చిరి. 'ఒరేయి, మనకక్కరలేదు ఈచదువు', అనీ కలియబలికికొని శాస్త్రులవారును వారి సోదరులును మఱి తండ్రిగారికి కనబడక తిరిగి ఆ 'చదువు'ను తప్పించుకొనిరట. అప్పుడు శాస్త్రులవారికి దాదాపు పండ్రెండు సంవత్సరము లుండును. ఇదియే వీరు తండ్రిగారికడ కూర్చుండి చదివినదంతయు; తర్వాతి పాండిత్యమంతయు స్వయంకృషియే.
పెద్దవారైన వెనుక తండ్రిగారు వినునట్లు బిగ్గరగా చదువుకొనుచు అర్థము చెప్పుకొనుచుండుటయు, ఎచ్చటనైనను వీరు తప్పిపోయిన తండ్రిగారు 'ఆ', అనుటయు, వెంటనే వీరు దిద్దుకొనుటయు జరుగుచుండెడిది. ఎప్పుడైనను సందేహము లుండిన నడుగువారేగాని అక్షరమక్షరమును తండ్రిగారికడ నేర్చుకొనలేదు.
విశాఖపట్టణము నార్మలు స్కూలులో 6 రు లు,స్టయిపెండు పై (విద్యార్థివేతనము) చదివి అట మెట్రిక్యులేషను (1869 సం) మొదటి తరగతియం దుత్తీర్ణులైరి. శాస్త్రులవారు మెట్రిక్యులేషను పరీక్షకుపోవుటకు పైకము కట్టవలసివచ్చినది. తండ్రిగారు పైకము చెంతలేక ఒకానొక పెద్దమనుష్యుని చేబదులడిగిరి. అతనికి శాస్త్రులవారనిన కిట్టదు. "అయ్యా! ఎందుకండీ, మంచిడబ్బు పాడుచేసుకుంటారు? మీఅబ్బాయికి ప్యాసుకాదు, వృథా." అనెను. అంతట వేంకటరమణశాస్త్రులవారు కొమారునితో "ఒరే, నాయనా, నీకు ప్యాసుకాదంటాడురా ఆయన ఎం