Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/812

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చైనాదేశము (చ)

సంగ్రహ ఆంధ్ర

బౌద్ధము క్రీ. పూ. 1, 2 శతాబ్దములలోనే చైనాలో ప్రవేశించినది. చిన్ వంశస్థులు బౌద్ధమతమును విశేషముగ ఆదరించిరి (అచిరకాలములో, కన్‌ఫ్యూషియస్, లౌజే, గౌతమబుద్ధుడు - చైనీయులకు త్రిమూర్తులైనారు). చిన్ యుగమున, చైనాలో ముప్పదివేల బౌద్ధవిహారములు వెలసినట్లును, వానిలో 20 లక్షల మంది భిక్షువులు నివసించినట్లును తెలియుచున్నది. టావాన్ అను బౌద్ధ భిక్షువు (క్రీ. శ. 312-285) పెక్కు మత గ్రంథాలు రచించి ప్రసిద్ధి చెందెనట ! చైనీయులు భారత బౌద్ధాచార్యులను తమ దేశమునకు ఆహ్వానించి గౌరవించిరి. అట్టివారిలో కుమారజీవుడు అగ్ర గణ్యుడు (క్రీ. శ. 343-413). ఇతడు మూడు వందలకు పైగా బౌద్ధ గ్రంథాలను చైనా భాషలోనికి తర్జుమా చేసెను. చైనా బౌద్ధభిక్షువు లనేకులు ఇండియాలోని బౌద్ధ క్షేత్రములను దర్శించుటకై వచ్చిరి. అందు పాహియాను, హుయాన్‌సాంగ్ అనువారు సుప్రసిద్ధులు. హుయాన్‌సాంగ్ (క్రీ. శ. 604-664) నలందాలో విద్యాభ్యాస మొనర్చి, ఆచార్యుడుగా పనిచేసి, దేశమందలి ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రములను దర్శించి, 600 బౌద్ధ గ్రంథములతో స్వదేశమునకు మరలెను. ఇతడు చైనా భాషలోనికి తర్జుమా చేసిన బౌద్ధ గ్రంథములు 1300 సంపుటములైన వట! నాగార్జునాచార్యుని శూన్యవాదము. అతని మహాయాన మత శాఖగా పరిగణింపబడు ధ్యాన బౌద్ధము చైనాలో విశేష వ్యాప్తి చెందెను. చాంగన్ బౌద్ధమత విద్యా కేంద్రమై దూరదేశములనుండి కూడ విద్యార్థుల నాకర్షించెను. ఇండియాలో వలెనే చైనాలోకూడ బౌద్ధమతము శిల్ప, చిత్రలేఖనములకు దోహదకారి యైనది. ఇందుకు ఉత్తర చైనాలో యున్ కాంగ్ పర్వత సానువున చెక్కబడిన 50 అ. ఎత్తు బుద్ధ విగ్రహము, టెన్ హుయాంగ్ చెంత తవ్వబడిన వేయి బుద్ధ గుహలు నిదర్శనములు. ఈ గుహలలో మనోహరములైన శిల్పములు, కుడ్య చిత్రములు కన్నులకు విందుచేయును. వీనిలో అమరావతీ, అజంతా కళా సంప్రదాయములు స్పష్టముగ కన్పించును.

సారస్వతము : చైనా ప్రాచీన సారస్వతము తొమ్మిది గ్రంథములుగా విభాగము గావింపబడినది. అందు మొదటి ఐదు గ్రంథములు హాన్ యుగమున (క్రీ. పూ. 200-క్రీ. శ. 220) క్రోడీకరింప బడెను. మిగిలినవి సుంగ్ యుగములో (క్రీ. శ. 960-1279) తయారైనవి. ఆ గ్రంథములు : (1) ఇచింగ్ (మత గ్రంథము), (2) షూచింగ్ (చరిత్ర); (3) షిచించ్ (కవిత్వము); (4) లీచీ (సాంఘి కాచారములు); (5) చున్ చియు; (6) లున్‌య; (7) టూహిస్యు; (8) చుంగ్‌యంగ్ ; ; (9) మెంగ్‌ట్సుషు. ఈ గ్రంథములపై హాన్ యుగమున భాష్యములు రచింపబడినవి. ఇదిగాక చైనాలో అపారమగు బౌద్ధమత వాఙ్మయ సృష్టి జరిగినట్లు పైన పేర్కొనబడినది.

చైనా చక్రవర్తులు ప్రజలలో విద్యాబుద్ధుల వ్యాప్తికై శ్రద్ధ వహించిరి. చౌ యుగముననే పాఠశాలలు అసంఖ్యాకముగ నెలకొల్ప బడెను. హాన్ వంశస్థులు ప్రారంభించిన ప్రభుత్వ పరీక్షలు విద్యాభివృద్ధికి దోహద మొసగెను. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారే ఉద్యోగములలో నియమింపబడుచుండిరి. ప్రతి సంవత్సరము 30,000 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుగు చుండిరి. జన్మహక్కును బట్టి కాక విద్యను, సమర్థతను నిర్ణయించు పరీక్షా ఫలితములనుబట్టి ఉద్యోగము లిచ్చు ఈ పద్దతి ప్రాచీన చైనా సంస్కృతి లోని విశిష్ట లక్షణము.

మధ్యయుగము : (క్రీ. శ.618-1644). మధ్యయుగమున, తరచు రాజకీయ ఐక్యము నశించి, చైనా విదేశ దండయాత్రలకు గురియైనది. క్రీ. శ. 618 లో, చాంగన్ రాజధానిగా స్థాపించిన టాంగ్ వంశము వారు చైనాను సమైక్య మొనర్చి పాలించిరి. వీరు కొరియా, మంచూరియా, ఇండియా, పర్షియాలతో మైత్రి నెరపిరి. క్రీ. శ. 907 లో, చువెన్ అను నాతడు విజృంభించి, టాంగ్ వంశమును నిర్మూలించుటతో చైనా సామ్రాజ్యము విచ్ఛిన్నమై లియాంగ్, టాంగ్, జిన్, హాన్, చౌ మున్నగు వంశముల వారు పది రాజ్యములను స్థాపించిరి. చివరకు చౌ వంశస్థుడైన చావో కు యాంగ్ యిన్ అను నాతడు క్రీ. శ. 960 లో సింహాసన మాక్రమించి సుంగ్ వంశమును స్థాపించెను. ఈ వంశమువారు క్రీ. శ. 1279 వరకును చైనాను పాలించిరి.

సుంగుల కాలమున కీటాన్, తార్తార్, మంగోలు

748