పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/716

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
హరికథ:

క్రైస్తవ మతానికి చెందిన కథా రచయితలు, కథానాయకులు, దీనిని కాలక్షేపమనీ, సత్కథా గానమనీ అంటారు. బాపట్లలో 'ఇండియా బైబిల్ మిషను ' కు చెందిన షారోను ఆశ్రమ నిర్వాహకులు రెవరెండు మనోహర కవి వ్రాసిన 'అవతార విలాసం' 1959 లో ప్రచురింపబడింది. దీనిని ఆయన హరికథగా పేర్కొన్నాడు.

క్రైస్తవ కథాగానాన్ని రచించిన ప్రధమ కవి 'పిడతల జాన్ కవి.' (1876 - 1971) ఈయన భారత పురాణ కథల్ని వినడంవల్ల హరికథల్ని వినటం వల్ల అందులోని మెలకువల్ని తెలుసుకుని బైబిలులోని ఘట్టాలను అనుసరించి హరికథా కాలక్షేపాలుగా మలిచాడు. వాటిలో 'ఆదాం హవ్వలు ' 'క్రీస్తు జననం' పేర్కొన దగినది. అలాగే మంద పాటి అబ్రహాం భాగవతార్ 'ఏసు చరితము' 'అత్తోట రత్నకవి' 'సంపోను దెలీలా ' మొదలైనవారు వ్రాసినవి మాత్రమే లభ్యమౌతున్నాయి.

హరికథలు వ్రాసిన రచయితలు

బండారు ఇసాక్ భాగవతార్, కంబం జాకబ్, పాటి బండ్ల జాకబ్, పినపాటి జర్నియాబిరినీడి మోషే కవి, కంచం జాకబ్, చందోలు ఆనంద కవి మొదలైన వారు క్రీస్తు గాథల్ని హరికథలుగా వ్రాసున్న ప్రముఖులు. వీరు క్రైస్తవ హరికథల్నే కాక హిందూ పురాణ గాధల్ని కూడ వ్రాయడం చెప్పుకోదగిన విషయమంటారు ఆనందన్ గారు.

అంతే కాదు-మన పురాణ గాధల్ని హరి కథలుగా వ్రాసే రచయితలు క్రైస్తవ ఇతివృతాలను కూడ హరికథలుగా వ్రాస్తున్నారు. అలాంటి వారు జిన్నా అప్పారావు, అన్నం నాగ భూషణం, చేకూరి లక్ష్మీనారయణాచార్య, పెద్దింటి సూర్య నారాయణ దీక్షితులు మొదలైన వారు రచనలు చేస్తున్నారు.