Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/525

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోలకొండ పట్టణము

సంగ్రహ ఆంధ్ర

చున్నవి. కోహినూరు వజ్రముకథ ప్రపంచ ప్రసిద్ధమైనది. గోలకొండనుండి ఆ వజ్రము పయనించి ఎందరినో సామాన్యులను, ధనికులను, చక్రవర్తులను, తన్మకుటములను వరించినది. ఇట్టి గాథ లనంతములుగ గలవు. గోలకొండలో వజ్రములను పరీక్షించు నిపుణు లెందరో ఉండిరి. వజ్రముల పరీక్షించు పద్ధతులుకూడ పలువిధము లయినవి. కొందరు చూచినంతమాత్రమున, కొందరు తాకినంతమాత్రమున, మరికొందరు వాసన చూచినంత మాత్రముననే వజ్రముల మంచిచెడుగులను తెలిసికొనెడి వారట. వజ్రముల గనులు రాజాధికారులయొక్కయు, ధనికులయొక్కయు స్వాధీనమున ఉండినవి. విదేశీయములైన కంపెనీలకు ఈ గనులపై యాజమాన్యము లేకుండ, గోలకొండసుల్తానులు కట్టుదిట్టములు కావించిరి. అక్కన్న మాదన్నలు ఈ విషయమున ప్రత్యేకశ్రద్ధ వహించి విదేశీయములయిన కంపెనీలకు ఎట్టి యాజమాన్యము లేకుండ ఆంక్షలు విధించిరని తెలియుచున్నది. డచ్చివారు వజ్రముల వ్యాపారములో ప్రముఖులుగ నుండిరి.

సుగంధద్రవ్య వ్యాపారసంబంధములు రెడ్డిరాజుల కాలమునుండియు విదేశములకును, ఆంధ్రదేశమునకును మధ్య ప్రగాఢముగ నుండెను. గోలకొండలో అవచి తిప్పయసెట్టివంటివా రెందరుండిరో చెప్పుట కష్టము. వర్తకులు తెచ్చిన సుగంధద్రవ్యములు గోలకొండ విఫణి వీథులందు కొన్ని గంటలలోనే అమ్ముడు పోవుచుండెడి వట. ఇక్కడకు సుగంధాదివస్తువులు తెచ్చి అమ్ముడుపోక, నిరాశాహతులైనవా రెవ్వరును లేకుండిరి. మహమ్మద్‌కులీ కాలమున సుగంధ ద్రవ్యములను దెచ్చిన వర్తకు డొకడు తనసరకు నమ్మలేకపోయెనట. నాటికే రాజుగారి యొద్ద, ధనికులయొద్ద . అట్టి సుగంధద్రవ్యములు రాసులుగ నుండెనట. ఆ వర్తకుడు నిరాశాహతుడై వెళ్ళుచున్న వార్త గూఢచారులవలన రాజుగారి కందినది. రాజు ఆ వస్తువులను కొని రాజసౌధములం దుంచుటకు స్థలము లేకపోయినది. అందుచే, ఆ చక్రవర్తి తక్షణమే వర్తకునియొద్ద కొన్న కస్తూరిని అపుడపుడే హైదరాబాదు ప్రాంతమున నిర్మాణదశలో నున్న సౌధపు పునాదులందు వేయ నాజ్ఞాపించెనట. అప్పటినుండి ఆ సౌధము 'మిష్క్ మహల్' అనగా కస్తూరిభవనము అని ప్రసిద్ధి పొందినదని జనశ్రుతి కలదు. ఇందలి సత్యాసత్యము లెట్లున్నను, గోలకొండ గొప్ప వర్తక కేంద్రమనియు, ఆచట ఎంత సుగంధ సామగ్రినైనను కొనుటకు శక్తిసామర్థ్యములు కలవారుండిరనియు, గోలకొండ విఫణివీథులందు సుగంధాది ద్రవ్యములు అమ్ముడు పోకుండుట లేనేలేదనియు, గోలకొండప్రభువులు వర్తకులకు తగిన సౌకర్యములను కూర్చుచుండిరనియు తెలియుచున్నది.

గోలకొండ ప్రజలు వివిధోత్సవములను మహావైభవముగ జరుపుకొనుచుండిరి. జాతిమతవర్గభేదములులేక గోలకొండ నగరమునందలి ప్రజలు రాజుగారి పట్టాభిషేక - జన్మదినోత్సవములందు పాల్గొనుచుండిరి. నౌరోజా ఉత్సవము, వసంతోత్సవము, మృగశిరాప్రవేశోత్సవము, ఇత్యాది ఉత్సవములందు సమధికోత్సాహమున చక్రవర్తులతోపాటు ప్రజలందరు సంతోషమునొందు చుండిరి. ఈ ఉత్సవములు మహమ్మద్ కులీకాలమునుండి ద్విగుణితోత్సాహమున జరుగుచుండెను.

ఈ ఉత్సవములందు రాజు, రాజాధికారులందరు, మద్యపాన మత్తులై సుఖములందోలలాడుచుండిరి. ఆట కత్తెలు వివిధ నృత్యములచేత రాజునకు వినోదమును కూర్చుచుండిరి. చెలికత్తెలందరు పుష్పాలంకృతలై కోలాటము లాడుచు మైమరచి ఇతరులను మురిపించుచుండిరి.

రాజుగారి పట్టాభిషేకోత్సవము నగరప్రజలకొక పర్వదినము. ఈ సందర్భమున నగరమంతయు సుందరముగ అలంకరింపబడుచుండెను. అంతఃపురములోని చెలికత్తెలు చెరకుగడలతో అమర్చిన పుష్పమంటపమును చేతులతో బట్టుకొ నినీలవర్ణ ఛత్రచ్ఛాయలందు సుల్తాను నాసీనుని గావించుచుండిరి. నీలవర్ణము కుతుబుషాహీల అభిమాన వర్ణము. రాజునకు దృష్టితీయుట, కండచక్కెర తినిపించుట, పుష్పములు, చందనము, సుగంధద్రవ్యములు సమర్పించుట, రాజు పాదములను పారాణితో నలంకరించుట, సురటీలు పట్టుట మున్నగు కృత్యములు మహావైభవముతో జరుగుచుండెను. సన్నాయిలు నగారాలు వీటి మ్రోతలచే దిశలు ప్రతిధ్వనించు చుండెను. ఈ ఉత్సవమున పాల్గొనువారందరును, రాజును వెండి పూలుగల పల్లకియందు ఊరేగించుచుండిరి. చక్రవర్తి జన్మదినోత్సవములందు ప్రజలకు కండచక్కెరను పంచిపెట్టుచుండిరి.

476