Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గౌతమబుద్దుడు

సంగ్రహ ఆంధ్ర

మునకు పోయెను. అచ్చట బింబిసారుడను రాజు బౌద్ధ ధర్మమును స్వీకరించుటయేగాక బౌద్ధసంఘమునకు ఒక ఆరామముకూడ దానముచేసెను. అచ్చట నే శారీపుత్రుఁడు, మౌద్గలాయనుడు అను ఇరువురు బుద్ధునిచే ఉపదిష్టులై అతనికి ప్రముఖశిష్యులై వరలిరి.

ఇట్లుండ బుద్ధుడుగా సుప్రసిద్ధుడైన తన కుమారుని చూడగోరి శుద్దోదనుడు సందేశములు పంపదొడగెను. తుదకు బుద్ధుడు ఇష్టపడి ఒక వసంతకాలమున తన శిష్య వర్గముతో కపిలవస్తుపురమున కేగెను. ఇల్లు విడచిపోయిన పిదప మొదటి పర్యాయముగా అతడు తన తండ్రిని, భార్యాపుత్రులను చూచుట తటస్థించెను. అతడు నగరముయొక్క వాకిట నిలుచుండెను. యశోధర తనకుమారుడగు రాహులుని తండ్రియగు బుద్ధునికడకు పంపెను. రాహులుడు బుద్ధుని కడకు వచ్చి తన వారసత్వము తన కిమ్మని యాచించెను. బుద్ధుడు శారీపుత్రునివై పు తిరిగి రాహులుని సంఘమునందు చేర్చుకొమ్మని ఉత్తరువిచ్చెను. ఇట్లు బుద్ధుడు తన కుమారునకు భౌతిక రాజ్య వారసత్వము కంటె శ్రేష్ఠమగు ఆధ్యాత్మిక వారసత్వ మొసగెను.

అటనుండి బుద్ధుడు రాజగృహమునకు తిరిగి వచ్చెను. శ్రావస్తీ నగరమందు అనాథపిండికుడను వర్తకుడు ఆతని శిష్యు డయ్యెను. ఆ వర్తకుడు రాజగృహమునుండి శ్రావస్తి వరకు గల మార్గమున ప్రతి క్రోసు దూరమునను బౌద్ధసంఘమునకై విశ్రాంతి గృహములు కట్టించెను. శ్రావస్తీనగరమున జేతుడను నొక రాజకుమారుని ఆరామమును కొని బౌద్ధసంఘమున కొక సంఘారామమును కట్టించెను. దీనికి జేతవనమని పేరు. ఇది నాటి నుండి బుద్ధునకు తన ధర్మప్రచారమునకు కేంద్రస్థాన మాయెను. శ్రావస్తియందు మరియొక వణిక్పుంగవుని కుమార్తె విశాఖయను నామె బౌద్ధమతము స్వీకరించి తన అమూల్యాభరణములను సంఘమునకు దానమిచ్చెను. దీనిపై వచ్చు నాదాయముతో మరియొక సంఘారామము కట్టింపబడెను. బుద్ధుడు ఈ సమయముననే ఇరువురురాజుల మధ్య జరుగనున్న యుద్ధమును వారించెను. వారు బుద్ధుని ఉపదేశములను విని వాటి ననుసరించి వర్తించిరి.

ఇంతవరకును పురుషులే సంఘమునందు చేరుటకు అర్హులై యుండిరి. స్త్రీలకు ప్రవేశము లేకుండెను. శుద్ధోదనుని మరణానంతరము, మహాప్రజాపతి గౌతమి కాషాయాంబరములను ధరించి బుద్ధునికడకు వచ్చి సంఘమునందు చేర్చుకొమ్మని ఆతని నర్థించెను. బుద్ధుడు మొదట అంగీకరింపలేదు. కాని అతని శిష్యులలో ప్రముఖుడైన ఆనందుడు ఆమె పక్షము వహించి అనేక విధముల ప్రార్థించెను. బుద్ధు డామెకు ప్రవేశ మొసగెను. బుద్ధుడు స్త్రీలను సంఘమునందు చేర్చుకొనుటకు చాల విముఖుడై యున్నట్లు అత డేర్పరచిన కఠిన నియమముల వలన తెలియవచ్చుచున్నది.

అప్పటినుండి బుద్ధుడు నలుబదియైదు సంవత్సరములు ఈశాన్య భారతదేశమున పర్యటించుచు ధర్మచక్ర ప్రవర్తనము కావింపదొడగెను. తనకడకు వచ్చినవా రందరకును ధర్మమును బోధించుచుండెను. రాజాధిరాజుల నుండి అధమజాతివారి వరకు అందరును అతనికి శిష్యులై సేవ చేయుచుండిరి. బింబిసారుడు, అతని కుమారుడు, కోసల దేశాధీశుడైన ప్రసేనజిత్తు అతనికి శిష్యులైరి. ఆమ్రపాలియను వేశ్యగూడ బుద్ధుని ఆదరాభిమానములను పొందెను. ఆమె బౌద్ధసంఘమునకు సంఘారామములను, విహారములను దానముచేసెను.

ధర్మప్రచారార్థము పర్యటించుచు బుద్దుడు 'పావా' యను పట్టణమునకు బోయెను. అచ్చట కుందుడను కమ్మర వాని యింట భోజనము గావించెను. ఆహారపదార్ధములు జీర్ణముకాకపోవుటచే బుద్ధుడు మరణించె నని చెప్పుదురు. కాని ఇది సత్యదూరముగా కాన్పించుచున్నది. భోజనా నంతరము బుద్ధుడు సాలవనమునకు పోయి తాను బడలిక చెందితి ననియు, తనకు శయ్య సిద్ధము చేయుమనియు ఆనందునితో చెప్పెను. భిక్షువులు బుద్ధుని అవసానము సమీపించె నని తెలిసికొని చుట్టును చేరిరి. అత్యల్పకాలములో బుద్ధుని అవసానదశను గూర్చిన సమాచారము పరిసర గ్రామవాసులకు తెలిసెను. ఆ గ్రామవాసులందరు వచ్చిరి. బుద్ధుడు అందరకును ధర్మము నుపదేశించెను. అతడు దుఃఖాక్రాంతుడైన తన ముఖ్య శిష్యుడగు ఆనందుని పిలిచి అతనిని ఓదార్చెను. అందరకును “మీ ఆత్మ యందే శరణుపొందుడు. ధర్మమునే ఆశ్రయింపుడు. భిక్షుకులారా ! మీరందరును కష్టించి ముక్తిని సాధించు

492