మహాభారతతత్త్వకథనము, ప్రథమ భాగము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

శ్రీ గురుభ్యో నమః

ఉపోద్ఘాతము

“వాగీశాద్యా స్సుమనస స్సర్వార్థానా ముపక్రమే|
యం నత్వా కృతకృత్యా స్స్యుస్తం నమామి గజాననమ్"||

“ఇద మన్థం తమః కృత్స్నం జాయేత భువనత్రయమ్|
యది శబ్దాహ్వయం జ్యోతి రాసంసారం న దీప్య తే ||
అతః ప్రజానాం వ్యుత్పత్తి మభిసన్ధాయ సూరయః|
వాచాం విచిత్రమార్గాణాం నిబబన్ధుః క్రియావిథిమ్||"

అను ఆచార్యదండివచనానుసారము దేశాంతర కాలాంతరవర్తులును, ఇంద్రియా గోచరములును అగుపదార్థములను ప్రకాశింపజేయు శబ్దాత్మక జ్యోతిస్సు లేనినాడు యీ భువనత్రయమును అంధకారబం ధురమే యనుట నిర్వివాదము. అట్టి శబ్దజాలమునే లోకోపకారమునుకోరి ప్రజల యొక్క బుద్ధివైజాత్యమును బట్టి సుగమముగా లోకులు గ్రహించి తరించుట కుపయుక్తముగా మహర్షి ప్రభృతులు శాస్త్రకావ్యపురాణేతిహాస రూపమున బహువిధ వాఙ్మయము నిర్మించి, మనలననుగ్రహించిరి.

అందు వేదవ్యాసప్రణీత మగు మహాభారత మొకటి. దీని ప్రాశస్త్యము - "ధర్మేచార్థేచ కామే చ మోక్షే చ భరతర్షభ| య దిహాస్తి త దన్యత్ర య న్నేహాస్తి న తత్క్వచిత్" అను వచనముచే చతుర్విధపురుషార్థములలో నీభారతమందు లేని దేగ్రంథమందు లేదనియు దీనియం దున్నదే గ్రంథాంతరమందుండె ననియు బోధింపబడుచున్నది. ఈ యుద్గ్రంథము పఠన శ్రవణప్రక్రియలచే పాపహరమై, ఐహికాముష్మిక శ్రేయస్సాధనమై, భారతీయభాగ ధేయమై భాసించు చున్నదనుట జగద్విదితము.

కాని యార్షవిద్యాసంప్రదాయము దూరమై యున్న యీకాలమందు ఆర్ష గ్రంథ తాత్పర్యము దుర్జ్ఞేయమగుటచే స్వబుద్ధి ప్రాభవమున బరిశీలుంచు వారికి విరుద్ధముగా నుండినట్లు కనబడుటనుబట్టి యీమహాభారత మందు ఇటీవల పాశ్చాత్య విజ్ఞాన సంపన్నులును, తదనుయాయులును అగు కొందరు హస్తనిక్షేషము చేసి సంప్రదాయ విరుద్దముగా బహిరంగ పరీక్ష యను పేరుతో నేమేమో వాసి విమర్శనము లనబడు కొన్ని గ్రంథములను లేవదీసిరి.

అందు సప్రే పండితునిచే హిందీలో వ్రాయబడి, చర్ల నారాయణశాస్త్రిగారి చే నాంధ్రీకరింపబడిన మహాభారత మీమాంస, బంకిం చంద్ర చటోపాధ్యాయునిచే వంగ భాషలో వ్రాయబడి, బాలాంత్రపు సూర్యనారాయణరావు గారిచే నాంధ్రీకరింపబడిన శ్రీకృష్ణ చరితము, కోటమర్తి చినరఘుపతిరావు గారి సుయోధనవిజయము, పెండ్యాల వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రిగారి మహాభారతచరిత్రము ఇత్యాదులు కలవు.

ఈ విమర్శనము లుద్బవించి యా మహాభారతమందు నిరూఢమగు లోకవిశ్వాసమును సడలింప మొద లిడినవి. అట్లావిశ్వాసము సడలుటచే గ్రంథకర్త యగు మహర్షికి గూడ నజ్ఞత నాపాదించుటకు లోకము సిద్ధపడుచున్నది.

ఆహా! మన మేమాత్రమైనను లోకోత్తర మగు విజ్ఞానము నార్జింపగలిగితి మేని యది యార్షగ్రంథ మూలకమే యని ముమ్మాటికి చెప్పక తప్పదు.