పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిదర్శనం. దీని ఇతివృత్తం వీర చరిత్రకు సంబంధించింది. పాడింది ద్విపద కావ్యం. వీర గుంభితను వాయించింది ఒక స్త్రీ. పైన వివరించిన వీరగుంభిత నేటి గుమ్మెటని పండితుల అభిప్రాయం. గుమ్మెట్ల వాద్యం గంభీరంగానూ, గుంభనంగానూ వుండే ధ్వని విశేషం అవడం వల్లదీనికి గుంభిత అనే పేరు వచ్చి వుండవచ్చు. ఈ గుంభితను ఆనాడు స్త్రీలు వాయించినట్లే ఈ నాటి కథల్లో స్త్రీలూ, పురుషూలూ కూడ వాయిస్తున్నారు. ఈ డక్కీలు పూర్వం నుంచీ వున్నవనడానికి కాశీఖండంలో శ్రీనాథుడు

వల్లకి చక్కి కాహళము వంశము డక్క హుడుక్క ఝర్ఘరుల్
ఝల్లని యాదిగా గలుగు శబ్ద పరంపర తాళ శబ్దమై

అని వుదాహరించడాన్ని బట్టి, డక్క హుడుక్క అనే దానిని బట్టి కాహళము మొదలైన వివిధ వాయిద్యాలతో పాడు ఢక్క అనే నేటి డక్కీని బుడబుక్కల వారు వుపయోగించే హుడుక్కను కూడ వుపయోగించి వుండవచ్చు. అలాగే పండితారాధ్య చరిత్రలో

అలరుచు బడి హరులట్ల ల్యందురును
లలినుచ్చి చాంగు భళా యను వారు

అనే దానిని బట్టి నేటి వంతలు పాడే 'భళానోయి భాయి తమ్ముడూ, మేల్ భళానోయి దాదానా' అనే దానికి దగ్గరగా వుండడాన్ని బట్టి 'తందాన తాని తంధనా, భళా, భళి' మొదలైన వంత విశేషాలు ఆనాటి నుంచీ ప్రచారంలో వున్నట్లు మనం తెలుసుకోవచ్చు.

బుర్రకథ గాన విశేషంగా రూపొందిందనడానికి పై ఉదాహరణలే గాక, క్రీడాభిరామంలో

రాగములనుండి లంఘించ రాగమునకు నుదురు సూరుదయ్యంబుపైనొత్తిగిల్ల
కామవల్లీ మహాలక్ష్మి కైటభారి వలపు బాడుచు వచ్చె జక్కుల పురంధ్రి.

జక్కుల పురంధ్రి వలపు బాడుచు వచ్చె అనే దానిని బట్టి గాన విశేషంగా రుజువౌతుంది.