పుట:Shodashakumaara-charitramu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

57


గొనితేరఁగ నింకొకకథ
విను మని యాతనికి వింతవేడుక దనరన్.

45


(7) మదమంజరికథ

క.

మనుజేశ్వర శుద్ధపటుం
డనురజకుం డొకఁడు మోహనాకార మహీ
జనవినుతను మదమంజరి
యనియెడివరపుత్రిఁ గనియె నంబవరమునన్.

46


వ.

అన్నారీమణిమోహనాకారంబు గనుంగొని ధవళుం డనురజకుండు మనోభవాధీనమానసుం డైన వానిజనకుం డెఱింగి దానిజననీజనకుల నొడంబడిచి యక్కన్యం దనతనూజునకు వివాహంబు గావించుకొని పురంబునకుం దోకొని పోయిన.

47


క.

ధవళుండును వేడుక నా
ధవళాంశుముఖి న్వినూత్నధవళాంబుజచా
రువిలోచనఁ బొంది మనో
భవసౌఖ్యము నొందుచుండెఁ బాయనివేడ్కన్.

48


ఉ.

అంతట నొక్కనాఁడు దనయల్లుని గూతును దోడితేర న
త్యంతముదం బెలర్పఁగ నిజాత్మజు శుద్ధపటుండు పంపఁగా
నెంతయుఁ బ్రీతి వాఁ డరిగి యిద్దఱఁ దోడ్కొని యేగు దెంచుచో
సంతతశోభితం బయిన చండికగేహముపొంత నక్కడన్.

49


క.

ధవళుఁడు దనమఱందిని
ధవళేక్షణ సచట డించి తానొకఁడుఁ బ్రభా
ధవళ మగు భద్రకాళీ
భవనంబున కరిఁగి యధికభక్తియుతుం డై.

50