Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/701

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చలనచిత్రములు

వినోదము చేకూర్చుటకు సినిమెటోగ్రఫీ చక్కని సాధనమను విషయము క్రీ. శ. 1896 లో విరివిగా వ్యాప్తిలోనికి వచ్చెను. ఫ్రాన్సుదేశీయులైన లూమియర్ సోదరులు లండన్‌లోని రాయల్ పాలీటెక్నిక్ లో తాము తీసిన ఛాయా చిత్రములను ప్రప్రథమముగా వినోదార్థము ప్రదర్శించిరి. లూమియర్ సోదరులు ఈ ప్రదర్శనములో ఉపయోగించిన యంత్రములో కెమేరా, ప్రింటరు, ప్రొజెక్టరు కలిపియుండెను.

అనంతరము, చలనచిత్రముతో శబ్దమును జోడించుటకు పెక్కు ప్రయోగములు జరిగెను. ఈ ప్రయోగములలో ఒక ఫ్రెంచి జాతీయుడు కొంతవరకు విజయము సంపాదింపగల్గెను. ఆతడి పేరు డెమినీ. ఒక వంక మాజిక్ లాంతరు నడచుచున్న సమయములో ఆతడు కొన్ని "స్లైడ్సు"ను చూపెట్టగల్గెను. ఈ స్లైడ్సుకు అనుబంధముగా ఫోనోగ్రాఫ్‌మీద కంఠధ్వని వినపడెను.

క్రీ. శ. 1890 లో షికాగో (అమెరికా సంయుక్త రాష్ట్రములు) నగరములో జరిగిన ప్రపంచ సంతలో (World Fair) థామస్ ఆల్వా ఎడిసన్, తాను నిర్మించిన 'కినిటోస్కోవ్ 'ను ప్రదర్శించెను. ఈ యంత్రములో నుండి చూడగా, సెల్యులాయిడ్‌మీద ఒక చిన్న చలన చిత్రము కాన్పించెను. మానవునిహావ భావ సంచలనమును ఆచిత్రములో చూచినవారి ఆనందమునకు అవధులు లేకుండెను. ఆ చలన చిత్రమును దర్శించుటకు ప్రజలు నేల ఈనినట్లు వెఱ్ఱిగా విరుగబడిరి. ప్రపంచములో ప్రప్రథమముగా ప్రదర్శించబడిన చలనచరిత్ర మిదియే.

మూగచిత్రము : చలనచిత్రమును ఇతోధికముగ శాస్త్రీయమును, శ క్తిమంతమును చేయుటకు ఆనాటినుండియు ఎన్నియో పరిశోధనలు జరిగెను. మూగ చిత్రములు (silent pictures) మీద ప్రజాసామాన్యమునకు మోజు హెచ్చెను. కెమేరాలు, ప్రాజెక్టరులు శీఘ్రకాలములో తయారగుట ప్రారంభమయ్యెను. అంతకు పూర్వము ముక్కలు ముక్కలుగా నున్న ఫిల్ములు ఇప్పుడు వెయ్యి అడుగుల 'రీలు' గా తయారయ్యెను. ఆ దినములలో జరిగిన పెద్ద విందులు, వినోదములు ఈ మూగ చిత్రములలోనికి డాక్యుమెంటరీ రూపములో ఎక్కసాగెను.

చిత్రము - 188

పటము - 4

ఈనాడు ఉపయోగించుచున్న స్టూడియో కెమెరా

వేయి అడుగుల చిత్రములకు పూర్వము వచ్చిన ఏబది అడుగుల చిత్రములు ప్రేక్షకులకు యధార్థముగ విస్మయము కల్గించెను. 'లైఫ్ ఆఫ్ ఏన్ అమెరికన్ ఫైర్ - మన్', 'ట్రెయిన్ రాబరీ' మొదలగు చిత్రములు ఎడిసన్ కంపెనీవారి ఆవరణ నుండి బయటికి వచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యచకితులుగా చేసివై చినవి. ఇటు చిత్రము నడచుచున్న సమయమందే, అటు వ్యాఖ్య ఫోనోగ్రాఫ్ మీద వినిపించెడిది.

క్రీ. శ. 1902 లో అమెరికాలో థామస్ టాల్ అను నాతడు 'ఎలక్ట్రిక్ థియేటరు' ను ప్రారంభించెను. అంతకు పూర్వమే ఎడిసన్ తన స్వంత స్టూడియోను నిర్మించుకొనెను. ఉద్వేగమును, ఆవేశమును కలిగించెడి వంద అడుగుల చిత్రములు ఆ స్టూడియో యందును, బహిరంగ ప్రదేశములయందును తయారు కాజొచ్చెను. సంస్కారము లోపించిన మోటునటనను కనబరచెడి కొందరు నటీనటులు ముందునకువచ్చి ఈ చలనచిత్రములలో పాల్గొనిరి. చలనచిత్రముల మీద మోజు హెచ్చిన ప్రజలు నటీనటుల హావభావములకు అంతగా ప్రాముఖ్యము నియ్యలేదు.

641