మల్లన్న : ఆ విభ్రాంతాత్మతోనే నాన్నగారు భాగవతము పూర్తి చేస్తున్నారు. ఆత్మీయతతో అతిశయించే ఈ భాగవతమంటే భ్రాంతి నీ మతినికూడా పోగొడుతుందో లేదో చూదము.
శ్రీనాథుడు : ఈపాటికే మామతి పొయ్యెటట్లయితే ఈ దిగ్విజయాలేం చేస్తాము. ఈ కనకాభిషేకాలేం చేయించుకుంటాం.
మల్లన్న : మామా! ప్రారంభించమన్నావా. ఈ కూశాస్తరణం మీద కూర్చొని వింటే ఎంతో బాగుంటుంది.
శ్రీనాథుడు : ఇలాగే తిరుగుతూ వింటుంటే విశేషాలు త్వరగా తల్లో ప్రవేశిస్తవి. కానీ.
మల్లన్న : (గొంతు సవరించి వ్యాసపీఠానికి నమస్కారం చేసి)
శ్రీకైవల్యపదంబు చేరుటకునై
చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా
సంరంభకున్ దానవో
ద్రేక స్తంభకు,
(అని వరుసగా చదువుతూ ఉంటాడు)
మూడవ దృశ్యం
(సాయం సమయం - వేదికమీద సంధ్యారుణ కిరణ ప్రసారం వల్ల కిమ్మీరిత మౌతుంటుంది. శ్రీనాథ మహాకవి నీలాకాశం వైపు చూస్తూ ఆలోచించుకుంటూ మధ్య మధ్య బంగారపు టొరలోనుంచి ఘంటం బయటకు తీస్తూ తాళపత్ర గ్రంథం మీద వ్రాసుకుంటుంటాడు. మల్లన్న అప్పుడే పొలం నుంచి తిరిగి వచ్చే వేషంతో ముల్లుగర్ర, చెన్నకోల దూరంగా పెట్టి దగ్గరికి వచ్చి కూర్చొని)
మల్లన్న : ఏమిటా గ్రంథం మామా!
శ్రీనాథుడు : కాశీఖండం మల్లన్నా - వచ్చే వసంతోత్సవాలల్లో రాజమహేంద్రవరం వీరభద్రారెడ్డికి కృతి ఇవ్వాలి. మొన్న మేమంతా కాశీయాత్రకు వెళ్ళినప్పుడు ప్రసంగవశాత్తూ ఆయనకు ఆ క్షేత్ర మాహాత్మ్యం చెప్పవలసి వచ్చిందిలే.
ఏకాంకికలు
357