పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ముక్కామల భూదాన శాసనం:

అలాగే క్రీ॥శ॥1208 లో దుర్జయాన్వయులైన విప్పరుల కొండప, గుండప నాయకుల ముక్కామల భూదాన శాసనంలో, సూత్రదారి బోమలయ అనే ఆయన ప్రతి గృహీతగా పేర్కొనబడ్డాడు. అతను బొమ్మలాట వాడే కావచ్చని యస్వీ జోగారావుగారు వ్రాస్తున్నారు.

గూడూరు శాసనం:

ఇంకా కాకతీయులకు సంబంధించిన తెలంగాణా శాసనాలలో వరంగల్ జిల్లా గూడూరు శాసనం ఒకటి ఈ బొమ్మలాట సమాచారాన్ని తెలియజేస్తూంది. శాసనం చివరి భాగంలో సూత్రదారి కొమ్మోజనహా బరహా అని వుంది. అంటే సూత్రధారి కొమ్మోజు వ్రాసినదన్న మాట. ఇది తెలుగు శాసనం.

అలాగే పానుగల్లు శాసనంలో సూత్ర ధారి బ్రహ్మోజు బెరసిన సూత్ర ధారుల కాస్యపల్లిని బానుగంట దళవృత్తి పుడపండ్లు 20. భీమ సముద్రము వెనుక పుడమఱుతరు అని వుంది.

కొమ్మోజు, బ్రమ్మోజు:

పై సూత్రధారులు కొమ్మోజు, బ్రహ్మోజు అనే పేర్లను బట్టి బొమ్మలాట వారని తెలుసుకోవచ్చు. అంతేగాక పై పేరులను బట్టి వీరు తప్పక మహారాష్ట్రులే ఐవుండవచ్చు.

అంతేగాక వారుపయోగించిన మాటల బరహా, బెరసిన అన్నవి కన్నడ భాషకు చెందినవి. దీనిని బట్టి మనకు విశదమయ్యే దేమంటే మరాటీ బొమ్మలాట వారు దేశదేశాలు తిరిగారు. అలాగే వీరు కన్నడ దేశం కూడా సంచారం చేశారు. అంతే గాక మహారాష్ట్రపు సరిహద్దు నున్న దేశం కన్నడ దేశం. అందువల్ల వీరికి ఆ బరహా, బెరసిన అనే కన్నడ మాటలు కూడ వచ్చి వుండవచ్చు. దేశ దిమ్మరులులైన వారికి ఆయా భాషలు వంటబట్టడం సహజమే.