ఈ పుటను అచ్చుదిద్దలేదు
నాయనా! ఎప్పుడు వచ్చావూ? ఇప్పుడు బండేముందీ! ఎక్కణ్నుంచీ? అని ప్రశ్న వేసింది.
నేను ప్రొద్దున మెయిలులో వచ్చానండీ....తిన్నగా మీ ఇంటికి రాలేకపోయాను.అదీ మంచిదే అయింది. వుడ్ లాండ్స్ లో దిగాను, కొల్లిపరనుంచే వచ్చాను. అక్కడకువచ్చి రెండు నెలలు కావచ్చింది. అక్కడ పాఠశాల పెట్టించాలని ప్రయత్నం చేస్తున్నా అని జవాబిచ్చాను. మా మామగారు నాయనా తిన్నగా ఇక్కడకు వచ్చేసేయి అన్నారు.
నేను : అలావద్దండీ. మనం ఇప్పుడునుకొన్న పని ఆలోచించి చేయాలి. నేను నాల్గురోజులుండి, మంచి యిల్లు మాట్లాడుకొని, ఇంటికి వెళ్ళి అమ్మను తీసుకొని వస్తాను. రేపు అడయారు ఉత్సవాలు కదా! అక్కడకు మీరంతా రండి. అక్కడ హేమను కలుసుకుంటాను.
అత్త : నాయనా నువ్వు ఫలానా అని హేమకు తెలియజేయక పోవడం మంచిదా! సరే ఆలోచిద్దాం....రేపు పదకొండు గంటలకు మా ఇంటికి రా! అప్పటికే అమ్మాయీ, లోకేశ్వరీ వెళ్ళిపోతారు.
హేమా! ఇదీ నాకథ. ఎంతో ఆలోచించి ఈలా చేశాను. నేను మీ బావానని ఒక ఏడాది పాటు చెప్పకుండా వుండడం బ్రహ్మయజ్ఞం అంత పని అయింది. మీ పాపారావు బాబయ్య రావడం భగవంతుని ఆజ్ఞలాంటిది అయింది. ఆయన ఇంక ఈ నాటకం చాలించమన్నాడు. లోకేశ్వరి ఒక నెల క్రిందటే నేను ఫలానా అని అనుమానపడింది. నన్నడిగింది. నిజం ఒప్పుకొని, కారణం చెప్పాను. ఆమె సంతోషంతో మా కుట్రలో చేరింది. నా పని కుట్రవంటిదే! నువ్వులేని సమయాలలో నేనూ,అత్తగారూ, మామగారూ ఈ విషయాలే మాట్లాడుకొనేవాళ్ళం. నాకు తిబెత్తులో వచ్చిన బిరుదు త్యాగతి శర్వరీ భూషణ్ అనే పేరుతో అడయారులో నిన్ను దర్శించాను. నీ త్యాగతి ఈలాంటివాడు హేమా!