పుట:Veemana, Rallapalli Ananthakrishna Sharma.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేమన 102

విషయమును నిర్ణయించుట సాహనము. మరియు నిద్దుఱు ఎవరి కెవరైనను గురువు కాఁగల సామర్థ్యముగలవా రనుటలో సందేహము లేదు.

కన్నడ వచనకారులు

ఇతనివలెనే యోగమార్గము నాశ్రయించి శివ సాక్షాత్కారమునకై ప్రయత్నిం చినవారు కన్నడ వీరశైవులలో ననేకులు గలరు. వారిలో పెక్కురు తమ తమ యనుభవములను, సిద్ధాంతములను కొంత పద్యపు నడకగల 'వచనముల'లో వ్రాసి నారు. బనవేశ్వరుఁడే యీ పద్ధతిని మొదలుపెట్టినవాఁడని తోఁచుచున్నది. వీరు సర్వజ్ఞ వేమన్నలవలె చిక్కిన విషయములకెల్ల చేయి వేయరు, వేసినను నిర్వహించు కొనఁగల కవితాశక్తియు వారికి లేదు. ఇతరుల బాహ్యాచార ఖండనము, స్వమత మందలి భక్తి, శివపారమ్యమందలి నమ్మిక, శివయోగ సాధనపద్ధతులు-ఇవి వీరి వచనములయందు ప్రముఖముగాఁ గానవచ్చును. వీరిలో కొందఱు స్త్రీలును గలరు. మచ్చుకు రెండు మూఁ డాంద్రీకరించి చూపదును.

(1) ‘లోకపు వంకరను మీరేల తీద్దెదరు? మీమీ తనువుల నూరడింపఁడు; మీమీ మనసుల నూరడింపఁడు. పొరుగింటివారి దుఃఖమున కేడుచువారిని మెచ్చఁడు కూడలి సంగమదేవుఁడు."

(బసవేశ్వరన వచనగళు, శివానుభవ గ్రంథమాల, బిజాపుర, ప 19)

(2) “నా దేహమును దండముగాఁ జేయవయ్య; నా తలను సార బుట్టగా చేయవయ్య; నా నరములను తంతులను జేయవయ్య; నావేళ్ళను పుల్లలుగా జేయవయ్య ముప్పదిరెండు రాగములు పాడవయ్య ; ఎదకొత్తుకొని వాయింపవయ్య కూడలి సంగమదేవా !"

(పై, పు. 70)

(3) కొండపై నిల్లు గట్టుకొని మృగములకు వెఱచిన నెట్లయ్య? సముద్రపు గట్టున నిల్లు గట్టుకొని నురుగుతరగలకు భయపడిన నెట్లయ్య? సంతలో నిల్లు గట్టి శబ్దమునకు సంకోచించిన నెట్లయ్య? చెన్న మల్లికార్జునదేవ ! వినవయ్య ! లోకమునఁ బుట్టిన పిదప స్తుతినిందలు వచ్చిన మనసున కోపెంపక నెమ్మదిగా నుండవలెను."

(మహాదేవియక్క కర్ణాటక కవిచరితె, 2, భా, పు. 109)

(4) ఏనుఁగును గాదని యెనుఁబోతు నెక్కిన నెవరేమి చేయుదురు ? కస్తురి విడిచి బురదc బూసుకొన్న నెవరేమి చేయుదురు? పాయసము విడిచి మద్యము త్రాcగిన నెవరేమి చేయుదురు? తెలిసి తెలిసి గుహేశ్వరుని శరణులతో వాదించిన నేవరేమి చేయుదురు చెప్పుమా మడివాళయ్య

(వచనశాస్త్రసార, 1 భాగము, పు. 108)

వీరందఱు మొత్తము మీఁద శివాద్వైతవాదులు. ఇట్టి వచనములు కన్నడ భాషలో లెక్కలేనన్ని కలవు.

ఇదిగాక విష్ణుభక్తిగల కన్నడ మాధ్వులలో పండితులట్లుండఁగా, పామరులలో సామాన్యమైన యీ వేష భాషలు, వాదములు, జాతిభేదములు మొదలగువాని ప్రాబల్యమును జూచి యసహ్యపడి, యా భావములను తమ భక్తిని పాటలరూపమున వెల్లడిపఱఁచిన పురందరదాసు, కనకదాసు మొదలగువా రనేకులు గలరు. వీనినే “దేవరనామము' లందురు. మనలో రామదాసు, త్యాగరాజు మొదలగువారి కీర్తన లిట్టివే. తత్త్వసిద్ధాంతములం దెంత భేదమున్నను మతాంతరులయెడ ద్వేషా