పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కురవల కురంజి

ఆయా రాజుల కాలాల్లో ఎన్నో కళలు అభివృద్ధి చెందాయి. అయితే నాటినుంచి నేటిదాకా ఏదో ఒక రూపంలో కురవంజి కళారూపం బ్రతికే వుండి. ముఖ్యంగా ఈ నాడు తమిళనాడులో జీవించే వుంది. ఆ మాటకొస్తే ద్రావిడ సీమ లన్నిటిలోనూ ప్రాముఖంలోకి వచ్చింది. ఇక ఆంధ్ర దేశంలో సొదెమ్మో సోదె అంటూ వచ్చే ఎరుకల వారిలో కురవంజి జీవిత రేఖలు కనిపిస్తూ వున్నాయి.

కురవంజి ఒక జానపద దృశ్యకావ్యం. కురవంజి అంటే, ఎరుకలసాని, పూర్వం ఈ ఎరుకలసాని సంఘంలో ఎక్కువ పలుకుబడి సంపాదించుకుంది. ఆ నాడు విజయనగర రాజుల కాలంలోనూ ఎరుకలసాని ఎంతో ప్రాముఖ్యత వహించింది. ఈ ఎరుకలసాని వినోద కాలక్షేపానికీ యదాలాపంగా ఆటలు పాటలు జోడించి ప్రారంభించిన కళారూపం కురవంజి.

అసలు అర్థం:

కురవంజి అనగా ఒక నృత్య విశేషంతో కూడిన అడుగు. అడవులలో నివసించే కురవలనేవారి అడుగు కాబట్టి, దానిని కురవంజి అని కూడ పిలుస్తూ వచ్చారు. గంతులూ, చిందులు, గొండ్లి, అంజె అనేవి నృత్య విశేషానికి సంబందించిన పర్యాయపదాలు.

కురవంజి కళారూపం ఆటవికులది. మానవుల అడవుల్లో నివసించే కాలంలో ప్రచారంలో కొచ్చిందీ కళారూపం. ఆనాటికీ ఈ నాటికీ పుణ్యక్షేత్రాలుగా వున్న సింహాచలం, దేవాలయంలోనూ, మంగళగిరి నృసింహ దేవాలయంలోనూ, విజయవాడ కనకదుర్గ దేవాలయం వద్దనూ, శ్రీ శైల మల్లిఖార్జున దేవాలయం వద్దనూ, తిరుపతి కొండమీదా సంవత్సరం పొడుగునా యాత్రా వుత్సవాలు జరుగుతూ వుండేవి. దేశం నలుప్రక్కల నుండీ, స్వామి దర్శనార్థం యాత్రికులు వచ్చి పోతూవుండేవారు.