పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందించింది; గాంధీజీ ఆనందంతో నవ్వాడు.

ఆ చిరునవ్వు ఆమె హృదయంపై చెఱగని ముద్ర వేసింది. ఆ నవ్వే ఆమె జీవితానికో స్ఫూర్తినిచ్చింది. ఆ పదకొండేళ్ళ బాలికే దుర్గాబాయి!

అప్పటికే ఆమె హిందీ పాఠశాల పెట్టి 40 మంది మహిళలకు హిందీ నేర్పుతూ వుండేది. ఆ హిందీ పాఠశాల విద్యార్ధినులలో ఒక విద్యార్ధి దుర్గాబాయి తల్లి కృష్ణవేణమ్మ !

దుర్గాబాయి 1909 జూలై 15 తేదీన రాజమండ్రిలో జన్మించింది. తండ్రి ఆర్.వి.యన్. రామారావుగారు. తల్లి కృష్ణవేణమ్మ. దుర్గాబాయిగారి అమ్మమ్మ గారున్నది రాజమండ్రిలో. దుర్గాబాయి తాతగారైన మనోహరం పంతులు పోలీసు సూపరింటెండెంటు. సంఘ సంస్కరణాభిలాషాకల మనోహరం పంతులు వీరేశలింగం పంతులుగారి కెంతగానో అండగా వుండేవారు.

దుర్గాబాయి ప్రతిభావతి. బాల్యంలోనే హిందీలో పాండిత్యం గడించింది. వీణావాదనలో దిట్ట అనిపించుకున్నది. రంగవల్లులు వేయటంలో ఆమెకు ఆమే సాటి. హిందీ పాఠశాలలో పాటలు, పద్యాలు, నాటికలు, కోలాటాలు, దేశభక్తి గేయాలు నేర్పించేదా బాలికా ప్రిన్సిపాల్ !

1927 లో గాంధీజీ కోటి రూపాయాల నిధి సేకరణ చేస్తూ ఆంధ్ర పర్యటనకు వచ్చారు. రాజమండ్రి సమీపంలోని సీతానగరం ఆశ్రమంలో బస చేశారు.

ఆ కాలంలో భోగం మేళాలు ఎక్కువగా వుండేవి. దేవదాసీల జీవితం దుర్భరంగా వుండేది. వారేకాక ముస్లిం మహిళలు కూడా సంప్రదాయాలకు బానిసలై బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా వుండేవారు. వారికో వెలుగుచూపాలని నిశ్చయించింది దుర్గాబాయి. స్త్రీల కోసం ప్రత్యేక సభ ఏర్పాటు చేసి, ఆ సభలో గాంధీజీగారిచే ఉపన్యాసం ఇప్పించాలనుకున్నది.

కాంగ్రెస్ నాయకులైన బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్యగార్ల వద్దకు వెళ్ళి దుర్గాబాయి తన కోర్కెను వెళ్ళడించింది.

'ఏమిటీ! స్త్రీల సభ ఏర్పాటు చేస్తావా? గాంధీజీ రావాలా? ఏమిటీ పిల్లచేష్టలు?' అన్నారు కొండా వెంకటప్పయ్యగారు.

' అయిదువేల నిధి సమర్పిస్తే, గాంధీగారిని అయిదు నిమిషాలు మాట్లాడమని చెబుతాం' అన్నారు బులుసు సాంబముర్తిగారు.

'సరే, అయిదువేలు ఇస్తాం' అన్నది. దేవదాసీల వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పిందామె.

వారం రోజుల్లో అయిదు వేలు వసూలు చేసారు. 'అయ్యా, ఇదిగో అయిదు వేలు - ప్రోగ్రాం ఏర్పాటు చేయండి' అన్నది దుర్గాబాయి.

మునిసిపల్ హైస్కూల్ హెడ్ మాస్టరు గారిని బతిమిలాడి, స్కూల్ మైదానంలో సభ జరుగుటకు అనుమతి సంపాదించిందామె.