పుట:Tikkana-Somayaji.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ యధ్యాయము

89


దృక్కుల నరసి నెరసులఁ గొన్నిటి నారోపించుటచేఁ దృప్తి వహించి తద్రత్నంబుల నాత్మశేముషీశాణోపలంబుల నొరసిన నానెరసులు నుగుడ గుణంబులుగా నెక్కడఁ బరిణమించునో యని యట్లు సేయ నొల్ల కుందురు. ఈపరస్పర వైముఖ్యంబు కృతిరత్నంబుల యెడనగాక తఱచుగాఁ గృతిరత్న నిర్మాతలయెడం గూడ వ్యాప్తం బగు. "సమకాలమువారల మెచ్చరేకదా" యన్న ట్లీస్వభావము సమకాలికులయందును మఱికొంత మెండు. ఇందునకుఁ దార్కాణము లెన్నియేనిఁ జెప్పం జొప్పడు. తొల్లి భవభూతి బాణుని 'హటాదాకృష్ణానాంకతిపయపదా నాంరచయితాజనః' అని యాక్షేపించి నట్లును, 'నీయీకాపు కవిత్వపుమాటలు బాపనకవివరుని చెవికిఁ బ్రమదం బిడునే' అని రామకృష్ణుఁడు రామరాజభూషణుఁ దిరస్కరించి నట్లును ఆంగ్లేయకవీంద్రులలో నగ్రగణ్యుం డైన షేక్సిపియరును బెంజాన్సను లోనగువారు వేదు రని భావించినట్లును గ్రంధములచేఁ దెలియవచ్చుచున్నది. కాఁబట్టి కవీంద్రు లొండొరుల దోషంబులఁ బ్రకాశింపఁజేసి గుణంబుల నాచ్చాదింతు రనియు నొకవేళ గుణంబులఁ బ్రకాశింపఁ జేసియున్న వానిని సత్య మనినమ్మవచ్చు నీవిచారమునకు ఫలము. ఏలయీవిషయ మింతపెంచి వ్రాసితి నన్నఁ దిక్కనచరిత్రమునకు ముఖ్య సాధనము లైనయతని సమకాలికుల యభిప్రాయంబులు విశ్వసనీయంబులే యని చూపుటకై వ్రాసితిని."

తిక్కనసోమయాజి సామర్థ్యము తత్కృతాంధ్ర భారతమువలసనే మనకుఁ దేటపడుచున్నందునఁ గేతనవర్ణనలు నూటికిఁ దొంబదితొమ్మిదిపాళ్లు సత్యము లనిమనము విశ్వసింప వచ్చునని తెలుపుచుఁ బైవారియభిప్రాయముతో నేకీభవించు చున్నాఁడను.