24-ప్రకరణము
ఆంధ్రభాషాభిమాని సమాజము
రంగనాయకులపేటలో నున్నంతకాలము తాతగారికి విద్యావినోదములచే కాలము జరుగుచుండెడిది. నిత్యము సాయంకాలములయందు శిష్యులువచ్చి వాకిట తిన్నెపై సమావేశమై సంస్కృతాంధ్ర కావ్యనాటకములను వారికడ చదువు చుండిరి. ఆంధ్రభాషాభిమాని సమాజము, నాడు, 1900 సంవత్సరప్రాంతమున, స్థాపితమైనట్టిది, నిరంతరాయముగా జరుగుచువచ్చినది.
కందాడై శ్రీనివాసన్గారు (దొరసామయ్యంగారు), నేలటూరు తిరువేంగడాచార్యులు (బంగారయ్య) గారు, కొండగుంట వేంకటరమణశాస్త్రి గారు, గుంటూరు శివకామయ్యగారు, నందగిరి హనుమంతరావు గారు, యరగుడిపాటి వేంకటాచలము పంతులవారు, వారి సోదరులు య. గోపాలకృష్ణరావుగారు, (నేటిప్రసిద్ధసినిమాదర్శక శిఖామణులలో నొకరగు వై.వి. రావుగారి తండ్రిగారు) ఇంకననేకులు మొదటమొదట తాతగారి శిష్యులై ప్రతాపరుద్రీయము, ఉష, శాకుంతలము, నాగానందము, లను నాటకములను నెల్లూరిలో ప్రదర్శించుచుండిరి. ఈ నటులందఱు బి.ఏ.లు. పైగా సంస్కృతాంధ్రములయందు మంచి ప్రవేశముగలవారు. కందాడై శ్రీనివాసన్గారు, క్రైస్తవ కళాశాలలో తాతగారి శిష్యులైయుండినవారు, సమాజమున