పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొనియాడుతూ, నాగయ్యను 'ఆంధ్రా పాల్‌ముని' గా కీర్తించాడు.

కె. వి. రెడ్డిగారు, 'భక్త పోతన' చిత్రంలో, పోతన పాత్ర ధారణకు నాగయ్యను ఎన్నుకొన్నారు. పోతనగా, నాగయ్య చూపిన హావభావాలు, భక్తుడుగా ఆయన అభినయం చిరస్మరణీయం. 'పావన గుణ రామా' అను పాట ఈనాటికీ చిత్రం చూచిన వారిని మైమరిపిస్తుంది. అసమాన నటుడుగా ప్రశంసలందుకొన్నాడు.

నాగయ్య స్వయంగా రేణుకా ఫిల్మ్స్ అనే సంస్థను ప్రారంభించి త్యాగయ్య చిత్రాన్ని నిర్మించి చరిత్ర సృష్టించాడు. ఆ చిత్రం ప్రారంభించుటకు ముందు తిరువాయార్ లోని త్యాగరాజుల వారి సమాధి వద్ద కొన్ని రోజులు ఉపవాస దీక్ష చేశాడు. 'త్యాగయ్య' చిత్రంలో నాయకుడుగా సంగీత దర్శకుడుగా అఖండ కీర్తినార్జించాడు. త్యాగయ్య చిత్రం యునెస్కో ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించబడి భారతదేశ కీర్తి పతాకను ఎగుర వేసింది.

తెలుగు చిత్రాలతోపాటు నాగయ్య తమిళ చిత్రాలలో కూడా నటించాడు. మోసాలు, తంత్రాలు తెలియని నాగయ్య 'భక్త రామదాసు' చిత్ర నిర్మాణంలో పెక్కు అడ్డంకులను ఎదుర్కొన్నాడు. 'రామదాసు' అనుభవించిన సంకటాలను అనుభవించాడు. చిత్రం ఎలాగో బయట పడింది. కాని నాగయ్య ఆశించిన రీతిలో రాలేదు. మరలా మనశ్శాంతిని కోల్పోయి పుట్టపర్తి సాయిబాబాను ఆశ్రయించాడు. బాబా ఆధ్వర్యంలో, మద్రాసులో నాగయ్య షష్టిపూర్తి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.

నాగయ్యకు జరిగిన సన్మానాలు మరే నటుడికి జరగలేదు. 1965 లో భారత ప్రభుత్వం అతనికి 'పద్మశ్రీ' నిచ్చి గౌరవించింది. దక్షిణ భారత సినిమారంగంలో 'పద్మశ్రీ' అందుకొన్న మొదటి నటుడు నాగయ్య.

నాలుగు దశాబ్దాల సినిమా జీవితంలో నాగయ్య 200 తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోను, 160 తమిళ చిత్రాల్లోను నటించాడు.

నాగయ్య మహానటుడే కాదు, మహాదాత. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంలో, నాగయ్య 20 వేల రూపాయలు అప్పుగా తెచ్చి ఆంధ్రకేసరికి విరాళంగా సమర్పించాడు.

"నేను ఎన్నోసార్లు మోసపోతున్నాను. అందరి మాటా నమ్ముతాను. అందర్నీ విశ్వసిస్తాను! అదే నా అర్థిక పతనానికి కారణమైంది" అని తన ఆత్మకథలో వ్రాసుకొన్నాడాయన.

లక్షలార్జించిన నాగయ్య చివరిదశలో కఠిన దారిద్ర్యాన్ని అనుభవించాడు. చిన్న చిన్న వేషాలు వేయాల్సి వచ్చింది, డబ్బుకోసం!

పోతన, త్యాగయ్య, రామదాసు మున్నగు పాత్రలలో భక్తి రసామృతాన్ని పంచిపెట్టిన నాగయ్య నటించిన వేమన, పోతన చిత్రాలను చూచి ఒక బాలుడు యోగిగా మారి ముమ్మిడివరం 'బాలయోగి' అయ్యాడు.

ఒకమారు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మద్రాసు వచ్చారు. ఆయన దర్శనం