శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/37వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

37వ అధ్యాయము.

కర్మఫలము

706. జీవుడు గతజన్మను చాలించి ప్రపంచమునుండి వెడలుసమయమునచేయు సంకల్పాను సారమగు శరీరమును పొందును. కాబట్టి భక్తిసాధనలు చాల అవసరములు చిరకాలాభ్యాసమువలన సాంసారికచింతలు మనస్సునుండి జారిపోయి, దైవచింత మాత్రమే జీవుని అంటియుండును. అది మరణ సమయమునను విడువదు.

707. నేను ఒకచోట రెండు బుడ్డగొట్టినయెద్దులను చూచితిని. ఆవొకటి ఆత్రోవనుపోవుచుండగాంచి, ఒకయెద్దు ఉద్రేకమును పొందినది; రెండవది శాంతముగనున్నది. ఈచిత్రవర్తనమును కనుగొని ఈయెద్దులయొక్క పూర్వచరిత్రను విచారించితిని. మొదటిది పెద్దదై ఒక ఆవుతో మెలగిన పిమ్మట దానికి బుడ్డగొట్టిరట; రెండవదానికి చిన్న దూడగా నుండగనే కొట్టిరని తెలియవచ్చినది. పూర్వ సంస్కారబలము అంత గొప్పది. సంభోగ సుఖమును పొందకుండ సంసారమునుత్యజించిన సాధువులు స్త్రీలు కాన్పించినప్పుడు కామోద్రేకమును పొందరు. సంసార భోగముల ననుభవించి ముసలువారైన పిమ్మట కాషాయవస్త్రమును తాల్చువారు, చిరకాలము ఇంద్రియ సంయమనము చేసియు పూర్వ సంస్కారములకు లొంగుట కలదు. 708. ఎఱిగిగాని, ఎఱుగకగాని స్ఫృహ యుండిగాని స్ఫృహలేకగాని, భగవన్నామస్మరణ చేసినయెడల అట్టి స్మరణ సత్ఫలము తప్పక లభించును. స్వబుద్ధిపూర్వకముగా ఏటికిపోయి దానిలో స్నానముచేసినవానికిని స్నానఫలము కల్గును; వేఱొకనిచేత నీటిలోనికి దింపబడినవానికిని స్నానలాభము కల్గును; మఱియు నిద్రలోనుండగా ఎవరైన మీద నీళ్లు పోసిననుకూడ స్నానము చేయుట లభించును!

709. పుడమిలో బద్ధజీవులు మరణసమయమందు సయితము సంసారవిషయములగూర్చియే మాట్లాడుదురు. తీర్థయాత్రలుచేసియుండుగాక, గంగాస్నానము కావించియుండుగాక, తావళములు చేబూని జపములు చేసియుండుగాక హృదయములో సంసారవ్యసనములు దాగియుండినచో ఫలములేదు; ప్రాణావసానకాలమునను అవి పై కుబుకుట నిజము. ఆసమయమున సంధిలో ప్రలాపములు సాగింతురు. చిలుక సామాన్యస్థితిలో "రాధాకృష్ణా" అని పవిత్రగానము చేయవచ్చును; కాని పిల్లినోట చిక్కినప్పుడు కిచకిచ మను స్వాభావికపు కూతయే వచ్చునుగదా!

710. దైవభక్తి లేకపోవుటవలన నరుడు చాలబాధ పడగలడు. కావున తన ప్రాణావసాన సమయమున భగవంతుడు తలపునకువచ్చునట్టి సాధనను చేయవలయును. అందుకుపాయము "దైవభక్తి సాధనమే!" ముందుగా అటువంటి సాధన చేసియున్నయెడల అవసానకాలము అది వానికి తలపునకువచ్చును.