పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేమన కాల దేశములు

19

పేరు, ఊరు, ఔదార్యము మొదలగున వన్నియు వినియో యూహించియో వ్రాసి, మనకొరకు పరి పూర్ణమైన వ్యక్తిని చేతికందిత్తురు. ఆధునికులు ఉన్నదనుట ఇప్పుడు లేదనుకొనుటయే మంచిదిగాన, వేమన్నకు తండ్రియే లేఁడని యననుకొని, తండ్రిలేని కుమారుఁడు సృష్టిలో లేకపోవుటచే, ఒకవేళనుండినను అతని, విచారము మనకేమియు తెలియదని చెప్పి తండ్రియను నొక పదార్ధమును మాత్రము నామరూపాదు లొక్కటియు లేక మనతలఁపునకుc దెత్తురు.

మఱియు నమ్మవలసిన సందర్భము లందును ఇరువురి నమ్మకము లందు చాల భేదము గలదు. ప్రాచీనులలో నమ్మకమునకు అనుభవప్రమాణము గాని, యనుమాన ప్రమాణముగాని పనిలేదు. మన చేనిలోపండిన పచ్చకాయలను పాపరకాయలును రాసులుగాఁ బోసి, వానినొకమాఱు చేతితో తాఁకిన మాత్రమున బంగారుముద్దలుగాఁ జేసి యన్నగారికి ఇనామిచ్చినాఁడని వారు సందేహము లేక నమ్మి వ్రాయుదురు (చూ.వే.సూ.ర.పీఠిక, పు. 29). ఇట్టి దానిని ప్రత్యక్షముగా జూచుట యట్లుండనిండు. 'ఈ సామర్థ్యము గలవాఁడు, చేనుదున్ని, విత్తి, కోసి, కూలియిచ్చి-ఇంత యవస్థపడనేల? ఇంటిలోని యన్నగారి యినుపపెట్టెనో లేక పెరటి మట్టిగోడనో తాఁకి బంగారుగాఁ జేయవచ్చునే! ఏమి వెఱ్ఱివాఁడు వేమన్న! యని యూహింపవలసిన యక్కరయే పురాణములు వ్రాయువారి కుండదు. విషయ మెంత యసాధ్యమైన వారికంత యొక్కువ నమ్మకము. ఇంక చరిత్రకారుని తీరు వేఱు, అతనికి పరమ ప్రమాణము ప్రత్యక్షము. అనుభవబలములేని యనుమాన ప్రమాణమును ఆతనికి పనికిరాదు. మకియు తన కాలపు టనేకజనుల ప్రత్యక్షాను భపమేతప్ప తనయెుక్కని యనుభవమునకు వచ్చియుండినను తన్నుతానే యతఁడు నమ్మఁడు. ఇతరులు నమ్మరను భయ మతనికి మెండు. బంగారము కృత్రిమమైస వస్తుపుగాక సహజములైన ప్రకృతులలో నొక్కటిగావున, వేఱుపదార్ధమేదిగాని బంగా రముగా మార్ప వీలులేదని యాధునిక రసాయన శాస్త్రజ్ఞుల సిద్ధాంతమcట. కావున *తనకుఁ దెలియనిది తనతాతకును దెలియదు" అను నహంకారశాస్త్ర ప్రథమ సూత్రము ప్రకారము, అతఁడు రసవాద విద్యయే మిథ్యయని సిద్ధాంతముగా నమ్మును. తానొక వేళ పత్యక్షముగాఁ జూచినను 'ఇదేదో కనుకట్టువిద్య' యనుకొని తృప్తిపడును.


పై యిరువురికిని సమానధర్మ మొకటి కలదు.అదే దనగా అభిమానము, తమ జాతి, మతము, దేశము, భాష మొదలగు వానిపై నిరువురికిని అభిమానము మొండు. పురాణ కారుల యభిమానముచే అతిశయోక్తు లు ప్రబలినవి; చరిత్రకారుల యభిమానముచే అసత్యములు ముందుకు వచ్చినవి. అతిశయోక్తులును అసత్యములే యైనను అం దలంకార మున్నది. ఇందులో లే దంతే. బసవేశ్వరుఁడు ఆంధ్రుఁడని సాధించు అసత్యమునకన్న, భీముఁడు బండెఁడు పనసపండ్లను ఏకాదశి ఫలాహారము చేసెనను అతిశయోక్తిలో సొగసెక్కువ పురాణముల వారు తమజాతియే సృష్టికర్త తలమీది తుది వెంట్రుకనుండి పుట్టినదనియు తమ మతమే భగవంతు డుపదేశించిన మోక్షమార్గమని, తమదేశమందలి వీధులమన్ను గూడపుణ్యభూమి యని, తమ భాషయే దేవభాషయని, ఇతరజాతిని స్పృశించరాదని, ఇతరమతము నరకహేతువని, ఇతరదేశమున కాలుపెట్టిన గత్తిరించు కొనవలయుని -- ఇతర భాషలాడిన నాలుకను దర్భతో గాల్చవలయునని --- వ్రాసుకొనిరి. చరిత్ర