విజ్ఞాపనము
ఈజీవితచరిత్రను రచియించునుద్దేశము నాకు చిరకాలమునుండియు కలదు. శ్రీ తాతగారు జీవించియుండినపుడు నేనొకపరి బాస్వెల్ మహాశయవిరచిత డాక్టర్ జాన్సన్పండిత జీవితచరితమును చదివితిని. నాటినుండియు శ్రీతాతగారి భాషాసేవపై నాదృష్టి మరలెను. తమ జీవితచరితమునందలి విషయలను వారు నాకును తమ శిష్యబృందమునకు చెప్పునప్పుడు గ్రహించి గ్రంథస్థములంజేయుచు వచ్చితిని. వారు చనిపోవుటకు కొన్ని నెలలుముందు, ఒకపరి, చిరకాలముగా తమకడ పడియుండినజాబుల నన్నిటిని, కొన్నిటిని చింపియు, కొన్నిటిని చింపకయు పాఱవేసిరి. వెంటనే వానివల్ల నేను సేకరించుకొంటిని. శ్రీవారు పరమపదించినవెనుక వారి గ్రంథములను పఠించియు, తమ్ముగూర్చి వారు ఎచ్చటెచ్చట నేమేమి చెప్పుకొనియుండిరో వానినెల్ల సేకరించియు, వారికి వచ్చినజాబులను ఆధారముగా నుంచుకొనియు కాలానుక్రమణిక నేర్పఱచుకొని జీవితచరిత్రను అప్పుడప్పుడు వ్రాయుచు థ్యానించుచు నుంటిని. నెల్లూరిలో నామిత్రులును, తాతగారిశిష్యులును కొందఱు, నిరంతరము తమ గురువర్యులనే థ్యానించుచుండువారు, ఈవిషయమై శ్రద్ధ వహింపసాగిరి. అప్పుడప్పుడు సంభాషణలనడును తాతగారిచరిత్రనే ఒకరికొకరము చెప్పుకొనుచు మా యభిప్రాయములను దృడీకరించుకొనుచు వచ్చితిమి. పత్రికలలో నెవరో యొకరు వారింగూర్చి