బైబులు భాష్య సంపుటావళి - జ్ఞానవివాహం, తిరుసభ/వాళ్లిద్దరూ ఒకే వ్యక్తిగా ఐక్యం గావాలి

వికీసోర్స్ నుండి

1. వాళ్లిద్దరూ ఒకే వ్యక్తిగా ఐక్యం గావాలి

మనవిమాట

వివాహవ్యవస్థ మానవ జీవితానికి పునాదిలాంటిది. బహుపురాతనమూ పవిత్రమూ ఐంది. పిల్లల బాగోగులు, వారి భావిజీవితం చాలవరకు కుటుంబంపైనే ఆధారపడివుంటాయి. క్రైస్తవ విశ్వాసానికిగూడ కుటుంబమే పట్టుగొమ్మ. మంచి క్రైస్తవ కుటుంబం మంచి క్రైస్తవ పౌరులను తయారుచేస్తుంది. ఈ గ్రంథంలో క్రైస్తవ వివాహాన్నీ, కుటుంబ జీవితాన్నీ వివరించాం. ఈ పొత్తం ఇదివరకే ఏడు ముద్రణలు పొందింది.

విషయసూచిక

1. ఆదిదంపతులు
2. క్రీస్తు - శ్రీసభ
3. సహజమైన వివాహాన్నే క్రీస్తు సంస్కారంగా మార్చాడు 9
4. వివాహవిధిలో ముఖ్యాంశం వధూవరుల అంగీకారమే 13
5. క్రైస్తవ వివాహం విడాకులను అంగీకరించదు 17
6. వివాహ వరప్రసాదం జ్ఞానశరీరాభివృద్ధికి తోడ్పడుతుంది 23
7. ప్రేమమార్గం 29
8. సిలువమార్గం 35
9. భక్తిమార్గం 40
10. వివాహజీవితంగూడ పిలుపే 45
11. యువతీయువకులు 49
12. వివాహ ప్రయత్నాలు 54
13. కుటుంబ దేవాలయాలు 60
– వివాహ విషయాలు, వేదపఠనాలు 63
- ఆత్మశోధనం 64
ప్రశ్నలు 72

1. ఆదిదంపతులు

1, 26-28 పోలిక, సంతానం. ఆదికాండం : 2,18-24 సహాయురాలు, ఇద్దరూ ఒకే వ్యక్తి

1. పోలిక

“దేవుడు తనకు పోలికగా నరుని సృజించాడు. ఆ నరుని స్త్రీ పురుషలనుగా సృజించాడు" - ෂධී 1,27.

దేవుడు పిడికెడు మట్టిముద్దను తీసికొని తన శ్వాసను దానిలోనికి వూదాడు. దేవుని శ్వాస అంటే అతని ఆత్మ ఈ ఆత్మను పొంది ఆ మట్టిముద్ద సజీవప్రాణి ఐంది. ఆ ప్రాణి ఆదాము. ఈ ఆదామునుండి స్త్రీ సృజింపబడింది . నరుడు దేవునికి పోలికగా వుంటాడు. ఆకాశంలోని పక్షులు, భూమిమీది జంతువులు, నీళ్ళలోని చేపలు మొదలైన సృష్టి ప్రాణులన్నీగూడ అతని అధీనంలో వుంటాయి - కీర్తన 8,7.

ఆదాము ఏవలు ఆదిదంపతులు. ఈ ఇద్దరూ దేవుని ప్రతిబింబాలే. వీళ్ళిద్దరిలోను దేవుని పోలికలు ఉన్నాయి. ఇద్దరూ దేవుని బిడ్డలే. ఇద్దరూ దేవుని చేరవలసినవాళ్ళే కావున వాళ్ళల్లో హెచ్చుతగ్గులంటూ లేవు. వాళ్ళ గుణగణాలు, శక్తిసామర్థ్యాలు వేరు. ఐనా దేవుని ఎదుట వాళ్ళ విలువ ఒకటే.

2. సహాయురాలు

‘నరుడు ఒంటరిగా వుండడం మంచిదికాదు. అతనికి యోగ్యమైన సహాయురాలిని సృజిస్తాను" అని అనుకున్నాడు ప్రభువైన యావే - ఆది 2,18.

నరుడు ఒంటరిగా వుండడం మంచిదికాదు. అంచేత అతనికి సహాయురాలునిగా ఏవను సృజించాడు యావే. ఇక్కడ సహాయురాలంటే అతణ్ణి పరిపూరుణ్ణి చేసే ప్రాణి. జంతువులను సృజించి ఆదామునకు చూపించాడు ప్రభువు. ఆదాము వాటికి పేర్లు పెట్టాడు. అనగా వాటిమీద అధికారం పొందాడు. కాని ఆదామునకు సహాయపడే సాటిజంతువు వాటిల్లో లేదు. వాటి స్థితి వేరు, అతని స్థితి వేరు. అంచేత అతనికి సహాయపడగలిగే వ్యక్తిని, ఏవను; ప్రభువు ప్రత్యేకంగా సృజించాడు. ఆమె లేనిదే అతడు పరిపూర్ణ ప్రాణికాలేడు. సంతానాన్ని పొంది అభివృద్ధిలోనికి రాలేడు. అతడు లేనిదే ఆమెకూడ పరిపూర్ణురాలు కాలేదు. వృద్ధుడు వూతకర్రమిదలాగ అతడు ఆమెమీద, ఆమె అతనిమీద ఆధారపడుతూ వండాలి. (సహాయం అనే హీబ్రూ పదానికి అర్థం ఇది). వాళ్ళిద్దరూ దేవునిమిద ఆధారపడుతూ వుండాలి.

3. సంతానం

"మీరు సంతానాన్ని కని అభివృద్ధి చెందండి. భూమి విూద వ్యాపించి దాన్ని వశపరచుకోండి" - ఆది 1,28.

సంతానం దేనికి? నరుడు దేవుని ప్రతిబింబం అన్నాం. భగవంతుని మహిమను ప్రకాశింపజేసేవాళ్లు నరులు. కావున నరులు ఈ నేలమీద సంచరించేలా చేయడం కోసం ఆదిదంపతులు సంతానం కనాలి. దేవుడు తొలిదంపతుల్ని తానే సృజించాడు. ఆ మీదట మనుష్యప్రాణుల్ని మనుష్యుల ద్వారాకాని సృజింపడు.

ఇక్కడ వివాహంయొక్క తొలిధర్మం సూచింపబడింది. పూర్వవేద ప్రజలు సంతానాన్ని మక్కువతో వాంఛించారు. బిడ్డల్ని కనటమంటే ప్రభువు ఆశీర్వాదాన్ని పొందటం, సంతానం లేకపోవడమంటే దైవశాపానికి గురికావడం,

4. పరస్పర ప్రేమ

“ఈవిడనా ఎముకల్లో ఎముక, నా శరీరంలో శరీరం. నరునినుండి కలిగింపబడింది కనుక యీవిడ నారి అనబడుతుంది. కావున పురుషుడు తల్లిదండ్రులనుగూడ విడచి భార్యకు హత్తుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తిగా ఐక్యమౌతారు" - ఆది 2,23-24.

ఆదాము ఏవనుచూచి "ఈవిడ నా ఎముకల్లో ఎముక. శరీరంలో శరీరం" అనుకున్నాడు. దగ్గరిబంధువురాలు అని యీ మాటల భావం. ఆమె అతని దేహంనుండి పుట్టింది. అచ్చంగా అతని కోవకే చెందింది. అందుకే అతడు నరుడైతే, ఆవిడ నారి. ఇక, వాళ్ళిద్దరి సంబంధం చాల సన్నిహితమైంది. అతడు, ఆమె గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకరితో ఒకరు ఐక్యమౌతారు. ఇద్దరైనాగూడా ఒకేవ్యక్తిగా కూడుకొనిపోతారు. అలా కూడుకొని ఒకరికొకరు సహాయపడతారు. బిడ్డల్ని కంటూవుంటారు. పురుషుడు తల్లిదండ్రులనుగూడ వదలిపెట్టి భార్యతో జీవిస్తాడు. క్రొత్త కుటుంబం ఏర్పరచుకుంటాడు. ఇక్కడ భార్యాభర్తల పరస్పర ప్రేమభావం, సహాయభావం సూచింపబడింది. ఇది వివాహపు రెండవ ధర్మం. కావున ఆదిదంపతులను వర్ణించిన హీబ్రూ రచయిత దృష్టిలో వివాహధర్మాలు రెండు : సంతానం, పరస్పర ప్రేమ. ఇవి రెండూ బైబులు సూచించే ప్రధాన ధర్మాలు. పూర్వవేదంలో వేరే తావుల్లోకూడ వివాహపు ప్రస్తావన వస్తుంది.

5. ఇతర భావాలు

యావే ప్రభువు యిస్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసికొన్నాడు. ఈ యొడంబడికను వివాహంగా భావించారు ప్రవక్తలు. యావే నరుడు. యిస్రాయేలు ప్రజ వధువు, “నిన్ను సృజించిన ప్రభువే నీ భర్త" అంటాడు యెషయా ప్రవక్త - 54,5. "ఎడారి కాలంలో ఒక వధువులా నన్ననుసరించి వచ్చావు" అంటాడు యిర్మీయా ప్రవక్త -2,2.

అబ్రాహాము తన భార్యయైన సారను గాఢంగా ప్రేమించాడు. సార అతనికి లోబడి వుండేది. అనురాగంతో అతన్ని 'ప్రభూ' అని పిలిచేది. వీళ్ళకుటుంబములో నుండే మెస్సీయా జన్మించింది. వీళ్ళలాగే తోబియా సార కూడ ప్రేమిజీవితం జీవించిన ఆదర్శ దంపతులు.

కీర్తనకారులు వివాహజీవితాన్ని ఉదాత్తభావాలతో వర్ణించారు. "నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్షలతలా ఉంటుంది. భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఓలివమొక్కల్లా కనబడతారు. ప్రభువుపట్ల భయభక్తులు చూపే గృహస్థు ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుతాడు” - కీర్తన 128,3-4

మరో కీర్తనకారుడు పెండ్లికుమార్తెను ఇలా హెచ్చరించాడు - కీర్తన 45,10-11.
"కుమారీ! సావధానంగా విను
నీ పుట్టింటిని సొంత జనాన్ని యిక మరచిపో
ఈ రాజు నీ ప్రభువు
నీ సౌందర్యాన్ని కోరినవాడు ఇతడే
ఇతనికి నమస్కరిస్తూ వుండు."

6. పాపానంతరం వివాహదశలో మార్పు

పాపం తర్వాత ఆదిదంపతుల వివాహదశలో పెద్దమార్పు వచ్చింది. పూర్వమున్న భాగ్యస్థితిపోయి దౌర్భాగ్యస్థితి పట్టుకొంది. ఆదాము ఏవకు సహచరుడు కావడం మానివేసి నియంత అయ్యాడు. ఏవ ఆదాముకు సహాయురాలు కావడానికి బదులు బానిస ఐంది - ఆది 3,16. దేవుడు ఆదామును నిలదీయగా అతడు తాను తినగూడని పండు తినడానికి. కారణం ఏవ అన్నాడు. తప్పు ఆమెమీద మోపాడు-3,12. పాపానికి ముందు ఏవకు వ్యాధిబాధలు లేవు. కాని పాపానంతరం ఏవ ప్రసవవేదనకు గురైంది - 3,16, ఆదాము నొసటి చెమటోడ్చి రెక్కలకష్టం చేయవలసివచ్చింది - 3,16. తొలిపాపం వలన భూమికూడ శాపం పాలయింది. ఆది పైర్లకు మారుగా ముండ్ల తుప్పలను ఎదిగించింది - 3,17-18.

పాపానికి ముందు ఆదామేవలు దిగంబరులుగా వున్నా వారికి సిగ్గవేయలేదు. కాని పాపం తర్వాత సిగ్గు పుట్టింది. కనుక అత్తియాకులతో దిసమొలను కప్పకొన్నారు - 3,7. అనగా వారి నిష్కల్మషత్వం పోయింది. ఇంద్రియ వాంఛలు అదుపుతప్పాయి. ఈ యనర్దాలన్నీ కూడ పాపం వివాహదశలో తెచ్చిపెట్టిన దుష్పరిణామాలు.

ప్రార్థనా భావాలు

1. భార్యవలన భర్తపొందే తృప్తి

ఈసాకు రిబ్కాను వివాహమాడాడు. ఆమెను నిండు మనస్సుతో ప్రేమించాడు. తల్లియైన సార చనిపోయిన తరవాత ఈసాకునకు చాల దుఃఖము కలిగింది. అప్పడు రిబ్కా అతన్ని ఓదార్చింది. దానితో అతని దుఃఖం తీరిపోయింది. భార్యవలన భర్తపొందే తృప్తి ఇలాగుంటుంది- ఆది 24,67,

2 భర్తవలన భార్యపొందే సంతృప్తి

ఎల్కనా భార్య అన్న, ఆమెకు సంతానం కలగలేదు, ఓనాడు వాళ్లు షిలో దేవాలయానికి వెళ్ళారు. అన్నదేవాలయంలో ఓ మూల చతికిలపడి విలపించింది. అన్నం తినడం మానివేసింది. అది చూచి ఎల్కనా "అన్నా! నీకు ఈ విచారం దేనికి? నా ప్రేమ నీకు చాలదా? పదిమంది కొడుకులకంటెకూడ నేను నీకు ఎక్కువగాదా?" అన్నాడు. ఆ మాటలకు సంతృప్తిచెంది అన్న యింటికి వెళ్ళింది. ఆ మీదట వాళ్ళకు సమూవేలు పుట్టాడు. భర్త వలన భార్య యిలా సంతృప్తి చెందుతుంది - 1సమూ 1,8.

3. భార్యాస్తుతి

"ఉదయించే సూర్యుడు ఆకాశానికి అలంకారం
మంచి యిల్లాలు ఇంటికి అలంకారం
వెలిగే దీపం దీప స్తంభానికి అలంకారం \
చిరునవ్వు నవ్వే ముఖం భార్యకు అలంకారం.

సీరా 26,16-21.

4 సంతాన దృష్టి

తోబియా సారాను పెండ్లాడాడు. పెండ్లినాటిరాత్రి సారా తోబియా దగ్గరకు వచ్చింది. అప్పడు తోబియా "ప్రభూ! ఆదామునకు ఏవను సహాయురాలినిగా అనుగ్రహించావు. వారిద్దరి వలన మానవలోకం ఉద్భవించింది. నేను సారాను ఈ దినం భార్యగా స్వీకరిస్తున్నాను. కామతృప్తికోసంగాక సంతానాన్ని పొందడంకోసం ఈవిడను గ్రహిస్తున్నాను. ముసలిప్రాయం వరకూ నేను ఈవిడతో కూడి జీవింతునుగాక" అని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు సార ఆమెన్ అని జవాబిచ్చింది. బైబుల్లోని స్త్రీ పురుషులు సంతానంపట్ల చూపే వాంఛ యిలా వుంటుంది - తోబీ 8,5–9.

5. సహాయురాలు

ఆదాముకోసం యోగ్యురాలైన సహాయురాల్ని సృజించాలనుకున్నాడు యావే. ఈ సందర్భంలో “సహాయరాలు" అంటే 1. ఆదామునకు దగ్గరి బంధువురాలు. ఆమె అతని ఎముకనుండి పుట్టింది. 2. ఆమెద్వారా కాని అతడు పరిపూర్ణుడు కాలేడు. ఆమెతో అతడు లైంగిక సంబంధం ఏర్పరచుకొని బిడ్డలను కనాలి. కర్రమీద ఆధారపడే వృద్దునిలాగ ఆమెమీద అతడు ఆధారపడాలి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, వాళ్ళిద్దరు ఒకే వ్యక్తిగా ఐక్యమైపోవాలి. భార్యాభర్తల సంబంధం, సన్నిహితత్వం ఈలాంటిది.

6 హెచ్చుతగ్గులు

భగవంతుని సృష్టి ప్రణాళికరీత్యా స్త్రీ పురుషుల శక్తి సామర్థ్యాల్లో భేదం వుంది. లింగభేదమూవుంది. సమాజంలో వాళ్లు చేయవలసినపనులుకూడా భిన్నభిన్నంగా వుంటాయి. కాని వాళ్ళిద్దరి విలువల్లో భేదం లేదు. స్త్రీ పురుషులు ఇద్దరూ దేవుని బిడ్డలే. దేవుని యెదుట యిద్దరూ సమానులే. యావే ఆదాము ఏవలను సృజించి వారికి “నరులు" అని పేరు పెట్టాడు. అనగా ఈ వాక్యంలో నరశబ్దం ఇద్దరకూ వర్తిస్తుంది. ఇద్దరు సమానులే-ఆది 228. స్త్రీకి పురుషుడు ఎంత అవసరమో, పురుషునికి స్త్రీకూడా అంత అవసరం-1కొ 11,11. పైగా క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినవాళ్లు లింగభేదాన్ని అతిక్రమించి సమానమైన హోదాను పొందుతారు - గల 3.28.

7. భార్య భర్తకు బానిస ఔతుందా?

ఆదిదంపతులు పాపంచేసాక, యావే ఏవను చూచి నీవు నీ భర్తకు బానిస అవుతావని శపించాడు - ఆది 3,16. కాని యిది ఏవ దుష్కర్మవలన కలిగిన శిక్ష పాపఫలితం. స్త్రీ సామాన్యధర్మం కాదు. కావున క్రైస్తవభార్య భర్తకు సహాయురాలుగాని భానిసకాదు. అందుచే క్రైస్తవభర్త భార్యను స్నేహితురాలునిగా భావించాలి.

2. క్రీస్తు శ్రీసభ

. IŠ 1. క్రిస్తు -- పురుషుడు -- ఆత్మార్పణం 2. శ్రీసభ -- 芭 ఎఫె 5,22-32. { స్త్రీ一 విధేయురాలు

1. పోలిక

"క్రీస్తు శ్రీసభను ప్రేమించాడు. ఆ సభ కొరకై తన్ను తాను అర్పించుకొన్నాడు. శ్రీసభ క్రీస్తునకు లోబడి వుంటుంది".

పూర్వవేదంలోని ప్రవక్తలు భగవంతునకు ప్రజలకు మధ్యవుండే ప్రేమ భార్యాభర్తల ప్రేమలాంటిది అన్నారు. కాని భార్యాభర్తల ప్రేమ భగవంతునకు ప్రజలకు మధ్య వుండే ప్రేమలాంటిది అనలేదు. అనగా దేవుని ప్రేమ మన ప్రేమలాంటిది అన్నారుగాని, మన ప్రేమ దేవుని ప్రేమ లాంటిది అనలేదు.

ఇక, తొలిసారిగా మనప్రేమను దేవుని ప్రేమతో పోల్చాడు ప్రేషితుడైన పౌలు. అతని భావం ప్రకారం క్రీస్తు వరుడు, శ్రీసభ వధువు. క్రీస్తు ప్రాణాలనే అర్పించి శ్రీసభను వధువుగా పొందాడు. శ్రీసభ వరుడైన క్రీస్తునకు విధేయురాలై వుంటుంది. (ఇక్కడ శ్రీసభ అనగా - క్రీస్తును విశ్వసించే క్రైస్తవ సమాజం)

2. అన్వయం

క్రీస్తు క్రైస్తవ వరునకు పోలికగా వుంటాడు. శ్రీసభ క్రైస్తవ వధువునకు పోలికగా వుంటుంది. జ్ఞానస్నానం పొందిన క్రైస్తవ వధూవరులు ఇద్దరూ వివాహం చేసికోగానే క్రీస్తు శ్రీసభ అనే పోలిక వాళ్ళకు సోకుతుంది. క్రీస్తు శ్రీసభల సంబంధం వాళ్ళకు వర్తిస్తుంది. క్రీస్తు శ్రీసభల వరప్రసాదం వాళ్ళమీద పనిచేస్తుంది.

క్రెస్తవ వివాహంలోని ఘనత అంతాకూడా ఈ పోలికలోనే యిమిడి వుంది. ఈ పోలికే లేకపోతే మన వివాహాలు అన్యమతస్తుల వివాహాలు ఒక్కటే ఔతాయి. అందుకే మనవాళ్ళ జ్ఞానవివాహం చేసుకొమ్మనేది.

3. బాధ్యతలు

మొదట శ్రీసభ, స్త్రీలు : క్రీస్తు శ్రీసభను రక్షించాడు. ఆమె పాపాలను తన నెత్తుటితో కడిగివేసాడు. ఆమెకు వాక్యస్నానం చేయించాడు. ఆమెను తన వధువును చేసికున్నాడు.కావున శ్రీసభ క్రీస్తునకు లోబడి ఉంటుంది. ఇదే విధంగా క్రైస్తవ భార్యకూడ భర్తకు లోబడివుండాలి. క్రీస్తు శ్రీసభకులాగే, భర్త భార్యకు శిరస్సు. శిరస్సు అవయవాల్ని అదుపులో పెట్టుకుంటుంది. అదేవిధంగా భర్తకూడ భార్యను తన అధీనంలో వుంచుకుంటాడు. కావున క్రైస్తవ భార్య యొక్క ప్రధాన ధర్మంవిధేయత.

ఆ పిమ్మట క్రీస్తు, పురుషులు : క్రైస్తవ భర్త భార్యను స్వాధీనంలో వుంచుకోవడమంటే ఆమెమీద అధికారం చలాయించటంగాదు. క్రీస్తు శ్రీసభను ప్రేమించినట్లుగా అతడూ భార్యను ప్రేమిస్తుండాలి. ఇది భర్తయొక్క ప్రధాన ధర్మం.

క్రీస్తు శ్రీసభను ఎలా ప్రేమించాడు? పాపాత్మురాలైన శ్రీసభకోసం సిలువబలిద్వారా తన్ను తాను సమర్పించుకున్నాడు. క్రీస్తు తన నెత్తుటితో ఆ సభ మాలిన్యం కడిగివేసాడు. తన వాక్యబోధనమే ఆ సభకు స్నానం. ఆమెను సుందరంగా అలంకరించి తనముందు నిలుపుకున్నాడు. (ఆనాటి గ్రీకు కుటుంబాల్లో వివాహ సమయంలో వధువును చక్కగా అలంకరించి వరునిముందు నిలిపేవాళ్ళు). ఆ సభను తన వరప్రసాదంతో పోషించి కాపాడుతూవచ్చాడు. ఈలాగే భర్తకూడ భార్యకోసం తన్ను తాను అర్పించుకోవాలి. ఆమె శ్రేయస్సుకోసం పాటుపడాలి. ఆమెను ప్రేమిస్తూ ఆమెయందు ఆనందిస్తూ ఉండాలి, ఆమెను పోషిస్తూ ఆదరిస్తూ ఉండాలి. తన తల్లిదండ్రులను గూడ వదలిపెట్టి ఆమెతో ఐక్యంగావాలి. అతడు శిరస్సు, ఆమె దేహం. శిరస్సు దేహాన్ని ఆదరించినట్లే అతడూ ఆమెను ఆదరిస్తూ వుండాలి. కావున భర్తయొక్క బాధ్యతలు చాలగొప్పవి.

4. వివాహ జీవితం - సిలువ బలి

వివాహజీవితం క్రీస్తు సిలువ మరణానికి చిహ్నంగా ఉంటుంది. క్రీస్తు సిలువమిద చనిపోతేనేగాని శ్రీసభ పునీతురాలు కాలేదు. అలాగే వివాహజీవితంలోగూడ భర్తవైపున నిత్యం స్వార్ధత్యాగమంటూ ఉండాలి.భార్యాపుత్రులను ఆదరించడమంటూ ఉండాలి.

భార్య భర్తకు విధేయత చూపుతూ తాను పునీతురాలు కావాలి. తన బిడ్డలను పునీతులను జేసికోవాలి. ఆమె చేయవలసిన త్యాగం ఈ విధేయతే. ఇలా భార్యా భర్తలిద్దరుకూడ క్రీస్తునందు పునీతులు కావాలి.

ప్రార్ధనా భావాలు

1. భర్త ప్రేమ

భార్య భర్తకోసం ఉద్దేశింపబడినది - 1కొ 11,9. కావున శిరస్సు దేహాన్నివలె అతడూ ఆమెను ఆదరిస్తూ ఉండాలి-ఎఫె 5,28. 2. భార్య ప్రేమ

యూదితు యిస్రాయేలు స్త్రీ విధవ, చాల ప్రజ్ఞావంతురాలు. హోలోఫెర్నెసు అనే శత్రుసైన్యాధిపతి శిరస్సు తెగనరికి తన ప్రజలకు విజయం చేకూర్చింది. యెరూషలేం పట్టణాన్ని కాపాడింది. ఈమె సౌందర్యాన్ని సాహసాన్ని మెచ్చుకొని చాలమంది ఈమెను పెండ్లాలని ఉవ్విళ్ళూరారు. కాని యూదితు మాత్రం గతించిన తన భర్త మనష్హను స్మరించుకుంటూ వివాహం మానివేసింది, వైధవ్యంతోనే రోజులు వెళ్ళబుచ్చింది. భర్తపట్ల ఆమె చూపిన గాఢానురాగం అలాంటిది-యూదితు 16,22.

3. వివాహ సంకేతాలు

క్రైస్తవ వివాహంలో రెండు సంకేతాలు ఉన్నాయి. పూర్వవేదంలో యావే ప్రభువు యిస్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసికున్నాడు. ఈ యొడంబడికనే ప్రవక్తలు పెండ్లిగా భావించారు. అనగా యావే అనే వరుడు యిస్రాయేలు అనే వధువును పెండ్లిచేసుకున్నాడు. ఈ యొడంబడిక క్రైస్తవ వివాహానికి సంకేతంగా ఉంటుంది. ఇక, నూత్నవేదంలో క్రీస్తు శ్రీసభను ప్రేమించి ఆ సభకోసం ప్రాణాలర్పించాడు. ఈ క్రీస్తు-శ్రీసభల ప్రేమకూడా క్రెస్తవ వివాహానికి పోలికగా వుంటుంది.

4 స్త్రీసభ సంతానవతి

క్రీస్తుపత్ని శ్రీసభ సంతానవతిగాని గొడ్రాలుగాదు. జ్ఞానస్నానపుతొట్టి ఆమె గర్భం. ఈ జ్ఞానస్నానం ద్వారా ఆమె చాలమంది బిడ్డలను కంటుంది. వాళ్ళనుచూచి ఆనందిస్తుంది. ఈలాగే క్రైస్తవ కుటుంబినికూడ తన సంతానాన్ని చూచి సంతృప్తి చెందాలి. వివాహపు-పూజలో గురువు "ప్రభూ! ఈ వధూవరులు తమ బిడ్డలను, బిడ్డల బిడ్డలను చూచేవరకూ జీవింతురుగాక" అని ప్రార్ధిస్తారు.

3. సహజమైన వివాహబంధాన్నే

క్రీస్తు సంస్కారంగా మార్చాడు

ఇతర దేవద్రవ్యానుమానాలను క్రీస్తు క్రొత్తగా స్థాపించాడు. కాని వివాహాన్ని అతడు నూతనంగా స్థాపించలేదు. మానవజాతిలో అంతవరకు సహజంగా నెలకొనివున్న వివాహబంధాన్నే క్రైస్తవ సంస్కారంగా మార్చాడు. ఈ యధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దా0.

1. సహజంగానేవున్న వివాహబంధం పవిత్రమైంది.

అనాదికాలంనుండి మానవజాతిలో సహజమైన వివాహబంధం నెలకొనివుంది. ఈ వివాహం కేవలం ఓ సాంఘిక ఆచారం మాత్రమే కాదు. అది భగవంతునితో ముడివడివుంది. కనుక పవిత్రమైంది. ఈ పవిత్ర వివాహబంధాన్నే క్రీస్తు సంస్కారంగా మార్చింది.

మానవలోకంలో సహజంగా నెలకొనివున్న పరిణయం పవిత్రమైందని నిరూపించడం ఎలా? ఆదిమకాలంలోనే భగవంతుడు స్త్రీ పురుషులమధ్య ఐక్యతను నెలకొల్పి పెండ్లిని ఏర్పాటుచేసాడు. కనుక ప్రతిజాతిలోను,ప్రతిమతంలోను ప్రజలు పరిణయాన్ని దివ్యమైనదాన్నిగా ఎంచారు. దానికి ఎన్నో కర్మకాండలు చేర్చారు. దానిపట్ల గౌరవం పెంచుకొన్నారు. భగవంతుడు భార్యాభర్తలద్వారా తన బిడ్డలైన నరులను సృజిస్తాడు. పరమేశ్వరుని జీవం తల్లిదండ్రులద్వారా బిడ్డలను చేరుతుంది. దంపతులమధ్య ఉండే పరస్పరానురాగంగూడ భగవంతుని ప్రేమే. ఈ ప్రేమను అతడు దీవించి ఫలప్రదం చేస్తాడు. ఫలితంగా బిడ్డలు కలుగుతారు. ఈ శిశువులు భగవంతుని పోలిక కలవాళ్లు, కడన భగవంతుణ్ణి చేరుకొనేవాళ్లు, నరులు పెండ్లితంతుద్వారా దేవునినుండి దీవెనలుపొంది ఆ పిమ్మట శారీరకంగా ఐక్యమై దేవుని ప్రతిరూపమైన సంతానాన్ని కంటారు. ఈలా పెండ్లిలో ప్రతి అంశంలోను భగవంతుని ప్రమేయం ఉంటుంది. కనుక అది పవిత్రమైంది.

సుతుడు నరావతారం ఎత్తినపుడు అతని దైవస్వభావం మన మానవ స్వభావంతో ఐక్యమైంది. ప్రాచీనకాలంనుండి వస్తున్న స్త్రీ పురుషుల ఐక్యత ఈ దైవమానవ ఐక్యతను సూచిస్తుంది. పెండ్లి క్రీస్తునరావతారానికి గుర్తుగా ఉంటుంది. పెండ్లి పవిత్రతకు ఇదికూడ ఒక కారణం.

2. వివాహానికి సంస్కారంగా గుర్తింపు ఎప్పడు వచ్చింది?

తిరుసభ పెండ్లిని ఎప్పుడు క్రైస్తవ సంస్కారంగా గుర్తించింది? తిరుసభకు పరిణయం పవిత్రమైందని మొదటినుండి తెలుసు. కాని అది ఏడు దేవద్రవ్యానుమానాల్లో ఒకటని తొలిరోజుల్లో తెలియదు. ప్రాచీన వేదశాస్త్రులు వివాహం క్రీస్తకీ తిరుసభకూవుండే ఐక్యతను సూచిస్తుందనుకొన్నారు. నరుల్లో సహజంగా వుండి వాళ్ళను అపమార్గం పట్టించే లైంగిక వాంఛలకు అది విరుగుడుగా పనిచేస్తుందనుకొన్నారు. కాని దానివల్ల వివాహితులకు ప్రత్యేక వరప్రసాదం లభిస్తుందనుకోలేదు. పైగా వివాహజీవితంలో లింగం ప్రమేయం అధికంగా ఉంటుంది. కనుక అది వరస్రాదాన్ని ఈయలేదు అనుకొన్నారు. 1350 ప్రాంతంలోగాని క్రైస్తవ వేదాంతులు వివాహం ద్వారా ప్రత్యేక వరప్రసాదం లభిస్తుందనీ, అది యేడు దేవ ద్రవ్యానుమానాల్లో ఒకటనీ స్పష్టంగా తెలియజేయలేదు. 16వ శతాబ్దంలో లూతరూ అతని అనుయాయులూ వివాహం దేవద్రవ్యానుమానం కాదని వాదించారు. అది కేవలం తిరుసభ ఏర్పరచిన తంతుకనుక దాని వల్ల వరప్రసాదం లభించదన్నారు. దీనికి భిన్నంగా ట్రెంటు మహాసభ పెండ్లి యేడు సంస్కారాల్లో ఒకటని ధ్రువీకరించింది.

3. వివాహం సంస్కారమేనని చెప్పే బైబులు బోధలు

పూర్వవేదంలో దేవుడు సీనాయికొండదగ్గర యిప్రాయేలీయులతో నిబంధనం చేసికొన్నాడు. వారిని గాఢంగా ప్రేమించాడు. ఈ నిబంధనం స్త్రీ పురుషుల పెండ్లిలాంటిది అన్నారు ప్రవక్తలు. నిబంధనంద్వారా దేవుడు వరుడు, యిప్రాయేలు వధువు అయ్యారని చెప్పారు. ఈ నిబంధనం భావికాలంలో రాబోయే స్త్రీ పురుషుల ఐక్యతనుగూడ సూచిస్తుంది. క్రీస్తు సిలువమీద చనిపోయి తిరుసభను పత్నిగా పొందాడు. తిరుసభను గాఢంగా ప్రేమించాడు. నూత్నవేదంలో క్రీస్తు తిరుసభల పోలిక వధూవరులమీద సోకుతుంది. వారి పెండ్లిని సంస్కారంగా మార్చి వారికి వరప్రసాదాన్ని దయచేస్తుంది. క్రైస్తవ పరిణయంలో ఈ క్రీస్తు తిరుసభల పోలికే ముఖ్యమైంది.

క్రీస్తు వివాహ సంస్కారాన్ని ఎప్పుడు స్థాపించాడు? ప్రభువు కానాపూరి వివాహానికి హాజరై అక్కడి పెండ్లివారికి సహాయం చేసాడు - యోహా2. భర్త భార్యను పరిత్యజించడం న్యాయమేనా అని పరిసయులు అడిగినప్పడు అతడు విడాకులు చెల్లవని చెప్పాడు. దేవుడు జతపరచిన జంటను మానవమాత్రులు వేరుపరచగూడదు అన్నాడు-మత్త 19,6. ఈ సందర్భాలను పురస్కరించుకొని తిరుసభ క్రీస్తు హృదయాన్ని అర్థం చేసికొంది. ప్రభువు పరిణయాన్ని గూడ ఓ సంస్కారంగా పరిగణింపగోరాడని క్రమేణ గుర్తించింది. బైబులంతటిలోను ఎఫెసీయులు 5,21-33లో పౌలు చెప్పిన క్రీస్తు తిరుసభల పోలిక వివాహంగూడ ఓ సంస్కారమేనని అర్థంచేసికోవడానికి బాగా ఉపయోగపడుతుంది. తిరుసభ ప్రారంభంనుండి వివాహాన్ని దేవద్రవ్యానుమానంగా గణించకపోయినా దాన్ని ఓ పవిత్రకార్యంగా గుర్తిస్తూ వచ్చింది. ఒక దశలో అదికూడ దేవద్రవ్యానుమానమేనని గ్రహించింది. కనుక ప్రోటస్టెంటు సంస్కరణవాదులు వాదించినట్లు అది కేవలం తిరుసభ సృష్టించింది కాదు. క్రీస్తు స్వయంగా నెలకొల్పింది.

ప్రతి దేవద్రవ్యానుమానమూ ఉత్దానక్రీస్తు నెరవేర్చే పవిత్రక్రియ. తిరుసభ జరిపే ఓ సాంకేతిక క్రియ. దానిద్వారా ప్రభువు ఆన ఉత్థాన భాగ్యాలనుండి మనకు వరప్రసాదాన్ని దయచేస్తాడు. జ్ఞానవివాహంకూడా ఈలా మనకు ఉత్ధానక్రీస్తు వరప్రసాదాన్ని దయచేసేదే కనుక అది కూడ ఓ దేవ ద్రవ్యానుమానమే.

పరిణయమాడే వధూవరులు క్రీస్తుని తిరుసభనూ పోలివుంటారని చెప్పాడు పౌలు. ఈ పోలిక వరప్రసాదాన్ని సంపాదించి పెడుతుంది. కనుక జ్ఞానవివాహంగూడ ఓ సంస్కారమే.

సంగ్రహంగా చెప్పాలంటే, క్రీస్తు జ్ఞానవివాహాన్ని నూతనంగా స్థాపించలేదు. అది లోకారంభంనుండి మానవజాతిలో వున్నదే. ప్రభువు దాన్ని చేకొని పవిత్రపరచి జ్ఞానవివాహమనే నూతన సంస్కారాన్ని ఏర్పాటు చేసాడు.

ప్రార్ధనా భావాలు

1. దేవునికి లింగం లేదు

పూర్వవేదాన్ని వ్రాసిన కాలంలో యిప్రాయేలీయులకు సమకాలికులైన అన్యజాతి ప్రజలు బాలు దేవతను కొల్చేవాళ్ళు.ఈ దేవతకు అనత్ అనే భార్య వుండేది.ఆనాటి అన్యజాతి ప్రజలు ఈ భార్యాభర్తలు తమకు సంతానాన్ని ప్రసాదిస్తారని నమ్మి వారిని కొల్చేవాళ్ళు. దీనికి భిన్నంగా బైబులు వ్రాసిన భక్తులు యావే ప్రభువుకి భార్యలేదని చెప్పారు. శరీరధారి కాడు కనుక అతనికి లింగం కూడ లేదు. ఈ పవిత్ర ప్రభువు యిస్రాయేలీయులతో నిబంధనం చేసికొని వారిని దీవించాడు. తనకూ ఆ ప్రజలకూ మధ్య భార్యాభర్తల సంబంధం నెలకొనేలా చేసాడు. ఈ సంబంధమే తర్వాత క్రీస్తు తిరుసభలమీద సోకింది. నేడు మన వివాహం పవిత్రం కావడానికికూడ కారణమైంది.

2.తొలి వివాహం

భగవంతుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సాటియైన తోడును తయారుచేస్తాను అనుకొన్నాడు. ఆదాము ప్రక్కటెముకనుండి ఏవను రూపొందించి ఆమెను అతనికి తోడుగా ఇచ్చాడు-ఆది 2,18. ఆ జంటను దీవించి మీరు చాలమంది బిడ్డలను కని వృద్ధిచెందండని చెప్పాడు – 1,28. ఆదాము ఏవను ఆదరంతో అంగీకరించాడు. ఇదే బైబుల్లోని తొలి వివాహం. అది నేటి మన వివాహాలన్నిటికి ఆదర్శంగా ఉంటూంది.

3. పరస్పరాకర్షణం

దేవుడు ఏవను ఆదాము ప్రక్కటెముక నుండి చేసాడు - ఆది 2,22. అనగా ఆమె అతని కోవకు చెందింది. అతనిలాంటిది. తర్వాత ఆదాము ఏవనుజూచి ఈమె నా యెముకల్లో ఎముక, మాంసంలో మాంసం అనుకొని మురిసిపోయాడు-2.23. అనగా ఆమె తనకు దగ్గరి బంధువురాలు, ఆప్తురాలు అని భావం. ఆదామేవలు పరస్పరాకర్షణతో, అనురాగంతో ఏకవ్యక్తిగా ఐక్యమైపోయారు. భగవంతుడే భార్యాభర్తలమధ్య ఈ ఆకర్షణను నెలకొల్పి వారిలో పరస్పర ప్రేమను వృద్ధిచేస్తాడు. ఈ యనురాగమే లేకపోతే ఆలుమగలు దీర్ఘకాలం సంసారజీవితం గడపలేరు.

4. పరమగీతం వర్ణించే ప్రేమ

బైబుల్లో పరమగీతం చాల విలక్షణమైన గ్రంథం. ఈ పుస్తకం నిర్మలమైన దాంపత్యప్రేమను వర్ణిస్తుంది. "ప్రేమ మృత్యువువలె బలమైనది. ప్రేమజ్వాలలు అగ్నిజ్వాలల వంటివి. జలములు ప్రేమను ఆర్పలేవు. ప్రవాహములు వలపును మంచివేయలేవు. ఎవడును తన పూర్తి సాత్తుతోగూడ ప్రేమను కొనజాలడు" - 8,6–7. దంపతులు ఈ గ్రంథాన్ని చదివి ప్రేరణను పొందాలి. తమ ప్రేమను బలపర్చుకోవాలి. ఈ పుస్తకం ప్రచారంలోకి వచ్చాక పూర్వవేద రబ్బయిలూ నూత్నవేద రబ్బయిలూకూడ దీనిలోని ప్రేమ భగవంతునికి నరులపట్ల వుండే ప్రేమకు పోలికగా వుంటుందని చెప్పారు. కాని ఈ గ్రంథరచయిత ఉద్దేశించిన మొదటి అర్థం దాంపత్య ప్రేమ మాత్రమే.

5. మంచి తోడు

పెండ్లి చేసికోబోయే యువతీయువకులు తమకు మంచి తోడు లభించాలని దేవుని ప్రార్థించాలి. వివాహితుల భవిష్యత్తు చాలవరకు వాళ్ళు పెండ్లియాడే వ్యక్తులపై ఆధారపడి వుంటుంది.

4.వివాహ విధిలో ముఖ్యాంశం

వధూవరుల అంగీకారమే.

వధూవరుల అంగీకారంద్వారా క్రెస్తవ వివాహం దేవద్రవ్యానుమానమౌతుంది. కనుక అంగీకారం అతిముఖ్యమైంది. దాన్నిగూర్చి మనకు క్షుణ్ణంగా తెలిసివుండాలి. ఈ యధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.

1. అంగీకారమే ముఖ్యమైంది

వధూవరులను భార్యాభర్తలనుగా చేసేది వారి యంగీకారం, జ్ఞానస్నానం పొందిన వధూవరులు గుళ్ళో పీఠంముందు హాజరై గురువు మరియు సాక్షులముందు తాము ఒకరినొకరు పెండ్లి యాడ్డానికి సిద్ధంగా వున్నామని సూచిస్తూ తమ అంగీకారాన్ని తెలియజేస్తారు. ఈ యంగీకారాన్ని తెలియజేయమని ఎవరూ వారిని నిర్బంధం చేయగూడదు. వధూవరులు స్వేచ్చగా తమ సమ్మతిని తెలియజేయాలి. ఇంకా, వారి వివాహాన్ని రద్దుచేసే అవరోధాలు కూడ ఏమి వుండకూడదు.

తిరుసభ బోధల ప్రకారం, వధూవరులను భార్యాభర్తలను చేసేది ఈ యంగీకారమే. కనుక ఈ యంగీకారం వున్నపుడు నిజమైన వివాహం జరిగినట్లే, ఈ సమ్మతి లేనపుడు నిజమైన వివాహం జరగనట్లే. ఈ యంగీకారం వలననే క్రైస్తవ వివాహం దేవద్రవ్యానుమానం ఔతుంది.

గుడిలో పీఠంముందు వధూవరులు తమ సమ్మతిని ఈలా తెలియజేస్తారు. “రాజారావునైన నేను శాంతవైన నిన్ను భార్యగా చేసుకొంటున్నాను. - శాంతనైన నేను రాజారావువైన నిన్ను భర్తగా చేసుకొంటున్నాను. కష్టంలోను సుఖంలోను, వ్యాధిలోను సౌఖ్యంలోను నేను నీపట్ల విశ్వసనీయుడనుగా (విశ్వసనీయురాలినిగా) మెలుగుతానని మాట యిస్తున్నాను. నేను ప్రతినిత్యం నిన్ను ప్రేమించి గౌరవిస్తాను". ఈ యంగీకార వాక్యాలద్వారా స్త్రీ పురుషులు భార్యాభర్తలౌతారు. ఆ యిద్దరూ వివాహబంధం ద్వారా ఏకవ్యక్తిగా ఐక్యమైపోతారు. వివాహం సాంగ్యంలోకెల్ల ఈ యంగీకార వాక్యాలు అతి ముఖ్యమైనవి,

కనుక వధూవరులు ఈ వాక్యాలను హృదయపూర్వకంగా వెలిబుచ్చాలి. వాళ్ళు ఇతరుల వలన నిర్బంధానికీ గురైకాని, ఇతరులకు భయపడికాని ఈ వాక్యాలను ఉచ్చరించకూడదు. ఇతరుల నిర్భంధానికి గురై వెలిబుచ్చిన అంగీకారం నిజమైన అంగీకారం కానేరదు, ఆ పెండ్లికూడ నిజమైన పెండ్లికాదు. నిర్బంధంతో వెలిబుచ్చిన అంగీకారం పెండ్లిని రద్దు చేస్తుంది.

వివాహపూజను జరిపే గురువే వధూవరుల అంగీకారాన్ని తిరుసభ పేరిట స్వీకరిస్తారు. "తిరుసభ సమక్షంలో మీరు మీ సమ్మతిని వెల్లడిచేసారు. ప్రభువు దానిని దయతో దృఢపరచి మీకు సంపూర్ణాశీర్వాదాన్ని దయచేయునుగాక. సర్వేశ్వరుడు జతపరచిన జంటను మనుష్యమాత్రుడు వేరుపరపకుండుగాక" అని ఆశీర్వదిస్తారు. ఈలా గురువు, వివాహనికి సాక్షులుగావున్నపెద్దలుకూడ పెండ్లి తిరుసభ పేరిట జరిగిందని ధృవపరుస్తారు. యువతీ యువకులు ఎప్పడుకూడ గుడిపెండ్లి చేసికోవాలి. తిరుసభ యిచ్చే వరప్రసాదం భార్యాభర్తలమిదికి, వారికి కలుగబోయే బిడ్డలమీదికికూడ దిగిరావాలి.

2. వివాహ సంస్కారాన్ని ఇచ్చేదెవరు?

జ్ఞానస్నానం మొదలైన దేవద్రవ్యానుమానాలను గురువు ఇస్తారు. కాని వివాహ దేవద్రవ్యానుమానాన్ని వధూవరులే ఒకరినొకరు ఇచ్చుకొంటారు. మామూలుగా క్రెస్తవ వివాహానికి గురువు హాజరుకావాలి. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అతడు లేకపోయినా చెల్లుతుంది. కనుక గురువు ఈ దేవద్రవ్యానుమానాన్ని ఈయడని గ్రహించాలి. కొందరు వేదశాస్త్రులు గురువు ఆశీర్వాదం వలన వివాహ సంస్కారం జరుగుతుందని వాకొన్నారు ఇది పొరపాటు.

జ్ఞానస్నానం పొంది వుండడం వలన వధూవరులకు జ్ఞానస్నాన యాజకత్వం వుంటుంది. ఈ యాజకత్వం ద్వారానే వాళ్ళు ఒకరికొకరు వివాహసంస్కారాన్ని ఇచ్చుకొంటారు. ఒకరికొకరు వరప్రసాదకారకులూ, రక్షణ సాధకులూ ఔతారు.

వివాహ సంస్కారం ఇద్దరు వ్యక్తులు ఇచ్చిపుచ్చుకొనేది. భార్యాభర్తలు ఒకరికొకరు ఈ సంస్కారాన్ని ఇస్తారు. ఒకరినుండి ఒకరు దీన్ని పొందుతారు. పరస్పరాంగీకారాన్ని తెలిపి వివాహ సంస్కారాన్ని జరుపుకొన్నపుడు ఆలుమగలమధ్య ఆధ్యాత్మిక బంధం ఏర్పడుతుంది. ఐక్యత సిద్ధిస్తుంది. ఆ క్షణంనుండి వాళ్ళు జీవితంలోవచ్చే సుఖదుఃఖాలను కలిసే అనుభవిస్తారు.

మూమూలుగా మన క్రైస్తవవివాహం పూజలో జరగుతుంది, పూజలో జరగనపుడుకూడ గురువు సాధారణంగా వివాహానికి హాజరుకావాలి. అతడు క్రెస్తవ వివాహానికీ దాని పావిత్ర్యానికీ సాక్షిగా వుంటాడు. అసలు వివాహ సంస్కారాన్ని జరిపే ప్రధానవ్యక్తి ఉత్దాన క్రీస్తే, వివాహానికి హాజరైన గురువు ఈ క్రీస్తు సాన్నిధ్యాన్ని సూచిస్తుంటాడు.

మనది ల్యాటిన్ (పశ్చిమ) తిరుసభ, మన దైవశాస్త్రం ప్రకారం వధూవరుల అంగీకారం వలననే వివాహం దేవద్రవ్యానుమానమౌతుంది. కాని ప్రాచ్య తిరుసభ దైవశాస్త్రం ప్రకారం, వివాహం దేవద్రవ్యానుమానం కావాలంటే వధూవరుల అంగీకారంతోపాటు గురువు ఆశీర్వాదం కూడా వుండాలి. అది ఆ క్రెస్తవుల ప్రత్యేకత.

పెండ్లితంతు ముగిసాక ఏ కారణం చేతనయినాసరే భార్యాభర్తలు తమ కళ్యాణాన్ని రద్దు చేసికోవాలంటే కుదురుతుందా? భార్యాభర్తలు శారీరకంగా కలసికొన్నతర్వాత ఆ వివాహాన్ని రద్దుచేయడానికి వీల్లేదు. శారీరక సంయోగంద్వారా క్రీస్తు తిరుసభల పోలికవాళ్ళమీద పరిపూర్ణంగా సోకుతుంది. వాళ్ళిద్దరూ పరిపూర్ణంగా ఏకశరీరం, ఏకవ్యక్తి ఔతారు. కాని శారీరకంగా కలసికోకపూర్వం కొన్ని నియమాల ప్రకారం వివాహాన్ని రద్దుచేయవచ్చు. ఈదశలో కళ్యాణం ఇంకా అపరిపూర్ణ స్థితిలోనే వుంటుంది. వధూవరుల్లో ఒకరు అక్రైస్తవులైతే ఆ కళ్యాణం దేవద్రవ్యానుమానంకాదు. కాని అలాంటి వివాహం కూడ పవిత్రమైందే. వారికి కలిగే బిడ్డలుకూడ పవిత్రులుగానే వుంటారు. అవిశ్వాసియైన భర్త తన క్రైస్తవ భార్యద్వారా, అవిశ్వాసియైన భార్య తన క్రైస్తవ భర్తద్వారా పరిశుద్దులౌతారు అన్నాడు పౌలు - 1కొ 7,14. ఐనా వివాహమాడే యిరువురూ జ్ఞానస్నానం పొందివుండడం సమంజసం.

క్రైస్తవులుకాని భార్యాభర్తలు జ్ఞానస్నానం పొందినపుడు వారి వివాహం కూడ దేవద్రవ్యానుమానం ఔతుంది.

8. వివాహంమిద తిరుసభకు అధికారం

వధూవరులే ఒకరికొకరు కల్యాణ సంస్కారాన్ని ఇచ్చుకొన్నా వారి వివాహంమీద తిరుసభకు అధికారం వుంటుంది. వాళ్ళకూడ తిరుసభలో భాగమే కదా! కనుక తిరుసభకు రక్తసంబంధం మొదలైన వివాహ ఆంక్షలు విధించే అధికారం వుంది.

పెండ్లి ఆధ్యాత్మిక రంగానికి మాత్రమేగాక లౌకికరంగానికికూడ చెందింది. కనుక ప్రభుత్వానికిగూడ దానిమీద అధికారం వుంది. ఆస్తి సంతానం మొదలైన విషయాల్లో వివాహితులమీద ప్రభుత్వాధికారం చెల్లుతుంది. ఈ రంగాల్లో గొడవలు వచ్చినపుడు మామూలుగా న్యాయస్థానం పరిష్కరిస్తుంది.\

ప్రార్ధనా భావాలు

1. ఆదామేవల అంగీకారం

సృష్ట్యాదిలో ఆదామేవలు ఒకరినొకరు భార్యాభర్తలనుగా అంగీకరించారు. దేవుడు ఏవను ఆదామునొద్దకు తీసికొనిరాగా అతడు "ఈమె నా యెముకల్లో ఎముక దేహంలో దేహం. ఈమె నరునినుండి రూపొందింది కనుక నారి ఔతుంది. కావున నరుడు సొంత తల్లిదండ్రులనుగూడ విడనాడి తన ఆలికి అంటిపెట్టుకొని వుంటాడు. వాళ్ళిద్దరూ ఏకశరీరమౌతారు" అని అనుకొన్నాడు. ఒకవిధంగా, ఈ యాదామేవల అంగీకారం నేడు గుడిలో పెండ్లిచేసికొనే మన వధూవరుల అంగీకారంమీద కూడ సోకుతుంది. ఆ తొలి అంగీకారం నేటి మన అంగీకారాన్ని పవిత్రం చేస్తుంది. ఆదామేవలు అందరికీ ఆదిమ మాతాపితలు.

2. ఒకరినొకరు నమ్మడం

వధూవరుల అంగీకారంలో ఒకరినొకరు నమ్మడమనే గుణం వుంటుంది. "వాళ్ళు "నేను నిన్ను భార్యగా - భర్తగా చేసుకుంటున్నాను. నీపట్ల విశ్వసనీయుడనుగా (విశ్వసనీయురాలినిగా) మెలుగుతానని మాట యిస్తున్నాను" అనే వాక్యాలు ఉచ్చరిస్తారు. ఈ వాక్యాలద్వారా భార్యాభర్తలు ఒకరినొకరు నమ్ముతామని ప్రమాణం చేస్తున్నారు. ఈ ప్రమాణానికి తగ్గట్టుగా వాళ్ళు ఒకరినొకరు విశ్వసించాలి. ఒకరికొకరు మేలేగాని కీడు తలపెట్టకూడదు. ఒకరికొకరు విధేయులు కావాలి. ఒకరినొకరు ప్రేమించి, సేవించి అభివృద్ధిలోనికి తీసుకురావాలి. ఎప్పుడైనా భార్యాభర్తలమధ్య ఈ విశ్వాసగుణం లోపిస్తే దాన్ని వెంటనే భర్తీ చేసికోవాలి.

3. లైంగికమైన కలయిక

వధూవరులు పీఠంముందు నేను నిన్ను భార్యాగా - భర్తగా చేసికొంటున్నాను అని చెప్తారు. అనగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు స్త్రీ పురుషులనుగా అంగీకరిస్తున్నారు. స్త్రీ-పురుషులు ఒకరికొకరు కావలసినవాళ్ళు ఒకరినొకరు పరిపూర్ణం చేసికొనేవాళ్ళ వాళ్ళిద్దరు ఏకశరీరులుగా ఐక్యమై సంతానాన్ని కనాలి. పౌలు చెప్పినట్లుగా ఒకరి శరీరంమీద ఒకరు యాజమాన్యం పొందాలి - 1కొ 7,4. ఒకరికొకరు శరీరదానం చేసికోవాలి. కనుక నేను నిన్నుభార్యగా - భర్తగా చేసుకొంటున్నాను అనే మాటల్లో లైంగికమైన కలయిక, సంతానప్రాప్తి అనే భావాలుకూడ ఇమిడివున్నాయి.

4 ఎన్నిక

వధూవరులు "నేను నిన్ను భార్యగా - భర్తగా స్వీకరిస్తున్నాను" అని చెప్తారు. ఈ వాక్యాల్లో ఎన్నిక అనే భావంకూడ ఉంది. ఇంతమందిలో నిన్ను మాత్రమే నేను భార్యగా-భర్తగా స్వీకరిస్తున్నాను అనే భావంకూడ ఇమిడివుంది, వరుడు ఇందరు యువతుల్లో ఈమెను మాత్రమే తనకు భార్యగా ఎన్నుకొంటున్నాడు. అలాగే వధువు ఇందరు యువకుల్లో ఇతన్ని మాత్రమే తనకు భర్తగా ఎన్నుకొంటూంది. ఇక వాళ్ళిద్దరూ పరస్పరానురాగంతో ఐక్యభావంతో జీవించాలి. ఇక వాళ్ళకు ఎడబాటుకాని విడాకులుకాని తగవు.

5. క్రైస్తవ వివాహం విడాకులను అంగీకరించదు

క్రైస్తవ వివాహానికి ఐక్యత, అవిచ్చిన్నత అనే రెండు గుణాలున్నాయి. వివాహం చేసికొనేవాళ్ళ స్వేచ్చగానే చేసికొంటారు. ఐనా వివాహం చేసికొన్న పిదప అందరూ ఈ రెండు లక్షణాలను పాటించవలసిందే. క్రీస్తు మానవలోకంలో సహజంగావున్న వివాహాన్నే దేవద్రవ్యానుమానంగా మార్చాడు. దానితో ఐక్యత, అవిచ్చిన్నత అనే రెండుగుణాలు ఇంకా బలపడ్డాయి. ఈ యధ్యాయంలో మూడంశాలు పరిశీలిద్దాం.

1. ఐక్యత

ఐక్యత అంటే ఒక భార్య, ఒక భర్త మాత్రమే కలసి జీవించడం. కనుక బహుభర్తృత్వం, బహుభార్యాత్వం రెండూ నిషిద్దాలే.

నరులు మొదట వివాహవ్యవస్థ లేకుండా విచ్చలవిడిగా జీవించేవాళ్ళనీ, తర్వాత బహుభార్యాత్వం వాడుకలోకి వచ్చిందనీ, ఆ పిమ్మట ఏకపత్నీవిధానం వ్యాప్తిలోకి వచ్చిందనీ కొందరు సాంఘిక శాస్త్రవేత్తలు వ్రాసారు. కాని ఈ వాదాన్ని ఇప్పడు చాలమంది అంగీకరింపరు.

పెండ్లి అనాదికాలంనుండి ఉన్నదే. ఆదిమకాలంలో బహుభర్తృత్వం అక్కడక్కడ వాడుకలో ఉండివుండవచ్చు. కాని ఈ పద్ధతివల్ల పుట్టిన బిడ్డలకు చేటు కలుగుతుంది. సంతానానికి తల్లిదండ్రుల ఆదరణ లభించదు. కనుక ఈ విధానం సరైందికాదు. పైగా ఇప్పడు బహుభర్తృత్వం ఎక్కడా వాడుకలో లేదు.

ఇక బహుభార్యాత్వానికి వస్తే, ఈ విధానం అన్ని దేశాల్లోను, అన్ని కాలాల్లోను వాడుకలో వుంది. ఐనా యిది ఏనాడుకూడ బహుళ ప్రచారంలో లేదు. ఎవరో కొద్దిమంది ధనవంతులు మాత్రం దీన్ని పాటించారు.

బహుభార్యాత్వంకూడ బిడ్డలకు చేటు తెస్తుంది. ఈ పద్ధతివల్ల జన్మించే బిడ్డలకు తండ్రి ఆదరాభిమానాలు సమానంగా లభించవు. పైగా ఒక పురుషుడు ఒక స్త్రీ పరస్పర ప్రేమభావంతో ఐక్యమయ్యేది వివాహం. సంసారంలో పురుషుడు తన్ను తాను పూర్తిగా ఒక స్త్రీకి అర్పించుకోవాలి. ఆలాగే స్త్రీ కూడ తన్నుతాను పూర్తిగా ఒక పురుషునికి అర్పించు కోవాలి. బహుభార్యాత్వంలో ఈసూత్రం చెల్లదు. కనుక అది సరైన పద్ధతి కాదు.

తొలిదంపతులైన ఆదామేవల వివాహం ఏకపత్నీ విధానం. ఏవ ఆదాముకి పరాయిదికాదు. అతని శరీరంనుండి పుట్టింది. అనగా అతనిలాంటిది, అతనితో సరిసమానమైంది. వాళ్ళిద్దరూ ఏకశరీరంగా, ఏకవ్యక్తిగా ఐక్యమౌతారు. ఇది భగవంతుడు నిర్ణయించిన వివాహపద్ధతి. ఐనా పూర్వవేదంలోని యూదులు చాలమంది ఈసూత్రాన్ని బహుభార్యాత్వాన్ని పాటించారు. భగవంతుడు ఆ కాలపు పరిస్థితుల ననుసరించి వారి లోపాన్ని సహించి వూరకున్నాడు. వాళ్లు ఇప్పడు మనకు ఏమాత్రం ఆదర్శ0 కాదు.

ట్రెంటు మహాసభ క్రైస్తవులకు బహుభార్యాత్వం ఎంతమాత్రం చెల్లదని ఖండితంగా బోధించింది. క్రీస్తు తిరుసభల పోలిక సోకి క్రైస్తవవివాహం పునీతమౌతుంది. ఈ పోలికవల్ల క్రైస్తవ వివాహంలో ఏకత్వం ఇంకా బలపడుతుంది. బహుభార్యాత్వం భిన్నత్వాన్ని తెచ్చిపెడుతుంది. కనుక ఆ పద్ధతిని ఎంతమాత్రం అనుమతింపరాదు.

2. అవిచ్ఛిన్నత

అవిచ్ఛిన్నత అంటే భార్యాభర్తలు విడివడిపోకుండా జీవితాంతం కలసి జీవించడం. అనగా విడాకులు లేకపోవడం.

అన్ని జాతుల ప్రజలు వివాహం స్థిరంగా వుండాలని కోరుకొన్నారు. విడాకులను నిషేధించారు. ఐనా చాలమంది ఈ నిషేధాన్ని ఉల్లంఘించి విడాకులు పొందారు. అలా పొందిన తావులందెల్ల కుటుంబాలు జాతులుకూడ విచ్ఛిన్నమైపోయాయి.

బిడ్డల మేలుకోరే తల్లిదండ్రులు విడివడిపోకూడదు. కనుక విడాకులు పనికిరావు, పైగా భార్యాభర్తల బంధం పరిపూర్ణ ప్రేమను కోరేది. ఒక పురుషుడు ఒక స్త్రీనీ, ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి జీవితాంతం పరిపూర్ణంగా ప్రేమించాలి. అలా కాకుండ వాళ్ళ మధ్యలో విడివడిపోయి మరో మూడో వ్యక్తిని ప్రేమిస్తే అది వివాహమెలా ఔతుంది?

దేవుడు ఆదిదంపతులను జతగూర్చినపుడు విడాకులు పొసగవనే భావించాడు. ఆదామేవలు ఏకశరీరం, ఏకవ్యక్తికావాలనే అతని ఉద్దేశం - ఆది 2,24, తర్వాత మోషే ఆనాటి ప్రజల హృదయ కాఠిన్యాన్ని అనుసరించి - అనగా ప్రాచీనకాలంలోని పురుషులు స్త్రీలపట్ల బహూక్రూరంగా ప్రవర్తిస్తారని తెలిసి, స్త్రీల రక్షణను మనసులో పెట్టుకొనే విడాకులను అంగీకరించాడు. మగవాడు అబలను హింసించి చంపివేయడంకంటె విడాకులిచ్చి పంపివేయడం మెరుగుకదా! కాని సృష్ణ్యాదిలో ఈ విడాకుల విధానం లేదు -మత్త 19,8, ఇరువురు వ్యక్తులు ఏకశరీరులై, అనగా ఏకప్రాణం కలవారై, ఏకవ్యక్తిగా ఒనగూడి జీవించాలంటే విడాకులు పొసగవు. దేవుడు జతపరచిన జంటను మానవమాత్రులు వేరుపరచరాదు-మత్త 19,6. ఇది క్రీస్తు బోధ.

16వ శతాబ్దంలో చీలిపోయిన ప్రోటస్టెంటు శాఖలు విడాకులను అంగీకరించాయి. కాని క్యాతలిక్ తిరుసభ మాత్ర0 ట్ట్రెంటు మహాసభ కాలంనుండి వివాహబంధం అవిచ్ఛిన్నంగా ఉండిపోవాలని అధికారపూర్వకంగా బోధిస్తూ వచ్చింది. విశేషంగా భార్యాభర్తలు శారీరకంగా కలసికొన్నపుడు వారి వివాహం ఖండితంగా అవిచ్ఛిన్నంగా వుండిపోతుందని తిరుసభ బోధ. ఎందుకు?

క్రీస్తు తిరుసభల పోలికసోకి క్రైస్తవ వివాహం వరప్రసాదాన్ని పొందుతుంది. ప్రభువు తిరుసభ కొరకు ప్రాణాలర్పించాడు. తిరుసభ ప్రేమభావంతో తన్నుతాను క్రీస్తుకి అర్పించుకొంటుంది. అలాగే వివాహజీవితంలో గూడ భార్యాభర్తలు ఒకరికొకరు ప్రాణాలర్పించుకొంటూ తుదివరకు విడిపోకుండా జీవించాలి. దంపతులు ఒకరినొకరు ప్రేమించుకొంటూ తుదిగడియల వరకు ఒకరితో వొకరు కలసివుండే వరప్రసాదాన్ని క్రీస్తే దయచేస్తాడు. భర్త భార్యకు ద్రోహం చేసినా, భార్య భర్తకు ద్రోహం చేసినా వాళ్లు ఒకరినొకరు క్షమించే శక్తినిగూడ ప్రభువే దయచేస్తాడు. ఏ కారణంచేతనైనాసరే దంపతులు విడిపోతుంటే క్రీస్తు సిలువ వారిని ఐక్యపరుస్తుంది. సంసారజీవితంలో పరస్పర విశ్వసనీయత, అపరాధక్షమాపణం ముఖ్యాంశాలుగా ఉండాలి. ఇవి క్రీస్తు అనుగ్రహంవల్ల సాధ్యమౌతాయి. ఉత్దానక్రీస్తు ఆత్మ దంపతులమీదికి దిగివచ్చి వారికి ఐక్యతనూ ప్రేమశక్తినీ ప్రసాదిస్తుంది. దీనివల్లనే చాల కుటుంబాలు విచ్చిన్నంకాకుండా నిలవగల్లుతున్నాయి.

క్రీస్తు తిరుసభలకు ఎడబాటు లేదు కనుక ఆ పోలికను పొందిన స్త్రీ పురుషుల వివాహానికిగూడ విడాకులు లేవు. అత్యవసరమైతే భార్యాభర్తలు విడిపోయి వేరువేరుగా జీవించవచ్చు. కాని భార్యాభర్తలు బ్రతికివుండగా ఒకరు వేరొకరిని వివాహం జేసికోవడం మాత్రం పనికిరాదు. హెన్రీరాజు తన భార్య క్యాతరిన్ కు విడాకులిచ్చి అన్నబోలిన్ అనే ఆవిడను పరిణయమాడగోరాడు. రోము అంగీకరింపలేదు. అతడు తిరుసభను వదలివేసి ఆంగ్లికన్ శాఖను స్థాపించాడు. ఈలాంటి విషమ పరిస్థితుల్లోగూడ తిరుసభ విడాకులను అంగీకరింపలేదు.

భార్యాభర్తల్లో ఒకరు అక్రైస్తవులనుకొందాం. ఆవ్యక్తి క్రైస్తవమతం నచ్చక తన క్రైస్తవ సహచ(రి)రుని విడనాడితే, ఆ విడనాడిన క్రైస్తవ వ్యక్తి మళ్లా వివాహం చేసికోవచ్చు దీనికే "పౌలుగారి అనుమతి" అని పేరు - 1కొ 7,15. క్రైస్తవ వివాహంలో క్రీస్తు తిరుసభల పోలిక ముఖ్యం. ఇక్కడ అక్రైస్తవవ్యక్తి ఈ పోలికను నిరాకరిస్తున్నాడు. కనుక వివాహం రద్దవుతుంది. అందుచే క్రైస్తవ వ్యక్తి మళ్ళా పెండ్లి చేసుకోవచ్చు.

ఈ పట్టున వివాదాస్పదమైన ఓ అంశాన్ని ప్రస్తావించాలి. ఏ కారణం చేతనయినాసరే భర్త భార్యను పరిత్యజించవచ్చా అని పరిసయులు క్రీస్తుని అడిగారు. ప్రభువు పరిత్యజించకూడదు అని చెప్పి ఇంకో విషయాన్నిగూడ తెలియజేసాడు. వ్యభిచారణం కారణం వలన తప్ప తన భార్యను విడనాడి వేరొకతెను పరిణయమాడేవాడు వ్యభిచారదోషి ఔతాడని చెప్పాడు – మత్త 19,9. ఇక్కడ "వ్యభిచార కారణంవల్ల తప్ప" అనే మాటలకు అర్థమేమిటి? భర్తగాని భార్యగాని వ్యభిచారం చేసినపుడు ఆ వివాహం రద్దవుతుందని భావమా? ఇక్కడ వ్యభిచారం అనే మాటకు గ్రీకుమూలంలో వాడిన పదం "పోర్నేయా". దానికి తుల్యమైన హీబ్రూపదం “జేనూత్", అన్న మారుచెల్లెలు మొదలైన దగ్గరి రక్తబంధువులు పెండ్లి చేసుకొంటే దాన్నియూదులు జేనూత్ వివాహం అనేవాళ్ళ ఈలాంటి వివాహాలు చెల్లవు. అవి అసలు పరిణయాలే కాదు. కనుక ఈ జంట విడిపోవలసిందే. పై వచనంలో వ్యభిచారకారణం వలన తప్ప అన్నపుడు క్రీస్తు ఉద్దేశించింది ఈ జేనూత్ పెళ్ళె. ఇది అసలు వివాహమే కాదు. కనుక రద్దుకావలసిందేనని క్రీస్తు ఉద్దేశం. కనుక ఈ వాక్యంలోని "వ్యభిచారం" మామూలు వ్యభిచారంకాదు. దగ్గరి బంధువులు చేసికొన్న నిషిద్ధవివాహం, అంతే. ఐనా ప్రోటస్టెంటు శాఖలు ఈ వాక్యాన్ని ఆధారంగా తీసికొని విడాకులను అనుమతించాయి. “దేవుడు జతపరచిన జంటను మానవమాత్రులు వేరుపర్చరాదు" అన్న క్రీస్తు సూక్తికి అపవాదం లేదు. అది నూటికి నూరుపాళ్ళ చెల్లే సూత్రం. కనుక ఏలాంటి పరిస్థితుల్లోను విడాకులు పొసగవు.

3. వివాహబంధం

వివాహబంధం పెండ్లినాడు ప్రారంభమై భార్యాభర్తలు జీవించినంతకాలం కొనసాగుతుంది. అది కొనసాగినంతకాలం భార్యాభర్తలకు వరప్రసాదాన్ని ఇస్తూనే వుంటుంది. ఐనా వివాహ దేవద్రవ్యానుమానానికి గురుపట్టం జ్ఞానస్నానం మొదలైన వాటికిలాగ అక్షయమైన ముద్ర ఏమీలేదు. భార్యాభర్తల్లో ఒకరు గతించగానే వివాహబంధం విడివడిపోతుంది.

వివాహబంధంవల్ల దంపతులు తిరుసభకు చెందినవాళ్ళవుతారు. దేవుని పోలిక కలిగిన బిడ్డలను కని జ్ఞానశరీరాన్ని వృద్ధిచేస్తారు. ఇందుకు కావలసిన వరప్రసాదాన్ని వివాహబంధమే వాళ్ళకు దయచేస్తుంది.

దంపతుల్లో ఒకరు చనిపోగానే వివాహబంధం విడిపోతుంది. బ్రతికివున్న వ్యక్తి చనిపోయిన వ్యక్తిని ప్రేమతో స్మరించుకోవచ్చు. కాని అది వివాహబంధం మాత్రంకాదు. కనుక ఆ వ్యక్తి మళ్ళా పెండ్లిచేసికోవచ్చు.

ప్రార్థనా భావాలు

1. హిలెల్, షమ్మయి బోధలు

క్రీస్తు నాడు విడాకులనుగూర్చి యూదుల్లో రెండుభావాలుండేవి. హిలెల్ అనే రబ్బయి చిన్న అపరాధానికి భర్త భార్యకు విడాకులీయవచ్చునని బోధించాడు. అనగా భర్త తేలికగా భార్యను విడనాడవచ్చు. దీనికి భిన్నంగా షమ్మయి అనే రబ్బయి తీవ్రమైన అపరాధానికిమాత్రమే భర్త భార్యకు విడాకులీయవచ్చునని చెప్పాడు. అనగా భర్త భార్యను తేలికగా విడనాడకూడదు. కాని క్రీస్తు ఈ యిద్దరు రబ్బయిల భావాలనుకూడ కాదని అసలు విడాకులే పనికిరావని బోధించాడు. సృష్ట్యాదిలోని ఆదామేవల్లాగ భార్యాభర్తలు ఏకశరీరులై యుండాలనీ, దేవుడు జతపరచిన జంటను మానవమాత్రులు వేరుపరపరాదనీ నుడివాడు. భార్యను విడనాడి మరొకతెను వివాహమాడే పురుషుడు ఆ నూత్న స్త్రీతో వ్యభిచరించినట్లేనని పల్కాడు - మత్త 19,3-8.

2. మలాకీ బోధ

మలాకీ ప్రవక్త పురుషుడు భార్యను విడనాడి ఆమెకు ద్రోహం చేయకూడదని ఖండితంగా ఆజ్ఞాపించాడు. నరుడు తాను యువకుడుగా వున్నపుడు పెండ్లాడిన భార్యకు ద్రోహం చేయగూడదు. భగవంతుడు దంపతులను ఏకదేహంగాను, ఏకాత్మగానుచేసి వారినుండి బిడ్డలను కలిగిస్తాడు. కనుక పురుషుడు తన భార్యను విడనాడకూడదు - 2,14-16.

3. భార్య భోగ్యవస్తువు కాదు

వివాహజీవితంలో పురుషులు స్వార్దంతో ప్రవర్తిస్తుంటారు. భార్యను తమ తృప్తికోసం వాడుకొంటూ వుంటారు. వైదిక కాలంనాడు భారత స్త్రీకి సమాజంలో గొప్ప విలువ వుండేది. పురుషుడు ఆమెను "సహధర్మచారిణి" అన్నాడు. ఆమె లేనిదే వైదిక ధర్మాన్ని సాధించలేను అనుకొన్నాడు. దురదృష్టవశాత్తు స్త్రీ క్రమేణ భోగ్యవస్తువుగా మారిపోయింది. కొందరి దృష్టిలో కేవలం బిడ్డలనుకనే యంత్రమైపోయింది. వంటింటికి పడకటింటికి పనికివచ్చే వస్తువైపోయింది. క్రైస్తవులమైన మనకు ఈ దృష్టి పనికిరాదు. స్త్రీపురుషులిద్దరూ దేవుని ప్రతిబింబాలే అన్నాం. ఇద్దరి ఆశయం దేవుడే. ఇద్దరూ దేవుని బిడ్డలే. పైగా క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినవాళ్ళు స్త్రీలైనాసరే పురుషులైనాసరే సరిసమానమే. క్రీస్తులోనికి ఐక్యమైన భార్యాభర్తల్లో మాత్రం హెచ్చుతగ్గులుండవచ్చా?

4. వ్యభిచార దోషా0

మనం జ్ఞానస్నానంద్వారా క్రీస్తుతో ఐక్యమౌతాం. క్రీస్తుదేహంతో అతుక్మొనిపోయి అతని అవయవాలుగా మారిపోతాం. అంచేత వ్యభిచారం చేసినప్పడెల్ల క్రీస్తు అవయవాల్ని రంకులాడిపాలు చేస్తాం. ఇది వివాహ ద్రోహం - 1కొ 6,15. ఈ దేహం జారత్వంకోసం గాక ప్రభువుకోసం ఉద్దేశింపబడింది. కావున ఈ దేహంతోను పాపం చేయకూడదు, ఈ దేహంలోను పాపం చేయగూడదు - 1కొ 6, 18. పైగా ఈ దేహం పవిత్రాత్మకు ఆలయమౌతుంది. ఈ యాలయాన్ని పాపంద్వారా అమంగళపరచగూడదు - 1కొ 6,19. అసలు ఈలాంటి మోహవాంఛలకు మనసులోకూడ సమ్మతి చూపించకూడదు. అలా చూపిస్తే మానసిక వ్యభిచారమౌతుంది - మత్త 5,28.

5. సంతానం విలువ

నేటి ప్రజలు గర్భనిరోధక ప్రయత్నాలు చేస్తున్నారు. కాని బైబులు ధృష్ట్యాసంతానం ప్రభువు ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. అందుకే తల్లులు ఒకమారు చిన్నబిడ్డలతో రాగా

ప్రభువు చేతులుచాచి ఆ బిడ్డలను దీవించాడు- మార్కు 10,16. బిడ్డలు తల్లిదండ్రులమీద ఆధారపడి నిష్కపట జీవితం గడిపినట్లే తన శిష్యులుకూడ పరలోకపితమీద ఆధారపడి జీవించాలని హెచ్చరించాడు. క్రీస్తునాటి యూదుల రబ్బయిలుకూడ బిడ్డలను ఆదరించారు. "చిన్న బిడ్డలు మోషే ధర్మశాస్తాన్ని ఉల్లంఘించరు. నిష్కపటజీవితం గడుపుతారు. కావున పరలోకరాజ్యంలో వాళ్ళకు స్థానం వుంది” అని బోధించారు. కనుక బిడ్డల పుట్టువును కృత్రిమంగా ఆపివేయడమనేది క్రైస్తవ దృక్పథంగాదు. "నా పేరిట ఈ చిన్నబిడ్డను స్వీకరించేవాడు నన్ను స్వీకరిస్తాడు" అన్న ప్రభువు వాక్యాన్ని గౌరవించి క్రైస్తవ ప్రజలు బిడ్డల పుట్టువునకు సమ్మతించాలి — లూకా 9,43. వాళ్ళను ఆదరించాలి. క్రైస్తవ సమాజంలో వాళ్ళకూ స్థానం కల్పించాలి.

6. వివాహ వరప్రసాదం జ్ఞానశరీరాభివృద్ధికి తోడ్పడుతుంది


ఏడు దేవ ద్రవ్యానుమానాలు ఏడు ప్ర త్యేక వరప్రసాదాలనిస్తాయి. వివాహసంస్కారానికికూడ ప్రత్యేక వరప్రసాదం వుంది. వివాహితులు ఈ వరప్రసాదాన్ని గూర్చి విపులంగా తెలిసికొని వండాలి. ఈ యధ్యాయంలో ఆరంశాలు పరిశీలిద్దాం

1. వివాహం ఆశయాలు

భగవంతుడు వివాహంద్వారా ఉద్దేశించిన ఆశయాలు రెండు. భార్యాభర్తల పరస్పర ప్రేమ, సంతానోత్పత్తి వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తిగా ఐక్యమౌతారు అనే ఆదికాండం 2,24వ వచనం పరస్పర ప్రేమను సూచిస్తుంది. మీరు సంతానాన్ని కని వృద్ధిచెందండి అనే ఆదికాండం 1,28 వచనం సంతానాన్ని సూచిస్తుంది.

ఈ రెండు ఆశయాల్లో ఒకటి హెచ్చు ఒకటి తగూ అంటూ లేదు. రెండూ సరిసమానమే. వివాహంద్వారా స్త్రీ పురుషులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకరికొకరు ఆత్మార్పణం చేసికొంటారు. శారీరకమైన కలయిక ద్వారా దుష్టమైన వాంఛలను అదుపులోనికి తెచ్చుకొని పవిత్ర జీవితం గడుపుతారు. ఈ కలయిక ద్వారానే దేవుని పోలిక కలిగిన బిడ్డలను కంటారు. ఆ బిడ్డలను పెంచి వారికి విద్యాబుద్ధులు నేర్పుతారు. భార్యాభర్తలు ప్రేమతో శారీరకంగా కలసికొంటారు. కాని అలా కలసికొనక పూర్వమే అస్పష్టంగానైనా సంతానాన్ని కోరుకొంటారు. కలయిక తర్వాత ఈ కోరికతీరి బిడ్డలు కలుగుతారు. కనుక పరస్పర ప్రేమ సంతానోత్పత్తి అనే రెండాశయాలు ఎప్పడూ కలసే వుంటాయి.

2. పై రెండాశయాల పరిపూర్ణభావం

పై వివాహాశయాల భావాన్ని లోతుగా అర్థంచేసికోవాలి. వివాహ సంస్కారం సతీపతుల పరస్పర ప్రేమను పవిత్రం చేస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు నిండు హృదయంతో ప్రేమించుకొని సోదరప్రేమ అనే క్రైస్తవ పుణ్యంలో పెరుగుతారు. దీనిద్వారా తమ దైవప్రేమను గూడ వృద్ధిచేసికొంటారు.

ఇంకా, వివాహబంధం నరుల్లో సహజంగా వుండే కామవాంఛను జయించడానికిగూడ తోడ్పడుతుంది. జంతువుల్లోలాగే నరుల్లోకూడ ఆడ మగ ఒకరినొకరు కామించడం అనే నైసర్గిక గుణం వుంది. ఈ గుణం హద్దులు మీరి స్త్రీ పురుషులను పాపానికి ఫురికొల్పుతుంది. ఫలితంగా నరులు మోహానికి లొంగి వ్యభిచారంలో పడిపోతారు. ఆలుమగలు శారీరకమైన కలయికద్వారా ఈ కామవాంఛను చాలవరకు అదుపులోకి తెచ్చుకొంటారు. వివాహ సంస్కారం నైసర్గికమైన కామవాంఛలను పునీతంజేసి ప్రేమనుగా మార్చుతుంది. దీనివల్ల నరులు తమ జంతుస్వభావాన్ని దాటిపోయి దివ్యత్వాన్ని చేరుకోగల్లుతారు.

ఇంతవరకు భార్యాభర్తల పరస్పర ప్రేమనుగూర్చి. ఇక వాళ్ళు కనే సంతానాన్ని గూర్చి విచారిద్దాం. ప్రేమలో సృజనశక్తి వుంది. భార్యాభర్తల ప్రేమకుగూడ నూత్నజీవాన్ని సృష్టించే శక్రీవుంది. కనుకనే ఆలుమగలు ప్రేమతో కలసికొన్నపుడు బిడ్డలు కలుగుతారు.
భార్యాభర్తల ఐక్యతకు చిహ్నం వాళ్ళుకనే బిడ్డలు. వారి పరస్పర ప్రేమకు, పరస్పర దానానికి ప్రతిఫలం బిడ్డలు. శిశువులు తల్లిదండ్రుల ఆకారాలను రూపురేఖలను తమలో ఇముడ్చుకొని తాము ఆ యిద్దరి పరస్పర ప్రేమకు ప్రతిరూపమో అన్నట్లు ఒప్పతూంటారు. భార్యాభర్తలు తమ సంతానాన్ని చూచి సంతోషించి ఒకరితో ఒకరు ఇంకా గాఢంగా ఐక్యమౌతారు.
పిల్లలను పెంచి పెద్దజేయడంద్వారా, వారికి విద్యాబుద్ధులను నేర్పడంద్వారా తల్లితండ్రుల్లోని ప్రేమశక్తి స్పందిస్తుంది. వాళ్ళు తమ స్వార్ధాన్ని అణచుకొని బిడ్డల శ్రేయస్సునకు పాటుపడతారు. వివాహబంధంలో ప్రేమ నశించి ఆ బంధం విడిపోయే స్థితికి వచ్చినపుడు సంతాన ప్రేమే తల్లిదండ్రులను కలిపి వుంచుతుంది. బిడ్డల మేలుకొరకు అమ్మా నాన్నలు కలసి జీవించగోరుతారు.
భగవంతుని ప్రతిరూపులైన శిశువులను సృజించడంలో తల్లిదండ్రులు దేవునితో సహకరిస్తారు. వాళ్లు కేవలం మానవజాతిని అభివృద్ధి చేసేవాళ్లు మాత్రమేకాదు. క్రీస్తు శరీరమైన తిరుసభలో క్రొత్త సభ్యులను చేర్చేవాళ్లు కూడ. అమ్మానాన్నలు స్వయంగా 

బిడ్డలకు వరప్రసాదం ఈయలేరు. కాని జ్ఞానస్నానం ఇప్పించటంద్వరా వాళ్లు వరప్రసాద కారకులౌతారు. బిడ్డలను క్రీస్తు మార్గంలో పెంచి పెద్దజేయడంద్వారా వారిలో దివ్యజీవనాన్ని వృద్ధిచేస్తారు. వారిని ఇహపరాలకు చెందిన పౌరులనుగా తయారుచేస్తారు. కనుకనే వేదశాస్తులు "నరుల పరలోక జీవితానికి వివాహం నారుమడిలాంటిది" అన్నారు.

దాంపత్య జీవితం పరస్పరానురాగ జీవితం. ఈ యనురాగ ఫలితమే నూత్న జీవమైన సంతానం. ఈ దృష్టితోజూస్తే వివాహాశయాలు రెండు కాదు, ఒకటే. అది సంతానఫలాన్ని ప్రసాదించే స్త్రీపురుషుల పరస్పర ప్రేమ. 

యువతీయువకులు ఒకరినొకరు ప్రేమించి పెండ్లి చేసికొంటారు. లేదా పెండ్లిచేసికొని ప్రేమిస్తారు, వాళ్ళు ఒకరితో ఒకరు ఐక్యమై ఏకశరీరమౌతారు. ఏకవ్యక్తి ఔతారు, ఈ యైక్యత ఫలితంగా వారిద్దరి పోలిక కలిగి, వారికంటె భిన్నమైన మూడవవ్యక్తి సంతాన రూపంలో ఉద్భవిస్తాడు. ఈ మూడవవ్యక్తి వారినింకా గాఢంగా ఐక్యపరుస్తాడు.

3. వివాహ సంస్కారం ఇచ్చే వరప్రసాదం

ఉత్థాన క్రీస్తు వరప్రసాదం ఏడు దేవద్రవ్యానుమానాల ద్వారా మనమీద సోకుతుంది. ఒక్కోదేవ ద్రవ్యానుమానాం ఒక్కో ప్రత్యేక వరప్రసాదాన్నిస్తుంది. కాని మన సహకారమూ ఆశా లేందే దేవద్రవ్యానుమానాలు పనిచేయవు.

ఇక, వివాహ సంస్కారం ఇచ్చే వరప్రసాదం దంపతులు తమ వివాహ జీవితాన్ని పవిత్రంగా గడపటానికి ఉపయోగపడుతుంది. వివాహాశయాలను సాధించడానికి తోడ్పడుతుంది. పరస్పర ప్రేమ బిడ్డలను కనిపెంచి పెద్దజేయడం వివాహాశయాలని చెప్పాం. వివాహ వరప్రసాదం ఈ రెండాశయాలను సాధించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వివాహ వరప్రసాదం సంసార జీవితం గడిపేవాళ్ళకు మత్రమే లభిస్తుంది. గురువు మఠకన్యలకు లభించదు.

ఈ సంస్కారంద్వారా దంపతులకు పవిత్రీకరణ వరప్రసాదం లభిస్తుంది. క్రీస్తు తిరుసభల పోలిక ద్వారానే ఈ వరప్రసాదం దంపతులమీదికి దిగివస్తుంది. దీనిద్వారా వాళ్లు దివ్యజీవనం గడపగల్గుతారు. ఇంకా, వాళ్ళకు సహాయ వరప్రసాదంగూడ లభిస్తుంది. దీని శక్తివల్ల వివాహ విధులను నెరవేర్చగల్లుతారు. ఈ రెండు వరప్రసాదాల బలంతోనే వాళ్ళు జన్మపాపం ద్వారా సంక్రమించిన కామాన్ని జయిస్తారు. వాళ్ళ ప్రేమ జంతుప్రేమను దాటిపోయి దివ్యప్రేమగా మారుతుంది. క్రీస్తుప్రేమగా రూపొందుతుంది. దంపతులు తమ లోపాలతోపాటు, మంచి గుణాలతోపాటు ఒకరినొకరు అంగీకరించుకొంటారు. ఒకరినొకరు ప్రోత్సహించుకొంటారు. వివాహ జీవితంలోని కష్టాలను ఓర్పుతో భరిస్తారు. బిడ్డలను కని పుణ్యమార్గంలో పెంచి పెద్దజేస్తారు. ఈ ప్రత్యేకమైన దైవానుగ్రహమే లేకపోతే వివాహ జీవితం దుర్భరమౌతుంది. దానిలో ఎదురయ్యే ఒడుదుడుకులకు తట్టుకోలేరు.

ఈ ప్రత్యేకానుగ్రహంద్వారా భార్యాభర్తలు ఒకరినొకరు పవిత్రపరచుకొంటారు. ఒకరికొకరు వరప్రసాద కారకులౌతారు. ఈ వరప్రసాదం తల్లిదండ్రులమీద పిల్లల మీదాకూడ సోకుతుంది. వాళ్ళంతా అనురాగంతో ఒకరినొకరు అంగీకరించుకొని కూడిమాడి జీవిస్తారు. కుటుంబమంతా గూడ దైవసోదర ప్రేమలతో నిండి భక్తిమంతంగా జీవిస్తుంది. ఉత్థానక్రీస్తు వివాహబంధంద్వారా ఈ వరప్రసాదాలన్నిటినీ కుటుంబానికి దయచేస్తాడు. దంపతులు ఎప్పడుగూడ ఈ ప్రత్యేక వరప్రసాదాన్ని అధికాధికంగా దయచేయమని ప్రభువుని వేడుకొంటుండాలి.

4. వివాహమూ తిరుసభ అభివృద్ధి

భార్యాభర్తల ఐక్యత క్రీస్తు తిరుసభల ఐక్యతను పోలి వుంటుంది. దంపతులు బిడ్డలను కని మానవ సమాజాన్ని పెంచుతారు. ఆ బిడ్డలకు జ్ఞానస్నానమిప్పించి వారిని దేవుని బిడ్డలనుగా తయారుచేస్తారు. తల్లిదండ్రులు బిడ్డలతో గూడిన క్రైస్తవ కుటుంబం ఓచిన్నతిరుసభలాంటిది. ఈలాంటి చిన్నతిరుసభలు చాల చేరి విశ్వ తిరుసభ ఔతాయి.

క్రీస్తు వరప్రసాదం తిరుసభను చేరుతుంది. వివాహ సంస్కారంద్వారా తిరుసభ ఈ వరప్రసాదాన్ని దంపతులకు అందిస్తుంది. దంపతులు తమ ఐక్యతద్వారా క్రీస్తు తిరుసభల ఐక్యతను లోకానికి వెల్లడిచేస్తారు. దంపతులూ బిడ్డలూ కలసి కుటుంబమౌతారు. చాల కుటుంబాలు చేరి స్థానిక తిరుసభ ఔతాయి. చాల స్థానిక తిరుసభలు చేరి విశ్వశ్రీసభ ఔతాయి. స్థానిక శ్రీసభలు విశ్వ శ్రీసభకేలాగో కుటుంబాలు స్థానిక శ్రీసభకు ఆలాగు. ప్రతి కుటుంబం ఓ చిన్న తిరుసభ, క్రీస్తూ తిరుసభా కలసి చెట్టనుకొంటే, ఆ చెట్టుకి పుట్టిన కొమ్మలు క్రైస్త్ఘవ కుటుంబాలు. వివాహ సంస్కారంద్వారా క్రీస్తు జ్ఞానశరీరమైన తిరుసభ శాఖోపశాఖలుగా పెరిగిపోతుంది. క్రైస్తవ కుటుంబాల పెంపు తిరుసభ పెంపు,

5. వివాహమూ దివ్యసత్ర్పసాదమూ

దివ్యసత్ర్పసాదం ఐక్యతా చిహ్నం. ఒకే రొట్టెలో పాలుపంచుకొనే మనమంతా ఒకే శరీరమాతాం - 1కొ 10,17. దివ్యసత్రసాదం క్రైస్తవుల ఐక్యతకు చిహ్నమైతే, వివాహం క్రీస్తు తిరుసభల ఐక్యతకు గుర్తు, దంపతులు దివ్యసత్ర్పసాదాన్ని స్వీకరించడంద్వారా ఈ రెండైక్యతలను తమలో ప్రతిబింబించుకొంటారు. క్రీస్తు ప్రేమను నిండుగాపొంది సంపూర్ణ ఐక్యతను సాధిస్తారు. కనుక దంపతులు తరచుగా, భక్తిభావంతో దివ్యసత్ర్పసాదాన్ని స్వీకరించాలి. దానివల్ల వాళ్ళ వివాహబంధం దృఢతరమౌతుంది. పూర్వవేదంలో యావే ప్రభువు యిస్రాయేలీయులతో ఒడంబడిక చేసికొన్నాడు. నూత్నవేదంలో క్రీస్తుమనతో నిబంధనం చేసికొన్నాడు. ఈలా దేవునికీ ప్రజలకూ మధ్య నిబంధనం ఏర్పడింది. ఇక, వివాహ సంస్కారం గూడ ఓ నిబంధనమే. ఈ నిబంధనం స్త్రీపురుషులిద్దరికీ మధ్య నెలకొని వుండేది. పూర్వనూత్నవేదాల్లో దేవుడు ప్రజలతో చేసికొన్న నిబంధనం నేడు మన వివాహ నిబంధనం మీద సోకి దాన్ని బలపరుస్తుంది. ఇక, పూర్వ నూత్నవేదాల నిబంధనను జ్ఞప్తికి తెచ్చేది దివ్యపూజ. ఇక్కడ ప్రభువు నూత్ననిబంధన రకాన్ని చిందిస్తాడు-మత్త 26,28. వధూవరులు సాధ్యమైనంతవరకు దివ్యపూజలోనే పెండ్లిచేసికోవాలి. ఈ పూజలో ప్రభువు శరీరక్తాలను స్వీకరించాలి. దీనిద్వారా క్రీస్తు నిబంధనం వారిపై సోకి వారి వివాహ నిబంధనాన్ని పునీతం చేస్తుంది.

క్రీస్తు దివ్యసత్ప్రసాదాన్ని స్థాపిస్తూ నేను మిమ్ము ప్రేమించినట్లే మీరూ ఒకరినొకరు ప్రేమించండి అన్నాడు - యోహా 13,34. దివ్యసత్ప్రసాద స్వీకరణం ద్వారా దంపతుల్లో ప్రేమశక్తి బలపడుతుంది. ప్రభువు వారి వివాహబంధాన్ని దీవించి వారిని గాఢంగా ఐక్యపరుస్తాడు. వివాహితులకు ప్రేమను మించిన సౌభాగ్యం ఏముంటుంది కనుక?

దంపతులు జీవితాంతమూ పూజలో తరచుగా పాల్గొని దివ్యసత్ర్పసాదాన్ని స్వీకరిస్తూండాలి. దివ్యభోజనం వారి పరస్పర ప్రేమనూ పరస్పరదానాన్నీ బలపరచే సాధనం.

6. వివాహమూ త్రీత్వమూ

క్రీస్తు తండ్రి నుండి ఆత్మను పంపి తిరుసభను నెలకొల్పాడు. తిరుసభ సభ్యుల్లో పరిశుద్ధ త్రీత్వం రూపురేఖలు కన్పిస్తాయి. ఇక, వివాహం క్రీస్తు తిరుసభల పోలికను సూచించేది. కనుక తిరుసభలోని పరిశుద్ధ త్రీత్వం పోలికలు వివాహ జీవితంలోగూడ కన్పిస్తాయి. ఏలాగ?

పరిశుద్ధ త్రీత్వంలో తండ్రి కుమారుల ఐక్యతనుండి ఆత్మ ఉద్భవిస్తుంది. అలాగే కుటుంబంలో తల్లిదండ్రుల ఐక్యతనుండి సంతానం కలుగుతుంది. త్రీత్వంలోని తండ్రీ కుమారులు మన కుటుంబంలోని తండ్రీ తల్లులను పోలివుంటారు. పవిత్రాత్మ మన కుటుంబంలోని సంతానాన్ని పోలివుంటుంది. త్రీత్వంలో తండ్రికుమారుల నుండి ఆత్మ బయలుదేరినట్లే, కుటుంబంలో తల్లిదండ్రులనుండి బిడ్డలు కలుగుతారు. ఇక్కడ తల్లిదండ్రులిద్దరినీ బిడ్డలనుకనే ఏకవ్యక్తినిగా గణించాలి. వివాహ బంధంద్వారా వాళ్ళిద్దరూ ఏకశరీరమౌతారుకదా! త్రీత్వంలో తండ్రికుమారులను ఐక్యపరచే ప్రేమబంధం ఆత్మ కుటుంబంలో మాతాపితలను ఐక్యపరచే సాధనం సంతానం. త్రీత్వంలోని తండ్రిలో పితృత్వం పరిపూర్ణంగా ఉంటుంది - ఎఫె 3,15. ఇక్కడ పితృత్వమంటే జననీజనకుల గుణాలు రెండూ కూడ. మన తల్లిదండ్రుల్లో వుండే పితృగుణమూ మాతృగుణమూకూడ పరలోకపు తండ్రిలో పరిపూర్ణంగా వుంటాయి. అతడు తండ్రులందరికి తండ్రి, తల్లలందరికి తల్లి, భూలోకంలోని తల్లి తండ్రీ ఏకవ్యక్తిగా ఐక్యమై ఈ పరలోకంలోని తండ్రిని పోలివుంటారు. ఈ యేకవ్యక్తియైన తల్లిదండ్రులే సంతానాన్ని కనేది. కుటుంబం పవిత్రత్రీత్వాన్ని పోలివుంటుంది కనుక పవిత్రమైంది. దైవరూపాన్ని ప్రతిబింబించేది. కుటుంబ సభ్యులంతా తమ ఔన్నత్యానికి తగినట్లుగా పవిత్రజీవనం గడపాలి.

ప్రార్ధనా భావాలు

1. సీనాయి నిబంధనం వివాహం లాంటిది

పూర్వవేద ప్రవక్తలు యిస్రాయేలీయుల వివాహజీవితాన్ని గూర్చి చెప్పదల్చుకోలేదు. ప్రభువు ప్రజలతో చేసికొన్న నిబంధననుగూర్చి చెప్పదలచుకొన్నారు. ఆ నిబంధనం వధూవరులు చేసికొనే వివాహ నిబంధనం లాంటిది అన్నారు. వరుడు వధువును పెండ్లియాడినట్లే సీనాయి నిబంధనంద్వారా ప్రభువు యిప్రాయేలీయులను పెండ్లియాడాడని చెప్పారు. అనగా దేవుడు యిస్రాయేలీయులను అనురాగంతో చూస్తాడని భావం. ఈ ఉపమానాన్ని మొదట పేర్కొన్నవాడు హోషేయ. ఇతని భార్య గోమెరు. ఈమె వ్యభిచారిణియై భర్తకు ద్రోహం చేసింది. ఐనా ప్రవక్త దేవుని ఆజ్ఞపై ఈమెను మళ్ళా భార్యనుగా స్వీకరించి గాఢా0గా ప్రేమించాడు–3,1. ఈ గోమెరులాగే యిస్రాయేలీయులు అన్యదైవమైన బాలుని కొల్చి ప్రభువుకి ద్రోహంచేసినా, ప్రభువు కరుణతో మళ్ళా వారిని తన ప్రజలనుగా స్వీకరించాడు. ఇస్రాయేలీయులు భార్య యావే భర్త, హోషేయ తర్వాత ఇతర ప్రవక్తలు కూడ ఈ భావాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు. నూత్నవేదంలో పౌలు ఈ భావాన్ని ఎన్నుకొని దాన్ని క్రీస్తుకీ తిరుసభకీ అన్వయించాడు.

2. సంతాన భాగ్యం

దేవుడు ఆదామేవలను జతపరచి మీరు చాలమంది బిడ్డలను కని వృద్ధిచెందండని ఆశీర్వదించాడు - ఆది 1,28. పూర్వవేద ప్రజలు సంతానాన్ని మక్కువతో ఆశించారు. వాళ్ళ దృష్టిలో బిడ్డలను కనడమంటే దేవుని దీవెనలు పొందడం. బిడ్డలు కలుగకపోవడమంటె దేవుని శాపానికి గురికావడం. చాలకాలం గొడ్రాలుగా వుండిపోయిన రాహేలు నీవు నాకు బిడ్డలనిస్తావా లేక చావమంటావా అని యాకోబు నెదుట మొరపెట్టుకొంది - ఆది 30,1. బిడ్డలు కలిగాక ఆమె దేవుడు నా అవమానాన్ని తొలగించాడని సంతోషించింది-30,28. నేటి తల్లిదండ్రులు బిడ్డల పుట్టువును అంగీకరించకపోవడం శోచనీయం.

3. దైవ సహాయం

వివాహ పూజలో వచ్చే ఓ ప్రార్ధన యిది. ఇది దంపతులకు ప్రేరణం పట్టిస్తుంది. "సృష్టికర్తవైన సర్వేశ్వరా! పరిశుద్దుడవైన పితా! నీవు స్త్రీ పురుషులను నీకు పోలికగా జేసావు. వివాహ జీవితాన్ని ఆశీర్వదించేవాడివి నీవే. ఈ దినం వివాహ సంస్కారంద్వారా తన భర్తతో ఐక్యమైన ఈ వధువు కొరకు మేము నీకు ప్రార్థన చేస్తున్నాం. నీవు ఈమెను ఈమె భర్తను మెండుగా దీవించు. నీవు దయచేసే వివాహ ప్రేమయందు వీళ్ళిద్దరు ఆనందింతురుగాక. వీరు తమ బిడ్డలద్వారా తిరుసభను వృద్ధిలోకి తెత్తురుగాక, ప్రభూ! ఈ దంపతుల సౌఖ్య0లో నిన్నుస్తుతింతురుగాక. దుఃఖంలో నీకు మొరపెట్టుకొందురుగాక. వీళ్ళు తమ పనిలో నీవు సాయపడతావనియు, తమ అవసరాల్లో నీవు తమ్ము ఆదుకొంటావనియు గ్రహించి సంతోషింతురుగాక. తిరుసభతో ఐక్యమై నీకు ప్రార్ధన చేయుదురుగాక. ఈ లోకంలో నీకు సాక్షులుగా వుందురుగాక. తమ స్నేహితులతో కలసి వృద్ధాప్యంవరకు జీవింతురుగాక. కడన నీరాజ్యంలో ప్రవేశింతురుగాక. మా ప్రభువైన క్రీస్తుద్వారా ఈ మనవిని ఆలించండి, ఆమెన్."

7. ప్రేమ మార్గం

ఆధ్యాత్మికంగా జూస్తే వివాహితులకు మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి. అవి ప్రేమ, సిలువ, భక్తి మార్గాలు. ఈ మూడు మార్గాలను మూడధ్యాయాల్లో పరిశీలించి చూద్దాం.

1. వివాహం జీవితంగూడ పవిత్రమైందే

సన్యాసజీవితంలాగే వివాహజీవితంగూడ ప్రత్యేకత కలది. అదికూడ పిలుపే. వివాహితులుకూడా ప్రత్యేకమైన ఆధ్యాత్మికజీవితం గడపాలి. ఇంతవరకు సంసారజీవితం అంత శ్రేష్టమైంది కాదు అనే అభిప్రాయం ప్రచారంలోవుంది. కాని అది పొరపాటు, గృహస్థజీవితం కూడ ఆధ్యాత్మికమైందే.

వివాహితులు తమ పిలుపులోని ఔన్నత్యాన్ని చక్కగా అర్థంచేసికోవాలి. సంసారజీవితం ద్వారాగూడ క్రీస్తు మరణోత్దానాలు తిరుసభలో కొనసాగుతాయి. ఇక్కడ యిద్దరు వ్యక్తులు కలసి జీవిస్తారు. వారి కలయిక క్రీస్తు తిరుసభల కలయికను పోలివుంటుంది. కనుక పవిత్రమైంది. ఈ కలయిక ద్వారానే ఉత్దానక్రీస్తూ పవిత్రాత్మా వారిని పునీతులను చేస్తారు.

స్త్రీపురుషులమధ్య విడదీయరాని బంధం వుంటుంది. ఇదే వారికి రక్షణ నిస్తుంది. దంపతులు పీఠంముందు ఒకరికొకరు వివాహ సంస్కారాన్ని ఇచ్చుకొంటారని చెప్పాం, దీనిద్వారా వాళ్లు ఒకరి ఆధ్యాత్మిక జీవితానికొకరు పూచీపడతారు. ఒకరినొకరు పవిత్రపరచుకొంటారు. దేవుడే వారిద్దరిని జతపరచి ఒకరిద్వారా ఒకరిని పవిత్రపరుస్తాడు.

కన్యా గురు సన్యా జీవితాలు వివాహజీవితంకంటె ఎక్కువ పవిత్రమైనవే. కాని దాంపత్యజీవితంగూడ దానంతట అది పవిత్రమైందే. దేవుడే ఆ మార్గాన్ని నిర్ణయించాడు కదా? అందరం క్రీస్తు ననుసరించి పునీతులం కావలసిందే. సంసారులు క్రీస్తు తిరుసభల పోలికనుపొంది, వారి పద్ధతిలో వాళ్ళ క్రీస్తు ననుసరించి, పావిత్ర్యాన్ని పొందుతారు.

2. ప్రేమ సమాజం

లోకంలో నిర్మలమైన ప్రేమ ఎక్కడవున్నా అది దేవుని ప్రేమనే సూచిస్తుంది. ప్రేమ వున్నచోట దేవుడుంటాడు. దేవుడు ప్రేమేకదా! క్రీస్తు తిరుసభను రక్షించి ఆ సభతో నిబంధనం చేసికోవడంలో దేవుని ప్రేమ వ్యక్తమైంది. ఇక క్రైస్తవ వివాహం క్రీస్తు తిరుసభల నిబంధనను పోలివుంటుందని చెప్పాం. కనుక దైవప్రేమ వివాహజీవితంలోకి గూడ ప్రవేశించి దాన్ని పునీతం చేస్తుంది. భార్యాభర్తలను ఓ ప్రేమసమాజంగా ఒనగూర్చుతుంది.

దంపతులు వారి పరస్పర ప్రేమద్వారా క్రీస్తుకిచెందిన వాళ్ళవుతారు. క్రీస్తునుండి ఒకరినొకరు వరప్రసాదంగా స్వీకరిస్తారు. ఒకరికొకరు క్రీస్తు వరప్రసాదాన్ని దయచేస్తారు. పరస్పర ప్రేమద్వారా దేవుని ప్రేమను తమలో ప్రతిబింబించుకొంటారు.

క్రైస్తవ వివాహంలో శారీరక ప్రేమా, దివ్యప్రేమా కూడా పరాకాష్ట నందుతాయి. శారీరక ప్రేమద్వారా దంపతులు ఒకరికొకరు పూర్తిగా సమర్పించుకొంటారు. ఒకరిపట్ల ఒకరు విశ్వసనీయులుగా మెలుగుతారు. ఒకరి జీవితంలోని కొకరు చొచ్చుకొనిపోయి ఏకవ్యక్తిగా తయారౌతారు. ఒకరికొకరు విడదీయరాని స్నేహితులౌతారు. దీనిద్వారా వాళ్ళ శరీరమూ మనసూకూడ ఔన్యత్యాన్ని పొందుతాయి.

వివాహ సంస్కారంద్వారా దంపతుల శారీరకప్రేమ క్రమేణ దివ్యప్రేమగా మారిపోతుంది. వాళ్లు ఒకరినొకరు దేవుని బిడ్డనుగా, తిరుసభ సభ్యునిగా గుర్తించి పరస్పరం సేవలు చేసికొంటారు. క్రీస్తునందు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకొంటారు. క్రీస్తు ప్రభావం వారిమీద బలంగా సోకుతుంది. ఇద్దరూ సంతానాన్ని అంగీకరించి ప్రేమిస్తారు. తోడి నరులనుగూడ ఆదరించి సోదరప్రేమను పెంచుకొంటారు. ఈ విధంగా ఆలుమగల్లో దివ్యప్రేమ వృద్ధి చెందుతుంది.

భార్యాభర్తల ప్రేమలోని ముఖ్యాంశం ఆత్మార్పణం. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తమ్ముతాము సమర్పించుకోవాలి. తమ ప్రేమను వట్టిమాటల్లోకాక చేతల్లో చూపించాలి. ఒకరికొకరు ఎంత త్యాగమైనా చేయాలి. భర్త క్రీస్తుని పోలి భార్యకొరకు తన ప్రాణాన్నికూడ సమర్పించాలి. భార్య తిరుసభనుపోలి కృతజ్ఞతా భావంతో భర్త ప్రేమను అంగీకరించి సంతానవతి కావాలి.

దంపతులు తొలిరోజుల్లో శారీరకప్రేమతోనే తృప్తి జెందుతారు. కాని ఈ ప్రేమ ఎంతోకాలం నిలవదు. ఈ ప్రేమ సమసిపోయాక వాళ్లు ఒకరినొకరు నిరాకరింపగూడదు. ఉన్నవాలళ్ళు ఉన్నట్లుగా - అనగా లోపాలతోపాటు సద్గుణాలతోపాటు ఒకరినొకరు ఓర్పుతో అంగీకరించాలి. ఇరువురూ ఒకరిలో దాగివున్న మంచితనాన్నీ శక్తిసామర్థ్యాలను ఒకరు వెలికితీయాలి. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో పాల్గొనడంద్వారా వారి ప్రేమ క్రమేణ పెరుగుతుంది.

వివాహ ప్రేమ క్రీస్తు తిరుసభలను పోలివుండడం దివ్యమైంది. ఒకరి విలువను ఒకరు అంగీకరించడంద్వారా వ్యక్తి సంబంధమైంది. ఒకరినొకరు పవిత్రపరచుకోవడం ద్వారా పునీతమైంది. సంతానాన్ని కనడంద్వారా ఫలభరితమైంది.

3. సంతానాన్ని కోరే ప్రేమ

వివాహపేమ సంతానంకొరకు ఎదురుచూస్తుంది. బిడ్డలను గాఢంగా వాంఛిస్తుంది. సంతానాన్ని ఆశించని ఆలుమగల ప్రేమ వంధ్యాత్వంతో నిండివుంటుంది. అలాంటి ప్రేమగల భార్యాభర్తలు ఒకరికొకరు సమర్పించుకోరు. నిరంతరం ఒకరినొకరు స్వార్థానికి వాడుకొంటారు. లైంగికానందమే ముఖ్యమనుకొంటారు. బిడ్డలనుకాక కేవలం లైంగికానందాన్నే కోరుకొనే ప్రేమ నింద్యమైంది. పూర్వవేద ప్రవక్తలు యావే ప్రభువుకి యిప్రాయలీయులపట్లగల ప్రేమను భార్యాభర్తల ప్రేమతో పోల్చారు. నూత్నవేదంలో క్రీస్తుకి తిరుసభపట్లగల ప్రేమ దంపతుల ప్రేమకు ఆదర్శం. ఈ దైవప్రేమలు రెండూ ఫలభరితమైనవి. యావే ప్రభువూ క్రీస్తూ ప్రజల రక్షణకొరకు పాటుపడ్డారుకదా! ఈ దివ్యప్రేమలను పోలిన మన వివాహ ప్రేమకూడ ఫలభరితం కావాలి.

సంతానాన్ని కనడమంటే దేవుని సృష్టిని కొనసాగించడం. ఒకవిధంగా చెప్పాలంటే, ప్రతిసృష్టి చేయడం. భగవంతుని సృష్టి అద్భుతంగా వుంటుంది. అన్నంలో రుచి వుంటుంది. ఈ రుచికి లొంగి నరులు అన్నం తింటారు. అలా తినడంవల్ల దేహపోషణం జరుగుతుంది. ఈ రీతినే స్త్రీపురుషుల కలయికలోగూడ సుఖం వుంటుంది. ఈ సుఖానికి లొంగి స్త్రీపురుషులు కలసికొంటారు. ఈ కలయికద్వారా సంతానోత్పత్తి జరుగుతుంది. దేహధారణం, సంతానోత్పత్తి భగవంతుడు సంకల్పించిన ఉద్దేశాలు. రుచి, సుఖం అనే గుణాలద్వారా అతడీయాశయాలను సాధిస్తాడు. లేకపోతే రోజుకి మూడుసార్లు ఎవడు అన్నంతింటాడు? యాతనతో కూడిన బిడ్డలను ఎవడు కంటాడు?

ఇక దేవుని సృష్టికార్యంతో సహకరించేవాళ్ళు తల్లిదండ్రులు. తండ్రి వీర్యం తల్లి గర్భంలో ప్రవేశించినపుడు పిండం ఏర్పడుతుంది. ఆ పిండంలోనికి ఆత్మను ప్రవేశపెట్టి మనుష్యప్రాణిని సృజిస్తాడు భగవంతుడు. మనం పాలరాతిని ఈయందే శిల్చి బొమ్మను చెక్కలేడు. అలాగే మనం పిండాన్ని ఈయందే భగవంతుడు నరుని సృజింపలేడు. ఈలా సృష్టితో సహకరించేది భార్యాభర్తల శారీరక సంబంధం. అందుకే దీన్ని ప్రతిసృష్టి అన్నాం.
ఈ కార్యంద్వారా జ్ఞానశరీరం అభివృద్ధిలోకి వస్తుంది. పరిశుద్దాత్మకు నివాసయోగ్యులైన పిల్లలు కలుగుతారు. భూమిపై భగవదారాధకులు విస్తరిల్లుతారు. మోక్షం పరిశుద్దులతో నిండిపోతుంది. ఈలాంటి శారీరకసంబంధం పట్ల మనకు పవిత్రమైన భావాలుండాలి. 

కొన్నిపార్లు శారీరకావరోధాలవల్ల దంపతులకు బిడ్డలు కలుగరు. దీన్నే వంధ్యాత్వం అంటాం. ఈ పరిస్థితిలో దంపతులు పరస్పర ప్రేమనే సంతానంగా భావించాలి. ఇంకా వాళ్లు ఇతరుల బిడ్డలను దత్తు తీసుకోవచ్చు. లేదా ఏదైనా ప్రేషిత సేవకు తమ జీవితాన్ని అంకితం చేసికోవచ్చు. ఈ ప్రక్రియలు బిడ్డలులేని లోటు కొంతవరకు తీరుస్తాయి.

4. వివాహప్రేమ - లైంగికప్రేమ

జంతువుల్లో లైంగిక ప్రక్రియ కేవలం శారీరకమైంది. నైసర్గికంగానే కలిగేది. కాని నరుల్లో అలాకాదు. అది దాంపత్యపేమకు సంబంధించింది. దంపతులు లైంగికక్రియద్వారా తమలో సహజంగావున్నకామాన్నిశాంతింపజేసికొంటారు. లైంగికక్రియ కామాన్నిశాంతింపజేయాలి గాని రెచ్చగొట్టకూడదు. క్రమేణ ఈ లైంగికక్రియే దివ్యప్రేమగా పరిణామం చెందుతుంది. శరీరం ఆత్మ ప్రాబల్యానికి లొంగుతుంది.

లైంగిక క్రియద్వారా ఆలుమగలు పరిపూర్ణంగా ఒకరికొకరు సమర్పించు కొంటారు. దానిద్వారా వారి దాంపత్యజీవితం, వారి ప్రేమ, వారి సంతోషం పరిపూర్ణమౌతాయి. భార్యాభర్తల లైంగికక్రియలో అపవిత్రత ఏమీలేదు. అది అన్నివిధాలా పవిత్రమైంది, పవిత్రపరచేది కూడ. కనుక దాన్నిగూర్చి మనం సిగుపడకూడదు, ఎగతాళిగా మాట్లాడకూడదు. లైంగికానందం భార్యాభర్తలు ఇద్దరూ కలసి పంచుకొనేది. ఇద్దరినీ తృప్తిపరచేది. కనుక లైంగికక్రియలో దంపతులు ఒకరినొకరు సంతోషపెట్టాలి. ఇది నిస్వార్ధప్రేమ. ఒకరినొకరు తమ ఆనందానికి వాడుకోగూడదు. ఇది స్వార్ధప్రేమ. ఎప్పడూ భార్య భర్తనూ, భర్త భార్యనూ సంతృప్తిపరచే ప్రయత్నంలో వుండాలి. ఒకరినొకరు మానుష వ్యక్తినిగా గౌరవించాలి. ఒకరిపట్ల ఒకరికి ఆరాధనభావం వండాలి. శారీరకంగా జూస్తే సతీపతులకు లైంగికానందాన్ని మించిన ఆనందం లేదు. ఈ యానందంలో దంపతులిద్దరూ పాలుపంచుకోవాలి. ఇది దాంపత్య ధర్మం. ఈ విషయంలో తరచుగా పురుషుడు స్త్రీకి ద్రోహం చేస్తూంటాడు. ఆమెను తన కోరికకు బలిచేస్తూంటాడు. ఇది పెద్ద నేరం.

దాంపత్య జీవితంలో లైంగిక వైముఖ్యం, మితిమీరిన భోగవాంఛ రెండూ నేరాలే. కొంతమంది, విశేషంగా స్త్రీలు, లైంగికక్రియను అసహ్యించుకొని దానిపట్ల వైముఖ్యం జూపుతారు. అది జంతుప్రక్రియ అనుకొంటారు. ఇది పొరపాటు. మానవజాతి ఈలోకంలో అవిచ్ఛిన్నంగా కొనసాగిపోవడం కొరకు, స్త్రీపురుషులు కలసి స్నేహంగా జీవించడం కొరకు, భగవంతుడే లింగాన్ని సృజించాడు. కనుక అది చెడ్డదికాదు, పవిత్రమైంది. కనుక స్త్రీపురుషులు నిర్మలమైన ఉద్దేశంతో లైంగిక క్రియలో పాల్గొని ఈ సృష్టిని కొనసాగించడంలో భగవంతునితో సహకరించాలి. భార్యాభర్తలు పరస్పర ప్రేమతో లైంగికక్రియను జరిపితే భగవంతుణ్ణి పూజించినంత పుణ్యం.

మితిమీరిన భోగవాంఛకూడ నిషిద్ధమే. భోగవాంఛ అంటే కామాన్ని తీర్చుకోవడం. జంతువులా కేవలం స్వీయసుఖాన్ని అనుభవించడం. ఇది మానుష వ్యక్తులైన భార్యాభర్తలకు తగదు. వివాహజీవితానికి పనికిరాదు. స్వీయతృప్తికొరకే సుఖాన్ని కోరుకోగూడదు. ఎదుటి వ్యక్తికి ప్రేమను పంచి ఈయడం కొరకు సుఖాన్ని కోరుకోవాలి. కనుక లైంగిక క్రియలో భార్యాభర్తలు, విశేషంగా భర్తలు కేవలం భోగప్రియలు కాగూడదు. శారీరకమైన కలయికద్వారా నైసర్గికమైన లైంగికవాంఛ దివ్యప్రేమగా రూపొందాలి. కనుక స్త్రీపురుషులు ప్రయత్నంజేసి తమ శారీరకమైన కలయికను పవిత్రమైన స్థాయికి తీసికొనిరావాలి.

ఇంకా, ప్రేమ అంటే ఈయడంగాని పుచ్చుకోవడం గాదు. కావున భర్త భార్య విషయంలో ఈమెనుండి యెంత సుఖం పొందుదామా అనికాక, ఈమెను ఏలా సుఖపెడదామా అని ఆలోచిస్తూండాలి. అలాగే భార్యకూడ ఇతన్నుండి ఎంత సుఖాన్ని పొందుదామా అనిగాక, ఇతన్నియేలా సుఖపెడదామా అని ఆలోచిస్తుండాలి. ఇదినిజమైన ప్రేమ. క్రీస్తు ప్రేమను ప్రకాశింపజేసేది శారీరక సంబంధం. కావున ఈ శారీరక సంబంధం మన స్వార్థబుద్ధికీ, కామతృప్తికీగాక, ప్రేమగుణానికి నిదర్శనంగా వుండాలి. వివాహజీవితంలో లైంగిక క్రియ ముఖ్యమైందే. కాని అది అన్నిటికంటె ముఖ్యమైంది కాదు. అదే మొదటి విలువకాదు. సంసారజీవితంలో శారీరకమైన కలయిక ఒక్కటే ముఖ్యంకాదని భార్యాభర్తలు కొద్దిరోజూల్లోనే గుర్తిస్తారు. జీవితంలో ఇంకా ముఖ్యవిషయాలు చాలా వున్నాయనీ వాటిమీదకూడ మనసుపెట్టి జీవించాలనీ అర్థంచేసికొంటారు. కనుక దంపతుల శృంగారం ఆదుపాజ్ఞల్లో వుండాలి. దాని స్థానం దానికుంది. కాని అది హద్దుమీరరాదు.

ప్రార్థనా భావాలు

1. వైవాహికానందం

వివాహ జీవితంలో ఎంతో ఆనందం వుంటుంది. భార్యాభర్తలు ఈ యానందాన్ని హాయిగా అనుభవించవచ్చు. స్త్రీ పురుషుల కలయిక ఆనందాన్నిస్తుంది. భర్త భార్య సౌందర్యాన్ని వినయ విధేయతలను జూచి ఆనందిస్తాడు. భార్య భర్త శక్తి సామర్థ్యాలను ప్రేమను మంచితనాన్ని చూచి ఆనందిస్తుంది. సంతానం కలిగి పిల్లలు అభివృద్ధిలోకి వస్తూంటే అదీ ఆనందమే. కష్టపడి పనిచేసికొంటూ తోడిప్రజలతో ఒద్దికగా జీవిస్తే అదీ ఆనందమే. నిర్మలమైన అంతరాత్మతో తోడిప్రజలకు కీడు చేయకుండ చేతనైనంతవరకు మేలు చేసికొంటూపోతే అదీ ఆనందమే. ఈ యానందాలన్నిటినీ అనుభవిస్తూ కృతజ్ఞతతో ప్రభువుకి వందనాలు అర్పించుకోవావలి సంసారజీవితం గడిపే స్త్రీపురుషులు. అప్పడే కందెన పెట్టిన బండి యిరుసులాగ సంసారజీవితం మెత్తగా సాగిపోయేది.

గురువు గురుజీవితంలో ఆనందిస్తాడు. మఠకన్యకన్యాజీవితంలో ఆనందిస్తుంది. అలాగే భార్యాభర్తలు సంసారజీవితంలో ఆనందించాలి.

2. దేహదానం

వివాహ ధర్మం ప్రకారం భార్య దేహం భర్తది. భర్తదేహం భార్యది. కావున భార్య కోరినపడెల్ల భర్త, భర్త కోరినపుడెల్ల భర్త, భర్త కోరినపుడెల్ల భార్య శారీరక సంబంధానికి అనుమతిస్తుండాలి. ఈ లైంగిక సంబంధం దంపతులను పవిత్రపరుస్తుంది —1కొరి 7,3-4 దేహదానమనే ఈ నియమాన్ని ఉల్లంఘించినవాళ్సు వివాహజీవితానికి విరుద్ధంగా పాపంజేసిన వాళ్ళవుతారు. ఇక, శారీరక సంబంధం భార్యాభర్తల మధ్య కలిగే కలహాన్నీ అపార్ధాన్నీ చక్కదిద్దుతుందని మానసికశాస్త్రవేత్తలు చెప్తారు.

3. స్వీయభార్య

సామెతల గ్రంథకర్త పురుషులకు చక్కని వైవాహిక ధర్మాలు బోధించాడు. "పురుషుడు సొంత పాత్రలోని నీళ్ళు త్రాగుతూండాలి. సొంతబావిలోని జలధారను సేవిస్తూండాలి. తాను యువకుడుగా వున్నపుడే స్వీకరించిన భార్యయందు ఆనందిస్తూండాలి. లేడిలా, దుప్పిలా ఆమె అతనికి అందంగా కన్పిస్తుంది. అతడు ఆమె ప్రేమకు బుద్ధుడు కావాలి. అతనికి సంతృప్తినిచ్చేది రంకులాడి రొమ్ముకాదు, నిజభార్య వక్షస్సు" - 5,15-20.

4. న్రీ సహజమైన వినయం

క్రైస్తవ స్త్రీకి వినయం తగుతుంది. చక్కని జడలు, బంగారు సొమ్ములు, ముత్యాలదండలు, వెలగలదుస్తులు - ఇవికాదు ఆమెకు అలంకారాన్ని ఇచ్చేది. అణకువ, దైవభక్తి సత్ర్కియలు - ఇవి క్రైస్తవ కుటుంబినికి పెట్టని సొమ్మలు - 1తిమో 2,9-10. ఆమె సాధుమతి మృదుస్వభావయై యుండాలి. ఈ గుణాలు ఆమె హృదయానికి అక్షయాలంకారాలు - 1పేత్రు 3,3-4 సార, రిబ్కా మొదలైన ఉత్తమస్త్రీలు ఈలాంటి గుణాలు కలవాళ్లు, క్రైస్తవ కుటుంబిని ఆదర్శాలు కూడ ఈలా వుండాలి. ఇంకా, స్త్రీ బిడ్డలను కనడంద్వారా ధన్యురాలవుతుంది - 1తిమో 2,15,

5. జంతమైథునం

జంతు మైథునంలో మృగాలు మొదట శారరీకసుఖాన్ని కోరుకొంటాయి. ఆ పిమ్మట వాటికి తెలియకుండానే యాదృచ్చికంగా పిల్లలు పుడతాయి. మనుష్య మైథునంలో మొదట సంతానం ఉద్దేశింపబడుతుంది. ఈ దృష్టితోనే శారీరకసుఖాన్ని అనుభవిస్తారు. భార్యాభర్తలు ఈ సత్యాన్ని మరచిపోగూడదు.

6. క్రీస్తునందు

మనంచేసే పనులన్నీ కూడ క్రీస్తుపేరిట చేయాలన్నాడు ప్రేషితుడైన పౌలు- కొలో 3,17. తినడం, త్రాగడం, నిద్రించడం మొదలైన మామూలు కార్యాలన్నీ ప్రభువుకే అర్పించమన్నాడు. స్త్రీ పురుషులు తమ కలయికనుగూడ ప్రభువుకే అర్పించుకోవాలి.

8. సిలువ మార్గం

క్రీస్తు సిలువను మోయడం కష్టం. ఐనా దాన్ని మోసినప్పడేగాని క్రీస్తు శిష్యులం కాలేం. అన్ని దేవద్రవ్యానుమానాల్లోలాగే వివాహంలోకూడ క్రీస్తు సిలువబాధలూ ఉత్థాన మహిమా రెండూ వుంటాయి. ఇక్కడ మనం సిలువ బాధలను పరిశీలించాలి. క్రీస్తు స్వీయమరణంద్వారా తిరుసభనే పత్నిగా పొందాడు. ఈ స్వార్థత్యాగం మన వివాహజీవితంలోగూడ కన్పించాలి. భార్యాభర్తల ఆత్మార్పణం, వారి జీవితంలో ఎదురయ్యే వొడుదుడుకులు వాళ్ళ క్రీస్తు సిలువలో పాలుపొందేలా చేస్తాయి. ఎదుటి వ్యక్తికి ఆత్మార్పణం చేసికొని అతన్ని సంతోషపెట్టడంలో పెద్ద సిలువవుంటుంది. ఈ సిలువను దంపతులు మోయక తప్పదు. ఆత్మార్పణంలేందే ప్రేమలేదు. స్నేహితుని కొరకు ప్రాణాలు అర్పించడంకంటె గొప్ప ప్రేమ ఏముంటుంది? -యోహా 15, 13 ఇదే సిలువ. ఆత్మార్పణం రూపంలో వుండే ఈ సిలువను దంపతులిద్దరూ మోరియాలి. స్వార్ధాన్ని జయించి తన్నుతాను నిరాకరించుకొంటేనేగాని స్త్రీపురుషులు నిజమైన దాంపత్యజీవితం గడపలేరు.

1. లైంగికరంగంలో సిలువలు

వివాహజీవితంలో శృంగారం వుండవలసిందే. కాని దీనికి సంయమనం అవసరం. భార్య మేలుకోరి భర్త, భర్తమేలుకోరి భార్య లైంగికక్రియను మానుకోవాలి. వ్యాధిబాధలకు గురికావడం, మనోధర్మాలు వికటించి వుండడం మొదలైన సందర్భాల్లో దంపతుల్లో వొకరు లైంగికక్రియకు సమ్మతింపకపోవచ్చు. అప్పడు రెండవవ్యక్తి తన భాగస్వామిని నిర్బంధం చేయకూడదు. నిగ్రహాన్ని పాటించాలి. ఇది పెద్ద సిలువ. ఐనా ఆలుమగలు దీన్ని మోయకతప్పదు. ఒకోసారి ఈ నిగ్రహాన్ని చాలకాలం పాటింపవలసి వుంటుంది. ఈ సందర్భంలో దంపతుల భావన "నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. కనుక నీవు అంగీకరించని దానిని గూర్చి నేను నిన్ను నిర్బంధం చేయను" అన్నట్లుగా వండాలి.

పౌలు వివాహితులు అవివాహితులో అన్నట్లు జీవించాలని చెప్పాడు-1కొరి 729. ఇక్కడ వివాహితులు లైంగికక్రియను అసలు మానుకోవాలని పౌలు భావంకాదు. అతడు రెండవరాకడ సమీపంలో వుందని నమ్మాడు. కనుక దంపతులు లైంగిక వ్యాపారాలు మాని ఆధ్యాత్మిక విషయాలమీదికి మనసు త్రిప్పకోవాలని భావం. విశాలార్థంలో ఈ వాక్యం నేడు మనకుకూడ వర్తిస్తుంది. భగవంతుణ్ణి పూజించుకోవడానికీ, ప్రార్ధన చేసికోవడానికీ, దీనులకూ ఆపన్నులకూ సేవలు చేయడానికీ కొన్నిసార్లు లైంగిక వ్యాపారాలు మానుకోవలసివస్తుంది. ఈ సిలువను మోయడంద్వారా దంపతులు ఎంతో పుణ్యాన్ని ఆర్జిస్తారు.

ఇంతవరకు లైంగిక రంగాన్ని గూర్చి చెప్పాం. కాని వివాహజీవితంలో సిలువలు కేవలం ఈ రంగంలో మాత్రమేకాక ఇంకా అనేకరంగాల్లో రావచ్చు. ఇవి చాలా వున్నాయి.

2. ఇతర రంగాల్లో సిలువలు

వైవాహిక జీవితంలో పెద్ద సిలువలు వస్తుంటాయి. భార్యాభర్తలకు మనసు కుదరకపోవడం, చపలచిత్తంతో వివాహడ్రోహం చేయడం సిలువ. వ్యాధిబాధలు, తలవని తలంపుగా భర్తగాని భార్యగాని చనిపోవడం సిలువ, పిల్లలు మాట వినకపోవడం, ఒకోసారి అసలు పిల్లలే కలక్కపోవడం సిలువ. కొద్దిజీతాలు, పెద్దసంసారం సిలువ. ఈలాంటి బాధలన్నీ మనం క్రీస్తునందు ఓపికతో భరించాలి. క్రీస్తు బాధామయుడు. గురువుకంటె శిష్యులు గొప్పవాళ్ళ కాదు. అతనికొక త్రోవ మనకు వేరొక త్రోవ అంటూలేదు. పచ్చి మ్రానుకే అలాంటి బాధలు సంభవించాయి. ఎండు ప్రమానులాంటి వాళ్ళమైన మనకు ఎంతటి విపత్తులైనా కలుగుతాయి. ఈలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకానుగ్రహం మనకు సహాయపడుతుంది.

వివాహం సిలువబలిని తలపిస్తూంటుంది. క్రీస్తు తిరుసభ కొరకు తన్నుతాను అర్పించుకొన్నాడు. అదే సిలువ బలి. క్రీస్తు తిరుసభను పోలింది వివాహజీవితం. కావున ఈ సంసారజీవితం సిలువబలికి పోలికగా వుంటుంది. క్రీస్తు పూజాబలిలో దినదినం మనకొరకై పరలోకపితకు అర్పించుకొంటాడు. ఇదే విధంగా వివాహజీవితంలో గూడ జరగాలి. భర్త భార్యతోపాటు క్రీస్తుద్వారా తన్నుతాను దేవునికి అర్పించుకోవాలి. ఇద్దరూ సంతానంతోపాటు తమ్ముతాము దేవునికి అర్పించుకోవాలి. ఈలా మనం క్రీస్తు సమర్పణంతో పాటు తమ సమర్పణనూ రోజురోజు కొనసాగించాలి. క్రీస్తు జీవితం సమర్పణాత్మకమైన జీవితం, కుటుంబజీవితం గడిపే గృహస్థులు పూజబలితో సంబంధం పెంపొందించుకొనే మార్గం ఇది.

సంసారజీవితంలో వ్యక్తిగత లోపాలుగూడ బాధను తెచ్చిపెడతయి. వివాహ జీవితం మొదట క్రొత్తగా, బులపరంగా వుంటుంది. వధూవరులు ఒకరికొకరు అందంగా, గొప్పగా కన్పిస్తారు. కాని కొద్దికాలం గడిచాక ఈ యందచందాలు మాసిపోతాయి. రోజూ చూచిన ముఖమే చూచుకోవడం, విన్నమాటలే వినటం జరుగుతుంది. క్రమేణ ఒకరి లోపాలు ఒకరికి తెలిసిపోయి ఒకరంటే వొకరు విసుక్కోవడం గొణుక్కోవడం రుసరుసలాడ్డం మొదలుపెడతారు. ఈలాంటప్పడు భార్యాభర్తలు చాల జాగ్రత్తగా మెలగాలి. ఒకరి లోపాలనొకరు ఓర్పుతో భరించాలి. భర్త భార్య మేలిగుణాలతోపాటు లోపాలనుగూడా జీవితాంతంవరకు అంగీకరించాలి. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమతో మృదువుగా సంస్కరించుకోవాలి. ఒకరినొకరు చిన్నపిల్లలను లాగ నేర్పుతో, ఓర్పుతో సరిదిద్దుతూండాలి. క్రీస్తును కానావూరి వివాహానికివలె మన వివాహానికిగూడ ఆహ్వానించాలి. యేసు వుండడంవల్ల అక్కడ రసం కొరత తీరిపోయింది. ఆ ప్రభువు ప్రత్యక్షమై వుంటే చాల మన జీవితంలోని కొరతలుగూడ తీరిపోతాయి.

3. ప్రాపంచిక విషయాల్లో నిమగ్నులు కావాలి

గురువులు మఠకన్యలు దైవసంబంధ కార్యాల్లో నిమగ్నులౌతారు. కాని వివాహజీవితం గడిపేవాళ్ళ ప్రపంచసంబంధ కార్యాల్లో నిమగ్నులుకావాలి. పొలాలు ఆఫీసులు బళ్ళు మొదలైన తావుల్లో పనిజేసికొంటూంటారు గృహస్తులు. మంచి ఉద్దేశంతో చేస్తే ప్రపంచంలోని ఏపనైనా వాళ్ళను పవిత్రపరుస్తుంది. కావున గృహస్థలు నిజాయితీతో ఈ పనులనుజేసి ప్రభువునకు అర్పిస్తుండాలి. అరవై డెబ్భయియేండ్ల జీవించేపుడు, ఈ పనులే మనలను పునీతులనుజేయాలి. అవి దేవుని యెదుట మనకు సాక్ష్యం పలకాలి. ఇక "భూమండలమంతట నివసించి దానిని వశం చేసికొనండి" "నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకొనండి" అన్న భగవద్వాక్యాలు వుండనే ఉన్నాయి - ఆది 1,28, 3,19.

4. పావనాత్మ

పితసుతులను ఐక్యపరచేది, ముగ్గురు వ్యక్తులు ఒక్క దేవుడయ్యేలా చేసేది పావనాత్మ. ఈయాత్మ ప్రేమజలాన్ని మన హృదయంలో కుమ్మరిస్తుంది - రోమా 5,5. కుటుంబంలోని వాళ్ళంతా కూడిమాడి ప్రేమజీవితం గడిపేలా చేసేది ఈయాత్మే. ఈయాత్మ ప్రత్యక్షమై వున్నచోట సిలువ వుంటుందిగాని అది భారమనిపించదు. కావున గృహస్తులు ఈ యాత్మపట్ల భక్తిభావంతో మెలుగుతూండాలి.

గృహస్థులు పవిత్రులయ్యే మార్గాలు రెండు. ప్రేమమార్గం, సిలువమార్గం. వివాహితులు సాధారణంగా తొలిరోజుల్లో ప్రేమమార్గంలో నడచిపోతారు. కడపటి రోజుల్లో సిలువమార్గంలో సాగిపోతారు.

ప్రార్థనా భావాలు

1. బలిపీఠం

వధూవరులు తమ క్రొత్త జీవితపు తొలి రోజుననే బలిపీఠంముందు సమావేశమౌతారు. ఆ పీఠం ముందు, దాని మీది సిలువయెదుట, ప్రభుసమక్షంలో భార్యాభర్తలుగా మారిపోతారు. ఆనాటినుండి ప్రభువు సిలువ వారిపై సోకుతూనే వుంటుంది. ఒకోమారు వాళ్ళమీద భారంగా వాలుతుంది. ఐనా ఈ పీఠంమీది దైవసాన్నిధ్యం వారి . జీవితంలోగూడ నెలకొని వుంటుంది. తొలిరోజే ఈ పీఠంముందు విందులో భార్యాభర్తలు పాలుపొందుతారు. మల్లా మోక్షవిందులో పాల్గొనేదాక యీ విందు దంపతులను ముందుకు నడుపుతూంటుంది,

2 కష్టసుఖాలు

కుటుంబజీవితంలో కష్టసుఖాలు కావడికుండల్లా మారుతూంటాయి. ఐనా సుఖదుఃఖాల్లోను, శీతోష్ణాల్లోను మనలను భరించేది ఆ ప్రభువే. కావున దంపతులు వెలుగులోను చీకటిలోను ప్రభువుమీదనే ఆధారపడాలి. పెండ్లిపూజలో వధూవరులు “మంచిరోజుల్లోను చెడురోజుల్లోను, వ్యాధిలో వున్నపుడును ఆరోగ్యంగా వున్నపుడును ఒకరిపట్ల ఒకరం విశ్వాస యోగ్యంగా ప్రవర్తిస్తామని” పీఠంముందు ప్రమాణం చేస్తారు. భార్యాభర్తలు అక్షరాల ఈ భావానికి అనుగుణంగా జీవించవలసిన రోజులు వస్తాయి.

3. బిడ్డలులేని బ్రతుకు

ఒకోమారు సంతానం కలుగదు. అలాంటప్పడు స్త్రీ పురుషులు తీరనివ్యధను అనుభవిస్తారు. ఈలాంటి పరిస్థితిలో కొంతవరకు ఓదార్పుపొందే మార్గం ఇది. భార్యాభర్తలు పరస్పర ప్రేమనుగూడ సంతానంగానే భావించుకోవాలి. ఈ ప్రేమ తరచుగా భౌతికరూపందాల్చి సంతానమౌతుంది. కాని ఒకోమారు అలా రూపొందదు. ఆ పిమ్మట మన సొంతబిడ్డలపట్ల చూపే ప్రేమనే వేరేవాళ్ళ బిడ్డలపట్ల చూపుతూ వాళ్ళను ఆదుకొంటూండాలి.

4. వైధవ్యం

వైధవ్యం స్త్రీకి ఘోరవ్యధను కలిగిస్తుంది. ఐనా ఆమె క్రీస్తునందు ఈబాధ సహించాలి. విధవకు మళ్ళా పెండ్లి చేసికొనే స్వాతంత్ర్యం వుంది. కాని క్రీస్తునందు తన వైధవ్యాన్ని భరించే స్త్రీ ధన్యురాలు - 1కొ 7, 10. క్రీస్తునందు అనగా ప్రభువు ప్రజలకు పరిచర్యలు చేస్తూ అనిభావం. పరదేసులకు ఆతిథ్యమిస్తూ, పరిశుద్దుల పాదాలు కడుగుతూ, శ్రమపడేవారికి సహాయంచేసూ ప్రతి సత్కార్యానికి ముందుకివస్తూ, రోజులు సాగించమన్నాడు తననాటి విధవలను ప్రేషితుడైన పౌలు- 1తిమో 5,10. ప్రభువు తనకిచ్చిన సిలువను ఓర్పుతో భరించడం, ఇంటిలోను ఇరుగుపొరుగు వాళ్ళ ఇండ్లలోను వున్న బిడ్డలను ఆదరించడం, గుడిలోను బడిలోను పరిచర్య చేస్తూండడం, అనవసరపు ప్రసంగాలు మాని ప్రార్థన చేసికోవడం - ఇవి విధవలు చేయదగిన సత్కార్యాలు. అన్నావారికి ఆదర్శంగా వుంటుంది - లూకా 226-28.

5. తిరుకుటుంబం

కుటుంబ జీవితానికి ప్రభువు తానే ఆదర్శంగా నిలిచాడు. నజరేతు గ్రామం. తల్లిదండ్రులు మరియా యోసేపులు. వాళ్ళతో కలసిమెలసి పనిచేసే పసిపాపడు బాలయేసు. వాళ్లు ముగ్గురూ కష్టజీవులు. వడ్రంగి వృత్తితో జీవించేవాళ్ళ క్రైస్తవ కుటుంబాలు ఈ

కుటంబంవైపు తేరిపార జూచి తమ రూపురేఖలు తీర్చిదిద్దుకోవాలి — లూకా- 2,51-52.

9. భక్తి మార్గం

వివాహ జీవితం జీవించేవాళ్లు ప్రేమ, సిలువ మార్గాలనే కాక భక్తిమార్గాన్ని గూడ అనుసరిస్తూ వుండాలి. దంపతులు తమ వివాహ జీవితంతో మూడు విధాలుగా భక్తిని పెంపొదించుకోవచ్చు. మొదటిది, ఒకరినొకరు నిస్వార్ధప్రేమతో ప్రేమించుకోవడం. రెండవది, ప్రార్ధనాజీవితానికి అలవాటుపడ్డం. మూడవది, క్రైస్తవ సంస్కారాలను యోగ్యంగా స్వీకరిస్తూ వుండడం, ఇక యీ మూడంశాలను విచారిద్దాం.

1. నిస్వార్థ ప్రేమ

భార్యాభర్తలు ఒకరినొకరు ఓ వరప్రసాదంగా భావించుకోవాలి. అనగా ఈ భార్య లేక ఈ భర్త, దేవుడు నాకనుగ్రహించిన వరప్రసాదం. ఈ వ్యక్తిద్వారా నేను పవిత్రతను పొందాలి. ఈ వ్యక్తిని నేను పవిత్రపరచాలి,

భార్యాభర్తలు విశేషంగా లైంగిక పావిత్ర్యాన్ని పెంపొందించుకోవాలి. లైంగిక పావిత్ర్యమంటే దంపతులు లైంగికక్రియలో నిస్వార్ధప్రేమతో ప్రవర్తించడం. లైంగిక సుఖం భార్యాభర్తలు ఇద్దరూ కలసి అనుభవించేది. ఇద్దరూ కలసి పాలుపంచుకోనేది. కనుక భర్త తాను సుఖించడంతో సరిపోదు. భార్యనూ సుఖపెట్టాలి. అలాగే భార్య తాను సుఖించడంతో సరిపోదు. భర్తనూ సుఖపెట్టాలి.

కాని తరచుగా భార్యాభర్తల్లో ఎవరోవొకరు, విశేషంగా పురుషులు, ఈ నియమాన్ని ఉల్లంఘిస్తూ వుంటారు. లైంగికక్రియలో తమ సుఖాన్ని తాము చూచుకొని ఎదుటివ్యక్తి సుఖాన్ని విస్మరిస్తూ వుంటారు. ఈ యెదుటి మనిషిగూడ నాలాగే ఓ వ్యక్తి నా సుఖంకోసం ఈ మానుషవ్యక్తిని ఓ వుపకరణంగా వాడుకోగూడదు. అలా వాడుకుంటే ఆ వ్యక్తిని ఓ వస్తువుగా ఉపయోగించుకొని అవమానించినట్లే. కేవలం స్వీయతృప్తి కోసమే భార్యను సమీపించే భర్తగాని, భర్తను సమీపించే భార్యగాని జంతువుల్లా ప్రవర్తిస్తున్నారనే చెప్పాలి. ఎదుటివ్యక్తిని ఆదరించని లైంగికక్రియ, ప్రేమలేని లైంగికక్రియ జంతువులకు యోగ్యమైతే ఔతుందేమోగాని నరులకు యోగ్యంగాదు.

అసలు ఆలుమగలు ఎదటి వ్యక్తినుండి సుఖాన్ని పొందడంగాదు, ఎదుటివ్యక్తికి సుఖాన్ని ఈయడమే తమ కలయిక యొక్క ధ్యేయం అనుకోవాలి. ఎదుటివ్యక్తి ప్రేమను అనుభవించడంగాదు, ఎదుటివ్యక్తిని ప్రేమించడమే ప్రధానం అనుకోవాలి. ఇది స్వార్థంలేని ప్రేమ. భార్యాభర్తలు అవశ్యం పెంపొందించుకోవలసిన ప్రేమ. ఈలాంటి నిస్వార్ధప్రేమ ద్వారాగాని దంపతులు "స్నేహితులకోసం స్వీయప్రాణాన్ని సమర్పించడంకంటె ఉత్తమ "ప్రేమ యేముంది?" అనే ప్రభువాక్యాన్ని సార్ధకం జేసికోరు - యోహా 15,13. దీనిద్వారాగాని భార్యాభర్తల ప్రేమ శ్రీసభ-క్రీస్తు ప్రేమ పోలికనందజాలదు.

ఇలా భార్యాభర్తలు లైంగిక క్రియలో నిస్వార్థంతో ప్రవర్తించడమనేది వాళ్ళ దాంపత్య జీవితానికీ అంతస్తునకూ సంబంధించిన పుణ్యం. కనుక దీన్ని దాంపత్యపుణ్యం అనాలి. ఈ పుణ్యాన్ని పాటించందే వాళ్ళ దాంపత్య జీవితం పునీతంకాదు. గుడికి వెళ్ళడం, జపాలు జపమాల చెప్పుకోవడం, క్రైస్తవ సంస్కారాలు పొందుతూ ఉండడం సులభం. కాని ఈ దాంపత్య పుణ్యాన్ని పాటించడం కష్టం. ఐనా ఈ పుణ్యంద్వారా భార్యాభర్తలు తమ్ము తామేగాదు, ఒకరినొకరుగూడ పవిత్రపరచుకుంటారు.

ఈలా భార్యాభర్తలు ఒకరినొకరు ప్రభు వరప్రసాదంగా భావించుకోవాలి. ఒకరిపట్ల ఒకరు మర్యాదతో, గౌరవంతో భక్తిభావంతో ప్రవర్తించాలి. ఇతరుని భజించేవాడు లేక సేవించేవాడు, భక్తుడు. ఇక సేవలేని ప్రేమంటూ లేదు. కనుక భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు భక్తిభావం ప్రదర్శించడమంటే ఒకరినొకరు ప్రేమిస్తూ సేవిస్తూ ఉండడం. ఇదీ దాంపత్య జీవితానికి తగిన భక్తి.

2. ప్రార్థనా జీవితం

ప్రార్థనలేందే కుటుంబజీవితంలో భక్తిని పెంపొందించుకోలేం. ప్రార్థన భార్యాభర్తలను ఐక్యపరుస్తుంది. బిడ్డలను తల్లిదండ్రులతో జోడిస్తుంది. రోజురోజు నియమిత కాలానికి సమావేశమై భక్తిశ్రద్ధలతో ప్రార్థన చేసుకునే కుటుంబం కూడిమాడి జీవిస్తుంది. ప్రార్థనమంటే దైనందిన కార్యాలు మానుకొని ఓ ఐదు నిమిషాలు దేవునివైపు మనస్సు మరల్చడం మాత్రమేగాదు. మరి ఆ దైనందిన కార్యాలనే దేవునివైపు మరల్చడం. ప్రార్ధనద్వారా మన జీవితంలోని కష్టాలను సుఖాలను ప్రభువునకు అర్పించుకోవాలి. మన పనులన్నీ ఆ ప్రభువునకు సమర్పితం కావాలి. మన జీవితమంతా పరలోకంలోని తండ్రికి అంకితం కావాలి. కుటుంబ ప్రార్థనలో బిడ్డలుకూడ తప్పనిసరిగా పాల్గొనాలి. ఈలా పాల్గొనడం ద్వారా పిల్లలకు ప్రార్థనాభ్యాసం అలవడుతుంది. ప్రార్థనకు అలవాటుపడిన పిల్లలు దేవుణ్ణి, దేవునికోసం తోడిప్రజలను, ప్రేమించడం నేర్చుకుంటారు. చిన్ననాడు ప్రార్థనకు అలవాటుపడిన బాలబాలికలు యౌవనప్రాయంలో చాంచల్యంవల్ల కొంతకాలం భగవంతుని విస్మరించినా, ఆ పిమ్మట మళ్ళా ప్రభువును స్మరిస్తారు. చిన్ననాడు ప్రార్ధనద్వారా పరిచయం జేసుకున్న ప్రభువును మళ్ళా సమీపిస్తారు. ఇక ఈ ప్రార్థనాభ్యాసానికి అలవాటుపడని బాలబాలికలు పెరిగి పెద్దవాళ్ళయ్యాక ప్రపంచ వ్యామోహాల్లో చిక్కుకొని పోతారు. లౌకిక విషయాలనే వరదలోబడి కొట్టుకొనిపోతారు. ప్రార్ధనం బహుముఖంగా ఉంటుంది. కనుక కుటుంబప్రార్థన పలానా విధంగా ఉండాలి అని ఓ నియమాన్ని సూచించలేం. ఐనా మన క్యాతలిక్ క్రైస్తవులకు బైబులుతో అట్టే పరిచయం ఉండదు గనుక మన ప్రజలు బైబులు చదువుకొని ప్రార్థన చేసికోవడం చాల ముఖ్యం. మనం ప్రార్థించేప్పుడు దేవునితో సంభాషిస్తాం. కాని బైబులు చదువుకునేప్పడు ప్రభువే మనతో సంభాషిస్తాడు. జీవితంలో ఈ రెండు రకాల సంభాషణలూ అవసరమే. బైబులు చదువుకోవడంకూడ ఓ ప్రార్థన. బైబులు వాక్యాలద్వారా ప్రభువు మనతో మాటలాడతాడు అనే సత్యాన్ని మనవాళ్ళు చాలమంది గుర్తించరు. స్తిమితంగా కూర్చుండి రోజూ కాసేపు బైబులు చదువుకొని ప్రార్ధనం చేసికోవాలి. ఈ ప్రార్ధనం మనవి, విజ్ఞాపనం, కృతజ్ఞత, పశ్చాత్తాపం, ఆరాధన అనే నానారూపాల్లో వుండవచ్చు. ప్రార్థనలో వేదవాక్యం నోటికి రుచి తగలాలి. ఒకసారి వేదవాక్యాన్ని రుచిచూచిన భక్తులు ఇక దాన్ని వదలి ఉండలేరు.

ఈ లోకయాత్రలో ప్రభువు వాక్యమే దీపమై మనకు దారి చూపిస్తుంది. మనం దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించేలా, దేవుని మార్గాల్లో నడిచేలా చేస్తుంది.

మంచి ప్రార్ధనవల్ల మన జీవితం మంచికి మారుతుంది. మన పొరపాట్లను కొంతవరకైనా సవరించుకొంటాం. మనలోని స్వార్థం తగ్గుతుంది. తోడివారిని ప్రేమభావంతో ఆదరిస్తాం. ఇవన్నీ మన ప్రార్ధనం ఫలించిందనడానికి గుర్తులు.

గృహస్థులకు తరచుగా పగటిపూట కాలవ్యవధి లభించదు. కనుక కుటుంబమంతాకూడి రాత్రిపూట ప్రశాంతంగా అవధానంగా జపంచేసికోవడం మంచిది. ఎవరి ప్రార్ధనా కాలాన్ని వాళ్ళు నిర్ణయించుకోవడం ఉత్తమం.

3. క్రైస్తవ సంస్కారాలు

కుటుంబ జీవితాన్ని పవిత్రంజేసే సాధనాలన్నిటిలోను క్రైస్తవ సంస్కారాలు ప్రధానమైనవి. మొట్టమొదట వివాహజీవితం జీవించేవాళ్ళను జ్ఞానవివాహ సంస్కారం పునీతులను జేస్తుంది. ఈ సంస్కారంవలన క్రీస్తు-స్త్రీసభల ప్రేమ భార్యాభర్తల ప్రేమపైసోకి ఆ ప్రేమను నిర్మలం చేస్తుంది. ఈ సంస్కారం ఇచ్చే ప్రత్యేక వరప్రసాదం కస్టసుఖాల్లోను దంపతులను ఆదరిస్తుంది.

ఇక జ్ఞానస్నాన సంస్కారం వుంది. ఇది మనలను క్రీస్తుతో ఐక్యంజేస్తుంది. శ్రీసభ సభ్యులనుగా తయారుచేస్తుంది. ఈ శ్రీసభలో ఆరాధన జీవితమూ ప్రేమ జీవితమూ ప్రధానమైనవి. కనుక జ్ఞానస్నానం శ్రీసభలో ఓ భాగమైన క్రైస్తవ కుటుంబంకూడ ఈ యారాధన జీవితాన్ని సంపూర్ణంగా జీవించేలా జేస్తుంది. జ్ఞానస్నానాన్ని పరిపూర్ణం జేసేది భద్రమైన అభ్యంగనం. దీనిద్వారా క్రీస్తు తరపున ప్రపంచానికి సాక్ష్యమిస్తాం. పైగా ఈ సంస్కారం దంపతులు వివాహజీవితానికి సాక్ష్యమిచ్చేలాగూడ చేస్తుంది. అనగా భార్యాభర్తలు పరస్పరానురాగంతో జీవిస్తూ, విడివడని తమ క్రైస్తవ ప్రేమనుగూర్చి లోకం యెదుట సాక్ష్యమిస్తారు. బిడ్డలను కనిపెంచుతూ సంతానం దాంపత్యజీవితధ్యేయమని యెలుగెత్తి చాటుతారు. స్వార్ధప్రేమతో, విడాకులతో, కుటుంబ నియంత్రణతో కలుషితమైపోయిన నేటి కుటుంబజీవితానికి క్రైస్తవ దంపతులిచ్చే ఈ సాక్ష్యం ఎంతైనా అవసరం.

ఆమీదట దివ్యసత్రసాదముంది. ఇది క్రీస్తు ప్రేమను ప్రసాదించే సంస్కారం. దీనివలన దంపతులు క్రీస్తు ప్రేమను పొందుతారు. పరస్పర ప్రేమను పెంపొందించు కుంటారు. ఈ ప్రేమద్వారా ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరిపట్ల ఒకరు విశ్వాసంతో ప్రవర్తిస్తారు. వివాహంనాడు ఒకరి యెదుట ఒకరు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకొంటారు. ఒకరి కష్టాల నొకరు సానుభూతితో అర్థంజేసికొని ఒకరినొకరు ఓర్పుతో భరిస్తూ వుంటారు. దేహంలో జీవశక్తి యేలాంటిదో కుటుంబంలో ప్రేమశక్తి అలాంటిది. జీవాన్ని గోల్పోయిన దేహం శిధిలమైపోతుంది. ప్రేమను గోల్పోయిన కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. కుటుంబాలను నిలబెట్టేది దివ్యసత్రసాదం.

కట్టకడన పాపోచ్చారణముంది. ఇది నరుల తప్పిదాలను క్షమించి వాళ్ళ బలహీనతలనూ, లోపాలనూ చక్కదిద్దే సంస్కారం. దీనివలన దంపతులు స్వీయ పాపాలకు లోపాలకు ప్రభువునుండి క్షమాపణం పొందుతారు. పైగా, ప్రభు క్షమాపణను ఆదర్శంగా బెట్టుకొని ఒకరినొకరు క్షమించుకోవడంగూడ నేర్చుకుంటారు. ఒకరి బలహీనతల నొకరు జాలితో చక్కదిద్దుకోవడానికి అలవాటు పడతారు.

ఇక, పాపోచ్చారణం లాంటిదే ఆత్మశోధనం గూడ. దంపతులు చేసుకునే ఆత్మశోధనం వాళ్ళ అంతస్తునకు తగినట్లుగా వుండాలి, అనగా భార్యాభర్తలు తమ పరస్పర ప్రేమనుగూర్చి, తాము బిడ్డలను పెంచే విధానాన్ని గూర్చి కుటుంబ జీవితం ద్వారాలోకానికి తామిచ్చే సాక్ష్యాన్ని గూర్చి ఆత్మశోధనం చేసుకోవాలి. ఈ యాత్మశోధనను గ్రంథాంతంలో పొందుపరచాం గనుక దాన్ని వాడుకోవచ్చు.

కుటుంబజీవితం జీవించేవాళ్లు ఈ క్రైస్తవ సంస్కారాలపట్ల ఆదరాన్ని భక్తిని చూపుతూండాలి. వాటిని యోగ్యంగా పొందుతూండాలి. అలా పొందినట్లయితే కుటుంబ ప్రజలు ప్రభు దీవెనలు బడసి ప్రశాంతంగా జీవిస్తారు. పుణ్యమార్గంలో సాగిపోతారు.

ప్రార్ధనా భావాలు

1. సంయమనం

పౌలు తన లేఖల్లో భార్యాభర్తలకు సంయమనాన్ని బోధించాడు. కాలం చివరకు వచ్చిందిగనుక భార్య కలిగిన వాళ్లుకూడ భార్యలేనట్లుగా జీవించాలి అన్నాడు-1కొ 7,29. ప్రభువు రెండవ రాకడను మనస్సులో పెట్టుకొని అతడీలా వ్రాసాడు. ఈ లోక విషయాలూ, వాటితోపాటు వివాహంకూడా, ప్రభు రాకడకు తావీయాలి. అనగా లైంగిక జీవితమే ప్రధానం కాదని భావం. మరో తావులో పౌలు, ప్రార్ధనంచేసికొని భగవత్సాక్షాత్కారం కలిగించుకోవడం కోసం భార్యాభర్తలు కొంతకాలంపాటు ఒకరినొకరు సమీపించకుండా వుండడం మంచిదనికూడ సూచించాడు-1కొ7,5, ఇక్కడ లైంగికక్రియ చెడ్డదని కాదుగాని, భగవత్సాన్నిధ్యాన్ని కలిగించుకోవడంకోసం దాన్ని కొంతకాలం విసర్జించమన్నాడు. భార్యాభర్తలు లైంగిక విషయాల్లో సంయమనాన్ని పాటించాలి అనడానికి ఈ ఉదాహరణలు చాలు. ఉపవాసం చేసిన దేహం ఆరోగ్యంతో పనిచేస్తుంది. సంయమనానికి అలవాటుపడిన స్త్రీపురుషులు లైంగికక్రియలోని విలువను ఉదాత్తతను అధికంగా గుర్తిస్తారు. పైగా లైంగికక్రియ, లైంగికసుఖమే వివాహజీవితానికి పరమావధి అని బోధించే వెర్రివేదం నిలువజాలదని కూడ దంపతులు ఈ సంయమనంద్వారా తేల్చి చూపవచ్చు.

2. తిమోతి

తిమోతి పౌలు శిష్యుడు. పౌలు గతించిన తరువాత అతడు ప్రారంభించిన ప్రేషితకార్యాన్ని కొనసాగించిన ప్రేషితోత్తముడు. ఈ తిమోతి అమ్మమ్మ పేరు లోయి. ఆమె తిమోతి బాలుడుగా వున్నపుడే అతన్ని భక్తిమార్గంలో తీర్చిదిద్దింది. అతన్ని ఒడిలో కూర్చుండబెట్టుకొని వేదగ్రంథం చదివించింది. ప్రార్ధనం చేయడం నేర్పించింది-2తిమో 3,15, ఈలా కుటుంబంలోని పెద్దవాళ్ళవలన తిమోతికి చిన్ననాడే బైబులు గ్రంథంతో పరిచయం గలిగింది. తరువాత తిమోతి పెరిగి పెద్దవాడై చాలయేండ్ల గతించాక పౌలు అతనికి జాబు వ్రాస్తూ "నీవు చిన్ననాడే అలవాటుచేసికొన్న బైబులు పఠనాన్ని అశ్రద్ధ చేయవద్దు సుమా" అని హెచ్చరించాడు -1తిమొు 4, 13. మన కుటుంబం జపాల్లోకూడ బైబులు చదువుకొని ప్రార్ధనం చేసికొంటే ఎంత బాగుంటుంది! తిమోతిలాగ మన పిల్లలుకూడ చిన్ననాటినుండే బైబులు పఠనానికీ బైబులు ప్రార్థనకీ అభ్యాసపడితే యెంత ముచ్చటగా వుంటుంది! 3. దివ్యభోజనం

పునీత అగస్టీను తాను వ్రాసిన "కన్ఫెషన్సు" అనే గ్రంథంలో ఓ సంఘటనం చెప్పాడు. అగస్టీను యౌవనప్రాయంలో చాల పాడుజీవితం జీవించి ఆ పిమ్మట పరివర్తనం చెందాడు. కాని పరివర్తనం చెందాకకూడ అశుద్ధపు కోరికలు అతన్ని నిత్యమూ బాధిస్తుండేవి. ఓదినం అగస్టీను ఈ విషయాన్ని ప్రభుసన్నిధిలో నివేదించుకొని ప్రార్ధనం చేసికొంటూండగా అతని అంతరాత్మలో ఓస్వరం వినిపించింది. "నీవు నా శరీరాన్ని చేకొని భుజించు, నీ బాధలు తీరిపోతాయి. కాని ఈ భోజనం మాత్రం నరులను నా లోనికి మారుస్తుంది" అని ప్రభువు అతనితో సెలవిచ్చాడు. తరువాత అగస్టీను దివ్యభోజనాన్ని యోగ్యంగా స్వీకరించి ఆ యశుద్ధపు కోరికలను అరికట్టగల్లానని తన గ్రంథంలో వ్రాసికొన్నాడు. జీవితంలో కష్టాలను ఎదుర్కొనేపుడు మనంకూడ సంస్కారాలద్వారా, విశేషంగా దివ్యభోజన సంస్కారంద్వారా, ఈ శక్తినే పొందవచ్చు. కనుక దంపతులు క్రైస్తవ సంస్కారాలను యోగ్యంగా స్వీకరించి తమ జీవితాన్ని భక్తిమంతంగాను శక్తిమంతంగాను తీర్చిదిద్దుకోవాలి.

4 అక్విలా, ప్రిస్కా

పౌలు క్రీస్తును బోధించడంకోసం కోరింతు పట్టణానికి వచ్చాడు. ఆ నగరంలో అక్విలా, ప్రిస్కా అనే యూద క్రైస్తవ దంపతులు వుండేవాళ్ళు వాళ్లు గుడారపు బట్టలు నేసికొని జీవిస్తుండేవాళ్లు. పౌలు కోరింతులో వున్నంతకాలం ఈ దంపతుల ఇంటిలోనే తలదాచుకున్నాడు. వీళ్ళతోపాటు తానూ గుడారాల బట్టలు నేసాడు. ఈ దంపతులు పౌలునుండి క్రీస్తును నేర్చుకున్నారు. తాము నేర్చుకున్న క్రీస్తును ఇతరులకు బోధించారు. తమ బోధలద్వారానైతేనేం, తాము జీవించే ఆదర్శ క్రైస్తవ జీవితంద్వారానైతేనేం క్రీస్తునకు సాక్ష్యమిచ్చారు. పౌలు తనజాబుల్లో ఈ దంపతులను ఎంతో ఆదరపురస్కారాలతో పేర్కొన్నాడు - రోము 16,3-4. ఈలాగే మన క్రైస్తవ దంపతులుకూడ భక్తిమంతమైన జీవితంద్వారా క్రీస్తునకు సాక్ష్యమిస్తుండాలి.

10. వివాహ జీవితంగూడ పిలుపే

1. వివాహ జీవితంగూడ పిలుపే

మామూలుగా మనం గురుజీవితం, కన్యాజీవితం దేవుని పిలుపు అనుకొంటాం. కాని వివాహ జీవితంగూడ దేవునిపిలుపే. అసలు దైవప్రజలందరికి పిలుపు వుంటుంది. ఆ పిలుపులో అంతర్భాగాలే గురుజీవితం, వివాహజీవితం మొదలైనవి. వివాహితులుకూడ పవిత్రజీవనం గడపాలి. వివాహ అంతస్తుకి తిరుసభలో ప్రత్యేకమైనస్థానం వుంది. తిరుసభలో పలురకాల జీవిత విధానాలు వున్నాయి, వీటన్నిటిని నియమించిన వాడు ప్రభువే. వివాహ వ్యవస్థ కూడ ఓ జీవిత విధానం. దాన్ని ఏర్పరచినవాడు క్రీస్తే, కనుక అదికూడ ఓ పిలుపే. వివాహ వ్యస్థ ఓ దేవద్రవ్యానుమానంచే పరిపూరితమైంది. అది తిరుసభలో క్రీస్తు ద్వారా నూత్నజీవాన్ని కొనివస్తుంది. ఈ వ్యవస్థను చేపట్టే భార్యాభర్తలు ప్రత్యేకమైన పద్ధతిలో పవిత్రులు కావాలి.

భగవంతుడు అందరినీ గురు కన్యాజీవితాలకు పిలువడు. చాలమందిని వివాహ జీవితాలకే పిలుస్తుంటాడు. క్రైస్తవుల్లో నూటికి 99శాతం వివాహితులేగదా! ఈ వివాహ వ్యవస్థను బైబులు పలుతావుల్లో వర్ణిస్తుంది. “దేవుడు తన్ను పోలునట్లుగా మానవజాతిని సృజించాడు. స్త్రీపురుషులనుగా మానవులను చేసాడు. వారిని దీవించి మీరు బిడ్డలను పెక్కండ్రను కని వృద్ధిజెందండని చెప్పాడు" - ఆది 127-28. "మా పితరులు దేవుడవైన ప్రభూ! నీకు సుతి కలుగునుగాక నీవు ఆదామును సృజించావు. అతనికి భార్యగాను, ఆదరవుగాను, తోడుగాను ఉండడానికి ఏవను చేసావు. వారినుండి మానవజాతి ఉద్భవించింది” తోబీతు 6,5–6. "ప్రారంభంనుండి సృష్టికర్త భార్యాభర్తలను స్త్రీ పురుషలనుగా సృజించాడు. ఈ కారణంచేత పురుషుడు తల్లిదండ్రులను విడనాడి భార్యను హత్తుకుని వుంటాడు. వాళ్ళిద్దరూ ఏకశరీరులై యుంటారు - మత్త 19,4-5.

వాటికన్ మహాసభ ఈలా బోధించింది. భార్యాభర్తలు క్రీస్తుకీ తిరుసభకూ గల ఐక్యతను ప్రేమను జ్ఞప్తికి తెస్తుంటారు. వాళ్లు పరస్పర ప్రేమతో కలసిమెలసి జీనించడం ద్వారాను, బిడ్డలను కనిపెంచడంద్వారాను పవిత్రులౌతారు. తిరుసభలో వాళ్ళకు ఓ ప్రత్యేకస్థానం వుంది.

వివాహ వ్యవస్థకూడ ఓ ప్రత్యేక పిలుపు అనడానికి ప్రధాన కారణం ఇది. దేవుడు తిరుసభలో కొందరు నరులకు ఓ ప్రత్యేకమైన పని ఒప్పజెప్తాడు. ఆ పని సక్రమంగా జరగడానికిగాను ఓ ప్రత్యేక దేవద్రవ్యానుమానమూ వరప్రసాదమూ వారికి తోడ్పడేలా చేస్తాడు. మనం ఆ నరులు దేవునినుండి ప్రత్యేకమైన పిలుపుని పొందారని చెప్తాం. ఐతే వివాహ వ్యవస్థలో జ్ఞానస్నానం పొందిన స్త్రీ పురుషులిద్దరికీ దేవుడు ప్రత్యేకమైన పనిని ఒప్పజెప్తాడు. ఆపని క్రీస్తు తిరుసభల ఐక్యతను సూచించడం, సంతానాన్నికని మానవజాతిని అభివృద్ధిచేయడం. ఈ పనిని సాధించడానికిగాను వివాహ దేవద్రవ్యానుమానమూ ప్రత్యేక వరప్రసాదమూ, వాళ్ళకు సాయంజేస్తూంటాయి. కనుక వివాహ వ్యవస్థకూడ ప్రత్యేకమైన పిలుపే.

2. వివాహ జీవితమూ బ్రహ్మచర్య జీవితమూ

గురువులు మఠకన్యలు గడిపే బ్రహ్మచర్య జీవితానికి ప్రత్యేకమైన విలువ వుంది. ఈలాంటి జీవితం మోక్షంలో మనకు భగవంతునితో సిద్ధించే ఐక్యతను సూచిస్తుంది. దీనికి భిన్నంగా వివాహ వ్యవస్థ ఈ లోకంలో క్రీస్తుకి తిరుసభతో వుండే ఐక్యతను సూచిస్తుంది. కనుక ఒకటి పరలోకంలోని ఐక్యతను సూచిస్తే, మరొకటి ఈలోకంలోని ఐక్యతను తెలియజేస్తుంది. గురు జీవితానికి వివాహ జీవితానికీ ఈ వ్యత్యాసం వుంది. గురుజీవితం తిరుసభలో దైవారాధనను కొనసాగించడానికి వుంది. గురువుకి అక్షయమైన ముద్రకూడ లభిస్తుంది. వివాహ జీవితంలో అక్షయమైన ముద్ర యేమీలేదు. భార్యాభర్తలు మాత్రం తమ జీవితకాలమంతా కలసిమెలసి జీవిస్తారు. వివాహ జీవితం బిడ్డలను కనడానికీ, ఆ బిడ్డలను తిరుసభ బిడ్డలనుగా తయారుచేయడానికీ వుంది. వారిని దైవప్రజలనుగాను దేవుని కుటుంబ సభ్యులనుగాను చేయడానికి వుంది. కనుక గురుజీవితం దైవరాధనకొరకు, వివాహజీవితం మానవజాతి మనుగడను ఈ భూమిపై కొనసాగించడం కొరకు.

3. వివాహ జీవితానికి పిలుపు

ఎవరైనా వివాహ అంతస్తులో ప్రవేశించవచ్చు. "మీరు పెక్కండ్రు బిడ్డలను కని వృద్ధిచెందండి" అన్న తొలి ఆజ్ఞను దేవుడు నరులందరికీ యిచ్చాడు - ఆది 1,28. ఐతే దేవుడు వివాహము అంతస్తుకిపిల్చే నరుని హృదయంలో ఆ వివాహంపై బలమైన కోరిక పుట్టిస్తాడు. అతన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులద్వారా, కొందరు ప్రత్యేక వ్యక్తులద్వారా ఓ నిర్ణీతవ్యక్తిదగ్గరికి నడిపిస్తాడు. చివరన వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది. వివాహపు అంతస్తులో ప్రవేశించకముందు స్త్రీపురుషులు తమ హృదయంలోని కోరికలను పరిశీలించి చూచుకోవాలి. దేవుని చిత్తాన్ని గుర్తించాలి. ఆ దేవుడు తనకు నిర్ణయింపబోయే భాగస్వామిని పెద్దలు మిత్రులు మొదలైనవారి సహాయంతో గుర్తుపట్టాలి. ఈలా గుర్తుపట్టటానికి మన తరపున మనకు ప్రార్థన ఆలోచన రెండూ అవసరమే. గురువులను మఠకన్యలనులాగే వివాహితులనుగూడ ప్రభువు ఓ ప్రత్యేక పద్ధతిలో పిలుస్తాడు. ఒక ప్రత్యేక పురుషుణ్ణి ఒక ప్రత్యేక స్త్రీతో జతగూరుస్తాడు. అందరి వివాహాలను ముందుగా నిర్ణయించేది ఆ ప్రభువే.

4. వివాహజీవితమూ పావిత్ర్యమూ

వివాహజీవితం గడిపేవాళ్ళుకూడ పవిత్రంగా జీవిస్తారని చెప్పాం. కాని వివాహితుల ప్లావిత్ర్యం వేరు. గురువూ మఠకన్యా ఈలోక విషయాలలోగాక పరలోక విషయాల్లో నిమగ్నులై యుండాలి. వాళ్ళది ప్రధానగా నివృత్తిమార్గం. అనగా లౌకిక విషయాలనుండి వైదొలగడం. ఈలాకాక వివాహితులు ఈలోక విషయాల్లో నిమగ్నులౌతుండాలి. భూమండలమంతట వ్యాపించి దాన్ని వశపర్చుకోండి అన్న వేదవాక్యం ప్రధానంగా వాళ్ళకు వర్తిస్తుంది - ఆది 1,28. వాళ్ళది ప్రధానంగా ప్రవృత్తి మార్గం. అనగా ఈలోక విషయాల్లో మునిగి వుండడం. వివాహ పావిత్ర్యం భార్యాభర్తలు ఇద్దరు కలసి సాధించేది. లైంగికమైంది. ఐనా శారీరక వ్యామోహాలను జయించేది. క్రీస్తు వరప్రసాదం ద్వారా జంతుప్రేమను దివ్యప్రేమగా మార్చుకొనేది సంతానంవైపు దృష్టి సారించేది. కుటుంబగతమైది. సామూహికమైంది. క్రీస్తు మనుష్యావతారమెత్తి ఈ భౌతిక ప్రపంచాన్ని పునీతం చేసాడు. వివాహ పావిత్ర్యం ప్రధానంగా ఈ భౌతికలోకానికి చెందింది.

ప్రార్ధనా భావాలు

1. వివాహం గొప్పతనం

రెండవ శతాబ్దంలో జీవించిన టెర్టూలియన్ అనే వేదశాస్త్రి పెండ్లిని మెచ్చుకుంటూ ఈలా వ్రాసాడు. "వివాహం ఔన్నత్యాన్ని ఏనాడూ చాలినంతగా కొనియాడలేం. తిరుసభ ఆ సంస్కారాన్ని జరిపిస్తుంది. పూజబలి ఈ దేవ ద్రవ్యానుమానాన్ని ధ్రువపరుస్తుంది. గురువు వధూవరులను ප්‍රජිරිඳධබ්දක. వివాహ సాంగ్యంలో దేవదూతలే సాక్షులుగా నిల్చివుంటారు. పరలోకంలోని పితే వివాహాన్ని స్థిరపరుస్తాడు." ఇవి ప్రేరణం పుట్టించే వాక్యాలు కదా!

2. వివాహం తక్కువది కాదు

4వ శతాబ్దంలో మానిక్కీయులనే పతితవాదులు వివాహాన్ని ఈసడించుకొన్నారు. అది కేవలం శరీరానికి సంబంధించింది కనుక నికృష్టమైంది అన్నారు. జీవమిచ్చేది ఆత్మ శరీరం నిప్రయోజనమైంది - యోహా 6,63. రక్తమాంసాలు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు - 1కొ 15,50 మొదలైన వాక్యాలను ఉదహరించి వాళ్ళు పెండ్లిచెడ్డదని వాదించారు. కాని ఇది పొరపాటు, క్రీస్తు శరీరధారియై మన శరీరాన్ని పవిత్రం జేసాడు. వివాహ సంస్కారం క్రీస్తు మనుష్యావతారంమీద ఆధారపడి పనిచేస్తుంది. 5. తిరుకుటుంబం మరియూ యోసేపుల వివాహం పరమ పవిత్రమైంది. దానిలో లైంగిక ప్రక్రియమాత్రం లేదు. మరియ గర్భాన క్రీస్తు జన్మించడం పవిత్రకార్యం. తిరుకుటుంబం ఎల్లప్పడు మన Sšiš కుటుంబాలకు ఆదర్శంగా వుండాలి 4.పెండ్లి వంగరం

పదియవ భక్తినాథ పాపగారు అర్చ్యశిష్ణులు. ఆయన ఒకసారి తనచేతి వంగరాన్ని తల్లికి చూపించి అమ్మా! నీవు ఈ వంగరం ఘనతను గుర్తించావా అని అడిగాడు. 48 వెంటనే తల్లి తన వ్రేలి ఉంగరాన్ని కుమారునికి చూపించి నాయనా! ఈ వుంగరం లేకపోతే నీవసలు పట్టివుండేవాడివే కాదు అంది. వివాహంద్వారా దైవసేవకు అంకితమయ్యే గురువులనూ మఠకన్యలనూ కనే తల్లిదండ్రులు ధన్యులు కదా! 5. పురాతన వ్యవస్థ వివాహ వ్యవస్థ మానవజాతి ఎంత ప్రాచీనమైందో అంత ప్రాచీనమైంది. సృష్ట్యాదిలోనే దేవుడు "నరుడు ఒంటరిగా జీవించడం మంచిదికాదు" అనుకొన్నాడు - ఆది 2,18. "మీరు బిడ్డలను పెక్కండ్రనుకని వృద్ధిచెంది భూమండలమంతట వ్యాపించండి" అన్నాడు-1,28. ఆనాడే వివాహ వ్యవస్థకూడ ఏర్పడింది. ప్రాచీనమూ పవిత్రమూ ఐన ఈ వ్యవస్థను మనం అతిగౌరవంతో చూడాలి.

11. యువతీ యువకులు

1. వివాహమాడబోయే యువతీయువకులు

వివాహం చేసుకోబోయే యువతీ యువకులు తీయని కలలు కంటూంటారు. భావిజీవితాన్ని గురించి గొప్పగా తలంచుకోవడం మంచిదే. కాని మన భావాలు భావిలో సిద్ధించే భార్యనుగాని, భర్తనుగాని యథార్థంగా అర్థంజేసికొనేలా వండాలి. కాని వివాహానికి ముందే యువకుని గూర్చి యువతి, యువతిని గూర్చి యువకుడు, కొన్ని స్పష్టమైన భావాలు ఏర్పరచుకోవాలి.

2. దైవరూపం

యువకునిలాగే యువతికూడ దేవుని ప్రతీబింబం. దేవుని బిడ్డ. అతనితోపాటు ఆమెకూడ ఒకనాడు దేవుని చేరాలి-ఆది 127. ఇక ఆమెలాగే అతడూ దేవుని పోలికగా సృజింపబడ్డాడు. అతడూ దేవుని పత్రుడు. దేవుని చేరి ఆనందించవలసినవాడు. నరునిలోని యీ దేవుని పోలికను మననం జేసికొన్న యువతీ యువకులు ఒకరు విలువను ఒకరు చక్కగా గుర్తిస్తారు.

3. సహాయకురాలు - అధిపతి

ఆమెను నరునికి సహాయకురాలినిగా అనుగ్రహించాడు ప్రభువు - ఆది 2,18. అనగా ఆమె పురుషునికి సహచారిణి. ఆమె లేందే అతడు పరిపూర్ణ మానవుడు కలేడు. ఆమెతో ఐక్యమైతేనేగాని అతడు తన సృష్ణ్యాశయాన్ని సాధించలేడు. బిడ్డల్ని కని సంతానరూపంలో తన జీవితాన్ని పొడిగించుకోలేడు. అంచేత అతడు నిత్యం ఆమెమీద ఆధారపడుతూ వుండాలి. ఆమె గృహిణి. కాని అతడు గృహపతి. ఆమెకు శిరస్సు, అధిపతి - 1కొరి 113. ఆమె అతని దేహాన్నుండి కలిగింపబడింది. ఆమె ఉనికి అతనికోసం. కావున స్త్రీ ఓ దేహంలాంటిది. ఆ దేహానికి శిరస్సులాంటివాడు పురుషుడు - ఎఫె 5,28. బైబుల్లో శిరస్సు ఆధిపత్యాన్ని నాయకత్వాన్ని సూచిస్తుంది. కావున స్త్రీపై ఆధిపత్యం చూపేవాడు పురుషుడు. గాని ఈ ఆధిపత్యం క్రీస్తు శ్రీసభపట్లచూపే ఆధిపత్యం లాంటిదేఎఫే 5,23. బైబుల్లో ఆధిపత్యం చూపడమనగా ఓ వ్యక్తిపై అధికారం చెలాయించడంకాదు. మరి ఆ వ్యక్తి శ్రేయస్సుకోసం పాటుపడ్డం; ప్రేమభావంతో ఆ వ్యక్తిని ఆదరించడం. క్రీస్తు శ్రీసభను ఇలా ఆదరించాడు. భర్తకూడ భార్యను యీలా ఆదరించాలి. వివాహజీవితంలో పురుషుడేమో అధిపతే, స్త్రీయేమో విధేయురాలే - ఎఫే 5,24. కాని యీ యాధిపత్య విధేయతలు ప్రేమ అనే పునాదిపై నిలవాలి.

4. ఆమె తల్లి, అతడు తండ్రి

స్త్రీ భార్యగా, తల్లిగా, సార్ధక్యం పొందుతుంది. కావున పురుషుడు ఆమెను భార్యగా స్వీకరించాలి. "నా బిడ్డల తల్లి" అన్న భావంతో ఆమెను గౌరవించాలి. బైబులు చివరి గ్రంథములోని s మగబిడ్డని గని మన్నన పొందుతుంది-దరు 12,5. రాహేలు బిడ్డలనీయమని భర్త యాకోబును పీడిస్తుంది - ఆది 30,1. యువకునికి భార్య దొరికినప్పుడు అన్ని మేలులూ కలిగినట్లే - సామె 18,22 ఆమె అతనికి సహాయకురాలు. వృద్దుడు ఊతకట్టమీదలా, అతడూ ఆమెమీద ఆనుకొని నడుస్తాడు. పక్షి గూటిలో నివసించినట్లు ఆమెతో కాపురం ఏర్పరచుకొని ఓ యింట్లో నివసిస్తాడు. ఓ యింటివాడు ఔతాడు - సీరా 37,24-26. ఆమె భార్య, తల్లి కాబోతుందన్నాం. అతడూ భర్త, తండ్రి కాబోయేవాడు. అతని తాతతండ్రులూ, అతనూ తన బిడ్డలయందు కొనసాగిపోతారు. తల్లిదండ్రులం కాబోతున్నాం అనే భావం యువతీయువకుల మనస్తత్వానికి లోతుతనాన్ని నిబ్బరపు గుణాన్ని ఇస్తుంది.

5. కన్య-గురువు

ఇంతవరకూ పూర్వవేదం సూచించిన భావాలు చూచాం. కాని నూత్నవేదం స్త్రీ విషయంలో మరో గొప్ప ఆదర్శాన్నిగూడ సూచించింది. ఆమె భార్యగా, తల్లిగా మాత్రమేగాక కన్యగాగూడా తన ఆశయాన్ని సాధించుకుంటుంది. వివాహిత భర్తనేలా సంతోషపెట్టాలా అనే రేయింబవళ్లు భర్త విషయాలతో సతమతమౌతూ వుంటుంది. కాని అవివాహితయైన మఠకన్య ప్రభువునేలా సంతోషపెట్టాలా అని అహోరాత్రులు ప్రభు విషయాలతో సతమతమౌతూ వుంటుంది. ఈలా కన్యాజీవితం ద్వారా గూడ స్తీ ధన్యురాలు ఔతుంది-1కొ 7,34. ఈలాంటి ఉత్తమ స్త్రీ మరియమాత. ఆమె యందు స్త్రీ ధర్మాలన్నీ కార్యసిద్ధినందాయి. స్త్రీ భార్యగా మాతగా మాత్రమేగాక, కన్యగాకూడ ధన్యురాలు ఔతుంది అన్నాం. అలాగే పురుషుడూ తండ్రిగా భర్తగా మాత్రమేగాక, అవివాహితుడుగాగూడ ధన్యుడౌతాడు. కాని ఈ యవివాహితత్వం ప్రభువుకోసం ; ప్రభు సామ్రాజ్య వ్యాప్తికోసం, ప్రభువు పునీత ప్రజల్ని పీఠం చుటూ సమావేశపరచి దివ్యభోజనంతో పోషించడంకోసం. అనగా అతడు ప్రభుస్థానే నిలచే గురువు - మత్త 19,12; 1కొ 7,32-33.

6.సవరింపులు

యువతినిగూర్చి యువకులదృష్టి రెండు విపరీతమార్గాల పోవచ్చు. 1. స్వర్గలోకంలోంచి ఊడిపడిందో అన్నట్లు ఆమెను ఓ దేవతలా భావించడం, లేనిపోని గొప్పలు, వట్టి ఆశయాలు ఆమెకు అంటగట్టటడం. ఇది కవులు మొదలయిన కళాకారులు చేసేపని. ఇలాంటి భావాలుగల యువకులు కొద్దిరోజుల్లోనే నిజం తెలుసుకుని నిరుత్సాహపడతారు. 2. మరికొంతమంది యువకులు ఆమెను జంతు దృష్టితో చూస్తారు. తమలోని కామప్రవృత్తికి ఆమెను బలివస్తువుగా వాడుకోగోరుతారు. ఈలాంటివాళ్ళకూడా అచిరకాలంలోనే అపజయాన్ని పొందుతారు.

పెండ్లి చేసుకునే యువకుడు యువతి విషయంలో యథార్థంగా పెంపొందించు కోవాల్సిన భావాలు రెండు. 1. ఆమె తనకు సహాయురాలు ; స్నేహితురాలు ; సహచారిణి. 2. అతడు తన బిడ్డలకు తండ్రియైనట్లే, ఆమెకూడ బిడ్డలకు తల్లి.

ఇక యువకుని విషయంలో యువతుల దృష్టికూడ రెండు విపరీత మార్గాల పోవచ్చు. 1. అతనికి పూర్తిగా వశపడిపోయి ఓ బానిసలా ప్రవర్తించడం. అతడు చేసే మంచిపనికీ, చెడు పనికీ సమ్మతిస్తూ వుండడం. అతడే పతి, గతి, దేవుడు అని స్తుతిస్తూ వుండటం. ఈలాంటి ప్రతివ్రతలు వ్యక్తిత్వం లేనివాళ్లు ఈలాంటి పాతివ్రత్యాన్ని బైబులు ఆమోదించదు. అదృష్టవశాత్తు నేటి స్త్రీలలో ఈలాంటి వెన్నెముకలేని పతివ్రతలు తక్కువమంది. 2 మాటిమాటికి అతనితో పోటీపడ్డం. నీవు ఎక్కువేమిటి, నేను తక్కువేమిటి అనడం. నేనూ నీయంతటిదాన్ని సుమా అన్నట్లు ప్రవర్తించడం. ఈలాంటి స్త్రీ భర్త జీవితాన్ని దుఃఖంపాలు చేస్తుంది. అతని హృదయాన్ని వ్యధతో నింపివేస్తుంది. పెండ్లి చేసుకొనే యువతి యువకుని విషయంలో పెంపొందించుకోవాల్సిన ప్రధానభావాలు రెండు. 1. ఉత్తమ క్రైస్తవ స్త్రీ భర్తకు ముందుగా నడువదు. భర్తతో సరిసమానంగా ప్రక్కన నడుస్తుంది. కొన్నిసార్లు అణకువతో అతని వెనుకకూడ నడచిపోతూంటుంది. 2. కాని అతడు త్రోవతప్పినపుడెల్ల మెల్లగా పిలుస్తూంటుంది. మృదువుగా భుజాలు తట్టుతూంటుంది. అతడు మళ్ళా త్రోవలో నడిచేలా చేస్తూంటుంది. అతడు అధిపతి, ఆమె సహాయురాలు.

తొలి స్త్రీ ఏవ ఆదాము ఎదుట నిలిచింది. శ్రీసభ తన భర్త క్రీస్తు ఎదుట నిలిచింది. వీళ్ళకు పోలికగా వుండే క్రైస్తవ భార్యకూడ తన భర్త ఎదుట నిలుస్తుంది. అతడు ఆమెవైపు తేరిపారజూస్తాడు. ఆమెకూడ అతనివైపు కన్నులెత్తి చూస్తుంది. అతడు ముందు వెళ్తూటే అతని ప్రక్కన తాను పోతూంటుంది. వాళ్ళిద్దరి వెంటా బిడ్డలు సాగిపోతారు. ఇది మానవుల మహాయాత్ర.

ప్రార్థనా భావాలు

1. ఈసాకు - రిబ్కా

అబ్రాహాము కొడుకు ఈసాకు. ఇతనికి వధువును వెదకడంకోసం అబ్రాహాము సేవకుడు యజమానుని జన్మదేశానికి వెళ్తాడు. ఆ దేశంలో తనకు ఎదురుపడే బాలికయే ఈసాకునకు భార్య కావాలని ప్రార్ధిస్తాడు. అతడు కోరినట్లే రిబ్కా అనే బాలిక బావియొద్ద యెదురుపడి సేవకునకు అంతని యొంటెలకు నీళ్ళు తోడియిస్తుంది. తరువాత ఈసాకు, రిబ్కాలకు వివాహం జరిగిపోతుంది. ఈ రీతినే మన వివాహాలు కూడ కొంతవరకు దైవనిర్జీతాలు. ప్రభువు మనకోసం ఉద్దేశించిన యువతి లేక యువకుడు ఎక్కడో పెరుగుతూనే వుండాలి - ఆది 24,42-44.

2. మీకాలు - రాహేల

ఒకోమారు యువతీయువకులు తమకిష్టం వచ్చినవారిని పెండ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. కాని ఈ నిర్ణయం తల్లిదండ్రులకు సరిపడదు. ఐనను ప్రత్యక్షదోషముంటేనే తప్ప బిడ్డల నిర్ణయాన్ని తల్లిదండ్రులు కాదనకూడదు. సౌలు కుమార్తె మీకాలు దావీదును ప్రేమించి అతనిని వివాహం చేసికోగోరింది. దావీదంటే సౌలునకు గిట్టదు. ఐనా అతడు ఈ వివాహాన్ని కాదనలేదు -1సమూ 18,20. యాకోబు రాహేలును ప్రేమించి ఆమెకోసం ఏడేండ్లు లాబానుకు సేవలుచేసాడు. లాబాను తొలుత ఇష్టపడలేదు. " ఐనా తర్వాత వాళ్ళ వివాహం యధావిధిగా సాగిపోయింది-ఆది 29,15-20 3. ప్రభు మార్గాలు యువతీయువకులు తల్లిదండ్రులపట్ల విధేయతను చూపుతూండాలి. తల్లిదండ్రులూ బిడ్డల కోర్మెలను మన్నిస్తూ వాళ్ళ కోపాన్ని రెచ్చగొట్టకుండా వుండాలి. చిన్ననాటినుండి బిడ్డలను ప్రభుమార్గంలో నడుపుతూ వుండాలి - ఎఫె 6,1-3. 4. ఈ దేహం :

  ఈ దేహం జ్ఞానస్నానం ద్వారా క్రీస్తుతో ఐక్యమౌతుంది
  ఈ దేహాన్ని ప్రభువు నెత్తురు బిందువులు చిందించి రక్షించాడు 
  ఈ దేహం ప్రభు దేహంతో పోషింపబడుతుంది. 
  ఈ దేహం పవిత్రాత్మకు ఆలయం 
  ఈ దేహం ఉత్తానమై మళ్ళా ప్రభు సన్నిధిలో నిలుస్తుంది. 
  ఈ దేహం ప్రభువుకోసం ఉద్దేశింపబడింది, ప్రభువుది. 
  ఈ దేహాన్ని- అది స్త్రీ దేహమైనాసరే పురుష దేహమైనాసరే - కామ దృష్టితోగాక పవిత్రదృష్టితో చూడాలి. 

5 పరస్త్రీలు భక్తులైన హైందవ కవులు పరస్త్రీలను మాతృదృష్టితో జూడమన్నారు. బమ్మెర పోతరాజుగారి ప్రహ్లాదుడు :

  "కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన 
  మాతృభావన సేసి మరలువాడు".

రావిపాటి త్రిపురాంతకుడనే పదునాల్గవశతాబ్ద కవి అంబికాదేవిని యిలా ప్రార్థించాడు.

 లాచి పరాంగనల్ వరవిలాస మనోహర విభ్రమంబులన్ 
 జూచిన జూడ డుత్తముడు, చూచిన జూచును మధ్యముండు, దా
 జూచిన చూడకుండినను జూచు కనిష్పడు;వీరిలోననన్
 జూచిన చూడకుండు గుణి జూచిన చూపన చూడు మంబికా!

6. ఉత్తమ దాంపత్యం ఉత్తమ రామచరితంలో భవభూతి ఉత్తమ దాంపత్యాన్ని ఈలా వర్ణించాడు : “ఉత్తమ దంపతులు సుఖ దుఃఖాలు సమంగా పంచుకుంటారు. కలిమిలోనూ, లేమిలోనూ

ఇద్దరూ కలసే వుంటారు." (అద్వైతం సుఖదుఃఖయోః అనుగతం సర్వాసు అవస్థాసు).

12. వివాహ ప్రయత్నాలు

ముందటి అధ్యాయంలో వివాహమాడబోయే యువతీ యువకులు పరస్పరం పెంపొందించుకోవలసిన భావాలను వివరించాం. ఈ యధ్యాయంలో వాళ్లు వివాహనికి ఎలా తయారుకావాలో తెలియజేయబడుతుంది. వివాహానికి ముందు యువతీయువకులకు పరస్పర పరిచయం వుంటే మంచిది. తాము వివాహమాడబోయే వ్యక్తిని పూర్ణస్వాతంత్ర్యంతో తామే ఎన్నుకోవడంగూడ అవసరం. వివాహానికి ముందు కొంత ఉపదేశంకూడ వుండాలి. కనుక యూ మూడంశాలను గూర్చి ఇచ్చట ముచ్చటిద్దాం. నేడు మన పెద్దలు దేశమంతటా వివాహ సలహా కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఈ వివాహ సలహాలను మనసులో పెట్టుకునే ఈ యధ్యాయం తయారుచేసాం.

1. యువతీ యువకుల పరిచయాలు

మన ప్రాచీన భారతీయ సమాజంలో యువతీయువకుల పరిచయాలంటూ వుండేవిగావు. కాని నేడు పాశ్చాత్యభావాల వల్ల మన సమాజం చాలవరకు మారిపోయింది. విద్యా సంస్థల్లోనైతేనేం, వివిధ కార్యరంగాల్లోనైతేనేం మన యువతీ యువకులు కలసిపోవడం జరుగుతూంది. ఈ సమ్మేళనాన్ని మనం నివారించలేం. నివారించకూడదు గూడ. ఎందుకంటే ఈ పరిచయం భావిజీవితానికి చాల ఉపకరిస్తుంది. ఈ పరిచయంద్వారా యువతీయువకులు ఒకరినొకరు తెలిసికొని అర్థంచేసుకుంటారు, ఒకరినొకరు సానుభూతితో అంగీకరిస్తారు. నరుని మానసిక జీవితానికి ఇది చాలా అవసరం. కనుక నాయకత్వపు క్యాంపులు, సాంఘికసేవాశిబిరాలు, వినోదకార్యక్రమాలు మొదలైనవి ఏర్పాటుచేసి మన యువతీ యువకులకు పరస్పరం పరిచయం కలిగిస్తూ వుండాలి.

ఇక పెద్దలు జాగ్రత్తగా ఏర్పాటుచేసిన పరిచయ మార్గాలవల్లనైతేనేం, లేక తమంతట తామే పరిచయాలు పెంపొందించుకోవడంవల్లనైతేనేం మన యువతీయువకులు చాలమంది చనువుతో మెలుగుతూంటారు. కాని, ఈ చనువులు ఎంతవరకు పోవచ్చు? యువతీయువకులు పరిచయాలు, స్నేహాలు, భావి స్త్రీ పురుషులు కాబోయేవాళ్ళు ఒకరినొకరు అర్థం జేసికోవడానికి ఉద్దేశింపబడినవి గనుక చాల నిర్మలంగా వుండాలి. జంతుప్రవృత్తికి, దుష్టచేష్టలకు దారితీయకూడదు. ఇది చాల ముఖ్యమైన అంశం గనుక ఒకింత విపులంగా వివరించడం మంచిది.

మొదట యువతీ యువకుల మనోభావాలు పరిశీలిద్దాం. యువతి నిత్యం తన భావిజీవితాన్ని గూర్చి, విశేషంగా తన వివాహాన్ని గూర్చి ఆలోచిస్తూ వుంటుంది. ప్రాయం వచ్చేకొద్దీ ఆమెలో అందచందాలు, ఆకర్షణా గోచరిస్తాయి. ఆమె వస్త్రధారణ విధానం, నడకతీరు, ముఖభంగిమలు, మాటలాడే వైఖరి యువకులను ఆకర్షిస్తాయి. తనలోని ఈ యాకర్షణను యువతి వెంటనే గుర్తిస్తుంది. గర్విస్తుందికూడ. కొందరు యువతులు ఈ యాకర్షణను యువకులమీద ప్రయోగించిచూడాలని కూడ కోరుకొంటూంటారు. కాని ఈ ప్రాయంలో ఆమెకు లైంగికవాంఛ అంతగా ఉండదు. ఇక యిదే ప్రాయంలో వున్నా కూడ యువతికున్నంత మానసిక పరిపక్వత యువకునికుండదు. వివాహాన్ని గూర్చికూడ అతడంతగా ఆలోచించడు. ఓ ఉద్యోగాన్ని నంపాదించాలని మాత్రం ఉవ్విళ్ళూరుతూంటాడు. కాని యువతికంటె యువకునికి లైంగికవాంఛ బలంగా వుంటుంది. అతనికి సత్వరంగా వివాహం చేసికోవాలి అనేకోరిక లేకపోయినా యువతిస్నేహం కోసమూ, ఆడపిల్లల అందచందాలను అవలోకించడం కోసమూ ఉవ్విళ్ళూరిపోతూంటాడు. ఇవి యువతీ యువకుల మనస్తత్వాలు. ప్రాయం వచేకొద్దీ ప్రకృతే యువతీయువకుల్లో ఈలాంటి మనస్తత్వాలను సృజించి వాళ్ళను బలంగా ఆకర్షిస్తూంటుంది. కనుక ఇక్కడ ఆశ్చర్యపడవలసిన విషయమేమీలేదు.

ఇక, యౌవనప్రాయంలోని మానసిక భావాలను అనుగుణంగా మన యువతీ యువకులు కొన్నిసద్భావాలను పెంపొందించుకోవాలి. యువకుడు యువతికూడ తనలాగే ఓ మానుషవ్యక్తి అనుకోవాలి. ఆమెపట్ల గౌరవంగా ప్రవర్తించాలి. ఆమెనెప్పడూ భోగ్యవస్తువుగా భావింపగూడదు. స్త్రీ పురుషులనే జట్టునకు తాను నాయకుడు కావాలి. తన బాధ్యత చాల గొప్పది. కనుక అతడు దుష్టవాంఛలకు పశు ప్రవృత్తికి లొంగిపోకూడదు. పురుషుని వద్దనుండి పరిచయాన్ని ఆదరాన్ని అంగీకారాన్ని అనురాగరాన్ని,అనురాగన్నకోరుకుంటుంది. అందుచే యువతి చనువుతో తనవద్దకు వసూన్నంతమాత్రాన, లైంగికవాంఛతోనే వస్తుంది అనుకోవడం చాల పొరపాటు. అసలు ఆ ప్రాయంలో యువకుల్లోవుండే లైంగికవాంఛ యువతుల్లో వుండదన్నాం. కనుక యువకుడు ఏదోవిధంగా బలవంతం చేస్తేనేతప్ప, యువతి లైంగిక చేష్టలకు సాధారణంగా సమ్మతించదు.

ఇక యువతి, యువకుడు తనపట్ల గౌరవంగా మెలగేలా చూచుకోవాలి. ఆ ప్రాయంలో ఉద్యోగంమీదనేగాని వివాహంమీద అతనికి దృష్టివుండదు. ఆ ఉద్యోగం దొరికిందాక అతడు ఆడపిల్లలతో కాస్త సరదాగా ఆడుకొంటూ వుండాలని కోరుకొంటాడు - అంతే! ప్రాయంలో కాకపోయినా మానసిక పరిపక్వతలో అతనికంటె ఆమె పెద్దది. తన ఈ పెద్దరికాన్ని యువతి గుర్తించాలి. గుర్తించి జాగ్రత్తగా మెలగాలి. యువకుని చనువూ స్నేహమూ లైంగిక చేష్టలకు దారితీయకుండా వుండేలా చూచుకునే బాధ్యత ప్రధానంగా ఆమెది. ఈ బాధ్యతను విస్మరించిందో యువతి పతనమై పోతుంది. భ్రష్టురాలై తీరుతుంది. వివాహానికి ముందే లైంగిక క్రియకు సమ్మతించే యువతిని యువకుడు గౌరవంతో చూడడు. గాలితిరుగుళ్ల తిరిగే రకం, తేలిక మనిషి అనుకొని నిర్లక్ష్యం చేస్తాడు. ఆ పిమ్మట వివాహ ప్రస్తావన వచ్చినా అతడు ఆమెను పెండ్లి చేసికోడానికి ఇష్టపడడు - గుణవంతురాలైన మరో కన్యను వెదుకుతాడు. పైగా దుష్టచేష్టలవల్ల యువతి గర్భవతి ఐందో, లెక్కలేనన్ని చిక్కులు వస్తాయి. యువకుడు ఆమెను పరిణయమాడ్డానికి ఒప్పకోడు. ఒకవేళ, తనవలననే గర్భవతి ఐంది గదా అని జాలివలనగాని, నిర్బంధంవలనగాని ఆమెను పెండ్లాడిన దాంపత్యజీవితం సుఖవంతం గాబోదు. ఇక పైన నుడివినట్లు యువతి గర్భవతి కాకపోయినా తాను చాల బాధలకు గురౌతుంది. పురుషునికి లైంగికక్రియ అంత లోతైన అనుభవాన్ని కలిగించదు. అది అతనికి ఓ మామూలు పనిలాగే వుంటుంది. కాని స్త్రీకి అలా కాదు. లైంగికక్రియ ఆమెకు గాధమైన అనుభవాన్ని కలిగిస్తుంది. గొప్ప సంచలనాన్ని సంక్షోభాన్ని కూడ తెచ్చిపెడుతుంది. ఈ యనుభవాన్ని ఆమె ఇక విస్మరించలేదు. ఓ చిన్నముద్దు, ఓ తాత్కాలిక స్పర్శకూడ స్త్రీకి మరపునకు రాని మనోభావాలను తెచ్చిపెడతాయి, మగవాళ్ళకు ఇదేమీ వుండదు. తాను బిడ్డలతల్లి కాబోతుంది గనుక ప్రకృతే స్త్రీని ఈలా మృదుహృదయనుగా తయారుచేసింది. కనుక వివాహానికిముందే ఓ యువకునితో దుష్టచేష్టలు నడపిన యువతి, తరువాత తన దాంపత్యజీవితంలో పొందికను చూపలేదు. భర్తతో కాపురం జేసేటప్పడు పూర్వానుభవాలు ఆమెను వేధిస్తాయి, బాధిస్తాయి. ఓమారు ఆమె మానసిక ప్రవృత్తి స్పందించింది, కలుషితమైపోయింది. మళ్లా ఆమె తెప్పరిల్లుకోవడం కష్టం. ఈ కారణాల వలన వివాహానికి మందలి యువతీ యువకుల పరిచయాలు చాల నిర్మలంగా వుండాలి అన్నాం.

2. వివాహ నిర్ణయం

పూర్వకాలంలో తల్లిదండ్రులే వివాహాలు నిర్ణయించేవాళ్లు, ఐనా పూర్వులు వధూవరుల నుద్దేశించిగాక, కుటుంబాల నుద్దేశించే, అనగా కొన్ని కుటుంబాలు ఐక్యమై బలవడ్డంకోసం వివాహాలు నిర్ణయించుకున్నారు. కాని నేడు ఆ పద్ధతి మారిపోయింది. ఈనాడు తరచుగా యువతీయువకులే తమ వివాహాలు నిర్ణయించుకుంటున్నారు.

మామూలుగా వివాహాలను నాల్ల పద్ధతుల్లో నిర్ణయిస్తూ వుంటాడు. 1. బిడ్డలను సంప్రతించకుండా తల్లిదండ్రులే తమ కనుకూలమైన రీతిగా వధూవరులను నిర్ణయించడం. 2. బిడ్డలను సంప్రతించి వాళ్ళ యిష్టాల ప్రకారం తల్లిదండ్రులే వధూవరులను నిర్ణయించడం, 3. తల్లిదండ్రుల సమ్మతితో బిడ్డలు తామే వధూవరులను నిర్ణయించుకోవడం 4. తల్లిదండ్రులను సంప్రతించకుండా బిడ్డలు స్వయంగానే తమకిష్టమైన వాళ్ళతో వివాహం. నిర్ణయించుకోవడం. వీనిలో 14 పద్ధతులు ఉత్తమమైనవి కావు. 2,3 యోగ్యమైన నిర్ణయాలు. 3వది అన్నిటికంటె శ్రేష్టమైన పద్ధతి. ఏదిఏమైనా వివాహబంధంలో ప్రవేశించకముందు బిడ్డలు తల్లిదండ్రులను సంప్రతించడమంటూ వుండాలి.

ఇక వివాహాలు పొందికగా వుండాలంటే మున్ముందు గానే ಇರುವಐಲವ್ಳಿಬ್ಬ వధూవరుల గుణగణాలను, వివరాలను తెలిసికొని వండాలి. ఈ వివరాలుగూడ చాల రంగాలకు వర్తిస్తాయి. 1. మొదట వధువు లేక వరుని కుటుంబ వాతావరణం తెలిసి వుండాలి. పెద్దల అలవాట్ల పిల్లలకు వస్తాయి. అంచేత యెదుటివ్యక్తి కుటుంబంలో ఏవైనా దురభ్యాసాలు ఉన్నాయేమో విచారించి చూడాలి. 2. ఎదుటి వ్యక్తి ఆదర్భాలూ, నైతికజీవితం - అనగా నిజాయితీ, ఋజువర్తనం, శీలసంపత్తి మొదలైన అంశాలను తెలిసికొని వుండాలి. విశేషంగా వరుని విషయంలో ఈ విషయాలను క్షుణ్ణంగా తెలిసికొని ఉండాలి. ఒకమారు పెండ్లయ్యాక, మగవాళ్ళు తమ గుణాలను ఇక మార్చుకోరు. 3.ఎదుటి వ్యక్తిస్థాయి అభిరుచులుగూడ గమనించి వుండాలి. విద్య, ఆర్థికస్తోమత నాగరికత మొదలైన බංඟීද් వధూవరులకు కొంత సామ్యం వండాలి. లేకుంటే కాకి ముక్కుకు దొండవండులా వుంటుందేగాని, పొందికంటూ కుదరదు. 4. మనం మత విషయాలనుగూడ గుర్తించాలి. ఎదుటి వ్యక్తికి మతాచరణంపట్ల పట్టుదల వుందా లేదా అని విచారించాలి. చాల జాగ్రత్తగా ముందు వెనుకలు ఆలోచించిగాని క్రైస్తవేతరులతో వివాహం తలపెట్టరాదు. 5. ఎదుటి వ్యక్తి ఆరోగ్య విషయాలనూ గుర్తించాలి. విశేషంగా వంశపారంపర్యంగా సంక్రమించే దీర్ఘవ్యాధులను గూర్చి జాగ్రత్తగా తెలిసికొని వండాలి. 6. కడన వధువు అందచందాలూ విచారించాలి. అందచందాలు అంత ముఖ్యంకాదు. వాటికంటే శీలసంపత్తి ప్రధానం, రూపానికీ, శీలానికి తరచుగా పొత్తు కుదరదుకూడ. ఐనా సౌందర్యవతియైన యువతి లభించినపుడు యువకుడు కృతజ్ఞతాపూర్వకంగా స్వీకరించాలి.

ఇక, పై వివరాలను విచారించి తెలుసుకున్నాక, కొన్ని లోపాలువున్నా ఎదుటి వ్యక్తిని అంగీకరించవచ్చు. వివాహం చేసికోవచ్చు కాని అలాంటప్పుడు వివాహం చేసికునే వ్యక్తి ఈ లోపాలను బుద్ధిపూర్వకంగా అంగీకరించి స్వయంగా ఇష్టపడిపెండ్లిజేసికోవాలి. లేకుంటే తర్వాత మళ్ళా చిక్కులు వస్తాయి. ఇంకో విషయంగూడ, లోకంలో సర్వగుణ సంపూర్ణులైన మానవులెవ్వరూ లేరు. కనుక సంపూర్ణ వ్యక్తికోసం ఎదురుచూస్తూ కూర్చుంటే అసలు పెండ్లి కానేకాదు!

కడన యువతీయువకులు ఈ క్రింది అంశాలను గూడ తెలిసికొని వుండడం మంచిది. వివాహానికిముందు ఎదుటి వ్యక్తిలోని మంచిగుణాలూ గొప్పగుణాలూ మాత్రమే ప్రచురంగా కన్పిస్తాయి. వివాహమయ్యాక ఆ వ్యక్తిలోని దురుణాలు, అల్పగుణాలుకూడ గోచరిస్తాయి. 2. వివాహమయ్యాక ఎదుటివ్యక్తి వ్యక్తిత్వం ఉన్నది ఉన్నట్లుగా బయటపడుతుంది. ఒకోమారు, ఈ వ్యక్తి నన్ను వంచించి వివాహం చేసికోవడం జరిగింది గదా- అనే భావంకూడ కలుగుతుంది. విశేషంగా యువతికి ఈ యన్యాయం ఎక్కువగా జరుగుతుంది. పెండ్లయ్యాక మగవాళ్ళు తమ దురుణాలను సవరించుకోరు, కప్పిపుచ్చుకోరుగూడ. అసలు ఇక వాళ్ళకా యవసరమే కనిపించదు. 3. కడన ప్రేమ సంగతికూడ చెప్పాలి. లోకంలో ఉత్తమప్రేమ లేకపోలేదు. ప్రేమించి పెండ్లి చేసికొని సంతృప్తికరంగా జీవించినవాళ్ళూ లేకపోలేదు. కాని తరచుగా మన యువతీయువకులు ఎదుటివ్యక్తి శారీరక సౌందర్యానికీ, దైహికాకర్షణకూ బ్రమసిపోయి అదే ప్రేమ కాబోలు అని బ్రాంతి పడుతుంటారు. కేవలం శారీరక సౌందర్యానికి లొంగి ఓ వ్యక్తిని పెండ్లాడితే కొద్దిరోజుల్లోనే అసంతృప్తి కలిగి తీరుతుంది. పైయంశాల ఫలితార్థమేమిటంటే, ఎదుటివ్యక్తి గుణగణాలను చక్కగా విచారించి తెలిసికోందే ఆ వ్యక్తితో వివాహం తలపెట్టకూడదు.

8. వివాహోపదేశం

వివాహానికి ముందు వధూవరులు తప్పకుండా కొంత ఉపదేశాన్ని కూడ పొందాలి. ఈ వుపదేశంద్వారా తెలిసికోవలసిన ముఖ్యాంశాలు ఇవి : 1. వివాహమూ ప్రేమ జీవితమూ, క్రైస్తవ ప్రేమకుండవలసిన లక్షణాలు. 2. భార్యా భర్తలు ఒద్దికగా జీవించడమూ, లైంగిక జీవితం 3. వివాహం ఓ క్రైస్తవ సంస్కారం. 4. వివాహాన్ని రద్దుచేయగలిగే బాధకాలు. 5. పరిమిత కుటంబం. 6. బిడ్డల పెంపకం. 7. ప్రార్థన, క్రైస్తవ సంస్కారాలు - మొదలైనవి.

వధూవరులకు వివాహ పూజలోని భావాలను వివరించి చెప్పాలి. పెండ్లి తంతును విశదం చేయాలి. ఈ పూజలోను ఈ తంతులోను వివాహానికి సంబంధించిన ఆదర్శాలు చాల వర్ణింపబడ్డాయి.

పెండ్లి చేసికోబోయే యువతీయువకులు వివాహపు ధ్యానం చేయడం మంచిది. ఈ ధ్యానంలో పై యంశాలన్నీ విపులంగా బోధించవచ్చు. వాటినిగూర్చి నిదానంగా అవధానంగా ప్రార్ధనం చేసికోవచ్చు. ప్రార్ధనద్వారాగాని వేదసత్యాలు జీర్ణానికి రావు.

వివాహానికి ముందే లైంగిక జీవితానికి సంబంధించినంత మటుకు వైద్యజ్ఞానంకూడ సంపాదించి వుండడం మంచిది. నాలుగైదు వివాహాలు జరిగేప్పుడు సులభంగా ఓ డాక్టరునిగాని, ఓ నర్సునిగాని పిలిపించి ఈ వైద్య విషయాలను చెప్పించుకోవచ్చు. పైగా మన యువతులు వంట మొదలైన నిత్యకృత్యాలనుగూర్చి కొంత గృహిణీ విద్యకూడ అలవరచుకొనివుంటే చాల ఉపయోగకరంగా వుంటుంది. ఈ విషయాలన్నీ విచారించి చూచేందుకు మన పెద్దలు ప్రతి మేత్రాసనంలోను కుటుంబ సలహా కేంద్రాలను అవశ్యంగా ఏర్పాటు చేయాలి.

ప్రార్ధనా భామాలు

1. వివాహం తాత్కాలికమైంది

వివాహం ఈ జీవితానికే పరిమితం. మోక్షంలో వివాహం వుండదు. ఈ లోకంలో నరులు చనిపోతూంటారు. కనుక వివాహం ద్వారా నూత్న మానవులను పుట్టించవలసి వచ్చింది. పరలోకంలో చావలేదు కనుక అక్కడ నూత్ననరులను పుట్టించవలసిన అవసరంలేదు. అక్కడివాళ్ళ దేవదూతలతో సమానంగా వుండిపోతారు. కనుక వివాహానికి తాత్కాలిక స్థితేగాని శాశ్వతస్థితి లేదు - లూకా 20,34-36.

2. వివాహం చెడ్డదికాదు

ప్రాచీనకాలంలో పతితులు కొందరు వివాహం చెడ్డదని బోధించారు. ఇరెనేయస్ అనే వేదశాస్త్రి వారి వాదాన్ని ఖండించి ఈలా బోధించాడు. "దేవుడు నరదేహాలను సృజించినపడే లింగ వ్యత్యాసాన్ని ప్రవేశపెట్టాడు. నరులను స్త్రీపురుషులనుగా సృజించాడు. కనుక ఆదిమకాలంలోనే భగవంతుడు వివాహాన్ని ఉద్దేశించాడు. దేవుడే నిర్ణయించిన పెండ్లి పవిత్రమైనదై యుండాలి.

2. సొంతభార్య సొంతభర్త

పౌలు బోధల ప్రకారం బ్రహ్మచర్యం మెరుగైంది. కాని వివాహం చెడ్డదికాదు. ఆనాడు కొరింతులో వ్యభిచారం బహుళ ప్రచారంలో వుండేది. కనుక పౌలు ఈ దోషానికి దూరంగ వుండమని తన క్రైస్తవులను హెచ్చరించాడు. వ్యభిచారానికి లొంగకుండా వుండడానికై ప్రతి పురుషునికి సొంత భార్య ప్రతి స్త్రీకి సొంత భర్త వండాలని ఆదేశించాడు - 1కొ 7,2. నిగ్రహశక్తిలేని అవివాహితులు విధవలు మొదలైనవాళ్లు పెండ్లి చేసికోవడం మంచిదని చెప్పాడు. కామం వలన కాలిపోవడం కంటె పెండ్లియాడ్డం ఉత్తమమని వాకొన్నాడు - 7,9. కనుక వివాహం దానంతట అది మేలైందే.

4. దైవాశీస్సులు

వివాహపూజలో వచ్చే ఓ ప్రార్ధనం ఇది. "పావన పితా! నీ ప్రణాళికద్వారా స్త్రీ పురుషుల ఐక్యతతో గూడిన వివాహ వ్యవస్థ ఏర్పడింది. నేడు వివాహం ద్వారా తన భర్తతో ఐక్యమైన ఈ నీ కొమార్తెను కనికరంతో వీక్షించు. ఈమె నీయాశీర్వాదాన్ని అడుగు కొంటూంది. ఈమెకు ప్రేమనూ శాంతినీ ప్రసాదించు. ఈమె ఎల్లవేళల పవిత్రగ్రంథం పేర్కొనే పుణ్యస్త్రీల మార్గంలో నడచునుగాక.

ఈమె భర్త ఈమెను విశ్వసించునుగాక. ఈమె తనకు సరిసమానమనియు, వరప్రసాద జీవితం వలన తనతోపాటు మోక్షానికి వారసురాలనియు గుర్తించునుగాక. క్రీస్తు తన పత్నియైన తిరుసభను ప్రేమించినట్లే ఇతడును ఈమెను సదా ఆదరించి ప్రేమించునుగాక.

పరలోక తండ్రీ! వీళ్ళు సదా నీ యాజ్ఞలను పాటింతురుగాక. వీళ్ళు వివాహబంధంలో పరస్పరం విశ్వసనీయులుగా మెలుగుదురుగాక, తోడి క్రైస్తవులకు ఆదర్శంగా వుందురుగాక. సువిశేష సందేశంనుండి లభించే బలాన్ని పొంది క్రీస్తుకి సాక్షులుగా నిల్లురుగాక. ప్రభూ! వీరికి సంతాన భాగ్యాన్ని దయచేయి. మంచి తల్లిదండ్రులుగా మెలిగే వరాన్ని ప్రసాదించు. వీళ్ళు తమ బిడ్డల బిడ్డలను కాంతురుగాక. వృద్ధాప్యం వరకు సుఖసంతోషాలతో జీవింతురుగాక. అటుపిమ్మట నీ దివ్యరాజ్యంలో అర్చ్యశిష్టులతోపాటు శాశ్వతంగా వసింతురుగాక. మా ప్రభువైన క్రీస్తుద్వారా ఈ మనవిని ఆలించండి, ఆమెన్.

13. కుటుంబ దేవాలయాలు

1. కుటుంబాలే దేవాలయాలు

బాలయేసు మరియా యోసేపులతో గూడిన తిరుకుటుంబంలో జన్మించి వారి అండదండలలోనే పెరిగాడు. ఈ తిరుకుటుంబం నేటి మన కుటుంబాలన్నిటికీ ఆదర్శంగా వుండాలి. ఇక, నేటి మన తిరుసభకూడ దైవకుటుంబమే. తొలినాళ్ళలో భక్తులు కుటుంబసమేతంగా జ్ఞానస్నానంపొంది తిరుసభగా ఏర్పడ్డారు. ఫిలిప్పిలోని చెరసాల అధిపతి కుటుంబం ఈలాంటిది - అ. చ. 16,31. కొరింతులోని ప్రార్థనామందిరాధికారి క్రిస్పు కుటుంబం ఈలాంటిది - 18,8. ఈ పవిత్ర కుటుంబాలు ఆనాటి అవిశ్వాసాంధకారంలో దీపాల్లా ప్రకాశించాయి.

నేటి లోకంలో విశ్వాసం తగ్గిపోతూంది. ఈ లౌకిక యుగంలో విశ్వాసంతో జీవించే కుటుంబాలు చాల అవసరం. క్రైస్తవ ప్రజల్లో భక్తి, విశ్వాసం సోదరప్రేమ నిలబెట్టేది ఈ కుటుంబాలే. కావుననే రెండవ వాటికన్ మహాసభ ఈ సత్ముటుంబాలను “కుటుంబ దేవాలయాలు" అని పేర్కొంది. ఈపదం మొదట తొలినాటి క్రైస్తవ కుటుంబాలకు వర్తించేది. ఇంకా రాతిగుళ్ళులేని ఆ ప్రాచీనకాలంలో ఈ ఆదర్శ కుటుంబాలే దేవాలయాలుగా పనిచేసాయి. ప్రాచీన క్రైస్తవులు ఈ యిండ్లల్లోనే గుమిగూడి ప్రార్థనలు చేసికొనేవాళ్లు. పూజబలిని అర్పించేవాళ్లు, కావుననే వాటిని కుటుంబ దేవాలయాలు అన్నారు. నేటి మన కుటుంబాలుగూడ దేవాలయాలుగా పనిచేయాలి. ఇక్కడ తలిదండ్రులు తమ పిల్లలకు తొలిసారిగా భక్తివిశ్వాసాలు, ప్రార్థన నేర్పాలి. విద్యాబుద్దులు నేర్చి వారిని భావిజీవితానికి సిద్ధం జేయాలి. ఆ పిల్లల్లో ఎవరికైనా దైవసేవమీద కోరిక పుడితె ఆ కోరికను బలపరచాలి.

2. గృహస్తుల యాజకత్వం

తిరుసభలో గురువుల యాజకత్వమూ వుంది. గృహస్థల యాజకత్వమూ వుంది. కుటుంబంలో తల్లిదండ్రీ బిడ్డలూ అందరూ కలసి గృహస్థ యాజకత్వాన్ని నెరపుతారు. భక్తితో పూజలో పాల్గొని తమ జీవితాలను సజీవయాగంగా దేవునికి అర్పించుకొంటారు రోమా 12,1. పవిత్ర గ్రంథాన్ని చదివి అది ఆదేశించినట్లుగా దేవుని మార్గాల్లో నడుస్తారు. దైవ సోదర ప్రేమలను పాటిస్తారు. స్వార్ధాన్ని అణచుకొని పరోపకారబుద్ధితో జీవిస్తారు. కష్టపడి పనిచేసికొంటారు. తమ పవిత్ర జీవితం ద్వారానే దైవరాజ్యం వచ్చిందని చాటిచెప్తారు. క్రైస్తవ గృహమూ దానిలో వసించే కుటుంబమూ క్రైస్తవ జీవితం ఈలా వుంటుందని లోకానికి చాటిచెప్పేదిగా వుండాలి. క్రీస్తుకీ అతని విలువలకూ సాక్ష్యమిచ్చేదిగా వుండాలి.

జ్ఞానస్నానం ద్వారా క్రైస్తవులు క్రీస్తుతో ఐక్యమై అతని రాజత్వం, ప్రవక్తృత్వం, యాజకత్వం అనే మూడు గుణాల్లో పాలుపొందుతారు. సజీవ శిలలై ఆధ్యాత్మిక దేవాలయంగా రూపొందుతారు - 1షేత్రు 2,5. దేవునిచే ఎన్నుకొనబడినవారు, రాచరికపు గురుకులం, పవిత్ర ప్రజ ఔతారు. చీకటినుండి వెలుగులోనికి వచ్చి, దేవుని అద్భుతకార్యాలను ప్రకటిస్తారు - 2,9.

3. తల్లిదండ్రులూ పిల్లలూ

కుటుంబంలో వసించేది తల్లిదండ్రులూ పిల్లలూ, తల్లిదండ్రులు పరస్పర ప్రేమభావంతోను ఐక్యభావంతోను జీవించాలి. క్రీస్తుకీ తిరుసభకీ వుండే పవిత్ర బంధాన్ని తమ దాంపత్యజీవితం ద్వారానే చూపింపగలిగి వుండాలి.

తల్లిదండ్రులు తమ తరపున తాము పిల్లలను ఆప్యాయంగా పెంచి పెద్దజేయాలి. విద్యాబుద్దులు నేర్చి వారిని భావిజీవితానికి తయారుచేయాలి. ఆ బిడ్డలు తమ బిడ్డలు కాకముందే దేవుని బిడ్డలు. కనుక వారికి విశ్వాసవిద్య దైవభక్తి నేర్పాలి. నైతిక గుణాలూ సచ్ఛీలము అలవర్చాలి. పిల్లలకు మొదటి మతబోధకులు తల్లిదండ్రులే పిల్లలు తమ తరపున తాము తల్లిదండ్రులను గౌరవించి ప్రేమించాలి. "నాయనా! నీకు ప్రాణమిచ్చినవారు నీ జననీజనకులు. వారి ఋణాన్ని నేవేలా తీర్చుకొంటావు? అనే సీరా జ్ఞానగ్రంథ వాక్యాన్ని సర్వదా స్మరించుకొంటుండాలి-7,28. తల్లిదండ్రులకు విధేయులు కావాలి. ముసలిప్రాయంలో వారిని ప్రేమతో ఆదుకోవాలి.

కుటుంబాన్ని ఐక్యపరచేదీ, భక్తిని పెంచేదీ, గొడవలు సమసిపోయేలా చేసేదీ ప్రార్ధనం. కనుక రోజు కొన్ని నిమిషాలపాటు కుటుంబ సభ్యులంతా కలసి ప్రార్ధనం చేసికోవాలి. రోజూ కాసేప ప్రార్ధన చేసికొనే యింటిని పవిత్రాత్మశక్తి ఆవరించి వుంటుంది. చిన్ననాడు కుటుంబంలో ప్రార్థన నేర్చుకోని పిల్లలు పెరిగి పెద్దయ్యాక ప్రార్థన చేయడం అరుదు.

4. హిందూసమాజం మధ్యలో వసిస్తున్నాం

ఈ దేశంలో క్రైస్తవులమైన మనం అల్పసంఖ్యాకులం. అధిక సంఖ్యాకులైన హిందువులమధ్య చీకట్లో మినుకుమినుకుమనే దీపాల్లాగ కన్పిస్తూంటాం. మన కుటుంబ జీవితం మన చుట్టుపట్లవుండే హిందువులకు ఆదర్శవంతంగా కన్పించాలి. క్రీస్తు ప్రేమకూ సేవకూ మంచితనానికీ సాక్ష్యంగా వుండాలి. అవకాశం వచ్చినపుడు మనం క్రీస్తుని గూర్చి తోడి హిందువులకు తెలియజేయగలిగి ఉండాలి. మన యింటిలో దైవార్చన క్యాలెండరు, మతపరమైన పటాలు, స్వరూపాలు మొదలైనవి తప్పక ఉండాలి. ఇవి క్రైస్తవ వాలకాన్ని భక్తినీ సూచిస్తాయి.

అంతా కుటుంబ జీవితం మీదనే ఆధారపడి ఉంటుంది. భక్తిగల కుటుంబాలకు ఏ కొరతా రాదు. కానాపూరి కుటుంబంలో లాగ క్రీస్తు వారి కుటుంబంలో నెలకొని వుంటాడు. వారి పిల్లల్లో కొందరు గురువులుగా మఠకన్యలుగా తయారౌతారు. ఇక భక్తిలేని కుటుంబాలకు కలిగే అనర్ధం అంతా యింతా కాదు. తాజెడిన కోతి వనమెల్ల చెరిచింది అన్నట్లుగా వాళ్ళ ఇతర క్రైస్తవులనుగూడ చెడగొడతారు. క్రైస్తవ మతానికే తలవంపులు తెస్తారు. ఫలితంగా దేవుని దీవెనకుమారుగా శాపాన్ని కొనితెచ్చుకొంటారు.

ప్రార్థనా భావాలు

1. మంచి ఆదర్శం

మన క్రైస్తవులు తరచుగా బడుగువర్గాలకు చెందినవాళ్లు, పేదజనం, కూలినాలి చేసికొని బ్రతికేవాళ్ళు అనేక కారణాలవల్ల మన కుటుంబాల్లో త్రాగుడు, దొంగతనం, మోసం, అబద్దాలు, సోమరితనం మొదలైన దురభ్యాసాలు కన్పిస్తుంటాయి. ఈ దుర్గుణాలవల్ల మనం క్రైస్తవ మతానికే అపఖ్యాతి తెస్తాం. ఇరుగుపొరుగు హిందువులు మన రోజువారి జీవితంలో క్రీస్తుని చూడలేక పోతుంటారు. మనలో పవిత్రాత్మకు బదులుగా దుష్టాత్మను చూస్తుంటారు. కనుక మన కుటుంబజీవితం ఎంత శుద్ధంగా ఉందా అని పరిశీలించి చూచుకొంటూండాలి. 2. తల్లి, తండ్రి

కుటుంబానికి తండ్రి శిరస్సు, అధిపతి. నాయకత్వం వహించేవాడు అతడే. కాని కుటుంబానికి తల్లి హృదయంలాంటిది. గుండె ప్రేమకు చిహ్నం. ఇంటిని ప్రేమతో నింపేది తల్లే ఇంటికి తండ్రి యజమానుడు, పరిపాలకుడూ ఐతే తల్లి అనురాగంతో ఇంటిల్లిపాదినీ ఐక్యంజేసేది. "ఇంటిని జూడు ఇల్లాలిని జూడు" అన్నట్లుగా గృహశోభ చాలవరకు తల్లిపై ఆధారపడి ఉంటుంది. 3. నిబంధనం

వేదశాస్తులు వివాహ జీవితాన్ని నిబంధనంతో పోల్చారు. దేవుడు పూర్వవేదంలో యిస్రాయేలీయులతోను నూత్నవేదంలో క్రైస్తవులతోనూ నిబంధనం చేసికొన్నాడు. నిబంధనకర్తలైన దేవుడూ నరజాతీ ఒకరిపట్ల ఒకరు విశ్వసనీయులుగా మెలగాలి. ఇక, వివాహజీవితంలో భార్యాభర్తలే ఒకరితో ఒకరు నిబంధనం చేసికొంటారు. కనుక వాళ్ళిద్దరూ ఒకరిపట్ల ఒకరు విశ్వసనీయులుగా మెలగాలి. ఒకరికొకరు ఉపకారమేగాని అపకారం తలపెట్టగూడదు. ఒకరిపట్ల ఒకరు గాధానురాగంతో మెలగాలి.

వివాహ విషయాలు-వేద పటనాలు

1. పూర్వవేదం

1. నరునిలోను దేవుని పోలిక, ఆది 126-28

  సంతానాన్ని కనడం 

2. ఏవ ఆదామునకు సహాయకురాలు, ෂධි 2, 18-25

  వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తిగా ఐక్యంగావాలి 

3. ఒడంబడిక వివాహం లాంటిది యొష 54, 5, 62,1-5 4. తోబియా ప్రార్ధన తోబీ 85-8 5.కుటుంబజీవితం కీర్త 45,10-11 6. ఆదర్శ గృహిణి సామె 31,10-31 భర్త చూపవలసిన ప్రేమ రంకులాడి క్రీస్తు-శ్రీసభ వివాహితులు 2. నూత్నవేదం కన్యాజీవితం, గురుజీవితం 4. విధవ జీవితం 5. ఉత్తానజీవితంలో వివాహం ఉండదు 6. క్రైస్తవస్త్రీకి ఉండవలసిన వినయం 7. విడాకులు పనికిరావు . వ్యభిచార దోషం 9. మానసిక వ్యభిచారం ఆత్మ శోధనం ਹੇਕo 5, 15-20 ਹੇo 7,6-27 Ꭷ8b 5, 21-88 1S 7,1-16 1S 7,32-34 మత్త 19,12 1Ց" 7,39-40 మార్కు 12,25 1పేత్రు 3,1-6 1తిమో 2,9-15 మత్త 19,3-9 1S 6, 12-20 మత్త 5,28 ఇంతవరకు వివాహజీవితాన్ని గూర్చి ఆయా విషయాలు విచారించి చూచాం. ఇక యీ విషయాలు మన జీవితానికి ఏలా వర్తిస్తున్నాయో చిత్తశుద్ధితో పరీక్షించి చూచుకోవాలి. ఇదే ఆత్మశోధనం. ఓ వ్యక్తి తాను భార్యగావచ్చు, భర్తగావచ్చు. ఎవరైనాగాని నేను, నాయిల్లు, నా భర్త లేక భార్య నా పిల్లలు అనే నాలుగంశాల క్రింద ఈ యాత్మశోధనను కొనసాగించవచ్చు. 1. భర్తగా నా బాధ్యతలు 1. నేను 1. నా యాకారం ఏలా వుంటుంది? నేను శుభ్రంగా వుంటున్నానా? ధరించే దుస్తులు, తల జట్టు మొదలైనవి నీటుగా వుంటున్నాయా? 2. నా పనివస్తువులను చిందరవందరగా పారవేస్తున్నానా లేక మట్టసరిగా ఓ ప్రక్కన అమర్చివుంచుకుంటున్నానా?

64

3.కొన్ని మంచి పుస్తకాలు పత్రికలు చదివి రోజురోజుకు విజ్మనం పెంపొందించుకొంటున్నానా?
4.నేను చక్కగా, మర్యాదగా మాటలాడగలనా?
5.నాకు మతవిషయాలు తెలుసా? క్రైస్తవ విశ్వాసం అంటే అభిమానం వుందా?
6.నేను నా కుటుంబంతోపాటు గుడికి వెళ్తుంటానా? పాపోచ్చారణం దివ్యసత్ప్రసదం మొదలైన సంస్కారాలు పొందుతుంటానా?
7.నాకు బైబులు చదివే అలవాటు వుందా? అసలు ఇంటిలో బైబులంటూ వుందా?
8.ఉదయంగాని, సాయంత్రంగాని కుటుంబ సభ్యులతో పాటు ప్రార్ధన జేసికునే అలవాటు వుందా?
9.ఏటేట వడకం చేస్తుంటానా? నన్ను నేను సవరించుకుంటూంటానా?
10.విచారణలోని మతసంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటూంటానా? దేవమాతపట్ల విశేషభక్తిని చూపుతుంటానా?
11.వివాహం జగత్ స్థితికోసం ఉద్దేశింపబడిందేగాని, దానికి శాశ్వత స్థితి అంటూ లేదు. ఈ వివాహంద్వారా నన్ను నేను పవిత్రపరచుకొని, నా భార్యనుగూడ పవిత్రపరుస్తుంటానా?

2. నా యిల్లు, నా పని

12.నేను ఇల్లువాకిలి పట్టించుకుంటానా? నా యింటి విషయాలు నేనే స్వయంగా చక్కదిద్దుకుంటూంటానా?
13.ఇంటిలోని వాళ్ళను సంతోషపెడుతుంటానా లేక మాటిమాటికి సుమ్మర్లపడుతూ
గొణుక్కుంటూ వుంటానా?
14.సంతోషంగా వుండడం, శాంతస్వభావం, కలుపుగోలుతనం మొదలైన మంచి
గుణాలను ప్రదర్శిస్తూంటానా?
15.భోజనవిషయంలో సంతృప్తి చూపుతుంటానా లేక యెప్పడూ ఇది బాగలేదు అది బాగలేదు అని గొణుక్కుంటూ వుంటానా?
16.సకాలంలో నా పని ప్రారంభిస్తున్నానా? పూర్తికాలం పనిలో నిమగ్నుణ్ణయి వుంటున్నానా? శక్తికొలది కృషి చేస్తున్నానా?
17.దుర్విమర్శలతోను వేరేవాళ్ళను ఆడిపోసుకోవడంతోను కాలం వెళ్ళబుచ్చుతూన్నానా?
18.పనికాలంలో క్రైస్తవేతరులు నన్ను గమనిస్తూంటారనీ, వాళ్ళకు చక్కని ఆదర్శాన్ని ఈయాలనీ గుర్తిస్తుంటానా?

19.నేను పనిచేసే తావుల్లో మెలిగే స్త్రీలపట్ల, నా భార్యపట్ల ఇతర పురుషులు ఎలా ప్రవర్తించాలని కోరుకుంటానో అలా ప్రవర్తిస్తూంటానా?
20.అసలు పరస్త్రీలపట్ల నా ప్రవర్తన ఏలా వుంటుంది? పరస్త్రీని మోహదృష్టితో జూచినా మానసిక వ్యభిచారం చేసినట్లే అన్నాడు ప్రభువు. ఈ యాజ్ఞ నాపట్ల ఏలా వర్తిస్తుంది.

3. నా భార్య

21.స్త్రీ హృదయాన్ని మనస్తత్వాన్ని అర్థం చేసికొని నా భార్యకు అనుకూలంగా నడుచుకుంటున్నానా?
22.నా భార్యను ఇంకా నిండు హృదయంతో ప్రేమిస్తూనే వున్నానా? ఒకవేళ తొలినాటి ప్రేమ వట్టిపోయినట్లయితే కారణమేమై వుంటుంది?
23.నా ప్రేమకు చిహ్నంగా భార్యకు బహుమతులు మన్ననలు ఇస్తూంటానా? వివాహదినం, ఆమె పుట్టినదినం జ్ఞాపకం వుంచుకుంటూంటానా?
24.పిల్లలను కనిపెంచుతూన్నందులకు, ఇల్లూ వాకిలి చక్కబెడుతూన్నందులకు, అన్నం వండిపెడుతూన్నందులకు ఇంకా నూరు సేవలు చేస్తూన్నందులకు ఆమెను మెచ్చుకుంటూంటానా?
25."స్త్రీని మెచ్చుకుంటూ వుండాలి" అన్న ధర్మాన్ని బట్టి ఆమె రూపాన్ని దుస్తులను, అలంకరణను, అణకువను, అనురాగాన్ని వంటను ప్రశంసిస్తూంటానా?
26.ఆమెకు తెలియవలసిన రహస్యాలుకూడ తెలియనీకుండ దాచిపెడుతూంటానా?
27.ఆమెపట్ల మృదువుగా మర్యాదగా ప్రవర్తిస్తుంటానా? ఆమెను అనురాగంతో పిలుస్తుంటానా? కోపం వచ్చినపుడు నాలుకను అదుపులో పెట్టుకుంటానా? లేక కటువుగా దుర్భాష లాడుతూంటానా?
28.ఇతరులముందు ఆమెను స్తుతిస్తూంటానా లేక నిందిస్తూంటానా? ఆమె లోపాలను ఇతరులముందు విమర్శిస్తుంటానా?
29.స్త్రీ వంటింటికీ పడకటింటికీ పనికివచ్చే వస్తువు అనేలా ప్రవర్తిస్తుంటానా? ఆమె నా బిడ్డల తల్లి, నాకు సహాయకురాలు అనే భావం చూపుతూంటానా, లేక చిన్నదానికి పెద్దదానికి ఆమెను ఓ పనికత్తెలాగ వాడుకొంటుంటానా? బడలిక చెందినపుడు ఆమె విశ్రాంతి పొందేలా చూస్తూంటానా?
30.క్రీస్తు-తిరుసభ అనే పోలికను గుర్తించి భార్యకోసమెంత త్యాగమైనా చేయడానికి సంసిద్ధమౌతూంటానా?

31.కుటుంబవిషయాల్లో ఆమెతో కలసి వో నిర్ణయానికి వస్తుంటానా లేక నేనే ఓ నిర్ణయాన్ని చేసుకొని ఆ తరువాత ఆమెకు తెలియజేస్తూంటానా?
32.లైంగికక్రియలో జంతుభావంతో ప్రవర్తిస్తుంటానా? భార్యవద్దనుండి ఎంత సుఖం పొందుదామనే భావమేనా లేక భార్యనూ సుఖపెడదామనే భావంకూడ వుందా?
33.ఆమె కారణపూర్వకంగా దేహదానానికి అంగీకరించనపుడు నిర్బంధం చేస్తూంటానా?
34.లైంగికక్రియలో స్త్రీ మానసిక సుఖాన్ని కోరుకున్నంతగా శారీరక సుఖాన్ని కోరుకోదు. ఈ విషయంలో ఆమెపట్ల మొరటుగాను అసభ్యంగాను ప్రవర్తిస్తుంటానా?
35.ఆమెకు ద్రోహంగా నా హృదయాన్ని అన్యస్త్రీలవైపు మరలుస్తూంటానా? ఆమెను అనవసరంగా శంకిస్తూంటానా?
36.స్త్రీని ఒంటరిగా వదలివేయకూడదు అన్న నియమాన్ననుసరించి ఆమెతో కూడిమాడి వుంటూంటానా లేక యొక్కడెక్కడో కాలక్షేపంచేసి వసూంటానా?
37.ప్రేమ అంటే ఈయడంగాని పుచ్చుకోవడంకాదు. ప్రేమను మాటల్లోగాక చేతల్లో చూపించాలి. ఈ రెండు సత్యాలను నా భార్య విషయంలో ఎంతవరకు ఆచరణలో పెడుతున్నాను?
38.ఆమె చుట్టపక్కాలు వచ్చినపుడు వారిని ఆదరిస్తుంటానా?
39.ఆమెకు నాకు భేదాభిప్రాయం కలిగినపుడు నా పట్టేనెగ్గాలి అనేలా ప్రవర్తిస్తుంటానా లేక ఆమె బాధకూడ అర్థంచేసి కూంటూంటానా?
40.మతవిషయాల్లో ఆమెకు సహాయపడుతూంటానా? ఆమె గుడికివెళ్ళి సంస్కారాలు
పొందేలా ప్రోత్సహిస్తూంటానా?
41.ఆమె అంగీకరించకపోయినా నిర్బంధంగా సంతాన నిరోధక మార్గాలు ప్రవేశపెడుతూంటానా?
42.ఈ దేహంతోను పాపంచేయకూడదు, ఈ దేహంలోను పాపం చేయకూడదు
అన్న పౌలు ఆజ్ఞను పాటిస్తున్నానా?
43.లైంగికక్రియలో నేననుభవించే ఆనందం ఇంద్రియాలతో ఆగిపోతుందా లేక ఆత్మకుకూడ సోకుతుందా?.నా ప్రేమలో కామం ఎన్నిపాళ్ళు.
44.ప్రేమ, ఆదుకోలు, పరిచర్య క్షమాపణ మొదలైన నానాకార్యాల్లో ఆమె నాకు ఋణపడుతుందా లేక నేనే ఆమెకు ఋణపడుతున్నానా?
45.అన్నికార్యాలతోపాటు లైంగికక్రియనుగూడ ప్రభువుకే సమర్పించి వివాహజీవితాన్ని పునీతం జేసికొంటున్నానా?

     
  

4. నా పిల్లలు

46.తండ్రిగా నా బాధ్యతలు అర్థంచేసికొంటున్నానా? తండ్రి పదవిని తలంచుకొని సంతోషిస్తున్నానా?
47.భార్యతో సుఖాన్ని అనుభవించిగూడ, ఆర్థికస్తోమతవండికూడ, కృత్రిమంగా బిడ్డల పుట్టువును అరికడుతున్నానా? బిడ్డల్లో దేవుని రూపం చూడగలుగుతున్నానా?
48.నా భార్య నేను కలసి పిల్లల సమస్యలను స్థితిగతులను ఆలోచించుకుంటున్నామా?
49.పిల్లల యెదుటనే గురువులను ఉపాధ్యాయులను విమర్శిస్తున్నానా?
50.పిల్లలను క్రమశిక్షణకు అలవాటు చేస్తున్నానా లేక ఎక్కువ చనువుతో పాడుచేస్తున్నానా?
51.పిల్లలపట్ల ప్రేమ శ్రద్ధ చూపుతున్నానా? వాళ్ళ విశ్వాసానికి అనురాగానికి పాత్రుజ్ఞవుతూన్నానా?
52.వాళ్ళను భావిజీవితానికి, ఓ వుద్యోగానికి తయారుచేస్తూన్నానా? వాళ్ళు వోయింటివాళ్ళయ్యేలా ప్రయాసపడుతున్నానా?
53.నా పిల్లల స్నేహితులు ఉపాధ్యాయులు నాకు తెలుసా? వాళ్ళను ఇంటికి ఆహ్వానిస్తుంటానా?
54.పిల్లల ప్రవర్తనం ఏలావుందో, వాళ్లు ఏమేం చదువుతున్నారో, యొక్కడెక్కడ తిరుగుతున్నారో గమనిస్తున్నానా?
55.పిల్లలు అనుదినం గుడికివెళ్ళి జపం జెప్పకొని, సంస్కారాలు పొంది, భక్తిమంతమైన క్రైస్తవజీవితం గడిపేలా ప్రోత్సహిస్తున్నానా?
56. నా క్రైస్తవ జీవితం వాళ్ళకు ఆదర్శప్రాయంగా వుంటుందా?
57.నా పిల్లల్లో ఒకరైనా దేవుని పిలుపు వినాలని కోరుకుంటున్నానా?

2. భార్యగా నా బాధ్యతలు

1. నేను

1.నా రూపం ఏలా వుంటుంది? నేను శుభ్రంగా వుంటున్నానా? ఆకర్షణీయంగా కనిపిస్తుంటానా?
2.వస్త్రధారణలోను అలంకరణ విధానంలోను క్రైస్తవనీతిని పాటిస్తుంటానా? నా ప్రాయానికి తగినట్లుగా అలంకరణ చేసికొంటున్నానా?

3.కొన్ని మంచి పుస్తకాలు పత్రికలు చదువుతూంటానా? నాగరికతతో మూటలాడగలనా?
4.దేశంలో ప్రపంచంలో జరిగే సంఘటనలు కొంతవరకైనా తెలిసికుంటుంటానా? లేక బావిలోని కప్పలా వుండి పోతూంటానా?
5.తరచుగా గుడికి వెళ్తుంటానా? పాపోచ్చారణం దివ్య సత్ర్పసాదం మొదలైన సంస్కారాలు పొందుతుంటానా? 6.అనుదిన జపాలు, జపమాల చెప్పకుంటూంటానా? బైబులు చదువుతూంటానా?
7.నా సంభాషణల్లో వేరేవాళ్ళనుగూర్చి ఆడిపోసుకోవడం, కోపతాపాలూ ప్రచురంగా వుంటాయా? ఊళ్ళ సుద్దులన్నీ నావేనన్నట్లుగా ప్రవర్తిస్తుంటానా?
8.కుటుంబంలోని సభ్యులపట్ల, ఇరుగు పొరుగువారిపట్ల ప్రేమభావంతో ప్రవర్తిస్తుంటానా? నా తలపులు మాటలు పనులు క్రైస్తవ ప్రేమకు ప్రతికూలంగా వుండడం లేదు గదా?
9.నాకు రహస్యాలు దాచిపెట్టడం చేతనౌతుందా?
10.పేదసాదలకు క్రైస్తవ కార్యాలకు ఉదారభావంతో దానధర్మాలు చేస్తుంటానా?
11.పూజబలికి హాజరైనప్పడు నా భర్తను బిడ్డలను గూడ పరలోక పితకు అర్పించుకుంటూంటానా? 12.వివాహజీవితంలో సిలువలను ఓర్పుతో భరిస్తుంటానా?
13.కుటుంబంలో చిక్కులు కష్టాలు ఎదురైనపుడు వివాహ జీవితంలో లభించే ప్రత్యేక వరప్రసాదంకోసం ప్రార్ధిస్తుంటానా?
14.ఇంటిని యింటిలోని సామగ్రిని శుభ్రంగా ఆకర్షణీయంగా అమర్చి వుంచుకుంటున్నానా?

2. నాయిల్లు, పని

15.వేకువ జాముననే లేచి పని ప్రారంభిస్తుంటానా?
16.క్రైస్తవ స్వరూపాలు పటాలు మొదలైనవి యింటిగోడలమీద కనిపిస్తుంటాయా? ఇంటిలొ క్రైస్తవ వాలకం వుంటుందా?
17.బిడ్డలకు తినుబండారాలకు డబ్బు దూబరాగా ఖర్చు చేస్తుంటానా?
18.అన్నమూ కూరలు వగైరా యింటిలోనివాళ్ళకు రుచించేలా వండుతుంటానా లేక వారంవారం ఒకేరీతిగా వండుకుంటూ పోతూంటానా?

19.భర్త అన్నానికి వచ్చినపుడే నా సుమ్మర్లన్నీ ఏకరువు పెడుతూంటానా?
20.నేను చేసే పని కాస్త సకాలంలో ప్రారంభించి తృప్తికరంగా చేసి ముగిస్తూంటానా.

3. నా భర్త

21.నేనింకా నా భర్తను ప్రేమిసూనేవున్నానా? నా ప్రేమకు నిదర్శనంగా, తొలినాళ్ళలోలాగ, ఏవేవో ఉపచారాలు చేస్తుంటానా?
22.అతని లోపాలను పస్తాయించుకొని పోతూంటానా? అతన్ని నిత్యం సంస్కరించాలని చూస్తుంటానా? ప్రక్కింటి అమ్మలక్కల యెదుట అతని లోపాలను విమర్శిస్తుంటానా?
23.ఉత్తమ దంపతులు కలిమిలేముల్లోకూడ కలసేవుంటారు అన్నాడు భవభూతి. భర్త ఆర్ధన సరిపోనపుడు అతన్ని చులకనగా చూస్తుంటానా?
24.అతన్ని మాటిమాటికి శంకిస్తూంటానా? అతనితో మాటలాడకుండా బెట్టుగా వండిపోతూంటానా?
25.నిజమైన కారణం లేకపోయినా సాకులతో దేహదానాన్ని నిరాకరిస్తుంటానా?
26.ఆర్థికస్తోమత వున్నాగూడ స్వార్థబుద్ధితో బిడ్డల పుట్టువును అరికడుతున్నానా?
27.భర్త సమీపించినపుడు, లైంగికక్రియ అశుద్ధమైన కార్యం అన్నట్లు ప్రవర్తిస్తుంటానా?
28.లైంగిక క్రియలో స్త్రీ కంటెగూడ పురుషుడు శారీరక సుఖాన్ని అధికంగా కోరుకుంటాడు. ఈ విషయంలో అతన్ని సంతృప్తి పరుస్తున్నానా?
29.ఇతర పురుషులపట్ల చూపగూడని చనువు చూపి అతని హృదయానికి బాధ కలిగిసూంటానా?
30.అతని స్నేహితులు బంధువులు ఇంటికి వచ్చినపుడు ఆప్యాయంగా ఆదరిస్తూంటానా?
31.పెద్ద విషయాలకు చిన్న విషయాలకు అతన్ని లెక్క అడుగుతూంటానా? అతనిచే చీవాట్ల తిన్నప్పడు, నేనే దానికి ఎంతవరకు కారణమై వుంటాను?
32.ఊరంతా అయ్యకు లోకువైతే అయ్య అమ్మకు లోకువ అన్నట్లుగా అతనిమీద పెత్తనం చేస్తుంటానా?
33.క్రీస్తు-తిరుసభ అనే పోలికకు అనుగుణంగా యధార్థంగా అతని స్వాధీనంలో వుంటున్నానా?

34.అతడు ముందు నేను వెనుక అన్నట్లు ప్రవర్తిస్తుంటానా లేక ప్రతిదానికి అతనితో పోటీపడుతుంటానా? అతడు చెడుత్రోవ పట్టినపుడు మృదువుగా మందలిస్తుంటానా?

35.అతడు ఇంటిలో గడిపే నాలుగు గడియలు ఉల్లాసకరంగా గడిపేలా చూస్తుంటానా లేక అవిలేవు ఇవిలేవని నిత్యం సుమ్మర్లు పడుతూంటానా?

36.అతనికి నాకు భేదాభిప్రాయం కలిగినప్పుడు అదేమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటానా?

37.నిరుత్సాహం మగవాణ్ణీ నాశం చేస్తుంది అన్న ధర్మాన్ననుసరించి కష్టదినాల్లో నా భర్తను ప్రోత్సహిస్తుంటానా? అతన్ని బుజ్జగించి పనికి పంపుతుంటానా?

38. ప్రేమ, ఆదుకోలు, సేవ మొదలైన వాటిల్లో నేనతనికి ఋణపడి వుండలేదుగదా?

4. నా పిల్లలు

39.నాలోని మాతృభావాలను అర్థం చేసుకుంటున్నానా? తల్లిగా నేను చేయవలసిన త్యాగాలు చేస్తుంటానా?

40.వ్రవంచ సుఖాలను యౌవన భోగాలను అనుభవించడానికి అవకాశముండదేమోనన్న భయంతో తల్లిని కావడానికి నిరాకరిస్తున్నానా?

41. పిల్లలను గూర్చిన సమస్యలు మంచిచెడ్డలు నా భర్తతో ఆలోచించి చూస్తున్నానా?

42. వాళ్ళను అదుపులో వుంచుకుంటున్నానా లేక ఈయగూడని చనువులిచ్చి పాడుచేస్తున్నానా?

43.పిల్లలను ప్రేమభావంతో పెంచి పెద్దజేస్తున్నానా? వాళ్ళ విశ్వాసానికి పాత్రురాల నౌతున్నానా?

44. పిల్లల సమక్షంలో పెద్దలను, ఉపాధ్యాయులను, మఠకన్యలను గురువులను విమర్శిస్తూంటానా?

45.పిల్లలను భావిజీవితానికి తయారుచేస్తూన్నానా? ఆడపిల్లలకు ఇంటిపనులు నేర్పి వాళ్ళను వివాహజీవితానికి చక్కగా తాయరుచేస్తున్నానా?

46. పిల్లల స్నేహితులు స్నేహితురాళ్ళు ఎవరో నాకు తెలుసా? వాళ్ళు ఇంటికి వచ్చినపుడు ఆదరంతో చూస్తుంటానా?

47. పిల్లలు ఇంటిలో వున్నపుడు సంతోషంగా వుంటున్నానా? సమస్యలు వచ్చినపుడు వాళ్లు చనువుతో నా దగ్గరకు వస్తుంటారా? 48.వాళ్ళు బడి పాఠాలను అడిగినపుడు సహాయం చేస్తుంటానా? వాళ్ళు ఉపాధ్యాయులతో పరిచయం కలిగించుకుంటూన్నానా?

49.పిల్లలు సకాలంలో క్రైస్తవ సంస్కారాలు పొందేలా చూస్తున్నానా?

50.వాళ్ళను గుడికి పంపిసూంటానా? వాళ్ళచే బైబులు చదివించి ప్రార్ధన చేయిస్తుంటానా?

51.వాళ్ళ మాట విననపుడు వివేకంతో ప్రవర్తిస్తుంటానా లేక గంపెడంత నోరుచేసికొని ఊరంతా వినేలా మాటలాడుతుంటానా?

52.ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు. నా జీవితం పిల్లలకు ఆదర్శప్రాయంగా వుందా?

53. పిల్లల్లో ఎవరైనా దేవుని పిలుపు వింటే బాగుండు అనే కోరిక నాలో వుందా?

54. పిల్లలు వివాహ జీవితంద్వారా మాత్రమేగాక కన్యా గురు జీవితాల ద్వారాగూడ ధన్యులౌతారు అనే భావాన్ని నేను అర్థంచేసికుంటున్నానా?

55. పిల్లలను విడచి వుండలేనన్న నెపంతో వాళ్ళను దైవసేవకు అర్పించడానికి నిరాకరిస్తున్నానా?

ప్రశ్నలు

అధ్యాయం -1

1.ఆదిదంపతుల జీవితంలో కన్పించే దేవుని పోలిక, సహాయురాలు, సంతానం, పరస్పర ప్రేమ అనే నాలు భావాలను వివరించండి.

అధ్యాయం - 2

1.క్రీస్తు తిరుసభల పోలిక క్రైస్తవ భార్యాభర్తల మీద ఏలా సోకుతుంది? సోకి ఏమి చేస్తుంది?

అధ్యాయం - 3

1.సహజమైన వివాహబంధాన్నే క్రీస్తు సంస్కారంగా మార్చాడని నిరూపించండి.

అధ్యాయం - 4

1.వివాహ విధిలో ముఖ్యమైంది వధూవరుల అంగీకారమేనని నిరూపించండి.

2.వధూవరులే ఒకరికొకరు వివాహ సంస్కారాన్ని ఇచ్చుకొంటారని రుజువు చేయండి.

అధ్యాయం - 5

1.బహుభర్తృత్వం, బహుభార్యాత్వం చెల్లవని నిరూపించండి. 2. క్రైస్తవ వివాహానికి విడాకులు పొసగవని నిరూపించండి.

అధ్యాయం - 6

1.వివాహం ఆశయాలను విశదీకరించండి. 2. వివాహం సంస్కారం ఇచ్చే ప్రత్యేక వరప్రసాదాన్ని వివరించండి.

అధ్యాయం - 7

1.వివాహ జీవితం ఎలా ప్రేమసమాజ మౌతుందో తెలియజేయండి.

అధ్యాయం - 8

1.వివాహ జీవితంలో సిలువలు ఎదురైనపుడు దంపతులు ఏమి చేయాలి?

అధ్యాయం - 9

1.లైంగిక క్రియలో నిస్వార్థంగా ప్రవర్తించడం అంటే యేమిటి? 2.ప్రార్థన సంస్కారాలు కుటుంబీకులను ఎలా పవిత్రపరుస్తాయి?

అధ్యాయం - 10

1.గురుకన్యా జీవితాల్లాగ వివాహ జీవితంగూడ ఓ పిలుపేనని నిరూపించండి.

అధ్యాయం - 11

1.వివాహమాడబోయే యువతీ యువకులకు ఒకరిపట్ల ఒకరికి ఏలాంటి భావాలుండాలి?

అధ్యాయం - 12

1.పెండ్లికాకముందు యువతీయువకుల పరిచయాలు ఏలా వుండాలి? 2.పెండ్లి చేసికోకముందు వధూవరులు ఒకరిని గూర్చి ఒకరు ఏయే వివరాలను తెలిసికొని వండాలి?

అధ్యాయం - 13

1.క్రైస్తవ కుటుంబాలు ఏలా దేవాలయాలుగా రూపొందాలో వివరించండి.