పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడ్డాయి. ఆనాడు రాజంతఃపురాలలో శాశ్వత నాటక శాలలుండేవి. అక్కడ ప్రదర్శించే ప్రదర్శనాల నన్నిటినీ ప్రభువు చూసి ఆనందించేవారు.

ప్రజా ప్రదర్శనాలన్నీ గ్రామ మధ్యలో నాలుగు వీధులూ కలిసేచోట ఎత్తు పాటి దిబ్బ మీద పందిరివేసి రంగ స్థలాన్ని ఏర్పాటు చేశేవారు. పందిరికి ఒక తెరను వ్రేలాడ తీసేవారు. ఈ తెరను గురించి పండితారాధ్య చరిత్రలో__

..."యొయ్య జవనికల గర్భంబు వెడలి" అని చెప్పటాన్ని బట్టి ఆనాడు కూడ తెరలు వుపయోగించే వారని అర్థమౌతోంది. అయితే ఆ తెరలు కిందికి పైకి వెళ్ళేవి. ప్రక్కకు లాగేవి కావంటారు శ్రీనివాస చక్రవర్తిగారు.

అలాగే బసవ పురాణంలో "జవనిక రప్పించి" అని ప్రయోగించటం వల్ల ఆనాటి తెర అప్పటి కప్పుడు అడ్డు పెట్టే దుకూలమని తెలుస్తూ వుంది. ఆనాటి దీపాలు కాగడాల వెలుతురే. తెర తొలగగానే నటీ నటులు ముఖం స్పష్టంగా కనిపించటానికి కాగడాల మీద గుగ్గిలాన్ని చల్లి పెద్ద వెలుగు తెప్పించేవారు. ఇక ప్రేక్షకులు రంగ స్థలానికి చుట్టూ కూర్చునేవారు. నటీ నటులు నాలుగు ప్రక్కల తిరుగుతూ, అందరికీ కనిపించేలా ఆభినయించేవారు.

పలురూపాలూ, పలు పదాలూ:

యక్షగాన వాజ్మయాన్ని దేశి సంప్రదాయంగా పండితులు పరిగణిస్తున్నారు. సంస్కృత మార్గ పద్ధతికి భిన్నమైనదీ, దేశీ పద్ధతి. యక్షగానాలలోని ప్రధానమైన గేయ రచనల్ని రగడలలో కొంత మార్పు జరిపి, త్రిపుట - జంపె -ఏక- ఆట అనే తాళాల కనుగుణంగా కల్పించ బడ్డాయి. యక్షగానాలలో ఇంకా అనేక రకాలైన దేశీ రచనలు ఇమిడి వున్నాయి. ఏల పాటలు__ జోల పాటలు__ ఆరతులు__ధవళాలు__చందమామ పాటలు__ వెన్నెల పదాలు మొదలైనవి వున్నాయి.

విరాళి పదాలు - తుమ్మెద పదాలు - కోవెల పదాలు- చిలుకపదాలూ -అల్లోనేరేళ్ళు -సీస కందార్థాలు - త్రిభంగులు - ద్విపదలు -చౌపదులు -షట్పదులు- మంజరులు -జక్కుల రేకులూ- ఈ మొదలైనవన్నీ అనేక యక్ష గానాల్లో ఉదహరింప