Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆస్ట్రియా - (హంగేరి)

సంగ్రహ ఆంధ్ర


సామ్రాజ్యమున మత ప్రాతిపదికపై అంతర్యుద్ధము ప్రారంభమై 1648 వరకు జరిగినది. దీనినే ముప్పదిసంవత్సరముల యుద్ధమందురు. ఈ అంతఃకలహము క్రమముగా అంతర్జాతీయ యుద్ధముగా పరిణమించినది. హాప్సు బర్గుల వైభవమును జూచి సహింపలేని డెన్మార్కు, స్వీడను, ప్రాన్సు దేశములు జర్మను ప్రొటెస్టెంటులకు సహాయముగ యుద్ధమునందు ప్రవేశించినవి. చివరకు చక్రవర్తి 3 వ ఫెర్డినాండు యుద్ధమున నోడి, వెస్టు ఫేలియా సంధికి (1648) సమ్మతించెను. ఈ సంధిప్రకారము జర్మనీపై హాప్సు బర్గుల అధికారమునకు స్వస్తిచెప్పబడెను. పవిత్ర రోనుక సామ్రాజ్యము నామమాత్రా వశిష్టమైనది. ఇది ఆస్ట్రియాకు కీడులో మేలై నది. హాప్సుబర్గులు తమదృష్టిని ఆస్ట్రియాపై కేంద్రీకరించుటకు అవకాశము గలిగెను.

లియోపాల్డు  : 30 సంవత్సరముల యుద్ధమునుండి ఆస్ట్రియా త్వరలో కోలుకొనగలిగెను. 1657లో ఆస్ట్రియా సింహాసన మెక్కిన లియోపాల్డు ఆస్ట్రియా గౌరవప్రతిష్ఠలను ఇనుమడింప జేసెను. తురుష్కులను అనేక యుద్ధము లందోడించి కార్లోవిట్జు సంధి (1699) ప్రకారము స్లవోనియా, ట్రాన్సిల్వేనియా, హంగేరీలను లియోపాల్డు ఆక్రమించెను. 1699 నుండి 1867 వరకును ఆస్ట్రియా సామ్రాజ్యమునందు హంగేరీ లీనమైయుండెను, ఇన్స్ బ్రక్, ఆల్మజ్ విశ్వవిద్యా లయములను స్థాపించి లియోపాల్డు ఆస్ట్రియాలో ఉన్నత విద్యాభివృద్ధికి అపారమగు సేవచేసెను.

6వ ఛార్లెసు  : లియోపాల్డు అనంతరము 6 వ ఛార్లెసు ఆస్ట్రియా సింహాసనమెక్కెను. ఇతడును అంతర్జాతీయ రాజకీయములందు పాల్గొనినాడు. ఫ్రెంచి చక్రవర్తియగు 14 వ లూయీ స్పెయిను సామ్రాజ్యము నాక్రమింప దలచుటచే స్పానిషు వారసత్వ యుద్ధము సంభవించెను. అందు ఇంగ్లండుతో చేరి ఛార్లెసు లూయీ నోడించి యుటెక్టు సంధి ప్రకారము నెదర్ లాండ్స్ను (బెల్జియమును) బడసెను (1713). 1716 లో తురుష్కుల నోడించి సెర్వియా నాక్రమించెను. ఛార్లెను తరువాత అతని ఏకైక పుత్రిక మేరియా థెరెస్సా సింహాసన మెక్కెను (1740)

మేరియాథెరెస్సా  : ఆస్ట్రియాలో స్త్రీ రాజ్యము చేయుట తమ కవమానముగా ఇతర ఐరోపా రాజులు భావించిరి. మేరియాథెరెస్సాను ఆస్ట్రియా ప్రభ్వణిగా గుర్తింతుమని తాము 6వ ఛార్లెసునకు చేసిన వాగ్దానమును (ప్రాగ్మాటిక్ శాక్షన్ ) త్రోసిపుచ్చి, మేరియా థెరెస్సాపై వారు కత్తిగట్టిరి. ప్రష్యా రాజగు ఫ్రెడరిక్ ఒక కూటమి నేర్పరచి మేరియాపై యుద్దమును ప్రకటించెను. దీనినే ఆస్ట్రియా వారసత్వ యుద్ధ మందురు. ఇందు మేరియా ఓడి, సైలీషియాను ఫ్రెడరిక్ నకు సమ ర్పించెను. సైలీషియాను తిరిగి సాధించు నాశయముతో సప్త సంవత్సర యుద్ధమున (1757-1763) మేరియా ఫ్రాన్సుతో చేరి ఫ్రెడరిక్ తొ యుద్ధము చేసెను. కాని లాభము లేకపోయెను. 1772 లో రష్యా చక్రవర్తిని యగు కాథరిన్, ప్రష్యా రాజగు ఫ్రెడరిక్ తొ చేరి పోలెండ్ విభజనలో పాల్గొని మేరియాథెరెస్సా గాబ్షీయా యను ప్రాంతమును బడ సెను.

2 వ. జోసెఫ్ : మేరియా కుమారుడగు 2 వ జోసెఫ్ 1780 లో సింహాసన మెక్కెను. ఇతడు ప్రజాహిత నిరంకుశ రాచరికమందు పూర్తి విశ్వాసము గలవాడు. రూసో, వోల్టేరు మున్నగు విజ్ఞానుల బోధనల ప్రకారము సమాజ పునర్నిర్మాణమునకు ఇతడు ప్రయత్నించెను. మతాధికారుల దౌర్జన్యములను తుదముట్టించేను. ప్రభువులపై పన్ను విధించెను; నిర్బంధ విద్యావిధానము అమలు జరిపెను. కాని ప్రజల కి సంస్కరణములు నచ్ఛలేదు. హంగేరీలో తిరుగుబాటు కూడ చెలరేగెను. చివరకు తనకృషి నిష్ఫలమైనదను హృదయవేదనతో జోసెఫ్ 1790 లో మరణించెను.

ఫ్రెంచి విప్లవము  : జోసెఫ్ తమ్ముడు 2వ లియో పాల్డు కాలమున (1790-92) ఫ్రాన్సులో నిరంకుశ రాచరికమును తుదిముట్టించి ప్రజాప్రభుత్వమును స్థాపించుటకై బ్రహ్మాండమగు విప్లవము చెలరేగినది. ఫ్రాన్సు రాజు 16 వ లూయీ యొక్క రాణి యగు మేరియా అంటాయి నెట్ లియోపాల్డు సోదరి. అందుచే ఫ్రెంచి రాజ దంపతులను రక్షించుటకై లియోపాల్డు ప్రష్యా రాజుతో చేరి ఫ్రాన్సుపై యుద్ధమును ప్రకటించెను. కాని కృతకృత్యుడుకాలేకపోయెను. ఇతని కుమారుడు 2 వ ఫ్రాన్సిస్ కూడ (1792-1835) నెపోలియనును ఓడించి ఫ్రాన్సులో నిరంకుశత్వము నెలకొల్ప విశ్వప్రయత్నము లొనరించెను.