చికిత్సాశాస్త్రము (ఆయు)
సంగ్రహ ఆంధ్ర
8. వాజీకరణ చికిత్స : అనవచ్ఛిన్నమగు ప్రజాతంతువునకు, అనిర్వచనీయమగు సర్వేంద్రియానంద సందోహమునకు మూలమగు మిధున ధర్మమునందు అనంతపాటవమును సమకూర్చుటను, స్థిరముగ కాపాడుటను, ఈ చికిత్స విధానమునందు చెప్పబడినది.
ఈ తీరునగల అష్టాంగ చికిత్సావిధానమును దైవాసుర మానుషీ చికిత్సా పద్ధతులని తిరిగి మూడు భాగములుగా సులభ గ్రాహ్యమగునట్లు వివరించనైనది.
శ్లో. ఆసురీమానుషీదైవీ చికిత్సా సా త్రిధా మతా
సూత ప్రధానదైవీస్యా చ్ఛేదభేదాత్మికాసురీ
మానుషీ సద్రసాజ్ఞేయా జపహోమాది సంస్కృతా
కలౌచాల్పబలేలోకే మానుషీ తత్రపూజితా.
ఆసురీచికిత్స, మానుషీ చికిత్స, దైవీచికిత్సయని చికిత్స మూడువిధములు.
(1) దైవీచికిత్స : ఇది పాదరసము ప్రధానముగ గలది. ఈ విధానమునకు శైవీచికిత్సా సంప్రదాయమని వాడుక. కైలాసవాసియగు పరమశివుడు ప్రయోక్తగను ప్రవక్తగను చెప్పబడిన శాస్త్రమగుటచే ఈ సంప్రదాయమునకీ వాడుక కలిగినది. శివుడు రససిద్దుడు - మృత్యుంజయు డనుటకు ఇది కారణము. శివుడు హాలాహల భక్షణము చేయుట ఈ రససిద్ధి మహత్వదర్శనమే. రససిద్ధులు జరారహిత దృఢకాయులుగ, అజేయ బలపరాక్రమో పేతులుగ, మృత్యుంజయులుగ, అనంతకల్పములు అమరులుగ నుందురని రసశాస్త్రసిద్ధాంతము - ప్రాచీన గ్రంథము లట్లుంచి పూజ్యపాదులగు శ్రీ గోవింద భగవత్పాదుల "రసహృదయతంత్రము”, శ్రీ మాధవ విద్యారణ్యుల “రసేశ్వర దర్శనము” నిదర్శనములు - రసశాస్త్రమును విరివిగా ప్రచారమున నందించినది “మత్స్యేంద్రనాధాది" నవనాథసిద్ధులు, “సిద్ధేరసేకరిష్యే - మహీమహం నిర్జరా మరణం" - రసహృదయ తంత్రము (అధ్యాయము 1. శ్లోకము - 6) నందు గోవింద భగవత్పాదులు రససిద్ధి కలిగిన, 'నేను లోకమంతయు నిర్జరామరణముగ చేయుదును. మనుష్యుల నందరను ముదిమియు, చావును లేని వారినిగా చేయుదు'నని ప్రతిజ్ఞ చేసెను. విమర్శకులకీ గ్రంథము మహోపయోగ్యము. శ్రీ శంకరులాదిగా మతత్రయా చార్యకోటి ఈ రసశాస్త్ర పారంపర్యము గలవారనియు, ఆయా పీఠములం దీ రసగ్రంథములు ఈనాటికిని గలవనియు ప్రతీతి. శ్రీ మాధవ విద్యారణ్యులు ఇందు అందెవేసినచేయి యని వారి వర్తనయు, రచనయు ప్రమాణములు. వీరు సిద్ధరసజ్ఞానమును ఇట్లు చెప్పిరి. “పూర్వలోహే పరీక్షేతపశ్చాదేహే ప్రయోజయేత్"- తరువాతకాలమున ప్రసిద్ధి సిద్ధనాగార్జునునకు గలదు. శ్రీశైలమునం దీ సిద్ధులు గలరనియు, సిద్ధులును గలవనియు వాడుక.
ఇట్లు మహత్వము, పవిత్రమునగు రసశాస్త్రమును కేవల ధాతువాదముగా మాత్రమే దొరికినంతలో పరిశోధించుచున్న సిద్ధయోగులు, యోగభ్రష్టులు నే డనేకులు గలరు. రసయోగములను సాధించుటలో ఆంధ్రమందు గల ఆయుర్వేదవైద్యు లగ్రగాములు. ప్రత్యేక రసయోగములను, రసకలిత యోగములను విరివిగా ఆంధ్రమునందు వైద్యులు ప్రాచీనమునుండియు వాడుక చేయుచున్నారు. యోగరత్నాకరము, చింతామణి, బసవరాజీయములు ఇందుకు చాలవరకు ప్రమాణములు.
2. ఆసురీచికిత్స : ఇది వివిధాత్మకమైన శస్త్రచికిత్స గలది. ఇందుకు సుశ్రుత సంహిత ప్రమాణము - చికిత్స యందు ఛేదన, భేదనాది క్రియలలో క్రూరముగా ప్రవర్తించవలసి యున్నందున ఆసురీచికిత్సయని చెప్పబడినది.
3. మానుషీ చికిత్స : ఇది మధురాదిరసములు, సకల ఓషధులు, పూర్వజన్మార్జిత కర్మవిపాక, గ్రహ, నక్షత్ర జప, హోమ, బలి, మంగళ క్రియా విశేషములు ప్రధానముగా గలది . ఈ మానుషీ చికిత్సా సంప్రదాయమునకు, బ్రాహ్మీచికిత్సా విధాన మని వాడుక . ఇందుకు చతుర్ముఖబ్రహ్మప్రవక్త. శ్రీమహావిష్ణువు ప్రయోక్త. అమృతోత్పాదనకథ ఇందుకు సంబంధము కలది. కైలాస వాసుడగు శ్రీ శంకరు డెట్లు రసశాస్త్ర నిష్ణాతుడో, క్షీరసాగరశయాను డగు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మీ సాంప్రదాయమునం దంత పరాకాష్ఠ కలవాడు - ఈ సంప్రదాయమునకు ప్రధానముగా చరక సంహిత ప్రమాణము.
చికిత్స ఎట్లుచేయవలయును? చికిత్సచేయువా డెట్లుండ వలయును? రోగి ఎటువంటివాడుగా నుండిన చికిత్సార్హుడు? రోగికి పరిచర్య చేయువా రెట్లుండవలయును ?
662