పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

133

సీ. వసుమతీనాథ! సర్వస్వామియైన గో, విందుండు చిదచి దానందమూర్తి

సలలిత స్వోపాధి శక్తిసమేతుఁడై తనరారు నాత్మీయ ధామమందు

ఫణిరాజు మృదుల తల్పంబుపై సుఖలీల యోగనిద్రారతి నున్న వేళ

నఖిల జీవులు నిజ వ్యాపార శూన్యులై యున్నత తేజంబు లురలుకొనగఁ


తే. జరగు నయ్యవస్థా విశేషంబు లెల్ల, విదిత మగునట్లు వలుకుట యది నిరోధ

మన నిది యవాంతరప్రళయం బనంగఁ, బరఁగునిఁక ముక్తిగతి విను పార్థివేంద్ర. (266)


సీ. జీవుండు భగవత్కృపా వశంబునఁ జేసి దేహ ధర్మంబులై ధృతి ననేక

జన్మానుచరిత దృశ్యము లైన య జ్జరా మరణంబు లాత్మధర్మంబు లైన

ఘన పుణ్యపాప నికాయ నిర్మోచన స్థితి నొప్పి పూర్వసంచితము లైన

యపహత పాప్మవత్త్వా ద్యష్టతద్గుణ వంతుఁడై తగ భగవ చ్ఛరీర


తే. భూతుఁడై పారతంత్య్రాత్మ బుద్ధి నొప్పి, దివ్యమా ల్యానులేపన భవ్యగంధ

కలిత మంగళ దివ్యవిగ్రహవిశిష్టుఁ, డగుచు హరిరూపమొందుటే యనుఘ! ముక్తి. (267)


వ. మఱియు నుత్పత్తి స్థితి లయంబు లెందు నగుచుఁ బ్రకాశింపఁబడు నది యాశ్రయంబనంబడు. అదియ పరమాత్మ. బ్రహ్మశబ్ద వాచ్యంబు నదియ. ప్రత్యక్షాను భవంబున విదితంబు

సేయుకొఱకు నాత్మ యాధ్యాత్మికాది విభాగంబు సెప్పంబడియె. అది యెట్లనిన నాత్మ యాధ్యాత్మి కాధిదైవి కాధిభౌతికంబులఁ ద్రివధంబయ్యె. అందు నాధ్యాత్మికంబు చక్షురాది గోళ

కాంతర్వర్తియై యెఱుంగంబడు. చక్షురాది కరణాభిమానియై ద్రష్టయైన జీవుండె యాధిదైవికుండనం దగు. చక్షురాద్యధిష్ఠా నాభిమాన దేవతయు, సూర్యాది తేజోవిగ్రహుండు న్గుచు నెవ్వని

యందు నీ యుభయ విభాగంబునుం గలుగు నతండె యాధిభౌతికుండు, విరాడ్వి గ్రహుండు నగుం గావున, ద్రష్టము దృక్కు దృశ్యంబు ననందగు మూఁటి యందు నొకటి లేకున్న నొకటి

గానరాదు. ఈ త్రితయంబు నెవ్వఁ డెఱుంగునతండు సర్వలోకాశ్రయుండై యుండు. అతండె పరమాత్మయు. అ మ్మహాత్ముండు లీలర్థంబై జగత్సర్జనంబు సేయు తలంపున బ్రహ్మాండంబు

నిర్భేదించి తనకు సుఖస్థానంబు నపేక్షించి మొదల శుద్ధంబులగు జలంబుల సృజియించె. స్వతః పరిశుద్ధుండు గావున స్వ సృష్టం బగు నేకార్ణ వాకారం బైన జలరాశి యందు శయనంబు

సేయుటం జేసి.