పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణకీర్తనలు పాడుతూ వుండగా - యాదాలాపంగా నయితే నేమి..... అందులో అబ్బాయి తన్మయతను గమనించిన శృంగేరి పీఠాధిపతి

కృష్ణభక్తిని ప్రచారం చేయడానికి అతనిని దేశ సంచారం పంపినట్లూ, యాత్రలు చేసుకుంటూ చేసుకుంటూ అతడు కూచిపూడి గ్రామం వచ్చినట్లూ, వూరి వెలుపల దేవాలయం వద్ద మకాం వేసినట్లూ, ఇంతలో ఆ వూరి బ్రాహ్మణ స్త్రీలు ఊరి వెలుపల నున్న ఊరబావికి నీళ్ళకు వచ్చి, ఈ సిద్ధేంద్రుని దర్శించి నట్లూ చెప్పుతారు.

ఆనాటి ఆచారం ఏమంటే గ్రామంలోకి ఎవరైనా అతిథులు వస్తే ప్రథమంగా వారిని సత్కరించాలి. అలాగే వీరిని సత్కరించటానికై కూచిపూడి బ్రాహ్మణులు వారిని దర్శించి ఆతిథ్యాన్ని అందుకోమన్నారు. అందుకు ఆయన సమ్మతించి అన్నం దగ్గర కూర్చుని ఒక కోరిక కోరినట్లూ, దానిని వీరు శిరసావహించినట్లూ చెబుతారు. ఏమిటా కోరిక? తాను ఒక భాగవతం వ్రాశాడట. దానిని వారు ప్రదర్శించాలట. అదే ఆయన కోరికట. ఆ కోరికను తిన్నగా తీరుస్తానంటేనే భోజనం చేస్తానని తీర్మానంగా చెప్పాడట. అందుకు వారు మారు మాట మాట్లాడక సరే నన్నారట. ఇందుపై సిద్ధేంద్రుడు నాట్య శాస్త్రాన్ని వారికి బోధించడానికి ఇష్టపడి , వారు ఈ శాస్త్రాన్ని వంశపారంపర్యంగా ప్రతి గృహంలోనూ కుల వృత్తిగా గ్రహించి, ప్రతి బ్రాహ్మణ యువకుడూ ముక్కు కుట్టించుకుని, కాలిగి గజ్జె కట్టి, ఆవూరి నాటరాజు ఆలయంలో ఒక్కసారైనా నాట్య ప్రదర్శనం చేసేటట్లు వాగ్దానం చేయించుకుని, పారిజాతాపహరణమనే భామాకలాపాన్ని వారికి ఉపదేశించాడట. ఆయన ఆదేశానుసారం ఆనాటి నుండి ఈనాటి వరకూ వారు నాట్య విద్యలో దినదినాభివృద్ధి పొంది వివిధ దేశాలను సందర్శించి నానారాజ సందర్శనం చేసి శతాబ్దాల తరబడి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.


అక్షరాభ్యాసానికి ఆరంభం:

ఆనాటి నుంచే నాట్యంలో అక్షరాభ్యాసం చేయబడింది. వెంటనే సిద్ధేంద్రుడు బాలురనందర్నీ సమకూర్చి, వారికి నాట్యాభినయాన్ని, సంగీతాన్నీ నేర్పాడు. అనాటి నుంచి వారి భాగవతాల ప్రదర్శనలకు అంకురార్పణ జరిగింది. ఈ రీతిగా