పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైవిధంగా అంతా వల్లించి, దండోరా వేసినట్లు ఊళ్ళోకి ధాన్యమూ, పప్పులూ, ఉప్పులూ వచ్చాయనీ, ఉప్పు కుంచం వంద రూపాయలని, కావలసిన వాళ్ళంతా వచ్చి కొనుక్కోండహో. అని అంటూ వుంటే పల్లె జనం బిత్తరపోయి చూస్తూ వుంటారు. ఇలా ఈ వేషం ద్వారా విజ్ఞానాన్ని వినోదాన్నీ కలిగించేవారు.

పగటివేషంలో సాతాని వైష్ణవులు:

పైన వుదహరించిన సాతాని వైష్ణవుల మాదిరి, ముఖంమీదా, గుండెలమీదా, భుజాలమీదా పెద్ద పెద్ద నామాలు దిద్ది, అక్షయ పాత్రలు ధరించి, హర్మోనియం, మద్దెళ్ళతో త్యాగరాయ కీర్తనలు పాడుకుంటూ వచ్చి మేమంతా వైష్ణవుల మండీ, అయితే శ్రీ వైష్ణవులం మాత్రం కాదు. నూట అయిదు దివ్వ క్షేత్రాలు సేవించుకుని తిరుపతికి వెళుతున్నామనీ, కంటెలు గానీ, కాసుల పేర్లు గానీ దుద్దులు గానీ, జూకాలు గానీ, వడ్డాణం గానీ, వెండి బంగారం రూపేణా మీవద్ద ముడుపులుంటే మా అక్షయ పాత్రలో వెయ్యండి. మీరిచ్చే ముడుపులన్నీ స్వామి పేర కైంకర్యం చేసేస్తాం. మీరే వెళ్ళాలంటే, రానూ పోనూ చాల ఖర్చు అవుతుంది. పైగా శ్రమ. అందువల్ల మా వంటి భక్తులకు ఇచ్చారంటే, మరేదో కాలేదు. అంటూ ఈ విధంగా ఊదర గొడుతూ వుంటే చుట్టూ చేరిన జనం, దొంగభక్తుల మాటలకు ఉబ్బి తబ్బిబ్బు అవుతూ వుంటారు. ఈ వేషధారులు సమయానుకూలంగా విష్ణుపురాణం లోని ఘట్టాల ననసరించీ, శ్లోకాలనూ, పద్యాలనూ ఉదహరిస్తూ వుంటారు.

బాలరండా రుక్మాబాయి (వెధవముండల వేషం);
గోవింద నామాలు - ద్విపద నడక

ఆయువూ లేకను, గోవిందారామ,
ఆయనే పోయెను ॥గోవిందా॥
భుజము మీదా కొంగు ॥గో॥
బుర్రకు వచ్చెను ॥గో॥
బుట్టలో విభూతి ॥గో॥
నొస్టకు వచ్చెను ॥గో॥
కంట కాటిక బోయె ॥గో॥