పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు. నిపుణులు ప్రత్యేకంగా వరుసలు తీరి, వరుసక్రమంలో ఒక నాయకుని చెప్పు చేతలలో రకరకాల నాట్యవరుసల్నీ, అభినయాన్నీ నిర్ణయించేవారు.

క్రమానుగతంగా కాలం మారినకొద్దీ మానవుడు విజ్ఞానం పొందుతూ వచ్చాడు. వేష భాషల్లో మార్పు రాసాగింది. వారనుకునే దేవతాది అతీత శక్తులు క్రూర స్వభావాలు కలవి కావనీ, అవి మానవుల, లక్షల కొద్దీ జీవరాసుల రక్షణ కొరకే వచ్చిన శక్తులనీ భావించసాగారు. ఎంతో భక్తితో ఎల్లకాలం మమ్ము కాపాడాలని, ఆరాధిస్తూ భక్తిమయమైన గీతాలు, నృత్యాలు, భజనలు, అభినాయలతో స్త్రీ పురుషులు కలిపి తమ సంతోషాన్ని దేవతలకు తెలియచేసేవారు. తమ తమ బిడ్డలూ, పశువులూ, పంటలూ బాగుండాలనీ, వాటిని కాపాడే శక్తులు మీరేనని దేవతలను స్తుతించేవారు.

బ్రతుకు కోసం నృత్యగానాలు :

చల్లటి గాలుల్లో విహరించేటప్పుడు ఒడలు పొంగి ప్రకృతిమాత ఒడిలో ఒదిగి పోయి పాటలు పాడుతూ ఒడలు మరిచి నిద్రపోయేవారు. పండువెన్నెల విరిసే సుందర రాత్రులలో స్త్రీ పురుషుల పాటలు పాడుతూ నృత్యాలు చేసేవారు. వర్షం రాకపోతే రకరకాల వాయిద్యాలతో భూనభోంతరాలు దద్దరిల్లి పోయేటట్లు, పాటలతో, ఆటలతో, కేకలతో వుత్సవాలు చేసేవారు. క్రూరమృగాల బారినుండి రక్షించుకోవడానికి, ఆ యా మృగాల వేషధారణలతో, వాటి అరుపులతో, వాటి అభినయంతో కదలికలతో వెళ్ళి వాటిని సంహరించి, వాటి మాంసాన్ని తెచ్చుకునేవారు. వాటి చర్మాలను దుస్తులుగా మార్చుకునేవారు. కొన్ని జంతువుల చర్మాలను, పెద్ద వెదురు బొంగులను ముక్కలు చేసి ఆ రంధ్రాలకు చర్మాలను అమర్చి వాటిని వాయిద్యాలుగా మార్చుకునేవారు. ఈ విధంగా ఆనాటి అటవికులు జీవిత విధానాల కోసం, నృత్య గానాలను నేర్చుకోవడంతో జానపదకళలకు అంకురార్పణ చేసారు.

జానపద కళలకు పునాది :

ఇలా దేవతలను పొగుడుతూ వారి గుణగణాలను కథలుగాను, పాటలుగాను వ్రాసి పాత్రలను సృష్టించి ఒకడు ప్రధానుడై, సూత్రధారుడై మిగిలినవారిని నడిపిస్తూ కార్యక్రమం నడపటం వాడుకైంది. ఈ పద్దతి ఎప్పుడైతే వచ్చిందో ప్రతి