విజ్ఞానకోశము - 3
చిలకమర్తి లక్ష్మీనరసింహము
చిరి. అది మిక్కిలిగా ప్రజల మన్ననకు పాత్రమగుటచే ఇమ్మానేని హనుమంతరావు వీరిని మరలమరల నాటక రచనకై ప్రోత్సహించుచువచ్చిరి. ఇట్లు నాయుడుగారి కోరికపైననే వరుసగా ద్రౌపదీకల్యాణము, గయోపాఖ్యానము, రామజననము, పారిజాతాపహరణము, నలచరిత్రము, సీతాకల్యాణము అను నాటకములను రచించిరి. ఇందు చాలవరకు వచన నాటకములే. కాని తరువాత ఈ నాటకములను ముద్రించి ప్రకటించినపుడు పద్యములను వ్రాసి ముద్రించిరి. తరువాత ప్రసన్న యాదవ నాటకము విరచింపబడియెను. వీరి నాటకము లన్నింటిలో గయోపాఖ్యానము మిక్కిలి విశ్రుతమై, ప్రజాదరణకు పాత్రమై, ఎన్నియో ముద్రణములందెను. లక్షలకొలది ప్రతు లమ్ముడువోయెను. ఆంధ్రులలో ఆ నాటకమునందలి పద్యములు రానివారు - ముఖ్యముగా 'అల్లుడారమ్మని' అను పద్యము - ఒక్కరుకూడ లేరనిన అతిశయోక్తి కానేరదు. ఇట్లీ నాటకము ఆబాలగోపాలము ఆకర్షకమైనది. వీరి తొమ్మిదవ నాటకము చతుర చంద్రహాసము. పార్వతీ పరిణయమను వీరి నాటకము సంస్కృత నాటకమునకు ఆంధ్రీకరణము.
వీరి సారస్వత సేవా కలాపము నందలి ఇంకొక ముఖ్యాంశము నవలారచనము. వీరేశలింగముగారి రాజశేఖర చరిత్రతో ప్రారంభమైన నవల వీరి హస్తమున మంచి పరిణతినొందినది. ప్రసిద్ధ ఆంధ్రవాఙ్మయపోషకు లైన న్యాపతి సుబ్బారావు పెట్టిన పోటీ పరీక్షల కొరకై మొదటగా లక్ష్మీనరసింహము 1894 లో రామచంద్ర విజయ మను నవలను రచించిరి. తరువాత క్రమముగా వీరు హేమలత, అహల్యాబాయి, సౌందర్యతిలక, కర్పూర మంజరి, సుధాశరశ్చంద్రము, కృష్ణవేణి, మణిమంజరి, గణపతి యను నవలలను రచించిరి. ఈ నవలలలో కొన్ని పౌరాణికములు, కొన్ని సాంఘికములు . సాంఘిక నవలలలో ఆనాటి సాంఘిక వృత్తము అనేక విధముల చక్కగా చిత్రింపబడెను. అందును వీరి 'గణపతి' మిక్కిలి ప్రసిద్ధినొందినది. ఇది వ్యంగ్యప్రధానమగు సాంఘిక నవల. ఆనాటి బ్రాహ్మణసంఘమున ప్రబలియున్న మూఢాచారములను రూపుమాపుటకై ఉద్దేశింపబడిన నవలా రాజమిది.
ఇవి గాక రాజస్థాన కథావళి, మహాపురుష జీవిత చరిత్ర, భారత కథామంజరి, ధర్మవిజయము, మహాపురుష జీవితముక్తావళి మున్నగు వచన రచనలు, ప్రహసనములు, వినోదములు మున్నగునవియు, ఇంకెన్నియో రచనములును కలవు. ముఖ్యముగ వీరి రచనము లన్నియు సరళ సుందరములు, ప్రసన్నములు నగుట యొక విశేషము. 1928 లో జరిగిన వీరి షష్టిపూర్త్యుత్సవమునకు వీరి రచనము లన్నియు చక్కని సంపుటములుగా నచ్చొత్తింప బడెను.
ప్రధానముగా లక్ష్మీనరసింహముగారు వృత్తిచేత ఉపాధ్యాయులుగా నుండి వారు స్వయముగ ఆర్జించినది చాల తక్కువయే. అయినను సాధుశీలమువలనను, నిష్కళంక మైన సంఘసేవారతివలనమ, ఎందరో ధనవంతుల యొక్క మెప్పుబడసి, వారల సహాయ సహకారములతో పాఠశాలలు నిర్వహించుట, పత్రికలు నడపుట, ప్రజాసేవా కార్యక్రమములు జరుపుట మున్నగు మిక్కిలి ధనసాధ్యములగు ఎన్నో దేశహితైక కార్యములను దీక్షగా కొనసాగించిరి.
వీరు స్థాపించిన హిందూ లోయర్ సెకండరీ స్కూలునే కందుకూరి వీరేశలింగము తీసికొనిరి. అదియే ఇప్పటి వీరేశలింగం హైస్కూలు. తరువాత 1909 లో 'రామమోహనరాయ్ పాఠశాల' యను పేరిట నిమ్నజాతులవారికి పాఠశాల పెట్టి ఉచిత విద్యా దానము చేసిరి. కొన్నాళ్ళు భీమవరములో నొక పాఠశాలను నడిపిరి. పాఠశాలా నిర్వహణమున అధికారులు చాల చిక్కులు కల్పించినను, ఆతడు చలింపక ఆత్మాభిమానము నేమాత్రమును వీడ కుండగనే దానిని నిర్వహించిరి.
లక్ష్మీనరసింహము, మనోరమ, దేశమాత, సరస్వతి, దేశ సేవ అను పత్రికలను నడపి, ఆనాటి సాంఘిక, రాజకీయ, సారస్వత వ్యవస్థల కెంతో సేవ సల్పిరి. సౌందర్యతిలక మున్నగు వీరి నవలలు, ప్రహసనములు వీరి పత్రికలలో ప్రచురింపబడినవే.
ఆనాటి మండల సభల యందును, 'హోమ్ రూల్', 'వందేమాతరం' ఉద్యమముల యందును ఆంధ్ర మహాసభల యందును, సంఘ సంస్కారోద్యమముల యందును, వేశ్యా బహిష్కారాది ఇతర దేశసేవా కార్యక్రమముల యందును, ఉపన్యాసకులుగను, అధ్యక్షులుగను పాల్గొనుటయే కాక వాటిని స్వయముగ నిర్వహించి మహోత్తమ
709