Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/817

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చైనాదేశము (చ)

దీవిని, లయోటంగ్ ద్వీపకల్పమును, ఆర్థర్ రేవు పట్టణమును, జపాను పరము చేయుటకు చైనా అంగీకరించెను. కాని ఆర్థర్ రేవుపట్టణముపై చిరకాలమునుండి రష్యా తన దృష్టిని ప్రసరించి యుండెను. అందుచే రష్యా, ఫ్రాన్సు, జర్మనీలను కలుపుకొని 'షిమొనెస్కీ' సంధిని రద్దుచేయించెను. జపాను రష్యాల వైరమునకు ఇదియే నాంది. ఈ యుద్ధము వలన చైనా నిస్సహాయత పూర్తిగా వ్యక్తమగుటయే గాక, చైనా భూభాగములకై విదేశీయుల మధ్య పోటీ ఆరంభమైనది.

చైనాలో పాశ్చాత్య అధికార విస్తరణము 1895-1898 : పాశ్చాత్య రాజ్యములవారు అపారమగు ధనమును చైనాకు అప్పుగా నిచ్చి యుండిరి. వారు 'షిమొనెస్కీ' సంధి సందర్భమున జపానునకు వ్యతిరేకముగ చైనాపక్షమునే వహించిరి. అందుచే వారు, మంచూ ప్రభుత్వము నుండి పెక్కు హక్కులను బడసి తమ ప్రాబల్యమును ఇనుమడించుకొన సాగిరి. రష్యా ఆర్థరురేవును, జర్మనీ సింగ్ టావోరేవును, ఫ్రాన్సు క్వాంగ్ చౌవాన్ రేవును, ఇంగ్లండు వై హెవై రేవును ఆక్రమించిరి. విదేశ వస్తువులపై రహదారి సుంకములు తొలగింపబడెను. దేశమున పన్నుల వసూలుపై తనిఖీ చేయు నధికారమును ఆంగ్లేయులు సంగ్రహించిరి. రైలుమార్గములను నిర్మించు హక్కులు పాశ్చాత్యుల కీయబడెను. క్రమముగా రష్యా మంచూరియా, మంగోలియాలలోను, ఫ్రాన్సు ఫ్యూనాన్ రాష్ట్రములోను, జర్మనీ షాన్‌టుంగ్ రాష్ట్రములోను, బ్రిటను యాంగ్సీ లోయలోను, జపాను ఫూకిన్ రాష్ట్రములోను తమ తమ ప్రాబల్యములను నెలకొల్పిరి.

అచిరకాలములో, చైనా స్వాతంత్ర్యమును అంతరింప జేసి, పాశ్చాత్యులు తమలో తాము చైనాను విభజించు కొందురేమో అను భయ మేర్పడెను. నాటి వరకును, అమెరికా చైనాతో వర్తకము చేయుచుండెనే కాని, చైనాలో పలుకుబడి ప్రాంతమును సంపాదించుటకు ప్రయత్నింపలేదు. చైనా స్వాతంత్య్ర మంతరించినచో తన వాణిజ్యపు హక్కులకు భంగము వాటిల్లు నని అమెరికా భయపడెను. అందుచే ఆమెరికాప్రభుత్వ కార్యదర్శియైన హే అను నాతడు 1899 లో నొక ప్రకటన (Open Door Policy) గావించెను. దాని సారాంశమేమనగా, చైనాలో అన్నిజాతులవారును వర్తకము చేసికొనవచ్చును. కాని ఏ ప్రాంతమునుగాని సంపూర్ణాధికారములతో నాక్రమింప గూడదు. నామమాత్రావశిష్టమైన స్వాతంత్ర్యమును గుర్తించి పాశ్చాత్యులు చైనాను ఉమ్మడిగా దోచుకొన సాగిరి.

బాక్సరు విప్లవము 1900-1901 : చైనా సామ్రాజ్య మెప్పుడో అంతరించినది. చైనా నడిగడ్డపై కూడ మంచూ చక్రవర్తుల అధికారము నామమాత్రమైనది. దేశ ఆర్థిక జీవితముపై విదేశీయుల ఆధిపత్య మేర్పడెను. దేశము నలుమూలల విదేశ సైన్యములు నిల్పబడినవి. దేశీయ పరిశ్రమలు నశించినవి. నిరుద్యోగుల సంఖ్య నానాటికి పెరిగి పోవుచుండెను. కరువు కాటకములు తాండవింప సాగినవి. మరొక వైపున పాశ్చాత్య సంపర్కము వలన ప్రజాస్వామ్యము, జాతీయత, మొదలైన భావములు ప్రజలలో వ్యాపింప సాగెను. విద్యావంతులలో మంచూ చక్రవర్తుల పట్ల అసంతృప్తి. విదేశీయులపై ద్వేషము ప్రబలు చుండెను. బాక్సరులు మొదలైన రహస్య విప్లవ సంఘముల వారు విధ్వంసక చర్యలు సాగించిరి.

చక్రవర్తి క్వాంగ్ షూ అనునాతడు పరిస్థితి విషమించిన దని గ్రహించి, సంస్కరణముల ద్వారా దేశమును ఉద్దరించుటకు సంకల్పించెను. కాంగ్ యువై, లియాంగ్ చిచో అను విద్వాంసు లాతనికి సలహాదారు లైరి. కాని సంరక్షకురాలుగా నున్న రాజమాత, జీహిసి అనునామె చక్రవర్తిని నిర్బంధములో నుంచి, సంస్కరణోద్యమమును రద్దుచేసెను. అంతటితో, బాక్సరులు తిరుగుబాటు చేసిరి. బాక్సరులను విదేశీయులపై మరలించుటకు జీహిసి ప్రయత్నించెను. బాక్సరులు పీకింగ్ లోని విదేశ స్థావరములను ముట్టడించుటతో, విదేశీయు లందరు నేకమై, బాక్సరుల నణచివేసిరి. విదేశీ సైనికులు మంచూ రాజాంతఃపురమును కూడ కొల్లగొట్టిరి. దేశమున శాంతి నెలకొల్పబడెను. మంచూప్రభువు విదేశీయులతో సంధి చేసికొని 135 కోట్ల రూపాయల విలువ గల ధనమును నష్టపరిహారముగ నొసగెను. చైనా జాతీయదైన్యములో ఇది చివరి మెట్టు.

రష్యా - జపాను యుద్ధము 1904-1905 : షిమొనెస్కి సంధి రద్దయి నప్పటినుండి, రష్యాపై జపాను పగబట్టి

751