శుకసప్తతి/రెండవయుపకథ

వికీసోర్స్ నుండి

గంతునిభుఁ డైన ధరణీ
కాంతునికడ కరుగుచో శుకం బిట్లనియెన్. 235

తే. అమ్మ యమ్మంత్రిసుతప్రభావమ్ము వినుము
విక్రమార్కవసుంధరావిభుఁ డొకింత
తెలిసికొనలేక మఱునాఁడు పిలువఁబనుప
జనియె నమ్మీననయన యాస్థానమునకు. 286

వ. చని యవనీకాంతసమాసీన యగుటయు నమ్మానవేశ్వరుం డితరప్రసంగంబున కవకాశం బొసంగక యంబుచరహాసంబునకుఁ గారణంబుఁ దెలుపుమనిన నచ్చెలువ కలకల నవ్వి పరుల నడుగందగని కార్యం బడిగెద విట్లయిన ననాచరణీయం బగుప్రయోజనం బొనర్చి యాపిమ్మట వనటకుంబాలైన పాలికయను బాలికతోడి పోలికగలవాఁడ వగుదు వది యెట్లనిన నవధానంబుతో వినుమని యిట్లనియె. 287

రెండవయుపకథ


క. ధరపై రత్నావళి యను
పుర మొక్కటి కలదు గగనపూరితమణిగో
పురమై పరమేశ్వర్యా
కరమై సరమై కలసదగారోత్కరమై. 288

క. ఆవీట రత్నవిదుఁ డనఁ
గా వైశ్యాగ్రణి యొకండు కలఁ డాతనికిన్
దేవేరి యొకతె మన్మథ
దైవతమై పాలికాభిదాన తనర్చున్. 239

క. ఆపాలిక శశిరేఖా
రూపాలిక జారజనశిరోమణి సురత
వ్యాపారమునం దన్న
వ్యాపారప్రేమఁ జెందు టరయుట కతనన్. 290

సీ. [1]ఓపరిపైన నీ కునికిఁ గావించిరే
బజగెడి యని దూఱు బావగారు
పొరిగింటిగోడచొప్పున గట్టివైచిరే
యవునె నిన్ననిదూఱు నత్తగారు
వాకటిచెంతఁ గావలియుంచిరే నిన్ను
గామిడి యని దూఱు మామగారు
పెరటిలోపలఁ బాతిపెట్టిరేమే నిన్ను
వగలాడి యని దూఱు వదినెగారు
తే. తోడికోడలు పగచాటి వీడనాఁడు
నాగడ మొనర్తు రెపుడు వియ్యములవారు
నేరముల నెంచఁ దొడఁగు బానిసెలగుంపు
పతి పృథక్తల్పశయనుఁడై భయముఁ జూపు. 291

క. ఈరీతి నింటివారలు
కారియ యొనరించుకతనఁ గార్కొని యుండన్
నీరజలోచన నెమ్మది
జారజనియోగవాయుసఖు కున్మఖయై. 292

తే. అంత నయ్యింతి యారుదూరైనదాన
నైతినేకద తగువాని హత్తుకొన్న

నింతకన్నను నన్ను వీరేమి సేయ
నేర్తురని నెమ్మనంబున నిశ్చయించి. 293

తే. తనకు ననుకూలయగు నొక్కదాసితోడ
మాలిమి యొనర్చుకొని యుంచి మంచివెట్టి
దానితో నొక్కనాఁడు మంతనమునందు
నింటివారలకసినికో లెల్ల నుడివి. 294

చ. పరపురుషాభిలాష మదిఁ బాటిలు టంతయుఁ దెల్పి తత్పురీ
పరిసరభూమిసున్న చలిపందిరి నొక్కనిఁ దెచ్చి కూర్చినం
గరివరగామినీ సురతకాలమునందు నినుందలంతు దు
ష్కరమని చూడ కింతయుపకార మొనర్పుమటంచు మ్రొక్కినన్. 295

తే. అది దిగుల్పడి నీ వెట్టు లరుగుదెంతు
వెన్నికౌ నటుమీఁద నీకేమి కాక
ముక్కఱయుఁ గమలును దాల్చి మురియు నన్నుఁ
జూడఁజాలక యిమ్మాట లాడె దేమొ. 296

క. అని వీడనాడ దాని
న్మనమున జడుపుడుపు తేటమాటలచే న
వ్వనిత పొసఁగించి పనుపం
జని కమ్మరవచ్చి యది నిశాముఖవేళన్. 297

తే. అమ్మ నీమాట మీఱరా దనుచు నదిగొ
నిలిపివచ్చితి నొకనిండునీటుకానిఁ
బురబహిర్నిర్జనప్రపాభూమి నచటి
కెట్లు పోయెదు పొమ్మని యేగుటయును. 298

తే. అందఱును నిద్రపోయెడు నంతతడవుఁ
జింతచేసియు సంకేతసీమఁ జేర

వెరవు గానక పాలికాతరళనయన
యాత్మలోనన యొకయుపాయంబు నెంచి. 299

క. ఇది సేయరా దటంచు
న్మది నెఱిఁగియుఁ దహతహన్ రమాతనయు వశం
వదయగుటం బానుపు డిగి
పదయుగళము సద్దడంచి భయవిరహితయై. 300

తే. చని యధిశ్రయణిని వహ్ని సంగ్రహించి
యింటి నడికొప్పతగిలించి యెఱుఁగనట్లు
ముంగిటికిఁబోయి రొదగాఁగ మొఱలువెట్ట
నదరిపడి లేచి గృహదహ మనుచు బెదరి. 301

వ. శిశురక్షణంబునకుం బశురజ్జుమోక్షణంబునకుం గృహోపకరణసంగ్రహంబునకు, దస్కరనిగ్రహంబునకుం బాల్పడి గురుజనంబు లేమఱిన సందడిం బడి యప్పడంతి బుడిబుడినడలతో నగరరక్షకాధిక్షేపదక్షంబగు సాహసంబు సహాయంబుగా సమయస్థలసరణిం గైకొని చన నంతఁ బావకుండునుం బవమానప్రవర్ధమానుండై నిలయాధారవేణువిదళజనితచిటచిటధ్వానంబు లాపోశనమంత్రోచ్చారణంబుగాఁ దైలఘృతాదికంబు లెడనెడం బానీయంబులుగా నయ్యగారం బాహారంబుగాఁ గొనియుం దనివిసనక పూర్వకృతఖాండవదాహం బుదాహరించు తెఱంగునం బ్రతివిశాఖాతిప్రతాపంబుఁ జూపుటవలన ధనంజయాభిధానంబునుం బుష్కరోజ్జృంభణవిధానంబు వలనం బృహద్భానునామంబును గృతార్థత్వంబుగా విహరింపఁ దొడంగె నంతకమున్న పౌరజనకోలాహలంబులతో జంటయై మింటి కెగయు నెఱమంటలం గనుంగొని దూతికావచనంబునం బానీయశాలాగతుండైన జారుండును నిజమందిరావనపరుండై క్రమ్మఱియె నంత. 302

ఉ. పాలికనిర్జనాదిభయభావము దూరము చేసి వాసియౌ
బాళి జనింప నేగి చలిపందిటి ముందట నన్యభీతిచే
నాలుగుదిక్కు లారసి ఘనంబగుచీఁకటి కందరంబునుం
బోలు తదంతరాళతలము న్వడిఁ జేరి మహారిరంసయై. 303

క. అచ్చట జారుని గానక
య చ్చెలి యుచ్చలితమానసాంభోరుహయై
ఱిచ్చవడి తెచ్చుకోలగు
హెచ్చరిక న్మఱియు వాని నెల్లెడ నెమకన్. 304

తే. వెదకి కానక వాఁడు నాహృదయ మెఱుఁగ
వేడి దాఁగెనొ యని బహిర్వేదిఁ జూచి
యెచట లే డెందొ యరిగినాఁ డేమొ యనుచు
నరిగి పందిటిలో నెల్ల నరసి పొగిలి. 305

శా. ఏరా మారునిబారికారియనున న్నిట్లేతురాతాళఁగాఁ
లేరా నేరము లేఱి దూఱక దయాలీలం గటాక్షింపరా
మేరా గారవ మారఁగా రతిసమున్మేషంబు లీకుండుటల్
రారా కూరిమిమీఱఁ జేరి కయికోరా జారవీరాగ్రణీ. 306

తే. ఇప్పు డాయిందువచ్చు టిదేమి యనుచుఁ
గోపమున డాఁగితేమొ మద్గురుజనంబు
కనుమొఱంగుట కొకనేర్పుఁ గాంచఁగోరి
యుంటి నేరంబు సైరించు టుచిత మిపుడు. 307

క. అని బతిమాలియు జారుం
గనుఁగొనఁగా లేక దూతికం దిట్టుచు న
వ్వనిత నిరాళం బగునె
మ్మనము రతికిఁ దఱుమఁగా నమందవ్యథయై. 308

చ. వెలువడి చక్కఁజూడ కవివేకముగాంచితి నేమొ యంచుఁబం
దిలికయిపోయి యందరసి నిక్కముగా నతఁ డిందువచ్చుటే
కలుగ దటంచు నిర్ణయముగాఁ దలపోయుచు నింక నేఁటితో
బొలిసితి జారవాంఛ ననిపోయె నిజాలయసీమ డాయఁగన్. 309

క. చని యగ్నిభయముఁ జెందిన
తనవారిం గదిసి బహువిధంబులఁ దాను
న్వనరుచు నుండెను వింటివె
జనవర యేతత్కథాప్రపంచం బెల్లన్. 310

తే. అవ్వధూమణి యిది యకార్యం బటంచు
యెంచ కి ల్లగ్నికై యప్పగించి జారు
గలయకడలినయ ట్లగుఁ దెలిసిచూడ
నడుగరానిది నీవు న న్నడుగుటెల్లఁ. 311

తే. కాన నేఁడెల్లఁ దెలియఁగాఁ గానకున్న
నెల్లి తెలిపెద నీ కిది యెల్ల ననుచు
నరిగే బాలసరస్వతి యనుచుఁ జిలుక
పలుక నంతటిలోనఁ బ్రభాతమైన. 312

తే. ఆప్రభావతి యంతఃపురాంతరమున
కరిగి యారేయి మేదినీవరునిఁ జేరఁ
బోవుచోఁ గీర మనియె నంభోజవదన '
వినుము బాలసరస్వతీవిమలమహిమ. 313

క. అంత మఱునాఁడు ధరణీ
కాంతుఁడు పిలిపింప నజ్జగన్మోహిని య
త్యంతవిభాసితమణి ఖచి
తాంతరపల్యంకికాసమారోహణయై. 314

సీ. నేల జీరక యుండఁ గేలఁ గుచ్చెలఁ బూను
కొని యూడిగపుఁ జెలు ల్గునిసి నడువ
మడిమెత్తు పరువుతో మంత్రాక్షతము లీయఁ
బాల్పడి భూసురభామ లెదుర
నొక్కకే లొఱగుపై నుంచి యేకాంతంబు
దెలుపుచుఁ గూరి నెచ్చెలులు సనఁగ
నెదురుగాఁ బఱతెంచి నృపమౌళి సమయంబు
హెగ్గడికత్తియ లెచ్చరింప
తే. కోరి పురివారిజాక్షులు గుంపుగూడి
యమ్మ యిదిగాక యైశ్వర్య మౌర యనుచుఁ
బలుకఁ గోయిలపరిభాష లలతి నగవు
మీఱ నన్నారి యరిగె హజారమునకు. 315

క. అరిగిన ప్రతిసీరాం
తరమునఁ గూర్పుండి యద్భుతముగాఁ బాథ
శ్చరహాస మని ప్రసంగాం
కుర మెత్తిన విక్రమార్కకువలయపతితోన్. 316

తే. అవ్వరారోహ పలుకు నన్నడుగ వలవ
దన్న నడిగెద విట్లేని యధిప మున్ను
పలుకవల దన్నఁ బలికి యాపైవిచార
మందు నలదందశూళ మట్లగుదు వీవు. 317

వ. తత్పురావృత్తాంతం బవధానాయత్తంబగు చిత్తంబుతో నవధరింపుము. 318

మూఁడవ యుపకథ


సీ. సహ్యశైలానీత జపతపస్సంజాత
యఖిలజగత్పూత యైనమాత
జడధినాయకు నేలుబడి గన్న యిల్లాలు
నిఖిలపుణ్యపుఁజాలు నిలుచుప్రోలు
అభ్రఘట్టనఖేలనాభీలకల్లోల
యఘతూలికాజాల మడఁచుకీల
ఫణిలోకవిజ్ఞానపాటవాంతర్మీన
వినుతసస్యవితానమునకు వాన
తే. యధిపతి సమాగమార్థప్రయాణసమయ
సముచితాంబుజనాళభక్షణవిలోల
ఘనగరుధ్వానపటపటాత్కారచారు
భూరిసితవక్షభేరి కావేరి వెలయు. 319

సీ. జలమానవులు చిమ్ము జముదాళి చాలునా
మిసిమివాలుగ మీలు మిట్టి పడఁగ
వరుణుండు వైచు మవ్వపు బిల్లగోలనాఁ
దరగతూరుపు గట్టుదాఁక నిగుడ
వళులపరంగుల హరిగోలుగుంపునా
వనజంబులలఁతిగాడ్పునఁ జలింప
సలిలాబ్దపాణి యచ్చపు మేలుముసుఁగునా
ఫేనపంక్తులుదరినాని యెసఁగ

  1. “కడకుపై నిన్నఁటు కాఁపురంబుంచిరే” అని పాఠాంతరము.