పుట:Shriiranga-mahattvamu.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

చతుర్థాశ్వాసము


వ.

అని యాదేవుండు పలికినఁ జెవుల నమృతంబులు చిలికిన
చందంబున
నమందానందంబు నొందిన యమ్ముకుందున కందంద యభివందనం
బాచరించి, కృతాంజలియై యమ్మునికుంజరుం డిట్లనియె.

71


చ.

అనుపమభోగితల్పగతు సంచితహాసవికస్వరాననున్,
నిను నఖిలేశు నిప్పుడిటు నెమ్మిఁ గనుంగొనవచ్చి, యింతలో
నన యిచటం బ్రియానుగసనాథు నుదారవిహారశీలుఁ జ
య్యనఁ గని యీతఁ డెవ్వడొకొ యంచు మనంబున జింతనొందితిన్.

72


ఉ.

నీవె యతండ వౌదువని నిర్ణయబుద్ధి జనించె నాకుఁ బ
ద్మావర! యిప్పు డిందుఁ గడు ధన్యుఁడనైతిఁ గృతార్థ మయ్యె నా
జీవిత, మీభవంబు వెలసెన్ నిను సర్వగు వేదవేద్యు నా
ర్తావనలోలు దేవమయు నచ్చట నచ్చటఁ జూడఁ గల్గుటన్.

73


ఉ.

నావుడు నంబుజాక్షుఁ డెలనవ్వుఁ దలిర్పఁగ నమ్మునీంద్రుతో,
నీవిమలప్రదేశ మతిహృద్యము నాకు సుధాసమంబు సం
భావనమైన యీవనియుఁ బ్రాణపదం బదిగావునన్, సుఖ
శ్రీ విలసిల్ల నీతటి వసించితి మంగళరంగశాయినై.

74


ఉ.

ఇచ్చటఁ దక్కఁ దక్కునెడ లెవ్వియు నామదికిన్ రుచింపమిం
బొచ్చెము లేక యీతటినిపొంత వనాంతములందుఁ, జాలఁ గ
న్నిచ్చకు వచ్చుకందువల నిచ్చపలాక్షియు నేను నిచ్చలున్
మచ్చికమైఁ జరింతుము సమంచితసౌఖ్యవిహారలీలలన్.

75


వ.

అని చెప్పి, యప్పద్మవాసినీసహచరుం డనుచరసహితుండై యల్లనల్లన జని
ముందట సమదవిలాసభవనం బగువనంబుఁ జొచ్చి యం దరవిరుల మధుకు
లంబు పరువంబులై కదలి తరువం బొడమిన తరువు గురువంబునకు మురువుఁ
జూపుకురువకంబుల పొరువులును, దరుణారుణశ్రీకంబులై సైకంబు లగు
కేసరంబుల యానీకంబుల నఖిలలోకవిలోకనంబులకు నుత్సేకంబు నెఱుపు
నశోకంబుల జోకలను, వికసనావసరంబుల నలివిసరంబులకు సుసరంబులై
రసంబులకు మాసరంబుల లగుకేసరంబు నతిభాసురంబు లగుపరిసరీలను