చంద్రగిరి
సంగ్రహ ఆంధ్ర
అంతమొందించినగాని ఈ సమస్య చక్కబడదని తలచి అతనిచంప నుద్యుక్తుడై చెరసాలకుబోవు సమయమున, శ్రీరంగదేవరాయ లీ వార్త తెలిసికొని దారపుత్రాదులను తొలుత చంపి, ఆత్మహత్య గావించుకొనెను. జగ్గరాయడు, యాచమనాయడును దీర్ఘ కాలము పోరిరి. తుదకు యాచమనాయనికే జయము కలిగినది. తనవద్ద నున్న రామదేవరాయలను క్రీ. శ. 1614 లో చంద్రగిరిలో పట్టాభిషిక్తునిచేసి ఆరవీటి వంశమును పునఃప్రతిష్ఠించెను.
చంద్రగిరిదుర్గమును తరువాత స్వాధీనము చేసికొన్న వారు మహారాష్ట్రులు. వీరివద్దనుండి గోలకొండ సుల్తానులు, తదుపరి ఆర్కాటునవాబులు చంద్రగిరిని కైవస మొనర్చుకొనిరి. క్రీ. శ. 1792 లో జరిగిన శ్రీరంగపట్టణపు సంధివలన దత్తమండలములు నైజామునకు దక్కినవి. కాని క్రీ. శ. 1799 లో నైజాము ఈ ప్రాంతమును బ్రిటిష్వారికి ఇచ్చివేసెను. 1805 వ సం. లో చంద్రగిరి ఉత్తరార్కాటు మండలమునుండి వేరుచేయబడి చిత్తూరు జిల్లాయందు కలుపబడెను. 1860 లో చంద్రగిరి యొక తాలూకా కేంద్రముగా ఏర్పడినది.
చంద్రగిరి కవి పండితప్రవరులకు విహార భూమిగా విరాజిల్లెను. ఇచ్చటనే తరిగొప్పుల మల్లన తన చంద్రభాను చరిత్రమును, దోనేరు కోనేరునాథకవి ద్విపద బాల భాగవతమును, గోవిందమంత్రిభారతీ పరిణయమును కృతిపతులకు సమర్పించుకొనిరి. వెంకటపతి రాయలు పైన పేర్కొనబడిన గోవిందమంత్రికి 'మణి కనకాభిషేకము’ గావించెనట ! అప్పయ దీక్షితుల యాదవాభ్యుదయ వ్యాఖ్యయు, కువలయానందము, భట్టకలంకుని శబ్దాను శాసనము, ఎఱ్ఱ మాధవార్యుని త్రిపదద్యోతిని చంద్రగిరి నుండి ఆవిర్భవించినవే. ఉప్పుగుండూరి పెరియన్న కవి తన మీనకేతనాభ్యుదయమను గ్రంథమును పెదవెంకటపతిరాయల కంకితము గావించెను. ఉభయభాషా సాహిత్య భోజుడైన చంద్రగిరి అనంతభూపాలుడు మైసూరి దళవాయి కళువె వీరరాజునకు గ్రంథరచనయందు తోడ్పడుటయే గాక, స్వయముగ భారత మందలి ఆనుశాసనిక పర్వమును వచన కావ్యముగా సంతరించి యున్నాడు. ఇతనికే తుపాకుల అనంతభూపాలు డని పేరు. తుపాకుల వారు జింజినాయకులయొద్ద సైన్యాధిపతులుగా నుండిరి. తుపాకుల లింగభూపాలుడును, ఈ అనంతభూపాలుడును జ్ఞాతులు. చంద్రగిరి తుపాకుల లింగభూపాలుని కుమార్తెయే మధుర నేలిన మహారాణి మంగమ్మ. 'కొమ్మరాజు యుద్ధము' అను పల్నాటి వీరచరిత్ర కథాభాగము రచించిన కొండయ తన గ్రంథమునకు చంద్రగిరి వెంకటేంద్ర భూపాలుని కృతిభర్తగా జేసికొనెను. సిద్ధాంత సిద్ధాంజనముపై వ్యాఖ్య రచించిన విశ్వనాథుని తండ్రి అన్నశాస్త్రి కామదేవకవి యను ఉద్దండ సంస్కృత కవిని ఓడించిన దీ చంద్రగిరి సాహిత్యరంగమునందే. లలితకళలకును చంద్రగిరి రాజన్యుల మహితాదరము లభించియుండెను.
వేలూరు, చంద్రగిరి దుర్గముల నిర్మాణమునందు అప్పచెల్లెండ్ర పోలికలు గలవు. రెండు దుర్గములును విజయనగరాధీశ్వరులచే పెంపు చేయబడినవే. ఈ రెండింటి యందును విజయనగర శిల్పవిన్యాసపు తీరు అచ్చు గ్రుద్దినట్లుగా కనిపించును. తాను పరిపాలించిన రోజులలో చంద్రగిరికి తేజోవంతమైన చైతన్యము కలిగించి, ఖండాంతర ఖ్యాతి తెచ్చి పెట్టిన వెంకటపతిరాయల కాంస్య విగ్రహము తిరుమలయందు నేడు చూడవచ్చును. చంద్రగిరికోట యందలి ఆంజనేయ విగ్రహమును కాకుమాని మూర్తి ఇట్లభివర్ణించి యున్నాడు:
సీ. జలరాశి లంఘనోజ్జ్వల జవంబున నెవ్వఁ
డలరె మరున్మహోహరత దోఁప
లంకాహరణ వేళ లలితాత్మ శౌర్యంబు
మున్నెవ్వఁ డకలంకముగ ఘటించె
ముద్రిక నిజ శిరంబునఁ దాల్చినాఁ డెవ్వఁ
డిల రామమహిజాని హితము గాఁగ
లక్ష్మణ ప్రాణానిలము నిల్పె నెవ్వాఁడు
తనదు గాత్రంబు పావనము గాఁగ
నట్టి రఘురామ సూచనా హర్ష బాష్ప
మోచనాఖండ గండాభిషేచనాంత
లోచనాంతర రుచి చారు లోచనాంతుఁ
జంద్రగిరికోట హనుమంతు సన్నుతింతు.
ఈ విగ్రహము నేడు అదెపొలమను ప్రదేశమున నున్నది. రామరాజ భూషణుఁడీ విగ్రహమును పూజించెడివాడని స్థలజ్ఞులు చెప్పుచున్నారు.
566