పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/691

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శ్రీనాథుని వీర చరిత్ర:

ఎవరు కథలు చెప్పినా అందరూ శ్రీనాథుడు వ్రాసిన పల్నాటి వీర చరిత్రనే ఇరవై అయిదు భాగాలుగా రోజుల తరబడి చెపుతూ వుంటారు.

అయితే ఆ వీరుల పౌరుషాలను వల్లిస్తూ చిలువలు పలువలు కల్పించి మరి కొన్ని గాథల్ని కూడ ప్రచారం చేశారు. అలా శ్రీనాథుని చరిత్రను ఆధారం చేసుకుని కొండయ్య కవి మరికొన్ని గాథలను కూడా రచించి ప్రచారంలోకి తెచ్చినట్లు చెపుతారు.

అయితే కొన్నికథలు ఈనాటికీ కొన్ని కంఠస్థంగా వున్నవీ, తాళపత్ర గ్రంధాలలో వున్నవీ కూడా వున్నాయి. అయితే వీటినన్నిటినీ ఒక చోటుకు చేర్చే ప్రయత్నం జరగక పోయినా, అక్కిరాజు ఉమాకాంతం గారు ప్రథమంలో బాలచంద్రుని కథను ప్రచారంలోకి తీసుక వచ్చారు. ఆ తరువాత పింగళి లక్ష్మీకాంతం గారు మరికొన్ని గాధల్ని వెలుగులోకి తెచ్చారు. అలాగే కాటమరాజు కథల్ని, పరిశోధించిన డా॥ తంగిరాల సుబ్బారావు గారు కూడా ఇరవై అయిదు కథల్ని వెలుగులోకి తెచ్చారు. అలాగే ముదిగొండ వీరభద్రకవి గారు వీర భారత గ్రంధంలో అనేక గాథల్నీ వర్ణించారు. ఇక మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంధాలయంలో పల్నాటి వీరచరిత్రకు సంబంధించిన వివరాలు కొల్లలుగా దొరుకుతాయి.

కన్నమదాసు వారసులే కథకులు:

సంప్రదాయంగా ఈ వీర గాధల్ని ప్రచారం చేసేవారు, వీర విద్యావంతులైన మాల కన్నమదాసు కులానికి చెందిన వారు చెపుతారు. ఇది వారి పారంపర్య హక్కుగా భావిస్తారుట: బ్రహ్మనాయుడు మాల కన్నమదాసుని చేరదీసి కులమత భేదాలు లేవని చాపకూటి సిద్ధాంతాన్ని అమలుపర్చాడు; అందువల్ల పల్నాటి వీర గాథల్ని ప్రచారం చేయడానికి బ్రహ్మనాయుడు, మాలలనే ఆదేశించాడనే కథ ప్రచారంలో వుంది. ప్రచారానికి నిదర్శనం ఈనాటి వీర విద్యావంతులే.

గతించిన చరిత్రలో కాకతీయుల కాలంలో ఓరుగల్లు వీథుల్లో పల్నాటి వీరగాథల్ని చెప్పినట్లూ, వారుపయోగించిన వాయిద్యాలను గురించీ, వాటి ఉధృత ధ్వనులను గూర్చీ క్రీడాభిరామంలో ఉదహరించబడింది.