పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/607

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
గజాసురుడు, గఆంగిరెద్దుల వారు:

అసలీ గంగిరెద్దుల వారికి కథకు మూల మేమిటయ్యా అని ప్రశ్నిస్తే వారు చెప్పిన కథాంశాన్ని కె.వి. హనుమంత రావు గారు ఆంధ్రప్రభలో ఈ విధంగా వివరించారు.

పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కటాక్షం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని వరమడిగాడట: అందుకు గజాసురుడు మీరు నా గర్భంలో ప్రవేశించి, పూజలందుకో మంటాడట. అందుకు శివుడు అంగీకరించి అతని గర్భంలో ప్రవేశిస్తాడట. అంతర్థానమైన పతి దేవుని జాడ తెలియక పార్వతీ దేవి దుఃఖించి గజాసురుని గర్భంలో వున్నట్లు తెలుసుకుని పతిని విముక్తిని చేయమని విష్ణుమూర్తిని వేడుకుంటుందట. అప్పుడు విష్ణువు గంగిరెద్దుల మేళాన్ని రూపకల్పన చేశాడట. నందికేశ్వరుణ్ణి గంగి రెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలతో వివిధ వాయిద్యాలను ధరింపచేసి, తాను మేళానికి నాయకత్వం వహించి _ గజాసుర పురానికి చేరి గంగిరెద్దుల ఆటను నిర్వహిస్తాడట.

ఈ విషయం గజాసురుని చెవులబడి తన సమక్షంలో ఆ ఆటను ప్రదర్శించమని కోరుతాడట. అందుకోసమే ఎదురు చూచిన విష్ణుమూర్తి అద్భుతంగా ఆటను నిర్వహిస్తాడట. గజాసురుడు ఆనందభరితుడై ఏం కావాలో కోరుకో మంటాడట.

తన పాచిక పారిందనుకున్న హరి... ఇది శివుని వాహనమైన నంది తన స్వామికి దూరమై విలపిస్తూ వుంది. ఆ స్వామిని నంది కడకు చేరనియ్యి అని కోరతాడట.

ఆలోచనలో పడ్డ గజాసురుడు, ఇతను అసుర సంహారి యైన చక్రధారి అనీ, ఇక తనకు మృత్యువు తప్పదనీ తెలుసు కున్న గజాసురుడు శివుని ప్రార్థించి, నందీశ్వరునికి ఎదురుగా నిలుస్తాడట.

అంతలో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా, కొమ్ములతో గజాసురుణ్ణి కుమ్మగా గజాసురుని గర్భం నుండి శివుడు బయట పడతాడట.

ఆడిన మాట తప్పని గజాసురుని శిరస్సు అన్ని లోకాల్లో పూజలందుకుంటుందనీ, అతని చర్మాన్ని తాను మేన ధరిస్తాననీ చెప్పి శివుడు గజాసురునికి శివైక్యాన్ని ప్రసాదిస్తాడట. ఇదీ గంగిరెద్దులవారి కథ.