పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/494

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
సామంతుల మయూర నృత్యం:

సామంతులు మాత్రమే ఈ మయూర నృత్యం చేస్తారు. సామంతులనే గోండులని కూడ అంటారు. సామంతులు ఎంతో వెనుకబడిన గిరిజనులు. విశాఖ పట్టణం, శ్రీకాకుళం జిల్లాలోని దుర్గమ్మ కొండ ప్రాంతపు అడవుల్లో ఈ గిరిజనులు కనిపిస్తారు. సామంతులు తరతరాలుగా కాపాడుకొంటూ వస్తున్న సాంస్కృతిక సంపదలో మయూర నృత్యం ఒక భాగం. గోండుల వివాహ సందర్భాలలోనూ, ఏప్రిల్ నెలలో వచ్చే చైత్ర పర్వ దిన సందర్భంలోనూ, సాధారణంగా ఈ మయూరి నృత్యం చేస్తారు. ఈ నృత్యంలో పిరోడి అనే మురళి కాళ్ళకు కట్టుకునే గజ్జెలు ముఖ్యమైనవి.

సామంతులు ఖరీదైన వస్త్రాలంకరణలు జోలికి పోరు. తెల్ల ధోవతి కట్టుకుంటారు. నర్తకు లందరూ పాదాలకు గజ్జెలు కట్టుకుంటారు. వీటిని సామంతులు "ముయ్యంగ" అంటారు. తలకు తోయంగ అనే తలపాగా ధరిస్తారు. తుంగ గడ్డితో చేసిన పొగాకు రంగుల గుడ్డ పేలికలను కుచ్చులుగా కడతారు. నడుము వంచినప్పుడు పింఛము విప్పిన నెమలి వలె కనిపించేటట్టు నెమలి పింఛముల గుత్తిని నడుముకు వెనుక బిగించుకుంటారు. మొదట నర్తకులందరూ రెండు వరుసలలో నిలుచుంటారు. నోటితో నెమలి అరుపును పోలిన శబ్దం చేస్తారు. వలయాకారంగా నిలిచి నాట్యం చేస్తున్న మయూరం పద్ధతిలో మోకాలిపై ముందుకు వంగుతారు. భూమాతకు సూర్య భగవానుడికి మ్రొక్కి నృత్యం ప్రారంభిస్తారు.

జోడియా:

అనే ఈ గిరిజన నృత్యాన్ని కొండ్య మట్టియా, జోడియా అనే జాతుల వాళ్ళు చేస్తారు. ఈ నృత్యాన్ని పులకమ్మ, గంగా దేవి, గసురమ్మ మొదలైన పండుగల సందర్భంగా చేస్తారు. ఇది ఆడ మగ కలిసి చేసే బృంద నృత్యం. పది అడుగుల కర్ర మీద ఇద్దరు నిల్చోగా మిగతా బృందం నాట్యం చేయడం దీని ప్రత్యేకత.

పూల పండ్లు:

ఇది శ్రీకాకుళానికి చెందిన సవర జాతి చేసే గిరిజన నృత్యం. దీన్ని పెళ్ళిళ్ళ సందర్భంలో, దేవీ పూజల సందర్భంగా చేస్తారు. ఇది ఆడ మగ కలిసి చేసే