Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/801

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చైతన్య మహాప్రభువు

పిచ్చి కేకలు వేయుచు, తరుచుగా మూర్ఛితు డయ్యెడివాడు. ఇతని చుట్టు అనుచరులు పెక్కురు చేరిరి. వీరిలో అద్వైతాచార్యులు, నిత్యానందుడు అను వారిద్దరు మహాభక్తులు. వీరి సహకారముతో ఇతడు ప్రజల ధార్మిక జీవనమునందు ప్రస్ఫుటమైన నూతన విధానములను కల్పించెను. అద్వైతాచార్యులు మొట్టమొదట విశ్వంభరునకు గురువుగానుండి తదుపరి అతనికే శిష్యు డయ్యెను. పూర్వాశ్రమములో విశ్వరూపు డను పేరుగల నిత్యానందుడు విశ్వంభరుని అన్న. నిత్యానందుడు శ్రీ బలరామావతార మనియు, విశ్వంభరుడు శ్రీకృష్ణుని అవతార మనియు భక్తుల విశ్వాసము.

చైతన్యుని ధర్మ ప్రబోధమునందు భక్తి భావ ప్రకోవనములగు కీర్తన గాన విధానము నూతన ఆరాధనా విధాన మయ్యెను. ఈ కీర్తనలో 'హరి - కృష్ణ' అను నామోచ్చారణ నినాదము మాత్రమే యుండును. ఈ సంకీర్తన సందర్భమున జంత్ర వాద్యముల సమ్మేళనముతో, మహా ధ్వనితో భక్తులు బృందగానము చేయు చుండెడివారు. ఇదియే వారి ప్రతి దిన చారుచర్యగా నుండెను. ఈ కీర్తన సంఘముల వారు గొప్ప సమూహముతో నవద్వీప నగర వీథులందు ఊరేగుచుండెడివారు. విశ్వంభరుడును, ఆతని ముఖ్యానుచరులును ఈ ఊరేగింపున ముందు నడచుచుండెడివారు. వారందరు బ్రహ్మానంద భరితులై ఆడుచు, పాడుచు, గంతులు వేయుచు పోవుచుండిరి. భక్తి సత్సంగములు ప్రతి దినము శ్రీనివాసుడను భక్తునియింట జరుగుచుండెను. ఈ సత్సంగము లందు ప్రధాన విశేషము కీర్తన పరాయణత్వమే.

'సంకీర్తన పద్ధతి' యనునది ఒక క్రొత్త విధమగు ఆరాధన. ఆ కాలమున నామగాన పద్ధతి యెచ్చటను లేదు. ఎవరికిని తెలియదు. దీనికి సంగీత సాధనములు "భోల్" అను పొడుగుపాటి మృదంగమును, కరతాళములును మాత్రమే. కీర్తనలు భగవంతుని నామావళిని మాత్రమే గూడుకొని యుండెను. ఇవి చిన్నవియు, అందరును ఉచ్చరింప దగినవై యుండెను. కొంచెము సేపు మృదంగము మ్రోయించిన తరువాత ఆ నామములపయి మనస్సులు లగ్నముచేసి, నామావళిని పాడుటకు భక్తులు ఉపక్రమించెదరు. అపుడు మహాప్రభువు నృత్యము చేయుటకు లేచును. అందరును లేచి, చిందులు త్రొకుచుందురు. మహాప్రభువు చేతులు పైకెత్తి ఊర్ధ్వ దృష్టితో మాటి మాటికి "హరిబోల్ - హరిబోల్" అనుచు కేకలు పెట్టుచుండును. అనుచరులందరును అట్లే నామోచ్చారణముతో, కేకలతో పరవశు లగుచుందురు. అందరు ఉన్మాదోద్రేకములతో వికార చేష్టలు చేయుచు, ప్రబలముగ నృత్యము చేయుచు తమ్ము తాము మరచి ఆనందమగ్ను లగుచుందురు. వీరు ఒండొరులను కౌగిలించు కొనుచుందురు. వణకుచు ఏడ్చుచుందురు. అరచుచుందురు. ఇట్లు గంటలకొలది నృత్యము చేయుచుండుటచే వీరల శరీరములనుండి చెమటలు కారుచుండును. కొందరు అలసి, వశముతప్పి, పడిపోయి, సమాధిగతులయ్యెదరు. ఈ విధానమును గూర్చి మన మేమనుకొన్నను, కేవలము 'హరి బోలో, కృష్ణ బోలో' అను నామద్వయోచ్చారణ గాన కలాపముతో కూడిన అట్టి భావోద్రేక పూరితమగు ఆరాధన పద్ధతి, వైష్ణవ మతములో నూతన సంప్రదాయ విధానమై ప్రజలకు అధికముగ ప్రీతిపాత్ర మయ్యెను.

నడి బజారులలో జరుగు వీరి వికట తాండవ దృశ్యము కొందరకు ఏవగింపు కలిగించెను. రాష్ట్ర పాలకుడయిన ముస్లిం అధికారి ఈ కీర్తన విధానమును నిషేధించెను. కాని విశ్వంభరుడు సత్యాగ్రహ పద్ధతి నవలంబించెను. ఆతడు ప్రభుత్వపు టాజ్ఞను బహిరంగముగ ధిక్కరించెను. చివరకా ఆజ్ఞ రద్దు చేయబడెను. భగవంతు డడ్డుపడి, స్వప్నసందేశ మిచ్చి నిషేధాజ్ఞను మాన్పించెనని చెప్పుదురు.

క్రీ. శ. 1510 జనవరి నెలలో కేశవభారతీస్వామి వారు విశ్వంభరునకు సన్యాస దీక్ష నొసగిరి. అప్పుడు కృష్ణచైతన్య భారతి అను పేరు పెట్టబడెను. కృష్ణచైతన్య పదమే సంగ్రహోచ్చారణలో చైతన్యుడను పదముగా మారెను.

భాగవత పురాణమునందు వర్ణితమైన శ్రీకృష్ణుని బాల్య క్రీడలకు తావలమైన బృందావనమునందు స్థిర నివాస మేర్పరచుకొనుటకు చైతన్యుడు నిశ్చయించుకొనెను. కాని మాతృదేవి ఆదేశానుసారము ఆమెకు దూరముగా కాక, దగ్గరగా పురీక్షేత్రమునందు నివసించుటకు ఆతడు ఒప్పుకొనెను. పురీక్షేత్రములో ఓడ్రదేశ ప్రభువగు ప్రతాపరుద్ర గజపతి, సుప్రసిద్ధ వేదాంతియైన

737