పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33

వ. ఇట్లు "సత్యమ్ పరమ్ ధీమహి" యను గాయత్రీ ప్రారంభంబున గాయత్రీ నామ బ్రహ్మరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసుర వధంబును నెందుఁ జెప్పంబడు నదియ భాగవతంబని పలుకుటం జేసి ఈ పురాణంబు శ్రీమహాభాగవతంబన నొప్పుచుండు. (1-33)

సీ. శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన, భాగవతంబు సద్భక్తి తోడ

వినఁగోరువారల విమలచిత్తంబులఁ జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక

యితర శాస్త్రంబుల నీశుండు సిక్కునే ? మంచివారలకు నిర్మత్సరులకుఁ

గపట నిర్ముక్తులై కాంక్ష సేయక యిందుఁ దగిలియుంట మహాతత్త్వబుద్ధి

తే.గీ. పరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు, నడచి పరమార్థభూతమై యఖిల సుఖద

మై సమస్తంబు గాకయు నయ్యు నుండు, వస్తు వెఱుఁగంగఁదగు భాగవతమునందు. (1-34)

ఆ.వె. వేదకల్పవృక్ష విగళితమై శుక, ముఖ సుధాద్రవమున మొనసి యున్న

భాగవత పురాణ ఫల రసాస్వాదన, పదవిఁ గనుఁడు రసిక భావవిదులు. (1-35)

నైమిశారణ్య వర్ణనము

కం. పుణ్యంబై మునివల్లభ

గణ్యంబై కుసుమ ఫల నికాయోత్థిత సా

ద్గుణ్యమయి నైమిశాఖ్యా

రణ్యంబు నుతింపఁదగు నరణ్యంబులలోన్.(1-36)


వ. మఱియును మధువైరి మందిరంబునుం బోలె మాధవీమన్మథ సహితంబై బ్రహ్మగేహంబునుం బోలె శారదాన్వితంబై నీళగళసభానికేతనంబునుం బోలె వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమవతీ కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటల మండితంబై బలభేది భవనంబునుం బోలె నైరావతామృత రంభా గణికాభిరామంబై మురాసురుని నిలయంబునుం బోలె నున్మత్త రాక్షస వంశ సంకులంబై ధనదాగారంబునుం బోలె శంఖ కుంద ముకుంద సుందరంబై రఘురాము యుద్ధంబునుం బోలె నిరంతర శరానల శిఖా బహుళంబై పరశురాము భండనంబునుం బోలె నర్జునోద్భేదంబై దానవ సంగ్రామంబునుం బోలె నరిష్ట జంభ నికుంభ శక్తియుక్తంబై కౌరవసంగరంబునుం బోలె ద్రోణార్జున కాంచన