మీఁగడ తఱకలు/మధురకవితలు

వికీసోర్స్ నుండి

7

మధురకవితలు

ప్రాచీనాంధ్రలక్షణకర్తలు తెలుఁగుఁగవిత్వమును 'ఆశు, మధుర, చిత్ర, విస్తరము' లను పేళ్లఁ జతుర్విధముల విభజించిరి. యక్షగానాదు లందులో మధురకవిత్వమునఁ జేరును.

"మధురకవిత్వం బన్నది నాటకాలంకారంబులు, కళికోత్కళికలు, విభక్త్యధిదేవతోదాహరణములు, సప్తతాళనటనలు, నట్టొట్లు, గీత ప్రబంధంబులు, చతుర్భద్రికాష్టభద్రికలు, బిరుదావళి, నామావాళి, భోగావళి, రంగఘోష, త్యాగఘోష, చతురుత్తరసంఘటనలు, యక్షగానంబునవెలయు పదంబులు, దరువులు, నేలలు, ధవళంబులు, మంగళహారతులు, శోభనంబులు, నుయ్యాలజోలలు, జక్కులరేకుపదంబులు, చందమామ సుద్దులు, అష్టకంబులు, ఏకపదద్విపద త్రిపదచతుష్బదాష్టపదులు నివియాదిగాఁ గల్గునన్నియు."

-లక్షణదీపిక

మధురకవితలు ప్రాయికముగా భాష, భావము, ఛందము దేసిగా నుండుటచే సంగీతసంస్కారము గలిగినసామాన్యజనుల నాలుకలమీఁద నాట్యమాడునవిగా నుండును, గాన తొలుత నవి యంతగా లిపి కెక్కక పోయెను. సంస్కృత ప్రాయరచనలు గలచిత్రవిస్తరకవితల ప్రాబల్యమునఁ గూడ వానికి సత్కవితలలోఁ బరిగణన మంతగా లేకపోయెను. ఇటీవల కవులుగాఁ బురాణప్రబంధరచయితలే పరిగణింపఁబడుచుండిరి గాని మధురకవితారచయితలు లెక్క కెక్కకున్నారు. ఆంధ్రవాజ్మయవృక్షమున ముఖ్యమయిన మధురకవితాశాఖ యిందాఁక సుపరిశీలనము లేకయే యున్నది. ఇక్కడ నాకిప్పుడు దేసినాటకము లనఁదగినయక్షగానరచనముల ప్రశంసయే ప్రసక్తమగుటచే వాని పుట్టుపూర్వోత్తరములఁగూర్చిమాత్రమే నాకు గోచరించినవిషయములఁ గొన్నింటి వివరింతును.

దేశిదృశ్యరచనలు

యక్షగానము లన్నపేరు గలదృశ్యరచనములు నన్నయాదుల కాలమున నున్న వనుటకుఁ బ్రబలాధారములు గానరావు. కాని యా నాఁడేవో కొన్ని దేశిదృశ్యరచనము లున్నవని మాత్రము గుర్తింపనగును. నన్నయ కిన్నూఱేండ్లకుఁ దర్వాత నున్న పాల్కురికి సోమనాధుఁ డిట్లు చెప్పినాఁడు.

"భ్రమరులు జాళెమల్ బయకముల్ మెఱసి
  రమణఁ బంచాంగ పేరణి యాడువారు
  ప్రమధపురాతన పటుచరిత్రములు
  క్రమ మొందబహునాటకము లాడువారు
  లలితాంగ రసకళాలంకారరేఖ
  లలవడ బహురూప మాడెడువారు
  అమరాంగనలు దివి నాడెడుమాడ్కి
  నమరంగ గడలపై నాడెడువారు
  ఆవియద్గతి యక్షు లాడెడునట్టి
  భావన మ్రోకులపై నాడువారు
  భారతాదికధలు చీరమఱుఁగుల
  నారంగ బొమ్మల నాడించువారు
  కడు నద్భుతంబుగఁ గంభనూత్రంబు
  లడరంగ బొమ్మల నాడించువారు
  నాదట గంధర్వయక్షవిద్యాధ
  రాదులై పాత్రల నాడించువారు"
                   పర్వతప్రకరణము - పండితారాధ్యచరిత్రము

పై ద్విపదలందు, నేఁటివీధినాటకములు, దొమ్మరాటలు, తోలుబొమ్మలాటలు మొదలగునవి పేర్కొనఁబడినవి. ఇట్టి సంప్రదాయములు వీనిఁ 

బేర్కొన్న సోమనాథుని కిన్నూఱేండ్ల పూర్వకాలమునఁగూడ నుండుట సంభావ్యమే. తెలుఁగునకు సాటిభాష లగుద్రవిడ కర్ణాటభాషల పద్ధతులను బట్టియుఁ దెలుఁగులో నిప్పు డుపలభ్యమానము లగుచున్నకొన్ని ప్రాచీనదృశ్య రచనములతీరులనుబట్టియు, ద్రావిడభాషాసామాన్యముగాఁ దొలుత వెలసిననాటకరచనల స్వరూపము కొంత గుర్తింపవచ్చును.

కురవంజి[1]

తొలుత ద్రావిడభాషలలో వెలసినదృశ్యరచనములు కురవంజు లనఁబడునవి. అంధ్రకర్ణాట ద్రవిడదేశముల యరణ్యములలో వసించు నాటవికులు, చెంచులు, కురవలు (క్రోవ, కోయ) అనువారు. అందుఁ గురవజాతివారి యంజె=అడుగు (నృత్యవిశేషము) కురవంజె[2] యనఁ బడెను. చిందు, గంతు, గొండ్లి, అంజె, అంగ-ఇత్యాదులు నృత్య విశేషములు. ఆంధ్రదేశమున బహుకాలముననుండి శివక్షేత్రము లగుశ్రీశైలము ఇంద్రకీలనగము (బెజవాడకొండ) మొదలగుపర్వతముల మీఁదను, నృసింహక్షేత్రము లగువేదాద్రులు (పెక్కులున్నవి. మంగళాద్రి, సింహాద్రి, గరుడాద్రి, మాల్యాద్రి, వెంకటాద్రి,) మొదలగుపర్వతములమీఁదను వర్షోత్సవములు (యాత్రలు, జాత్రలు, జాతరలు) జరుగునప్పు డక్కడికి నాగరకప్రజలు చేరుచుండువారు. వారివినోదమునకై యక్కడి యాటవికులు రాత్రులందు నృత్యవిశేషములు నెఱపి ధనార్జనము చేయుచుండువారు. అక్కడక్కడి కొరవజాతులవారు చేయునృత్యములు కొరవంజులనఁబడెను. కొరవంజె యన్నపేరు తొలుత వారి నృత్యమునకును, బిదప నృత్యవిశిష్ట మయిన వారిచిన్నచిన్నగేయరచనలకును, నాపై కురవజాతి వారికినిగూడఁ బేరైనది. కురవజాతి వారు తొలుత చేయునృత్యవిశేషముకాలక్రమమున నాయాపర్వతప్రదేశముల స్థలమాహాత్మ్యకథలతోను, శివవిష్ణలీలాకథలతోను మిళితము లయి గేయవిశిష్టనాట్య రూపములనుబడసెను. అపుడు మాయాకిరాతవేషు లగుపార్వతీశివుల కథలతోనున్న కిరాతార్జునీయము, నృసింహస్వామి చెంచీతను బెండ్లాడుస్థల మాహాత్మ్యకథలు (చెంచీతకథ) కురవంజులుగా వెలసెను. ఇట్లు వెలసినయాదృశ్యరచనములు తొలుత నత్యల్పముగా గేయభాగములును విశేషముగా నృత్యమును గలవై యుండెను. అవి సింగి, సింగఁడు-అని యిద్దఱు పాత్రములు గలవై సంస్కృత వీధినాటకములఁ బోలియున్నవి. సింగి, సింగఁడు సంస్కృత నాటకములలోని నటీనటులవలె నాలుమగండ్రు. వీరిద్దఱే కథాపాత్రము లగుచుందురు. కొన్నింటఁ గథాసంధాయకుఁడు -సంధివచనములఁ జెప్పువాఁడు-విదూషకుఁ డనందగినవాఁడు - మూఁడవపాత్రము-కోణంగి యనువాఁడు - (పిదప చోడిగాఁడు) కాన నగును. కోణంగి సంస్కృత నాటకములలోని విదూషకస్థానీయుడగుట స్పష్టముగాఁ గానవచ్చును. సంస్కృతనాటకములలోని ధ్రువాగానమే కురవంజులలో దరు వనఁబడెను. దేశిరచనలలోనుండి సింగి, సింగఁడు, కోణంగి, దరువు అనునవి నటీనటులుగను, విదూషకుఁడుగను, ధ్రువగను సంస్కృత నాటకములఁ జేరెనేమో యనికూడ యోజింపఁ దగినట్టున్నది. ఎంతో కాల మిట్లు కొండపట్టులందు సాఁగుచుఁ బెంపొందినగేయనృత్యసందర్భములు నగరములకుఁగూడఁ గ్రమముగా వ్యాపించినవి. చెంచులు, కురవలు నడవులనుండి పులిగోళ్ళు, అడవిపందికోఱలు, అడవిపండ్లు, వెదురు బియ్యము, వెదురుబెత్తములు. పిల్లనగ్రోవులు, సూదంటురాళ్ళు, ఓషధులు, తేనె మొదలగునాటవిక వస్తువులను నగరములకుఁ గొని వచ్చి యమ్ముచు నప్పుడప్పుడు తమగేయనృత్యవిశేషములను నగరములందును, బల్లెలందును ప్రయోగించుటచే నవి నాగరకదేశములందును వ్యాపించెను.

యక్షగానములు

ఇట్లు నగరములందు నభిరుచి గొల్పినయాగేయవిశిష్టనృత్య దృశ్యములు, జక్కులవారు(యక్షులు, కళావంతులు) తర్వాత నగరము లందును ప్రయోగింపఁ జొచ్చిరి. వీరి ప్రయోగములందు దృశ్య మయిననృత్యాభినయములతోపాటుగా నధికముగా గేయ వచనరూపమైనశ్రవ్యరచనముగూడఁ జేరెను. కురవంజులకంటె యక్షగానములు పర్యాప్తముగా శ్రవ్యము లగుకవిరచనములు గలవి. వీరిరచనములలో బహువిధము లగుపురాణకథ లెల్లఁ జేరినవి. కురవంజులలోని సింగి, సింగఁడుపాత్రలు మాఱి రామ నల హరిశ్చంద్ర సీతా దమయంతీ చంద్రమత్యాదిపాత్రలు వచ్చినవి. కాని వీనిలో నాటవికరచనాసంస్కార సూచకముగా, 'ఎఱుకతసాని’ పాత్రము వెలసినది. కురవంజులలోని దేసిరచనలకంటె నత్యధికముగా వీనిలో దేసిచ్ఛందోబద్ధము లగుగేయ రచనలు ప్రబలినవి. రాజసభలలో, దేవోత్సవములలో, ఊరిజాత్రలలో యక్షగంధర్వాదివేషముల ధరించి [3]వేశ్యలు ప్రదర్శించునవి గావునను, నృత్యధర్మములకంటె గేయధర్మము లధికముగాఁ గలవి కావునను నివి యక్షగానము లనఁబడెను. కళావంతులలో నొక తెగకు నేఁడు జక్కులవా  రనుపేరు గలదు. యక్షాదివేషముల ధరించి నృత్యగానప్రదర్శనములను గావించుటచేతనే వారి కాపేరు వచ్చియుండవచ్చును. శ్రీనాథుఁడు క్రీడాభిరామమున జక్కుల వారిని గూర్చి కొంతప్రశంస నెఱపినాఁడు.

సీ|| కోణాగ్ర సంఘర్ష ఘుమఘుమధ్వని తార
                      కంఠస్వరంబుతో గారవింప
     మసిబొగ్గు బోనాన వసలుకొల్పినకన్ను
                      కొడుపుచేఁ దాటించు నెడప దడప
     శ్రుతికి నుత్కర్షంబుఁ జూపంగ వలయుచోఁ
                      జెవిత్రాడు బిగియించు జీవగఱ్ఱ

_________________________________________________________

సీ|| విరులదండలతోడివేణికాభారంబు
                 పొంకంబు పిఱుఁదులఁ బొరలి యాడ
     మణితులాకోటికోమలఝణత్కారంబు
                 రవలి మట్టెలమ్రోఁత యవఘళింపఁ
     గుదురు నిండిన చిన్న గుబ్బచన్నులమీఁద
                 ముత్యాలత్రిసరంబు మురువుఁ జూప
     వలమానతాటంక వజ్రాంకురచ్ఛాయ
                 లేఁతవెన్నెలఁ బుక్కిలించి యుమియ
     సాని యీశానియై మహోత్సవమునందుఁ
     గేల నవచంద్రకాంతపుగిన్నె పూని
     వీథి భిక్షాటన మొనర్చు వేళఁ జేయు
     మరులు నృత్యంబు జగముల మరులు కొలుపు. (ఆ1-105)

వ|| మహోత్సవమండపమునందుఁ బేరోలగం బుండి, కుండలీదండలాసకప్రేరణీ ప్రేంకణసింధుకందక ధమాళి చేల మత్తల్లీహల్లీసకాది నృత్యంబు లవలోకించుచు.

(అ 1 - 118)

శ్రీనాథునికాలమునకే దేవోత్సవాదులయందు వేశ్యలు వేషములు కట్టి నాటకములఁ బ్రదర్శించుసంప్రదాయము ప్రబలినది.

“కీర్తింతు రెవ్వానికీర్తి గంధర్వులు-గాంధర్వమున యక్షగానసరణి (భీమ 3 అశ్వా) శ్రీనాథునికాలమున యక్షగానములు ప్రబలియుండుట దీనిచే దేలియనగును". 

 గిల్కు గిల్కున మ్రోయుకింకిణీగుచ్చంబు
             తాళమానంబుతో మేళవింప
 రాగముననుండి లంఘించు రాగమునకు
 నురుమ యూరుద్వయంబుపై నొత్తిగిల్ల
 కామవల్లీమహాలక్ష్మి కైటభారి
 వలపు వాడుచు వచ్చె జక్కులపురంద్రి.

అప్పకవి యక్షగానలక్షణము నిట్లు చెప్పినాఁడు.

సీ|| తుద నేడులఘువులు తొలఁగించి చదివినఁ
               ద్రిపుటకు వృషభగతిపదయుగము
     లలిఁ గడపల నొక్కలఘువు మానిన జంపె
              మను ద్విరదగతిసమపదయుగము
     గురు తగురచ్చెరకుఁ దురగవల్గనా
              హ్వయ మేక తాళి యామధురగతికి(?)
     నంఫ్రిు కిర్వదినాలు గటతాళమున మాత్ర
             లోలి విశ్రాంతి పద్నాలుగింటఁ
     దెలియ నర్ధంబు నర్ధచంద్రికలు వీన
     యక్షగానప్రబంధంబు లతుకవచ్చు
     రగడభేదంబు లివి యండ్రు రసఁ గవీంద్రు
     లవితనిజసేవకస్తోమ! యబ్దిధామ!

పై పద్యమునుబట్టి చూడఁగా యక్షగానములందలి ప్రధాన గేయరచనములు దేశిరచన లగురగడలలోఁ గొంతమార్పు జరిపి-త్రిపుట, జంపె, ఏక, అట, అనుతాళముల కనుగుణముగాఁ గల్పింపఁబడినవిగాఁ గానవచ్చును. అప్పకవి రగడవికారరచనములను తాళములపేరనే పేర్కొనెను గాన వానికిఁ బేరులు వేఱె తెలుపలేదు. అప్పకవి పేర్కొన్నయీ రచనములే కాక యక్షగానములలో నింకను ననేకవిధము లయినదేశి రచనములు చేరినవి. ఏలలు, జోలలు, సువ్వాలలు, ఆరతులు, ధవళములు, చందమామసుద్దులు, వెన్నెలపదములు, విరాళిపదములు, తుమ్మెద పదములు, గొబ్బిపదములు, కోవెలపదములు, చిలుకపదములు, అల్లొనేరేళ్ళు, సీస-కందార్ధములు, త్రిభంగులు, ద్విపదలు, త్రిపదలు, చౌపదలు, షట్పదలు, మంజరులు, జక్కుల రేకులు మొదలగునవి.

యక్షగానము లిట్లు వెలసినను ప్రాచీనము లయినకురవంజి రచనములును యక్షగానరచనావిధానసంకలితములై ఈకాలమునఁ గూడఁ గొన్ని సాఁగుచునే వచ్చినవి. దేవోత్సవరాజాస్థానాదులం దిట్లు వేశ్యలచేఁ బ్రదర్శింపఁబడుచున్న యక్షగానములు పెంపొందుచుండు నీకాలమున, దక్షిణదేశమున విజయనగరరాజ్యమున కుపశాఖలుగా తంజావూరు మధురరాజ్యము లాంధ్రనాయక రాజుల పరిపాలనమున వెలసినవి. ఆంధ్రదేశమునందును, దక్షిణ దేశమునందును నీకాలమున యక్షగానరచనము మిక్కిలి ప్రబలఁ జొచ్చెను. ఇవి యిట్లు కలావతులచేతఁ బ్రదర్శింపఁబడుచున్న వౌట కొఱఁతగాఁ గనిపట్టియో యేమో కాని, కృష్ణాతీరమునందలి కూచిపూఁడిగ్రామమున సిద్దేంద్రుఁ డనుయోగి యొకఁడు భాగవతకథలను పారిజాతము, గొల్లకలాపము మొదలగు పేళ్లతో యక్షగానములుగా రచియించి శాస్త్రీయ మయినభరతనాట్య సంప్రదాయములకు రక్షగా, స్త్రీనిస్సహాయముగా, నాయూరి బ్రాహ్మణులచేతనే ప్రదర్శినము చేయింప నేర్పాటు చేసెను. ఆయూర జన్మించిన బ్రాహ్మణుఁ డెవ్వఁడు గాని, ఒక్కతూరియైనను, యక్షగానప్రదర్శమున స్త్రీవేషమును ధరించి తీరవలె ననియు, నది వారికులాభ్యుదయహేతు వనియుఁగూడ శాసించెనఁట. నేఁడుకూడ కూచిపూఁడి బ్రాహ్మణులు శాస్త్రీయమయిన భరతనాట్యముతో భాగవతకథలను బ్రదర్శించువారుగా నున్నారు. ఈసంప్రదాయము వెలసినపిదపనే తత్ ప్రదర్శకులకు భాగవతు లనియు, తద్రచనములకు ఆటభాగవతము లనియుఁ బేరయ్యెను.

ఆటభాగవతములు

ఈ భాగవతకథలలో పారిజాతహరణకథ హృద్యతర మగుటచే దానికిఁ బ్రచార మెక్కువయ్యెను. అది హృద్యతర మగుట కందలి సవతుల కయ్యపుఁబట్టు ప్రధానకారణము. దీనినిఁ బట్టి యక్షగానసామాన్యమునకుఁ బారిజాతము లనియుఁ బేరయ్యెను. ఏయక్షగానముఁ బ్రదర్శించినను నందు సవతుల కయ్యపుఁబట్టునకుఁ బ్రసక్తి గల్పించుటయో లేక పారిజాతమునందలి తత్కథాఖండమునే స్వంతంత్రముగాఁ బ్రదర్శించుటయో పిదప నేర్పడెను. ఈసవతులకయ్యపుఁగథపట్టు హృద్యతర మగుటచేఁ బ్రబంధకవులనుగూడ నిది వలపించెను. కళాపూర్ణోదయమున పింగళి సూరన్న పారిజాతకథలోని సవతుల కయ్యపుఁబట్టు ని ట్లనుకరించెను.

అంత మదింపకువేయని పల్కిన నంత మదింపకువే యనుచున్
గంతు లడంచెడ లెమ్మని పల్కిన గంతు లడంచెద లె మ్మనుచున్
రంతుల నేమి ఫలం బని పల్కిన రంతుల నేమి ఫలం బనుచున్
బంతము చూడఁగదే యని పల్కినఁ బంతము చూడఁగదే యనుచున్,

సీ|| ఒట్టుసుమీ యన్న నొట్టుసుమీ యంచు
               నే నేమి యనిన నే మేమి యనుచుఁ
      గానీగదే యన్నఁ గానీగదే యంచు
               నింకేల యనిన నింకేల యనుచు
      నోసి పోవే యన్న నోసి పోవే యంచు
               నౌనంటి ననిన నౌనంటి ననుచు
      మఱువకు మిది యన్న మఱువకు మిది యంచు
               నీ వెంత యనిన నీ వెంత యనుచు
      నొకతె మగనికి నాసించు టొప్పదనిన
      నొకతె మగనికి నాసించు టొప్ప దనుచుఁ
      బట్టియాడె నారంభతోఁ బ్రథమరంభ
      ప్రియుఁడు నిలుమన్న నిలువక పెద్దరొదగ
                                            కళా, ఆ, 3-195, 196

ఆంధ్రదేశమున వెలసినయీకూచిపూండి భాగవతముల ప్రయోగవై శారద్యము ధక్షిణదేశమునకుఁగూడ వ్యాపించినది. ఆనాఁడు కూచిపూఁడి భాగవతుల యాటభాగవతసంప్రదాయము నేఁటికిని దక్షిణదేశమునఁ గలదు. దక్షిణదేశమున బ్రాహ్మణులు పురుషులే నేఁడును భాగవతయక్షగానములను దెనుఁగువానినే ప్రదర్శింతురు. ఆంధ్రదేశమున వెలసినయక్షగానము లిన్నూటికిఁ బైచిలుకు పరిగణింపఁబడినవి. వీని ననుసరించి వెలసిన దక్షిణదేశపుయక్షగానములు మున్నూటికిఁ బై చిలుకు గలవు. భక్తాగ్రేసరుఁ డనఁబడినశివనారాయణతీర్థులవారు (కృష్ణలీలాతరంగిణి కర్త), త్యాగరాజస్వామివారు పారిజాతాపహరణ మని, నౌకాచరిత మని భక్తిరసభరితము లయినయక్షగానములను రచించిరి. భగవత్కథలతోఁ బురాణకథలతోఁ బెంపు వెలసిన యీ భాగవతయక్షగానములు తత్ ప్రదర్శనములు నాయకరాజుల కాలమునను, మహారాష్ట్రరాజుల కాలమునను మితిమీఱి యాయారాజుల శృంగారజీవితవర్ణనాత్మకములుగాఁ గూడ రచితములై ప్రదర్శితము లగుచు వచ్చినవి. దిక్ ప్రదర్శనలుగా కొన్ని కురవంజులను, యక్షగానములను, భాగవతములను బేర్కొనుచున్నాను.

"కిరాతార్జునీయము, శ్రీగిరికురవంజి, గంగాగౌరీవిలాసము, అలమేలుమంగావిలాసము, ఎఱుకలవేషకథ, కపోతవాక్యము, గరుడాచలము, త్రిపురసంహారము, దారువనక్రీడ, నలచరిత్ర, నిజలింగచిక్కయ్యకథ, కన్యకాచరిత్ర, పారిజాతాపహరణము, పార్వతీపరిణయము, మృత్యుంజయ విలాసము, శివపారిజాతము, సముద్రమథనము, విజయరాఘవ చంద్రికావిహారము, రఘునాథనాయకాభ్యుదయము."

భిన్నపాత్రవేషధారణము లేక సింగి, సింగcడు (కొన్నింటిఁ గోణంగికూడ) పాత్రలతో వెలసినవీధినాటకము లనఁబడు కురవంజులు యక్షగానరూపమునఁ బెంపొందినపుడు వేషభేదము గల పాత్రభేదములును బెంపొందెను. ఇట్లు పాత్రబాహుళ్యముకూడఁ గలవైనయక్షగానములందు సంధివచనములఁ జెప్పుకోణంగి లేక సూత్రధారుఁడు 'వచ్చెనమ్మా సత్యభామ.' ఇత్యాది విధములను బాత్రములఁ బేర్కొనఁగాఁ దద్వేషధారులు వచ్చి, తమయాటపాటలు నెఱపుదురు. ఇ ట్లింకను బెంపొందిన యక్షగానములు తెరలు, రంగభేదములు కలవయి కొంతసంస్కృత నాటకచ్చాయయుఁ జొప్పడఁగా నాటకము లనుపేరనుగూడఁ బదు నెనిమిదవ శతాబ్దినాఁటికిఁ బేర్వెలసినవి.

ఇంచుమించుగాఁ దెలుఁగున నేనూఱింటిదాఁక లెక్కింపఁ దగియున్న యక్షగానములలో సుగ్రీవవిజయ మొకప్రశస్తకృతి.

దానికర్త

కందుకూరి రుద్రకవి

ఈతఁడు విశ్వబ్రాహ్మణవంశ్యుఁడు. కందుకూరికిఁ జేరువనే పాలేటియొడ్డునఁ గలచింతలపాలె మనుగ్రామ మీతనియూరు. ఆయూరనే తద్వంశ్యు లిప్పటికిని గలరు. రుద్రకవి మూలమున నావంశమువారికి 'కవివారు' అని యుపనామ మేర్పడినది. ఆవంశమున రుద్రకవికిఁ దర్వాతఁ బలువురు రుద్రకవినామకు లుండిరి. తొలుతటి రుద్రకవి కృష్ణదేవరాయల యాస్థానమున నష్టదిగ్గజము లనఁబడుకవు లెనమండుగురిలో నొక్కఁడుగా నుండెనఁట. [4]మల్కిబ్రహీంకాలమునగూడ నొక రుద్రకవి యుండెను. ఇబ్రహీంకాలమునఁ గలరుద్రకవియే కృష్ణరాయలకాలమున బాలుఁడుగా నుండఁబోలును. చింతలపాలె మనుగ్రామము మల్కిబ్రహీం ప్రభువే రుద్రకవి కొసఁగెను.

అద్యాశీతిచతుశ్శతాధిక సహస్రం వైశకాబ్దా గతాః
అస్మిన్ శ్రీజయవత్సరే జయతిథౌ మాసే చ మాఫేు తథా
పంచమ్యాం ద్వయతింత్రిణీజనపదం రుద్రస్య విద్వత్కవేః
ప్రీత్యా శ్రీయిభరామభూపతి రదాత్ క్షోణీధరాఖండలః||

ఇబ్రహీంప్రభు విచ్చినయగ్రహారమును నిన్న మొన్నఁటి దాఁకఁ దద్వంశ్యులే యనుభవించుచుండిరి.

సుగ్రీవవిజయము రచించినరుద్రకవియే నిరంకుశోపాఖ్యాన మని గ్రంథాంతరము రచియించెను. రెండుగ్రంథములందును గర్తకు కందుకూరు జనార్దనభక్తత్వము, పెదలింగనార్యపుత్త్రత్వము గలదు గావున రెండు గ్రంథములు నొక్కనివే యగుట స్పష్టము. నిరంకుశోపాఖ్యానమున,

"చేరి కన్నడభూమి చెఱవట్టుపాశ్చాత్య
నృపతికైనను గొంతకృప దలిర్చు "

అని సీసచరణ మున్నది. అది విద్యానగరమును దురుష్కులు కొల్లఁ గొట్టినదుస్సందర్భమును దెలుపుచున్నది. విద్యానగర వినాశనము క్రీ.శ. 1568 నాఁడు జరగినది. కావున నిరంకుశోపాఖ్యానరచన మటుతరువాత జరగినదగును. అప్పకవీయమున వినుకొండలో గుంటుపల్లి భాస్కరయగారిసముఖమునఁ గందుకూరి రుద్రకవి కవితాచర్చ జరపినట్లు కలదు. మనరుద్రకవి యూతఁ డగునేమో! నిరంకుశోపాఖ్యాన సుగ్రీవవిజయకర్త క్రీ.శ. 1568 ప్రాంతములవాఁడేని, కొంతతర్వాతివాఁ డేని కాఁగలఁడు. దక్షిణదేశమం దల్పముగా నాంధ్రదేశమం దధికముగా యక్షగానముల రచనములు, ప్రయోగములు సాగుచుండిన కాల మది.

సుగ్రీవవిజయము

శ్రీమద్రామాయణమునఁ గలకథాఖండములలో సుగ్రీవవిజయకథ యొక కండపట్టు. అత్యల్పకాలమున వడివడిగా గంటలలో నడచిన యీకథపట్టు రామలక్ష్మణులు, హనుమంతుడు, సుగ్రీవుఁడు, వాలి, అంగదుఁడు, తార అనుకథాపాత్రముల శీలపు మేలిమి నొఱసి మెఱుఁగు తఱుగులు చూపినయొఱగ ల్లనఁదగినది. తెలుఁగున గుత్తెనదీవిరామాయణాదు లగురామాయణగేయ కృతులలో నీసుగ్రీవవిజయపుఁగథపట్టు చాల హృద్యరచనములతో నున్నది.

ఎంత పని చేసితివి రామా! నిన్ను
నేమ నందును సార్వభౌమా!
చెంత కిటు రాలేక చెట్లలో దాగుండి
వింతమృగమును గొట్టువిధ మాయెనా బ్రదుకు!

ఇత్యాదిగేయములను బలువురు పాడుచుందురు.

ఈరుద్రకవిసుగ్రీవవిజయమునుగూడ స్త్రీ, వృద్ధ, పామరాదులు పలువురు పాడుచుందు రఁట! ఆయాపాత్రముల పాటలు తత్తద్వేషధారులు వచ్చి పాడునట్లును దక్కినసంధివచనాదులు ఒక్కరిద్దఱు సూత్రధారప్రాయులు పఠించునట్లును నీసుగ్రీవ విజయము వీథియాటగా నాడఁబడుచుండెడిది. ప్రాచీన సంస్కృత నాటకరచయితలు భాసభవభూత్యాదు లీసుగ్రీవవిజ యౌచిత్యమును దమనాటకములలో విమర్శించిరి. శ్రీరాముని శీలమును శ్రీవాల్మీకిరామాయణపద్ధతిని సమర్ధించిరి.

భవభూతి "యద్వా కౌశల మింద్రసూనుదమనే తత్రాప్యభిజ్ఞోజనః" యని దీని యౌచిత్యము నించుక చెనకెను. మన రుద్రకవి సంస్కృతాంధ్ర రామాయణకవులు త్రొక్కినత్రోవనే త్రొక్కెను గాని యపూర్వకల్పనాంశము నేమాత్రము నిందుఁజేర్చలేదు,

ఆయాపాత్రములు ప్రసిద్ధరామాయణములలో నెట్టియుక్తిప్రత్యుక్తులు గలవిగాc జిత్రితము లయ్యెనో యిందు నదే తీరు గలదు. కాని యిది దేశిరచనముతో గేయరూపమున నుండుట విశేషము. ఇం దీక్రింది గేయరచనలు ప్రశస్తము లయినవి!

హా సతీమణి ధర్మచారిణి హా గుణోన్నత జనకసుత ననుc
బాసిపోయితి వింతలోనే పద్మనయన
లేటిమాయలు మదిని దెలియఁగ లేక పాపపురక్కసునిచే
బోటి నిను గోల్పోతి నిక నాకేటి బ్రదుకు!

లలన నినుఁ గలనైన బాయఁగఁ గలన నీ విట లేక యుండినఁ
జలన మొుందెను నాదుహృదయము జలజనయన !

తరణికులమునఁ బుట్టి శరచాపముల బట్టి
తరుణిఁ గోల్పడుకంటె మరణమే మేలు
నను శౌర్యవంతుఁ డని తనపుత్రి నిడినట్టి
జనకవిభుఁ డీవార్త విని వగవకున్నె

నాయ మెఱుగక చంపితివి నరనాథ పాపము గట్టికొంటివి
బోయ వింతియె కాక నీ వొక భూమిపతివా?

శ్రీరామ శ్రీరామ జెఱగొన్న రావణుని
వారిధుల ముంచితిని వాలమునఁ జుట్టి
ఒకమాట నాకుఁ జెప్పక పోయితివి గాక
సకలదైత్యుల దున్మి జానకిని దేనె?

ఆలిఁ జెఱగొని పోయినట్టిదశాస్యుఁ డుండఁగ నిర్నిమిత్తము
వాలి నేటికిఁ జంపితివి రఘువంశతిలకా!
ఇట్టిసాహసకర్మ మెచటికి నేఁగె భరతుఁడు సీమ వెడలఁగఁ
గొట్టి రాజ్యము పుచ్చుకొన్నెడఁ గువలయేశా !
నాయ మేటికిఁ దప్పితివి రఘునాథ జానకితోడనే చెఱఁ
బోయెనే నీ రాజనీతియు భూరిమతియున్,

శ్రీరామచంద్రమూర్తి చెట్టుచాటుననుండి వాలిమేనఁగాడనేసిన వాఁడి ములుకులకంటె నిక్కడ తార ప్రత్యక్షమై నిలుచుండి శ్రీరాముని యంతరంగము నుచ్చిపోవునట్టు ప్రయోగించిన పలుకుములుకులు క్రొవ్వాఁడి గలవి.

సుగ్రీవవిజయము వీరకరుణరసభరితము. స్త్రీ బాలపామరాదులు గూడఁ బఠింపఁ దగినది,

ఆ యక్షగానమున నీక్రింది దేశిరచన లున్నవి. త్రిపుట, జంపె, కుఱుచజంపె, అర్ధచంద్రికలు, ఆటతాళము, ఏకతాళము, ద్విపదలు, ధవళములు, ఏలలు, అర్ధచంద్రికలు త్రిపుటాదిరచనల ఖండరచనలు గాఁబోలును. ఇందలియర్ధచంద్రిక లెల్ల నొక్క తెఱఁగునడక గలవి గాక భిన్నగతులతో నున్నవి. సంగీతతాళ లక్షణము లెఱిఁగినవారు వాని ప్రభేదములు గుర్తింపవలెను.

కురవంజులు, యక్షగానములు నింకను మంచిరచనములు గలవి కొన్ని యున్నవి. అవి యేవేని సుగ్రీవవిజయమువలె సుముద్రితములైనచో నాంధ్రమధురకవితావిశేషములను సహృదయు లింక నధికముగా నాస్వాదింపఁగల్గుదురు.


  • * *
  1. . వాల్విచి గుజ్జరి విల్వేడు(?) దండలాస్యము కందుకక్రీడ యల్లికయును కొరవంజి(జె) శుభలీల గుజరాతి దేసి చౌపదము జక్కిణి దురుపదము మదన పదదౌత్యమును జోగిపదచాళి శారదాసామ్రాజ్యమును జిందు సవతిమచ్చరంబులు నాట్యకదంబంబు మొదలైన నాట్యముల్ హవణించునవరసజ్ఞు (విజయరాఘవనృపాలుని ప్రహ్లాదచరిత్ర-యక్షగానము) ఇందు 'కొరవంజి' నృత్యవిశేషముగానే పేర్కొనఁబడినది.
  2. . కురవంజి, కురవ+అంజె (అంజ, అంజె, అంజియ రూపాంతరములు) కురవంజియ కురవంజెలనుండి కురవంజి అనురూప మేర్పడి యుండవచ్చును.
  3. శ్రీనాథుఁడు భీమఖండమున దాక్షారామభీమేశ్వర మహోత్సవ సమయములందు సానులు (వేశ్యలు) వేషములు వేసికొని నాటకము లాడుట నిట్లు వర్ణించెను.
  4. రుద్రకవి విషయమును చాటుపద్యమణిమంజరి ద్వితీయభాగమునఁ జూచునది,