పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట

మ. త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింపఁ బ్రాభాత నీ

రజ బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక

వ్రజసంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా

విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్. (1-217)


మ. హయరింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై

రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో

జయముం బార్థున కిచ్చు వేడ్క నని నా శస్త్రాహతిం జాల నొ

చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్. (1-218)


మ. నరు మాటల్ విని నవ్వుతో నుభయసేనా మధ్యమ క్షోణిలోఁ

బరులీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం

బరభూపాయువులెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ

పరమేశుండు వెలుంగుచుండెడు మన:పద్మాసనాసీనుఁడై. (1-219)


కం. తనవారిఁ జంపఁజాలక, వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్

ఘన యోగవిద్యఁ బాపిన, మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్. (2-220)


సీ. కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి, గగన భాగం బెల్లఁ గప్పికొనఁగ

నుఱికిన నోర్వక యుదరంబులో నున్న, జగముల వ్రేఁగున జగతి గదలఁ

జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ , బై నున్న పచ్చని పటము జాఱ

నమ్మితి నా లావు నగుబాటు సేయక, మన్నింపుమని కిరీటి మఱలఁ దిగువఁ

తే.గీ.గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి, నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాఁతు

విడువు మర్జున ! యంచు మద్విశిఖ వృష్టిఁ , దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. (2-221)


మ.తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న

ర్జున సారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్

మునికోలన్ వడిఁజూపి ఘోటకములన్ మోదించి తాటింపుచున్

జనులన్ మోహము నొందఁజేయు పరమోహాత్సాహుం బ్రశంసించెదన్. (1-222)


కం. పలుకుల నగవుల నడపుల, నలుకల నవలోకనముల నాభీర వధూ

కులముల మనముల తాలిమి, కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్. (1-223)