పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/489

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిమ వాసులకు అద్దం పట్టే గిరిజన కళారూపాలు


తెలుగు దేశంలో ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో వున్న ఆదిమ జాతుల గిరిజన నృత్యాలు ఆంధ్ర ప్రజలకు ఏమీ తెలియవు. వారు ఆంధ్రదేశంలో బ్రతుకుతున్నా అది వారి వారి ప్రాంతాలకే పరిమితమై పోయి వారికి తప్ప ఇతరులకు తెలియకుండా పోయాయి. అందుకు కారణం వారి బ్రతుకంతా అడవులకే పరిమితమై వుండటం ఇతరులతో ఏ విధమైన సంబంధాలు లేకపోవడమే.

గిరిజనుల కళా రూపాలు:

ఆంధ్రదేశంలో అటు రాయల సీమ నుండి ఇటు ఇచ్చాపురం వరకూ అన్ని ప్రదేశాల్లోనూ కలిపి మొత్తం ముప్పై ఎనిమిది గిరిజన జాతులున్నాయనీ, వీరి జనాభా పదమూడు లక్షలనీ, డి.ఆర్. ప్రతాప్ గారి వ్వాసానికి ఆధారంగా నాట్యకళ జానపద కళల ప్రత్యేక సంచికలో ఉదహరించారు.

అదిలాబాదు జిల్లాలో గోండులు, కొలాములు, మధురాలు, ప్రధానులు, ఆంధ్రులు ముఖ్య జాతులు.

నాయిక పోడులు ప్రధానంగా కరీం నగర్ జిల్లాలో కనిపిస్తారు. వరంగల్, ఖమ్మం , ఉభయ గోదావరి జిల్లాల ఏజన్సీ ప్రాంతాలలో కోయలు, కొండ రెడ్లు ఎక్కువ.

విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల గొండ ప్రాంతాలలో బగతలు, కొండ దొరలు, వాల్మీకులు, మూల దొరలు, సామంతులు, గదబలు, మమ్మరలు, కోటియాలు ఎక్కువ కనిపిస్తారు.