iii
ఓం నమో వేంకటేశాయ
* ముందుమాట *
15-07-2008.
భూమన కరుణాకరరెడ్డి
అధ్యక్షులు,
తి. తి. దేవస్థాన పాలకమండలి,
తిరుపతి.
తరిగొండ వెంగమాంబ రచించిన కృతుల్లో చివరిది "వాసిష్ఠరామాయణము". ఇది ద్విపద కావ్యం. ఇందలి విషయం వేదాంతం. రఘువంశీయుల కులగురువయిన వసిష్ఠుడు విశ్వామిత్రుని ప్రేరణచేత శ్రీరామునకు అనేక తాత్త్విక విశేషాలను పెక్కు కథల రూపేణ క్రమంగా, విశదంగా ఉపదేశిస్తాడు. ఇది యిందలి యితివృత్తం.
పరమయోగినియైన ఈ కవయిత్రి వాల్మీకి మహాకవి సంస్కృతంలో రచించిన "వాసిష్ఠ మహారామాయణ" కావ్యంలోని విషయాలను స్వీకరించి, వాటిని స్వానుభవంతో చక్కగా సమన్వయించి ఈ కావ్యాన్ని స్వేచ్ఛగా, సంగ్రహంగా ద్విపదలలో అనువదించింది.
యావద్ భారతీయ వాఙ్మయ మంతటిలోనూ అత్యుత్తమమైన గ్రంథంగా స్వామి రామతీర్థలాంటి మహాశయులచే కొనియాడబడిన ఈ "వాసిష్ఠ మహారామాయణా"నికి తెలుగులో రెండే రెండు అనువాదాలు గోచరిస్తున్నాయి. అందులో ఒకటి క్రీ.శ. 14-15 శతాబ్దుల నడుమ నివసించిన మడికి సింగన రచించిన పద్యానువాదం, రెండవది క్రీ.శ. 18వ శతాబ్ది ఉత్తరార్ధంలో తిరుమలక్షేత్రంలో విలసిల్లిన మహాయోగిని వెంగమాంబలేఖినినుండి వెలువడిన ప్రకృత ద్విపదానువాదం.