పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

39


నుండు, సర్వాత్మకుండైన యీశ్వరునకు నతోన్నత భావ మతివైషమ్యంబు లెక్కడివి ? అయిన భక్తవత్సలుండు గావున నేకాంత భక్తులకు సులభుండై యుండు. (1-212)


సీ. అతిభక్తి నెవ్వనియందుఁ జిత్తముఁ జేర్చి, యెవ్వని నామ మూహించి పొగడి

కాయంబు విడచుచుఁ గామకర్మాది నిర్,మూలనుండై యోగి ముక్తినొందు

నట్టి సర్వేశ్వరుం డఖిల దేవోత్తంసుఁ, డెవ్వేళఁ బ్రాణంబు లేను విడుతు

నందాక నిదె మందహాసుఁడై వికసిత, వదనారవిందుఁడై వచ్చి నేఁడు

తే.గీ. నాల్గు భుజములుఁ గమలాభ నయనయుగము, నొప్పుఁ గన్నుల ముంగట నున్నవాఁడు

మానవేశ్వర ! నా భాగ్యమహిమఁ జూడు, మేమి సేసితినో పుణ్య మితనిఁ గూర్చి. (1-213)


వ. అని యిట్లు ధనంజయ సంప్రాపిత శరపంజరుండైన కురుకుంజరుని వచనంబులు వినయంబున నాకర్ణించి మునులందఱు వినుచునుండ మందాకినీనందను వలన (నరజాతి సాధారణంబులగు ధర్మంబులును, వర్ణాశ్రమ ధర్మంబులును) రాగ వైరాగ్యోపాధులతోఁ గూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మంబులును. దానధర్మంబులును, రాజధర్మంబులును, స్త్రీధర్మంబులును, శమదమాదికంబులును, హరితోషణంబులగు ధర్మంబులును, ధర్మార్థ కామ మోక్షంబులును (నానావిధేతిహాసోపాఖ్యానంబులును ) సంక్షేప విస్తార రూపంబుల నెఱింగె. అంత రథిక సహస్రంబులకు గమికాఁడైన భీష్ముండు స్వచ్ఛంద మరణులైన యోగీశ్వరులకు వాంఛితంబగు నుత్తరాయణంబు చనుదెంచిన నది తనకు మరణోచిత కాలంబని నిశ్చయించి, (1-214)


శా. ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ

గ్జాలంబులు హరి మోముపైఁ బఱపి తత్కారుణ్యదృష్టిన్ విని

ర్మూలీభూత శరవ్యథా నిచయుఁడై మోదించి భీష్ముండు సం

శీలం బొప్ప నుతించెఁ గల్మష గజశ్రేణీహరిన్ శ్రీహరిన్. (1-215)


వ. ఇట్లు పరమేశ్వరుండైన హరియందు నిష్కాముండై ధారణావతియైన బుద్ధిని సమర్పించి పరమానందంబు నొంది ప్రకృతి వలన నైన సృష్టిపరంపరలఁ బరిహరించు తలంపున మందాకినీనందనుం డిట్లనియె. (1-216)