథలపైపు మరలుదము.

భక్త పంతు

ఒకనాడు పంతు అనుభక్తుడు, మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున శిరిడీకి వచ్చెను. అతనికి శిరిడీ పొవు ఇచ్ఛలేకుండెను. కాని తానొకటి తలచిన దైవమింకొకటి తలచునందురు. అతడు బి.బి. అండ్ సి.ఐ. రైల్వేలో పొవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు, బంధువులు కలసిరి. వారందరు శిరిడికి పొవుచుండిరి. వారందరు తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదన లేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్‌లో దిగెను. అచ్చట తన గురువును దర్శించి, శిరిడీకి పొవుటకు అనుమతి పొంది, ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని యందరితో కలసి శిరిడీకీ వచ్చెను. అందరు ఉదయమే శిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును జూచి యందరు సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హాఠాత్తుగా క్రిందపడెను. వారందరు భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్ళు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్రనుంచి లేచినవానివలే లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి. నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునటుల నీ క్రింది విధముగా బలికెను. "ఏమైనను కానిండు. పట్టు విడువరాదు. నీ గురునియందే యాశ్రమము నిలుపుము ఎల్లప్పుడు నిలకడగానుండుము ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి యుండుము." పంతు ఈ మాటలయొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు తన జీవితములో బాబా చేసిన యీ మేలును మరువలేదు.

హరిశ్చంద్ర పితలే

బొంబాయిలో హరిశ్చంద్ర పితలే యనునాత డుండెను. అతనికి మూర్ఛ రోగముతో భాధపడుచున్న కొడుకొకడు గలడు. ఇంగ్లీషు మందులను అయుర్వేదము మందులను కూడ వాడెను గాని జబ్బు కుదురలేదు. కావున యోగుల పాదములపయి బడుటయనే సాధన యొక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగణు బాబాకీర్తిని బొంబాయి ప్రెసెడెన్సీలో వెల్లడి చేసెనని తెలిసుకొంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నిటిని వినెను. వానినుండి, యితరుల చెప్పినదానినుండి, బాబా తన దృష్టిచేతను, స్పర్శ చేతను, బాగుకానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించెను. సాయిబాబాను జూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వవిధముల సన్నాహమై, బహుమానములను వెంట దీసికొని పండ్ల బుట్టలను బట్టుకొని భార్యబిడ్డలతో శిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు బోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబా యా బిడ్డవైపు చూడగనే యొక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిఱ్ఱున తిప్పి చైతన్యము తప్పి నేలపై బడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరము చెమట పట్టెను. అతడు చచ్చినవానివలె పడెను. దీనిని జూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెనుగాని యీ మూర్ఛ చాలా సేపటికివరకుండెను. తల్లి కంటీనీరు వరదలుగా కారుచుండెను. అమె యేడ్చుటకు మొదలిడెను. అమెస్థితి దొంగలనుండి తప్పించుకొనవలెనని యొక గృహములోనికి పరుగెత్తగా అది తన నెత్తిపై బడినట్లు, పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన యావువలె, ఎండచే భాధపడి చెట్టు నీడకు పోగ నది బాటసారిపై బడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను.

అమె యిటులేడ్చుచుండగా బాబా యామె నిటుల ఓదార్చెను. "ఇటు లేడ్వవలదు. కొంతసేపాగుము. ఓపికతో నుండుము. కుఱ్ఱవానికి బసకు దీసికొని పోమ్ము. అరగంటలో వానికి చైతన్యము వచ్చును. " బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్దము లయ్యెను. వాడాలోనికి దీసికొని పోగానే కుఱ్ఱవానికి చైతన్యము వచ్చెను. పితలే కుటుంబమంతయు సంతోషించిరి. వారి సంశయములన్నియు దీరెను. పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబాపాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదముల నొత్తుచు కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన యుపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో నిట్లనిరి. "నీయాలోచనలు సంశయములు, భయాత్పతములు, ఇప్పుడు చల్లబడినవా? ఎవరికయితే నమ్మకము ఓపిక గలదో, వారిని తప్పక భగవంతుడు రక్షించును. " పితలే ధనికుడు, మరియాద గలవాడు. అతడందరికి అపరిమితముగా మిఠాయి పంచి పెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబులము నిచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. అమె నిరాడంబరత, ప్రేమభక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబావైపు దృష్టి నిగిడ్చి కండ్లునుండి యానందబాష్పములు రాల్చుచుండెను. అమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవునివలె యోగీశ్వరులు కూడ తమ భక్తులపయి నాధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను, మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్దిరోజులు బాబా వద్ద సుఖముగా నున్న పిమ్మట ఇంటికి పోవనిశ్చయించి, బాబా దర్శనముకయి మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊది ప్రసాదమిచ్చి అశీర్వదించెను. పీతలేను దగ్గరకు బిలిచి యిట్లనెను. "బాపూ! అంతకుముందు 2 రూపాయి లిచ్చియుంటిని. ఇప్పుడు 3 రూపయలిచ్చుచున్నాను. వీనిని పూజ మందిరములో బెట్టుకొని పూజింపుము. నీవు మేలు పోందెదవు." పితలే వీనిని ప్రసాదముగా నంగీకరించెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేసి యాశీర్వచనములకయి ప్రార్థించెను. ఇదే తాను శిరిడీ పోవుట మొదటిసారి గనుక, అంతకుముందు 2 రూపాయిలిచ్చెనను బాబా మాటల యార్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలిసి కొనవలెనని కుతూహలపడెను గాని బాబా యూరకొనెను.

స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి బాబా యంతకు ముందు రెండురూపాయలిచ్చెననెను, అదేమియని యడిగెను. అమె తన పుత్రునితో నిట్లనెను: "నీ కొడుకుతో నీవిప్పుడు శిరిడీకి పోయినట్లు, మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్‌కోటకర్ మహరాజుగారి వద్దకు బోయెను. ఆ మహరాజు కూడ సిద్దపురుషుడు పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక అయన పూజను స్వామి అమోదించిరి. వారు మీ తండ్రికి రెండు రూపాయిలిచ్చి మందిరములో బెట్టి పూజింపుమనిరి. మీ తండ్రిగారు చనిపోవువరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీవదృష్టవంతుడ వగుటచే, అక్కల్‌కోట్‌కర్ మహరాజు శ్రీసాయిరూపములో గనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి దెచ్చి, నీ కష్టములను తప్పింప జూచుచున్నారు.కాబట్టి యిక మీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను దురాలోచనములను విడువుము. మీ తాతముత్తాతల యాచారము ప్రకారము నడువుము. సత్ర్పవర్తనము నవలంబింపుము. కుటుంబదైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి, వాటిని శ్రద్దగా పూజించి, మహత్ముల యాశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీసాయి నీలోనున్న భక్తిని మేలు కొల్పినారు. నీ మేలుకొరకు దాని నభివృద్ది చేసికొనుము." తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీసాయియొక్క సర్వాంతర్యామిత్వమునందు, వారి శక్తియందు అతనికి నమ్మకము కలిగెను. వారు దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను. అప్పటినుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా నుండెను.

అంబాడేకర్ గారు

పూనానివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు అబ్‌కారి డిపార్టుమెంటులో 10 సంవత్సరములు నౌకరి చేసెను. ఠాణా జిల్లాలోను, జవ్హార్‌స్టేట్‌లోను అయన ఉద్యోగములను జేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను. కాని ఫలించలేదు. అతడనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రానురాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడచెను. అతడు ప్రతి సంవత్సరము శిరిడీకి పోవుచు బాబాకు తన కష్టములు చెప్పుచుండెడివారు. 1916లో నతని స్థితి చాలా హీనముగా నుండుటచే శిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో శిరిడీకి వచ్చి రెండు మాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న యెడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో బడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడీ ప్రకారము చేయ నిశ్చయించుకొనగనే బాబా మరియొకటి చేయ నిశ్చయించెను. కొన్ని ఆడుగుల దూరమున నొక హొటలుండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్‍ను బిలిచి అక్కల్‍కోట్‌కర్ మహరాజుగారి చరిత్రను చదివితివా? యని యడుగుచు పుస్తకము నిచ్చెను. అంబాడేకర్ దాని తీసుకొని చదువనెంచెను. పుస్తకము తెరుచుసరికి ఈ కథ వచ్చెను. అక్కల్‌కట్‌ర్ మహరాజుగారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను. బాధాను సహించలేక నిరాశజెంది బావిలో దుమికెను. వెంటనే మహరాజు వచ్చి వానిని బావిలోనుంచి బయటకు దీసి యిట్లునెను. "గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తికాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి బాధ యనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మ ననుభవించరాదు? గత జన్మముల పాపముల నేల తుడిచి వేయరాదు? దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము."

సయయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగుల నాశ్చర్యపడెను. వాని మనస్సు కరగెను. బాబా సలహ యీ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియే యుండును. బాబా సర్వజ్ఞత్వమును, దయాళుత్వమును జూచి అంబాడేకరుకు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్‌కోట్‌కర్ మహరాజు భక్తుడు. కాన కొడుకు కూడ తండ్రివలె భక్తుడు కావలెనని బాబా కోరిక. అతడు బాబా యాశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్దిపొందెను. జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దానిద్వారా తన పరిస్థితి బాగు చేసికొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగత జీవితమంతయు సుఖముగా గడపెను.


శ్రీ సాయినాథాయ నమః ఇరువదియారవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు