పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/765

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పై ఉదాహరణనుబట్టి పల్నాటి వీరచరిత్రను కాశీ కావడి ద్వారా, చీరల మీద చిత్రించిన బొమ్మల ద్వారా వీరి కథను చెప్పినట్లు వూహించవచ్చును.


చిన్న మాదిగలు

కేవలం మాల మాదిగలను మాత్రమే యాచించే వీరిని చిన్న మాదిగలంటారు. సర్కారు ప్రాంతంలో కూడ ఇలా యాచించే వారున్నారు. చిన్న మాదిగలు ఊరూరా సంచారం చేస్తూ ప్రదర్శిస్తారు. వీరిది పగటి ప్రదర్శనం. వీరి ప్రదర్శనం వీధి భాగవతానికి దగ్గరగా వుంటుంది. వేషధారణ కూడా అంతే. వీరి కథాఇతివృత్తం చారిత్రాత్మకమైనది. వీరు ఏ గ్రామంలో ఎన్ని ప్రదర్శనాలు ఇచ్చినా ఒక వారం రోజుల కన్నా ఎక్కువ ఆ గ్రామంలో వుండరు. ప్రదర్శనలన్నీ ముగిసిన తరువాత చివరి రోజున ఒక తంతు నడుపుతారు. నీచ దేవతలను తృప్తి పరచడానికి జంతు బలిచేసి బీభత్సంగా వేషం అలంకరించుకున్న ఒక యువకుడు శౌరాత్ర దేవతల ముందు తాండవం చేస్తాడట. గ్రామ ప్రదక్షిణం చేసి సమీపంలో వున్న చెరువులో స్నానం చేసి తిరిగి ఆ గ్రామానికి రాకుండా వెళ్ళి పోతాడట. ఈ విధంగా ప్రదక్షిణం చేయడం వల్ల పాడి పంటలకు, ప్రజలను శుభం కలుగుతుందని జానపదుల నమ్మిక.


అక్కన్న మాదన్నల భాగవత మేళం

గోల్కొండ తానీషా మంత్రులైన అక్కన్న మాదన్నల యాజమాన్యంలోనూ ఒక భాగవత మేళముండేదని మధురిమంగా పుంశ్చలీ విలాసంలో ఉదహరించబడిందని యస్వీ జోగారావు గారు తమ యక్షగాన వాఙ్మయంలో వివరించారు.

అక్కన్న మాదన్నల భాగవత మేళం కూచిపూడి భాగవతుల రీతిలో వుండి దేశ సంచారం చేసి, ప్రదర్శనాలను ప్రదర్శించింది.