పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆకసపు లోయలోని స్వర్ణది ఆమె కంఠము. ఆమె బుజాలు ఉదయ సాయంకాలాలు. లోకంలోని మధురాలు సేకరించి, కరిగిన బంగారులో ఒలికించి, పోతపోసి, మొనలుతేల్చి, ఆ మొనలపై స్విన్నత నందిన సరస్వతీ కంఠహారసోణ రత్నాలు పొదిగినవి ఆమె ముగ్ధవక్షోజాలు. ప్రాణముపోసి కొన్న బంగారువర్ణం ఆమె దేహకాంతి, శిల్పుల తపఃఫలం ఆమె రూపం.

    ఆమెను పూజించాను.ఆమెకు షోడశోపచారాలు అర్పించాను. మల్లె పూలు వర్షము కురిపించాను. గులాబిపూలు ధారలు కట్టాను. మాలతీ జాజీ మాధవీ పుష్పాలు దోసిళ్ళర్పించాను. ఆణిముత్యాలు గుప్పిట సేసలు చల్లాను. నగల అర్పణలిచ్చాను. ఆమె ఎదుట మోకరిల్లాను. మృదులాలై, సౌందర్య శ్రీలు చెన్నారే, ఆమె చిన్నారి పాదాలు నా హృదయాన్ని చేర్చుకొని ఫాలానా అదుముకొని ప్రతివేలు, పాదము యావత్తూ తనివోవ ముద్దు పెట్టుకొన్నాను.

    ఆమెను సువ్వున పూలమాలలా యెత్తి నా హృదయాని కద్దుకొని, తీసుకొనిపోయి, మా తల్పం మీద పరుండబెట్టాను. ఆమె వివశయై ఈ లోకంలో లేదు. ఆమె మోము దివ్య కాంతులు ప్రసరిస్తున్నవి. ' శకుంతలా! శకుంతలా!' అని భయముతో, డగ్గుత్తికతో పిలిచాను. ఆమె చైతన్య రహితయై మారు పలకలేదు. ' శకుంతలా! శాకుంతలా!' అని అస్పష్టంగా వణికిపోతూ, నా కన్నుల నీరు జల జల వర్షిస్తుండగా పిలిచాను.

    ఆమె చిరునవ్వు నవ్వుతూ కన్నులు తెరిచింది. బంగారు వెన్నెల కిరణాలైన ఆమె చేతులు రెండూ నావైపు చాచి ' నేను మీ పూజకు తగుదునా ప్రాణేశ్వరా!' అన్నది.

    ' నా సర్వస్వము, నా తపస్సు, నా జన్మాశ్రయం, నీ పాదాల మ్రోలకాదా శకూ!'

    ' ఈ కల వినండి! మీరు పూజించగానే, నేనో గంధర్వ బాలికనై ఒక విమానంలో ఎగిరి వెడుతున్నానట. ' నా ప్రాణేశ్వరుడేడీ' అని దిక్కులు చూస్తూ వణికిపోతూ విమానంమీద కూర్చున్నాను. ఆ విమానం తిన్నగా చంద్రలోకం పోయిందట. అక్కడ ఓ కలవపూవుపై నామూర్తే పవళించి నిదురపోతూన్నదట. నేను వెళ్ళగానే ఆమూర్తి పెదవులు కదిపి ' నేను పూర్ణరూపాన్ని. నువ్వు నాలోసగం. పూర్తిగా మన తపఃఫలాన్ని నువ్వెలా అనుభవిస్తావు?' అన్నదట! భయపడి ఆమె పాదాలమీద వాలానట. ఇంతట్లో మీరు ' శకుంతలా!' అని దూరాన్నుంచి నన్ను పిలిచినారు, విని కూడా లేవలేకపోయాను. మళ్ళీ మీ పిలుపు వినబడింది. లేచాను. ఇంతలో నాకు మెలకువ వచ్చింది. నాకు చాల భయం వేసిందండీ.!'