Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోలకొండ సుల్తానులు

సంగ్రహ ఆంధ్ర

యొకటి. ఇది హైదరాబాదు నగరమునకు ఆరుమైళ్ళ దూరమున కలదు. ఇది మొదట మట్టికోటగ నుండినదట. ఇది 14 వ శతాబ్దమున బహమనీ సుల్తానుల వశమైనది. ఒకానొక కాలమున 'మానుగల్లుకోట' అను పేర ఈ దుర్గము ప్రసిద్ధమై యుండినటుల 'తేవనాట్' వ్రాతల వలన స్పష్టమగుచున్నది. ఈ దుర్గనిర్మాణమున గొల్లవాని సహకారముండి యుండెననుటకుకూడా తగిన ఆధారములుకలవు. సుల్తాన్ కులీకుతుబ్‌షా కాలమున ఈ దుర్గము బలిష్ఠ మొనర్పబడెను. భోనగిరి దుర్గమును నిర్మించిన ధనగరుకొండయ్యయొక్క ఆశీర్వాదమునొంది అహమ్మద్ నగరుగా పేర్కొనబడియున్న దుర్గమును గొల్లకొండగా సుల్తానులు మార్చిరి. గోలకొండదుర్గము క్రీ. శ. 1651 ప్రాంతమున పునర్నిర్మితమైనది. ఈ దుర్గమున మూడు కోటగోడలు ఒకదాని నొకటి చుట్టుకొని యున్నవి. దుర్గముచుట్టును పర్వతప్రాంత మొకటి కలదు. ప్రాకార కుడ్యముల కై వారము దాదాపు మూడుమైళ్ళుండును. 87 బురుజులతోను, ఎనిమిది ద్వారములతోను ఈదుర్గము బలిష్ఠముగా నుండినది. ఆనాటి కోటద్వారములలో ప్రస్తుతము ఫత్తేదర్వాజామాత్రమే నిలచియున్నది.

గోలకొండదుర్గశిఖరమున 'బాలాహిస్సారు' కలదు. ఇచట రాజప్రాసాదములు, అంతఃపురములు, ఉద్యాన వనములు, మసీదులు, దేవాలయములు, ఆయుధాగారములు, అంగళ్ళు, భాగ్యమతియొక్కయు, తారామతి యొక్కయు వాసగృహములు, మాదన్నమంత్రి పూజామందిరము మున్నగున వెన్నియో కలవు. గోలకొండ నుండి కొన్ని సొరంగములు గోషామహలు, చార్మినారుల వరకు భూగర్భమున కలవని జనశ్రుతి బలీయముగ నున్నది. గోలకొండ సుల్తానుల సమాధులు 'లంగర్ హౌసు' ప్రాంతమున కలవు. ఈ సమాధులు, దక్కనీమహమ్మదీయ శిల్పమునకు చక్కని తార్కాణములు. భాగ్యమతి సమాధికూడ ఇచ్చటనే కలదని తెలియుచున్నది. చక్కని పర్వత ప్రాంతమునుండి సుందర బలిష్ఠ ప్రాకారకుడ్యములతో నొప్పారిన గోలకొండ దుర్గమును ముట్టడించి వశపరుచు కొనుటకు ఔరంగజేబు సైన్యమునకు ఎనిమిది మాసములు పట్టెననుటయే దీని ప్రతిష్ఠను చాటుచున్నది.

కేవలము దుర్గమేకాక, గోలకొండ ప్రాంతమునను, మూసీతీరమునను ఎన్నియో హర్మ్యములు, ప్రాసాదములు గోలకొండ సుల్తానుల కాలమున నిర్మింపబడినవి. కొన్ని శిథిలావస్థలో నున్నవి. మరికొన్ని నేటికిని చెక్కుచెదరక హైదరాబాదును సందర్శించువారికి నేత్రపర్వముగ నున్నవి. అట్టివాటిలో చార్మినారు, మక్కా మశీదు ముఖ్యమైనవి. బారాదరి, గోషామహల్ మున్నగు భవనములు పెక్కులు భాగ్యనగర నిర్మాణానంతరము కట్టబడినవి. ఎటు చూచినను ఉద్యానవనములు, హర్మ్యములు, ప్రాసాదములు ఉండెను. కావుననే విదేశయాత్రికు డొకడు “నగరమంతయు సుందరోద్యానము" గ నుండెనని వర్ణించెను. హుస్సేన్ సాగరు వంటి తటాకములుకూడ నిర్మింపబడినవి. యాత్రికులకు సత్రములు కట్టబడినవి. ప్రాసాదములయొక్కయు, సుందర భవనములయొక్కయు శిథిలచిహ్నములు నేటికిని గోలకొండను దర్శించువారిని విస్మయమగ్నుల నొనర్చుచున్నవి. దుర్గమును బలపర్చుటయే గాక వివిధ నగర నిర్మాణ కార్యక్రమములయందు కూడ సుల్తానులు శ్రద్ధవహించిరి. ఇబ్రహీంపట్టణము, హయాత్‌నగరమువంటివి నాడు వెలసినవే.

సాంఘికపరిస్థితులు : గోలకొండనగరము శతాబ్దముల వరకును వర్తక వ్యాపారకేంద్రముగ విలసిల్లినది. కోహినూర్ వజ్రముల వలననే గోలకొండపేరు సర్వ ప్రపంచమునకును సుపరిచితమైనది. రత్నములకు, వజ్రములకు, కస్తూరీ మొదలగు సుగంధ ద్రవ్యములకు గోలకొండ వ్యాపార కేంద్రముగ నుండినది. విదేశములనుండి వర్తకులు వచ్చి సరకుల నమ్మి ధనరాసులను సంపాదించుకొను చుండిరి. కొన్ని సంవత్సరములు తప్ప తక్కిన కాలమును గోలకొండ సుభిక్షముగ నుండినది. కృషియందు కూడ గోలకొండ ఏ ప్రాంతమునకు వెనుకబడినది కాదు. గోధుమ, జొన్న, పప్పుధాన్యములు, ఆముదములు, తాటిబెల్లము, ఆమ్ల ఫలములు, నారింజ ఫలములు, మున్నగునవి విరివిగ ఆర్థిక సంపత్తిని కూర్చినవి. దట్టమైన అడవుల వలన వంట చెరకు విరివిగా లభించెడిది. వన్యమృగములు కూడ ఎన్నియో యుండెను. అన్నిటివలన దేశమున కెంతయో ఆదాయము లభించెడిది. గోలకొండలో గల 23 గనుల వలన కూడ దేశమునందలి ఆర్థికపరిస్థితులు పటిష్ఠముగ నుండెను. అందుచేత దేశమున ప్రజలు

486