శివపురాణము/సృష్టి ఖండము/సూత మహర్షి ఉవాచ

వికీసోర్స్ నుండి

శ్రీ లలితాంబికగా, ఆదిదేవి తపస్సు చేసిన ప్రదేశం నైమి శారణ్యం. కృతయుగం నాటి క్షేత్రస్థలి ఇది. ఒకానొకప్పుడు ఋషు లందరూ కలిసి తమకొక దివ్యమైన తపోస్థలిని ప్రసాదించమని బ్రహ్మను కోరారు. బ్రహ్మ చూపించబోయే ఆ దివ్యస్థలం సర్వోపద్రవాలకు అతీతం గానూ, దుర్జన దుర్జయముగానూ ఉండాలని అభ్యర్థించారు. శ్రీమన్నారాయణుని స్తుతించిన విధాత, ఒక చక్రాయుధాన్ని సృష్టించి దాని భ్రమణం ఎక్కడ నిలిచిపోతే అక్కడ తపస్సుకు అనుకూలమైన స్థలం ఉంటుందని, దానిని అనుసరిస్తూ వెళ్లవలసిందని ఆనతినిచ్చాడు. అది లోకాలన్నీ తిరిగి భూలోకంలోని ఒక ప్రదేశంలో ఒక రాక్షసుని నిమేష మాత్రంలో వధించి, ఆ చక్రనేమి అక్కడ నిలిచిపోయింది. నేమి నిలిచిన ఆ ప్రదేశమే నైమిశారణ్య ప్రాంతం.ఆ స్థలంలోనే ఆదిదేవి తపస్సు చేసినదని గ్రహించిన ఋషిగణం యావత్తూ విధాతకు స్తోత్రావళు లర్పించి మహదానందంగా నైమిశారణ్యప్రవేశం చేశారు.

సుమారు ఎనభై ఎనిమిది వేలమంది ఋషులు అక్కడ తపో వాటికలు నిర్మించుకుని లోక హితార్థం యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తుండగా ఒకనాడు ...

మహాపౌరాణికులయిన సూతమహర్షి అక్కడకు వేంచేశారు. రోమహర్షణ మహర్షి పుత్రుడూ, శ్రీ శుకయోగీంద్రుల సహపాఠీ, వేదవ్యాస మునీంద్రుల ప్రియశిష్యుడూ ఐన సూతముని రాక, నైమి శారణ్యమునందు వసించుచున్న శౌనకాది ఋషులందరికీ ఆనందం కలిగించింది.

మునిగణమంతా, సూతమహర్షి కెదురేగి స్వాగతించి ఆర్ఘ్యపాద్యాదులిచ్చి, సత్కరించి అనంతరం - ఆయనను పరివేష్ఠించి కూర్చున్న మీదట శౌనకుడీ విధంగా ప్రస్తావించాడు.

"మహాత్మా! మా యందుగల అపార కరుణా కటాక్షముచేత ఈ నైమిశారణ్యస్థలిని పావనం చేశావు. మాకు మీ దర్శన భాగ్యం లభించే ప్రతీసారీ పౌరాణిక గాధావళి విన వేడుక కలగడం - తాము అభిభాషించి అనుగ్రహించడం అనూచారంగా వస్తున్నది. ఎన్ని గాధలనైనా ధర్మ సూక్ష్మ సహితంగా వివరించగల 'అగాధమౌ జలనిధి ' వంటి తాము మాపై దయ ప్రసరించి, దివ్యపురాణమేదైనా సెలవీయ వలసిందిగా మా కోరిక" అని ఋషులందరి తరుపునా అభ్యర్థించాడు.

'కలి ప్రభావ పీడితులై నానాక్లేశాలు అనుభవిస్తున్న నరులను సైతం ఉద్ధరించగల ఏకైక పురాణం ఏది?' అని అర్థనిమీలిత నేత్రుడై, మనసులోనే త్రినేత్రుని అవలోకించిన సూతపౌరాణికునకు సాక్షాత్తు శ్రీ మహాశివుని పురాణమే ఆ క్షణాన వృదయ ఫలకంపై స్పురించింది.

చిరునవ్వుతోనూ, సదయాదృక్కులతోనూ తనచుట్టూ చేరివున్న మునిజన బృందాన్ని సమ్మోహనకరంగా చూశాడు సూత మహర్షి.

"ఇంతవరకు మీరు విన్న పౌరాణిక గాథలన్నిటికంటే శ్రేష్ఠమైనదీ, జ్ఞానయోగ మోక్ష కారకమైనదీ, జన్మజన్మాంతర పుణ్యఫల విశేషంచేత మాత్రమే శ్రవణార్హమైనదీ అయినట్టి శ్రీ శివమహాపురాణా గాధ సవిస్తరంగా మీకు చెప్ప ఉత్సాహంగా ఉంది! అంతా శివేచ్చ!" అంటు మొట్టమొదట తమ గురువైన వ్యాసభగవానుని ధ్యానించి, ఆయన కృతమైన రుద్ర స్తుతితో, ఈ మహాపురాణం ప్రారంభించాడు సూత పౌరాణికుడు.

వ్యాసోక్త రుద్ర స్తుతి -

నమో దేవాయ మహతే - దేవదేవాయ - శూలినే! త్ర్యంబకాయ త్రినేత్రాయ - యోగినాంపతయే నమః!!

నమోస్తు దేవదేవాయ - మహాదేవాయ వేధసే! శంభవే స్థాణవే నిత్యం - శివాయ పరమాత్మనే!!

నమస్సోమాయ రుద్రాయ - మహాగ్రాసాయ హేతవే! ప్రపద్యేహం విరూపాక్షం - శరణ్యం బ్రహ్మచారిణమ్!!

మహాదేవం మహాయోగ - మీశానం త్వంబికాపతిం! యోగినం యోగదాతారం - యోగ మాయా సమావృతం!!

యోగినాం గురు మాచార్యం - యోగగమ్యం సనాతనం! సంసారతారణం రుద్రం - బ్రహ్మణాం బ్రాహ్మణోధిపం!!

శాశ్వతం సర్వగ్o శాంతం - బ్రహ్మాణం బ్రాహ్మణప్రియం! కపర్దినం కళామూర్తి - మమూర్తి మమరేశ్వరమ్!!

ఏక మూర్తిం మహామూర్తిం - వేదవేద్యం సతాం గతిమ్! నీలకంఠం విశ్వమూర్తిం - వ్యాపినం విశ్వరేతసం!!

కాలాగ్నిం కాలదహనం - కామినం కామ నాశనం! నమామి గిరీశం దేవం - చంద్రావయవభూషణం!!

త్రిలోచనం లేలిహాస - మాదిత్యం పరమేష్ఠినం! ఉగ్రం పశుపతిం భీమం - భాస్కరం తమసః పరమ్!!

సూత మహర్షి ఈ విధంగా స్తోత్రం చేసిన అనంతరం, ఇలా చెప్పసాగాడు. " మునివరేణ్యులారా! నేను పఠించిన ఈ స్తోత్రములోనే శివుని అష్టవిధ రూపములు అంతర్గతమై ఉన్నాయి. వాటి విశిష్టత మీకు వివరిస్తాను. శ్రద్ధాళువులై వినండి!